
కేటీఆర్పై కాంగ్రెస్ ఫిర్యాదు.. కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ:
ఈనెల 21వ తేదీన జరిగిన పదో తరగతి తెలుగు పేపరు–1 లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బండి శ్రీను తన కారు డ్రైవర్ అని, బండి శ్రీనును తానే ప్రోత్సహించి నేరానికి ఉసిగొల్పినట్లుగా ఒక టీవీ చానల్తోపాటు, ఒక యూట్యూబ్ చానల్లో తప్పుడు ప్రచారం చేశారని నకిరేకల్ మండలం మర్రూరు గ్రామానికి చెందిన, తాటికల్ పీఏసీఎస్ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు నకిరేకంటి నరేందర్ పోలీసులకు ఈనెల 24న ఫిర్యాదు చేశారు. బండి శ్రీను తన కారు డ్రైవర్ కాదని, ఎస్సీ కులానికి చెందిన తనను అవమానించేలా, తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా, తన రాజకీయ జీవితానికి కలంకం అంటగట్టేలా ఆ చానళ్లు తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొన్నారు. నిజానిజాలను నిర్ధారించుకోకుండా.. కేటీఆర్, కొణతం దిలీప్ ట్విట్టర్లో ఫార్వర్డ్ చేశారని, వారంతా కుమ్మకై ్క ఈ పని చేసినందున తగిన చర్యలు చేపట్టాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
● అదే కేసులో అరెస్టయిన చిట్ల ఆకాష్ తన కారు డ్రైవర్ అంటూ ఓ టీవీ చానల్తోపాటు యూట్యూబ్ చానల్ తప్పుడు ప్రసారం చేశాయని నకిరేకల్ మున్సిపల్ ఛైర్పర్సన్ చౌగోని రజిత ఈనెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్ల ఆకాష్ తన కారు డ్రైవర్ కాదని పేర్కొన్నారు. పైగా ఆ నేరానికి పాల్పడేలా తానే ఉసిగొలిపినట్లు తప్పుడు వార్తను ఇచ్చారని పేర్కొన్నారు. సమాజంలో తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా, తన రాజకీయ జీవితానికి కలంకం అంటగట్టేలా ఆ వార్తలు ఇచ్చారని వివరించారు. నిజానిజాలను నిర్ధారించుకోకుండా క్రిషాంక్, కేటీఆర్, దిలీప్ ట్విట్టర్లో ఫార్వర్డ్ చేశారని, వారిపై తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
● ఈ కేసులోనే అరెస్టయిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గుడుగుండ్ల శంకర్.. తాను నకిరేకల్లోని ఓ ప్రైవేటు పాఠశాల యజమానితో కుమ్మకై ్క పేపర్ లీకేజీకి పాల్పడినట్లు టీవీ చానల్తోపాటు రెండు యూట్యూబ్ చానళ్లలో తప్పుడు వార్త ప్రసారం చేశారని ఉగ్గిడి శ్రీనివాస్ ఈనెల 25న ఫిర్యాదు చేశారు. ఆ వార్తల్లో నిజాలను నిర్ధారించుకోకుండా కేటీఆర్, క్రిషాంక్, దిలీప్ ట్విట్టర్లో ఫార్వర్డ్ చేశారని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితానికి కలంకం అంటగట్టాలని చూశారని, వారిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా చానళ్లలోపాటు కేటీఆర్, క్రిషాంక్, దిలీప్పై పోలీసులు వేర్వేరు కేసులను నమోదు చేశారు. ప్రజల్లో ఆందోళన కలిగించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, పుకార్లను వ్యాప్తి చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీలను లక్ష్యంగా చేసుకొని వారిపై ద్వేషం పెంచేలా ప్రచారం చేసినందుకు గాను ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులను నమోదు చేసినట్లు వేర్వేరు ఎఫ్ఐఆర్లలో పోలీసులు వివరించారు.
ఈ సెక్షన్ల కింద కేసు..
నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మన్నెం క్రిశాంక్ (ఏ1), కేటీఆర్(ఏ2), దీలీప్ కూమార్పై (ఏ3) బీఎన్ఎస్ 353(1)(సీ), 353(2) కింద కేసు నమోదు చేశారు. అలాగే ఉగ్గిడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవే సెక్షన్ల కింద కొణతం దిలీప్ (ఏ1), మన్నెం క్రిషాంక్ (ఏ2), కేటీఆర్పై (ఏ3), ఒక యూట్యూబ్ చానల్ ఎండీ (ఏ4), మరో యూట్యూబ్ చానల్ యాజమాన్యం (ఏ5)పై కేసులు నమోదు చేశారు. ఇక తాటికల్ పీఏసీఎస్ డైరెక్టర్ నకిరేకంటి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద కేటీఆర్ (ఏ1), కొణతం దిలీప్ (ఏ2), టీవీ, యూట్యూబ్ చానళ్ల మేనేజ్మెంట్పై (ఏ3) కేసులు నమోదు చేశారు.