
న్యూఢిల్లీ: ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు నీటి ఎద్దడి.. ఢిల్లీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితి అక్కడి ప్రజల ఆనందాన్ని హరింపజేస్తోంది.
దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే పటాసులు కాల్చడంపై నిషేధం కొనసాగుతుండగా, తాజాగా అక్టోబర్ 31 వరకు నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటుందని ఢిల్లీ జల్ బోర్డు ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. ఢిల్లీలో గాలి ఇప్పటికే పూర్ కేటగిరీలో ఉంది. పలు ప్రాంతాల్లో గాలినాణ్యత(ఏక్యూఐ) 400గా ఉంది. ఈ నేపధ్యంలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించే అవకాశం ఉంది.
అక్టోబర్ 31 వరకు ఢిల్లీలోని 60కి పైగా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనున్నదని ఢిల్లీ జల్ బోర్డు తెలిపింది. ఢిల్లీకి పలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి నీరు సరఫరా అవుతుంది. 110 ఎంజీడీ భార్గతి ప్లాంట్, 140 ఎంజీడీ సోనియా విహార్ ప్లాంట్కు నీరు ప్రధానంగా గంగా కెనాల్ నుండి వస్తుంది. యూపీ నీటిపారుదల బోర్డు దీనికి అక్టోబర్ 12 నుండి 31 వరకు మరమ్మతు పనులు చేయనుంది.
ఈ కారణంగా ఈ ప్లాంట్లను మూసివేయనున్నారు. అటువంటి పరిస్థితిలో యమునా నది నుండి ఢిల్లీకి నీటిని సరఫరా చేయనున్నారు. అయితే యమునా నీటిలో అమ్మోనియా స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నీటిని పరిశుభ్రపరిచేందుకు ఇబ్బందులు ఎదురువుతుంటాయి. ఫలితంగా ఢిల్లీకి నీటి సరఫరా తగ్గిపోయింది. ఇదే ఢిల్లీలో నీటి ఎద్దడికి కారణంగా నిలుస్తోంది. అయితే అవసరమైన ప్రాంతాలకు ట్యాంకార్ల ద్వారా ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తుంటుంది.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల
Comments
Please login to add a commentAdd a comment