
సాక్షి, బళ్లారి: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. దళితులు, ఆదివాసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా అవకాశాలు దక్కేందుకు వీలుగా నైష్పత్తిక రిజర్వేషన్ల పద్ధతి తేవాలన్నారు. 2011లో మోదీ సర్కారు చేపట్టిన కులగణన వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తద్వారా బీసీలకు మెరుగైన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాల్కీ, హుమ్నాబాద్ల్లో ఆయన ప్రచార సభల్లో మాట్లాడారు. ఓబీసీలపై మోదీ కేవలం మాటల్లోనే ప్రమ ఒలకబోస్తారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే కులగణన వివరాలు బయట పెడతామని చెప్పారు. ప్రతి పనికి 40 కమీషన్ తీసుకుంటున్న బీజేపీ సర్కారుకు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో బీజేపీకి 40 సీట్లు కూడా రావు.
ఉద్యోగ నియామకాల్లోనూ భారీ అవినీతి జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ అవినీతి విధానాలను, మోదీ, అదానీ బంధాన్ని గురించి లోక్సభలో ప్రశ్నిస్తే నా సభ్యత్వం తొలగించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబితే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పతనానికి నాంది అవుతుంది’’ అన్నారు. రాహుల్ కులగణన డిమాండ్కు పలు విపక్షాలు మద్దతిచ్చాయి. జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్కుమార్తో పాటు ఎస్పీ, బీఎస్పీ్ట, ఆప్, బీజేపీ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఇందుకు మద్దతు పలికాయి. దేశవ్యాప్తంగా తాజాగా కులగణన చేపట్టాలంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖను ఆయన తాజాగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment