
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సర్కార్ను ఏ ఒక్కరూ విశ్వసించబోరని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిజాయితీగా ఉండాలని, వాస్తవాలను ఎదుర్కోవాలని తాను కోరుతున్నానని చెప్పారు. ‘భారత ప్రభుత్వాన్ని ఏ ఒక్కరూ నమ్మరు.. ఈ ప్రభుత్వం అబద్ధం చెప్పకుండా ఒక్క రోజు ఉండటం కూడా అసాధ్యమ’ని ఆయన వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై తమకు మాటమాత్రం చెప్పకుండా ముందుకెళ్లారని అన్నారు. కశ్మీర్కు పెద్దసంఖ్యలో భద్రతా దళాలను తరలించిన ముందురోజు తాను ప్రధానమంత్రిని కలిశానని, ఆ భేటీలో మోదీ తమకు ఎలాంటి సంకేతాలూ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
కశ్మీర్కు పెద్ద ఎత్తున బలగాలను తరలించాల్సిన అవసరం ఏముందని తాను ఆయనను అడిగానని చెప్పారు. పర్యాటకులను తిప్పిపంపుతున్నారు.. అమర్నాథ్ యాత్ర రద్దు చేశారు.. పాకిస్తాన్తో యుద్ధం జరగబోతోందా అని తాను ప్రశ్నించినా ప్రధానమంత్రి మౌనంగా ఉండిపోయారని గుర్తుచేసుకున్నారు. తాము అడిగిన విషయం కాకుండా వేరే అంశాల గురించి ఆయన మాట్లాడారని, మోదీ గొప్ప దయగల, నేర్పున్న వ్యక్తే కానీ నమ్మదగిన నేత మాత్రం కాదని ఫరూక్ అబ్దుల్లా ‘ఎన్డీటీవీ’తో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏడు నెలల పాటు ప్రజా భద్రతా చట్టం కింద నిర్బంధంలో ఉన్న అబ్ధుల్లా(83)ను ఈ ఏడాది మార్చిలో విడుదల చేశారు. ఆర్టికల్ 370ని కేంద్రం ప్రభుత్వం రద్దుచేసిన అనంతరం ఆగస్టు 5న ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment