ఛావా ఎఫెక్ట్‌.. గుప్తనిధుల కోసం జనం ఉరుకులు పరుగులు | Chhaava Effect: Locals Search for Gold At MP Burhanpur Asirgarh Fort | Sakshi
Sakshi News home page

ఛావా ఎఫెక్ట్‌.. గుప్తనిధుల కోసం జనం ఉరుకులు పరుగులు

Published Sat, Mar 8 2025 2:06 PM | Last Updated on Sat, Mar 8 2025 3:32 PM

Chhaava Effect: Locals Search for Gold At MP Burhanpur Asirgarh Fort

విక్కీ కౌశల్ లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో.. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్‌ వద్ద పరుగులు పెడుతోంది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌. ఓవైపు ఛావా కథాకథనాలపై విమర్శలు.. మరోవైపు రోమాంచితమైన ఫెర్మార్మెన్స్‌కు  ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా ప్రభావం మధ్యప్రదేశ్‌ బుర్హన్‌పూర్‌లో అలజడికి కారణమైంది.

బుర్హన్‌పూర్‌లోని అసర్‌ఘడ్‌ కోట(Asirgarh Fort)ను బంగారు గనిగా, శంభాజీ సైన్య స్థావరంగా ఛావా చిత్రంలో చూపించాడు  దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌. అయితే ఈ మధ్య అక్కడ జరిగిన ఓ ఘటన.. ఈ వాదనకు మరింత బలం చేకూర్చి జనాల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. టార్చ్‌ లైట్లు, ఇనుప పనిముట్లు, మెటల్‌ డిటెక్టర్స్‌ స్థానికులు రాత్రిపూట కోట దగ్గరకు చేరుకున్నారు. ఇష్టానుసారం తవ్వకాలకు దిగారు. కొందరు బంగారు నాణేలు దొరికాయని ప్రకటించడంతో.. ఆ ప్రాంతానికి రోజురోజుకీ జనాల తాకిడి పెరిగింది. అయితే పోలీసులకు, అధికారులకు ఈ విషయమై సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని స్థానికంగా కొందరు యువకులు చెబుతున్నారు.

అసలేం జరిగిందంటే..
అసర్‌ఘడ్‌ కోటకు దగ్గర్లో ఉన్న జాతీయ రహదారిపై నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న దర్గా దగ్గర తవ్వకాలు జరిపిన ఓ జేసీబీ మిషన్‌.. ఆ మట్టిని స్థానికంగా ఉన్న ఓ రైతు పొలంలో పోశారు. అయితే కూలీలు ఆ మట్టి నుంచి పాత నాణేలు గుర్తించరాని, అందులో బంగారం, వెండి నాణేలు  ఉన్నాయని ప్రచారం మొదలైంది. ఈ పుకార్లు చిలిచిలికి గాలివానగా చుట్టుపక్కల ఊర్లకు విస్తరించాయి. అయితే ఈ ప్రచారం కొందరు ఆకతాయిల ప్రచారమేనని స్థానికులు అంటున్నారు. 

చరిత్రకారులు ఏం చెబుతున్నారంటే..
బుర్హన్‌పూర్‌ గతంలో మొఘలుల నగరంగా ఉండేది. ఆ కాలంలో అప్పటి ప్రజలు యుద్ధాలు, దొంగలకు భయపడి తమ వద్ద ఉన్న బంగారం, ఇతర విలువైన వస్తువుల్ని మట్టిలో పాతి పెట్టేవాళ్లు. కాబట్టి తవ్వకాల్లో నాణేలు బయటపడడంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని అంటున్నారు. నిజంగా అక్కడ నాణేలు దొరుకుతుంటే గనుక.. ఈ అంశాన్ని తీవ్రంగా భావించాలని, తక్షణమే ఆ ప్రాంతానికి రక్షణ కల్పించాలని పురావస్తు శాఖ అధికారులు స్థానిక  యంత్రాంగాన్ని కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా  ఈ అంశాన్ని పరిశీలించాలని పోలీసులను కోరింది. దీంతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగి.. ఆ ప్రాంతంలో సిబ్బందిని మోహరింపజేశారు. ఇష్టానుసారం తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement