జిల్లాలో పీ–4 సర్వేని పక్కాగా చేపట్టాలి:కలెక్టర్
పార్వతీపురం టౌన్: మార్చి 8 నుంచి జిల్లాలో ప్రారంభమైన పీ – 4 సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2 లక్షల 65 వేల గృహాలకు సర్వే చేయాల్సి ఉన్నందున, ప్రతి అధికారి పక్కా ప్రణాళికతో ప్రతి రోజూ సర్వే చేయాలన్నారు. పీ – 4 సర్వేపై ఇప్పటికే శిక్షణ కార్యక్రమం నిర్వహించినందున, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా జాగ్రత్తగా చేయాలన్నారు. గ్రామాల్లోని ప్రజలు వారి వృత్తుల రీత్యా ఉదయమే బయటకు వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం, సాయంత్రం వేళల్లో సర్వేను చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇళ్లు పేదరికాన్ని అధిగమించి, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వారి సహకారంతో అట్టడుగు స్థాయిలో ఉంటూ జీవించడానికి కనీస సౌకర్యాలు లేని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ విధానం అవలంభించనుందన్నారు. ప్రజలు అందుబాటులో ఉండే సమయంలో ఒక్కొక్కరూ రోజుకు కనీసం 90 వరకు సర్వేలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జూన్ మాసాంతం వరకు పురపాలక, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలను ఇప్పటి నుంచే తీసుకోవాలని హితవు పలికారు. ప్రతీ ఎంపీడీఓ, కమిషనర్ వారి పరిధిలోని నీటి కొళాయిలు, బోర్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సమస్యలు ఉన్న చోట తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే బోర్లు వేయడం, మరమ్మతులు చేపట్టాలన్నారు. పురపాలక పరిధిలో కొత్తగా ఏర్పడిన కాలనీలకు కూడా తాగునీటి సరఫరా కావాలని వివరించారు. ప్రతీ వారం తాగునీటి పరీక్షలు జరిపి రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఎక్కడికక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్లో మునిసిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్పసాద్
Comments
Please login to add a commentAdd a comment