పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై బ్యాడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై బ్యాడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Published Mon, Mar 15 2021 7:57 PM

No Proposal: To Bring Petroleum Products In GST Says Finance Minister Nirmala - Sakshi

న్యూఢిల్లీ: విరామమెరుగక రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందరూ భావిస్తుండగా అదేం లేదు ప్రజల ఆశలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌, ప్రతిపక్షాలు చేసిన సలహాను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతటితో ఆగకుండా బీమా రంగంలో ప్రైవేటుపరం చేసే చర్యలను కార్యరూపం దాల్చారు.

పార్లమెంట్‌లో సోమవారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌, జెట్‌ ఫ్యూయల్‌, సహజ వాయువులను జీఎస్టీ మండలి పరిధిలోకి తెచ్చే అంశం పరిశీలనలో లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 2017 జూలై 1వ తేదీన వచ్చిన జీఎస్టీలో పెట్రోలియం ఉత్పత్తులను చేరిస్తే ధరలు తగ్గుతాయని అందరూ చెబుతున్నారు. అయినా కూడా కేంద్రం పెడచెవిన పెట్టేసింది. దీంతో కేంద్రం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

ఒక కేంద్రమంత్రి చలికాలం అయిపోగానే పెట్రోల్‌ ధరలు తగ్గుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అదీ కూడా ఇప్పుడు లేదని పేర్కొంటున్నారు. తాజాగా బీమా రంగంలో ఎఫ్‌డీఐల ప్రవేశంపై తీసుకొచ్చిన కొత్త బిల్లు ప్రకారం మొత్తం 74 శాతం బీమా రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఈ బిల్లును ఆమోదం పొందితే బీమా రంగంలో కూడా ప్రైవేటు శక్తులు ఆధిపత్యం చలాయించనున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement