
బెంగళూరు/ఘజియాబాద్: వృద్ధ ముస్లింపై దాడి వీడియో ట్విట్టర్లో విస్తృతంగా షేర్ అయిన కేసులో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. బలవంతంగా ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఘజియాబాద్ పోలీసులకు హైకోర్టు సూచించింది. ఆయనను వర్చువల్ విధానంలో విచారించవచ్చని జస్టిస్ జి. నరేందర్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై తదుపరి విచారణ అవసరమనుకుంటే జూన్ 29న విచారిస్తామని కోర్టు పేర్కొంది.
ఆ వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందంటూ ట్విట్టర్ ఎండీ మనీశ్కు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ పోలీసులు ఇటీవల నోటీసులిచ్చారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, తాను వర్చువల్ పద్ధతిలో హాజరవుతానని మనీశ్ జవాబివ్వగా అందుకు ఘజియాబాద్ పోలీసులు నిరాకరించారు. ప్రతిగా మరో నోటీస్ ఇస్తూ 24 గంటల్లోపు స్వయంగా తమ ముందు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మనీశ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మనీశ్ తరఫు లాయర్ నగేశ్ వాదించారు.
చదవండి: అయేషా సుల్తానాను ప్రశ్నించి వదిలేసిన లక్షద్వీప్ పోలీసులు