సొరంగంలోనే ఎనిమిది మంది | - | Sakshi
Sakshi News home page

సొరంగంలోనే ఎనిమిది మంది

Published Sun, Feb 23 2025 12:53 AM | Last Updated on Sun, Feb 23 2025 12:53 AM

సొరంగ

సొరంగంలోనే ఎనిమిది మంది

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు

ఘటనా స్థలానికి మంత్రులు

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి,

కలెక్టర్‌, ఎస్పీ

కార్మికులను బయటకు

తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌,

సింగరేణి రెస్క్యూ బృందాలు

భారీ ఎత్తున నీటి ఊట, బురద,

శిథిలాలతో సహాయక

చర్యలకు ఆటంకం

ఒకే మార్గం గుండా..

టన్నెల్‌ శిథిలాల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు పెద్దఎత్తున నీటి ప్రవాహం, బురద ఆటంకంగా మారాయి. ఇలాంటి సొరంగ పనుల నిర్వహణకు ఆడిట్‌ టన్నెళ్లు, ఎస్కేప్‌ టన్నెళ్లు కీలకంగా పనిచేస్తాయి. వీటి ద్వారా సొరంగంలో తొలగించిన మట్టి, రాళ్లు, శిథిలాల తొలగింపుతోపాటు సొరంగంలో ఎయిర్‌ ప్రెజర్‌ను సమన్వయం చేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటివి ఏవీ ఆడిట్‌, ఎస్కేప్‌ టన్నెళ్లు ఈ ప్రాజెక్ట్‌లో లేవు. ప్రధాన సొరంగంతోపాటు అదనంగా ఆడిట్‌ టన్నెళ్ల నిర్మాణం చేపట్టేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఆడిట్‌ టన్నెళ్లు లేకపోవడం, ఒకే మార్గం గుండా సహాయక చర్యలు చేపట్టడం రెస్య్యూ బృందాలకు సవాలుగా మారింది.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో చేపడుతున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ నిర్మాణ పనుల్లో ఇన్‌లెట్‌ టన్నెల్‌లో 14 కి.మీ., వద్ద సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో నీటి ఊట ఉధృతి పెరిగి, మట్టి వదులు కావడం, అకస్మాత్తుగా కాంక్రీట్‌ సెగ్మెంట్‌ ఊడిపడటంతో ప్రమాదం సంభవించింది. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌కు ఇవతల వైపు ఉన్న సుమారు 50 మంది బయటకు పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకోగా.. అవతల వైపు ఉన్న 8 మంది సొరంగంలోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు 150 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అగ్నిమాపక, సింగరేణి కాలరీస్‌కు చెందిన రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది.

సీపేజీనే ప్రమాదానికి కారణం..

శ్రీశైలం జలాశయం నుంచి నీటిని నల్లగొండ జిల్లాకు తరలించేందుకు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టారు. నల్లమల కొండలను తవ్వుకుంటూ సుమారు 40 కి.మీ., మేర టన్నెల్‌ను తవ్వాల్సి ఉండగా.. కృష్ణాతీరం నుంచి 13 కి.మీ., మరోవైపు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి 23 కి.మీ., టన్నెల్‌ తవ్వకం పూర్తయ్యింది. దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌ నుంచి 14 కి.మీ., వద్ద సొరంగం తవ్వకాలను గత నాలుగు రోజుల కిందటే మొదలుపెట్టారు. ఈ సొరంగంలో గత నాలుగేళ్లుగా నీటి సీపేజీ కొనసాగుతోంది. శనివారం ఈ నీటి ఉధృతి ఎక్కువై అప్పటికే బలహీనంగా మారిన పైకప్పు, రాక్‌ బోల్టింగ్‌, కాంక్రీట్‌ సెగ్మెంట్‌తోపాటు ఒక్కసారిగా కుప్పకూలింది. సీపేజీ నిర్వహణ, డీవాటరింగ్‌ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడంతోపాటు భద్రతా ప్రమాణాలు పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
సొరంగంలోనే ఎనిమిది మంది1
1/1

సొరంగంలోనే ఎనిమిది మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement