
న్యూఢిల్లీ: బాల్ ఠాక్రే.. మహారాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా పేరుగాంచారు. నేడు (నవంబర్ 17) ఆయన వర్థంతి. 1926 జనవరి 23న జన్మించిన ఆయన 2012 నవంబర్ 17న కన్నుమూశారు. ఒకానొక సమయంలో బాల్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.
మహారాష్ట్ర సీఎం పదవిలో ఎవరున్నా బాల్ ఠాక్రే ఆధిపత్యమే కొనసాగేదని చెబుతుంటారు. ప్రముఖ జర్నలిస్టు సుజాతా ఆనందన్ 'హిందూ హృదయ సామ్రాట్ - హౌ ది శివసేన ఛేంజ్డ్ ముంబై ఫర్ ఎవర్’ అనే పుస్తకాన్ని రాశారు. దానిలో ఆమె బాల్ ఠాక్రేకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెలియజేశారు.
బాల్ ఠాక్రే బహిరంగంగా బీరు తాగేందుకు, సిగరెట్లు కాల్చేందుకు ఏమాత్రం మొహమాటపడేవారు కాదని సుజాతా ఆనందన్ ఆ పుస్తకంలో తెలిపారు. ఈ రెండూ అంటే బాల్ ఠాక్రేకు ఎంతో ఇష్టమని, ఆయన అందరి ముందు మద్యం తాగేవారని ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
అది 1995. బాల్ ఠాక్రే పార్టీ గెలిచింది. దీంతో ముంబైకి చెందిన బిల్డర్ నిరంజన్ హీరానందాని తండ్రి డాక్టర్ ఎల్ హెచ్ హీరానందాని ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో గొంతు తడపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బాల్ ఠాక్రే కోరారు. వెంటనే హీరానందానీ.. ‘పార్టీకి సీఎం వస్తారు. వారి సమక్షంలో మద్యం ఎలా తాగగలం?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన బాల్ ఠాక్రే నేరుగా సీఎం మనోహర్ జోషితో ‘ఏంటి మనోహర్.. మీరేమీ తాగరా’ అని ప్రశ్నించారు. ఈ మాట వినగానే సీఎం అవాక్కయ్యారు. తరువాత బాల్ఠాక్రే డాక్టర్ హీరానందానీతో మనం ఇప్పుడిప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కనీసం షాంపైన్ అయినా ఏర్పాటు చేయాలి అని అన్నారు. దీంతో ఫ్రూట్ జ్యూస్ పార్టీ కాస్తా మద్యం పార్టీగా మారిపోయింది.
ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment