
చండీపూర్(అగర్తలా): త్రిపురను కాంగ్రెస్, సీపీఎం, తిప్రా మోతా అనే ట్రిపుల్ ట్రబుల్ నుంచి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారే కాపాడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. త్రిపుర రాష్ట్రం ఉనాకోటి, సెపాహిజలా జిల్లాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి మాట్లాడారు. ఈ మూడు సమస్యల నుంచి బయటపడాలనుకుంటే బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికే ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఏళ్లపాటు రాష్ట్రంలోని గిరిజనులను నిర్లక్ష్యం చేసిన సీపీఎం ప్రజలను మోసగించడానికే ఇప్పుడు గిరిజన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందని ఆయన విమర్శించారు. బీజేపీని ఓడించటానికే సీపీఎం, కాంగ్రెస్ ఏకమయ్యాయని మంత్రి ఆరోపించారు. ఈ మూడు పార్టీలకు అధికారమిస్తే రాష్ట్రంలో తిరిగి ఆటవిక పాలన వచ్చినట్లేనన్నారు. సీపీఎం, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పలు కుంభకోణాలు జరిగాయని చెప్పారు. ఈ నెల 16న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment