
ఎలక్ట్రిక్ బైక్ దొంగలు ముగ్గురు అరెస్టు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎలక్ట్రిక్ బైక్లను చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద 22 ఎలక్ట్రిక్ బైక్లను స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ ఏసీపీ కె.దామోదర్ తెలిపారు. స్థానిక మాచవరం పోలీస్స్టేషన్లో ఆయన సోమవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఏసీపీ దామోదర్ కథనం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎస్కే బాషా (35), ఉండికి చెందిన జక్కంశెట్టి దుర్గాప్రసాద్ (26), విజయవాడ వాంబేకాలనీకు చెందిన సయ్యద్ యూసఫ్ (28) స్నేహితులు. కారు డ్రైవర్గా పనిచేసే బాషా వచ్చే ఆదాయం సరిపోక ఎలక్ట్రిక్ బైక్ రిపేరింగ్ నేర్చుకుని మెకానిక్ షాపు పెట్టుకున్నాడు. అందులోనూ ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో తాను నేర్చుకున్న విద్యను ఉపయోగించి ఎలక్ట్రిక్ బైక్లకు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకు న్నదే తడవుగా తన స్నేహితులైన దుర్గాప్రసాద్, యూసఫ్తో కలిసి చోరీలు ప్రారంభించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కై కలూరు, తాడేపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో 22 వాహనాలను చోరీ చేశారు. మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ బైక్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. స్పందించిన పోలీసులు పోలీసు కమిషనర్ ఆదేశానుసారం ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో మాచవరం ఇన్స్పెక్టర్ సీహెచ్.ప్రకాష్ తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎలక్ట్రికల్ బైక్ల చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నెల 21వ తేదీన మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలోని ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ విచారణలో వారు చేస్తున్న ఎలక్ట్రిక్ బైక్ల చోరీల విషయం బయటపడింది. వారు దొంగిలించిన 22 ద్విచక్రవాహనాలను పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం ఇన్స్పెక్టర్ సీహెచ్ ప్రకాష్, ఎస్ఐ ఎ.వి.శ్రీనివాస్, పోలీస్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు.
రూ.10 లక్షల విలువైన 22 వాహనాలు స్వాధీనం

ఎలక్ట్రిక్ బైక్ దొంగలు ముగ్గురు అరెస్టు