
ఉత్తమ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ‘50 బెస్ట్’ఆవిష్కరించిన ఆసియా ఉత్తమ రెస్టారెంట్ల విస్తృత జాబితాలో ఏడు భారతీయ రెస్టారెంట్లకు చోటు దక్కింది. 51 నుంచి 100వ ర్యాంకు ఫలితాలను శుక్రవారం సంస్థ వెల్లడించింది.
ఇందులో ముంబై, ఢిల్లీ, కసౌలి, బెంగళూరుకు చెందిన ఏడు ప్రసిద్ధ రెస్టారెంట్లు ఉన్నాయి. కసౌలీలోని నార్ 66వ ర్యాంకు, బెంగళూరులోని ఫామ్లోర్ 68, ముంబైలోని అమెరికానో 71, న్యూఢిల్లీలోని ఇంజా 87, ముంబైలోని ద టేబుల్ 88, న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ 89, ముంబైలోని ద బాంబే క్యాంటీన్ 91వ ర్యాంకులను దక్కించుకున్నాయి. కాగా, టాప్ 50 రెస్టారెంట్లను మార్చి 25న సియోల్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ ప్రకటించనుంది.
నార్, ఫామ్లోర్, ఇంజా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, నార్ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ కావడం గమనార్హం. కసౌలిలో చెఫ్ ప్రతీక్ సాధు నడుపుతున్న ఈ రెస్టారెంట్ హిమాలయాల దిగువన ఉంది. హిమాలయ ఆహార సంస్కృతికి అద్దంపడుతుంది. స్థానిక వంటకాలను ప్రోత్సహిస్తుంది. ఢిల్లీలోని ఇంజా రెస్టారెంట్ భారతీయ–జపనీస్ వంటకాలకు ప్రసిద్ధి. బెంగళూరులోని ఫామ్లోర్ వ్యవసాయ ఆధారిత వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇది వ్యవసాయ క్షేత్రంలోనే నడిపిస్తుండటం గమనార్హం. బాంబే క్యాంటీన్, అమెరికానో, ది టేబుల్, దమ్ పుఖ్త్ గతంలోనూ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ముంబైలోని కమలా మిల్స్లో ఉన్న బాంబే క్యాంటీన్ వైవిధ్యమైన భారతీయ వంటకాలకు ఆధునికతను జోడించి రుచి చూపిస్తుంది. అమెరికానో.. కాలానుగుణంగా వస్తున్న మార్పులను బట్టి సృజనాత్మక వంటకాలపై దృష్టి సారించే ఆధునిక యురోపియన్ బిస్ట్రో. ద టేబుల్ రెస్టారెంట్.. ‘ఫామ్ టు టేబుల్’ఫిలాసఫీతో నడిచే భారతదేశపు మొట్టమొదటి రెస్టారెంట్. ఇక్కడ మెనూ శాన్ఫ్రాన్సిస్కో శైలిలో ఉంటుంది. ఈ రెస్టారెంట్ టాప్ వంటల్లో.. టాగ్లిరిని పాస్తా, గుమ్మడికాయ స్పాగెట్టి, ఆస్పరాగస్ రిసోటో ఉన్నాయి. ఢిల్లీలో సుప్రసిద్ధ రెస్టారెంట్ దమ్ పుఖ్త్లో సాంప్రదాయ భారతీయ వంటకాలైన బిర్యానీ, కబాబ్ వంటివి దొరుకుతాయి.
–న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment