Shashi Tharoor: లక్ష్మణ రేఖ దాటినా.. అనూహ్య మద్దతు | BJP Minister Support Shashi Tharoor Amid Congress Criticism, Check More Details Inside | Sakshi
Sakshi News home page

Shashi Tharoor: లక్ష్మణ రేఖ దాటినా.. అనూహ్య మద్దతు

May 29 2025 8:01 AM | Updated on May 29 2025 11:40 AM

BJP Minister Support Shashi Tharoor Amid Congress Criticism

గత కొంత కాలంగా బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్(Shashi Tharoor).. ఎల్‌వోసీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపాయి. సొంత పార్టీ నేతలు ఆయన్ని తిట్టిపోస్తుంటే.. అనూహ్యంగా బీజేపీ నేతల నుంచి ఆయనకు మద్దతు లభిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పార్టీ వైఖరికి భిన్నంగా శశి థరూర్‌(Shashi Tharoor) మాట్లాడుతున్నారని, ఒకరకంగా ఆయన ‘లక్ష్మణరేఖ’ను దాటారని పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారంటూ తాజాగా పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ వివాదంలో కాంగ్రెస్‌ నేత ఉదిత్ రాజ్ శశి థరూర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ‘‘ప్రియమైన శశి థరూర్.. మిమ్మల్ని బీజేపీ సూపర్‌ అధికార ప్రతినిధిగా నియమించేలా ప్రధాని మోదీని ఒప్పించగలిగితే ఎంతో బాగుండేది. మీరు భారత్‌కు తిరిగి వచ్చేలోగానే మిమ్మల్ని విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే ఇంకా బాగుండేది. మోదీ ప్రధానమంత్రి కాక పూర్వం భారత్‌ ఆధీనరేఖను దాటిపోలేదని మీరన్నారు. తద్వారా కాంగ్రెస్‌ భవ్యచరిత్రను అప్రతిష్ఠపాలు చేశారు’’ అని ఉదిత్‌రాజ్‌ అన్నారు. 

‘‘1965లో భారత్‌  పాకిస్థాన్‌లోని లాహోర్‌ సెక్టారులో పలుప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. 1971లో భారత్‌ పాకిస్థాన్‌ను రెండుగా విడగొట్టింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా అనేక సర్జికల్‌ స్ట్రైక్‌లు(Surgical Strikes) నిర్వహించారు. అయితే ఆ విజయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అప్పట్లో డప్పు వాయించుకోలేదు’’ అని ఉదిత్‌రాజ్‌ పోస్ట్‌ చేశారు.

కాంగ్రెస్‌ నేత పవన్‌ఖేరా స్పందిస్తూ.. యూపీఏ హ యాంలో పాకిస్థాన్‌ మీద పలుమార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించామని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్వయంగా చెప్పిన వీడియోను శశి థరూర్‌కు ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అనేవి మోదీ ప్రధాని అయిన తర్వాతనే ప్రారంభం కాలేదని, గతంలోనూ అనేకసార్లు జరిగాయని, అయితే, దేశభద్రతకు సంబంధించిన అటువంటి సున్నిత సమాచారాన్ని తాము ఎన్నడూ రాజకీయ ప్రచారానికి వాడుకోలేదని అన్నారాయన.

థరూర్‌ ఏమన్నారంటే.. 
ఐదు దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్‌ పనామాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఉగ్రదాడులను భారత్‌ భరిస్తూ వచ్చిందని, కానీ, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉరీ(2016), పుల్వా మా, పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్‌లోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని ప్రసంగించారు. 

బీజేపీ మద్దతుగా.. 
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్‌పై భారత వైఖరిని వివిధ దేశాలకు స్పష్టం చేసేందుకు కేంద్రం పంపిన అఖిలపక్ష పార్టీల ప్రతినిధి బృందంలో శశి థరూర్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఆయన్ని పక్కనపెట్టినప్పటికీ.. కేంద్రం ఆయనకు అందులో చోటు ఇవ్వడం గమనార్హం. అయితే.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే థరూర్‌పై దాడి జరుగుతోందని, దేశం కన్నా గాంధీ కుటుంబమే కాంగ్రెస్‌కు ముఖ్యమని బీజేపీ విమర్శించింది. 

అసలు కాంగ్రెస్‌ ఎవరికి మద్దతిస్తోంది? దేశం కోసం మాట్లాడటం ఆ పార్టీలో నిషేధమా? అని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి. వారికి దేశం పట్ల నిజంగా ఎంత శ్రద్ధ ఉంది?. భారత ఎంపీలు విదేశాలకు వెళ్లి భారత్‌కు, ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుకుంటోందా?. రాజకీయ వైరాగ్యానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది’’ అని కిరణ్‌ రిజిజు ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. మరోవైపు.. 

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా థరూర్‌కు మద్దతు పలికారు. "శశి థరూర్ గాంధీ కుటుంబానికి కాకుండా, దేశానికి ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టే ఆయనపై కాంగ్రెస్ దాడి చేస్తోంది. పార్టీ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాల గురించి, ఓటు బ్యాంకు రాజకీయాల కంటే జాతీయ విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే ఆయన లక్ష్యంగా మారారు" అని పూనావాలా పేర్కొన్నారు.  "పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది. నేడు కాంగ్రెస్, పాకిస్థాన్ డీజీలా మాట్లాడుతూ సొంత నేతపైనే విమర్శలు చేస్తోంది" అని పూనావాలా ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: చీకటి ఆ కుటుంబాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement