కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్‌లపై పోరు | Sakshi
Sakshi News home page

కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్‌లపై పోరు

Published Wed, May 8 2024 5:03 AM

CM Revanth Reddy Comments On BJP and KCR

ఈ ఎన్నికలు.. గుజరాత్, తెలంగాణ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌! 

బీజేపీని డకౌట్‌ చేసి గుజరాత్‌ను ఓడించాలి 

బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందాలను తిప్పికొట్టాలి 

మళ్లీ కేసీఆర్‌ అదే దగాకోరు విధానాలతో తిరుగుతుండు 

వరంగల్‌ రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లలో సీఎం, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: నాటి ఓరుగల్లు కాకతీయుల పాలకుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్‌లకు ఏమాత్రం తీసిపోని బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో తిప్పికొట్టి ఉద్యమస్ఫూర్తి చాటుదామని ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ వర్సెస్‌ గుజరాత్‌ మధ్య జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ లాంటిదని అభివరి్ణంచిన సీఎం బీజేపీని డకౌట్‌ చేసి గుజరాత్‌ను ఓడించాలని కోరారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి గ్రేటర్‌ వరంగల్‌లో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపుకోసం రేవంత్‌ వరంగల్‌ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్‌షో నిర్వహించారు. హన్మకొండ చౌరస్తా, వరంగల్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన ప్రసంగించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పదేళ్లు పాలించి విధ్వంసం చేశాయని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, అవగాహనతోనే ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని విమర్శించారు. 

బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం 
‘వరంగల్‌ సాక్షిగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్‌ఎస్‌ నాయకుడిని బీజేపీలోకి పంపించాయి. పాపం ఓ అమాయకుడిని బీఆర్‌ఎస్‌ పక్షాన బరిలో నిలిపాయి. ఇందుకు ఉదహరణ.. బీఆర్‌ఎస్‌ నాయకులు బాహాటంగా నిష్పక్షపాతంగా ప్రచారంలో పాల్గొనడం లేదు. మీ కష్టాన్ని పణంగా పెట్టి మిమ్మల్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని బీజేపీతో కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారు ఇందుకు నగదు పంచుకొని నగదు నారాయణ రాజకీయం చేçస్తుండు’అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. 

బండకేసి కొట్టినా కేసీఆర్‌ బుద్ధి మారలే.. 
మాజీ సీఎం కేసీఆర్‌ బుద్ధి ఇంకా మారలేదనీ..వంకర ఆలోచనలు మానలేదని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణను విధ్వంసం చేసినందుకు డిసెంబర్‌ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టినా కేసీఆర్‌ తీరుమారలేదని విమర్శించారు. బస్సు యాత్రలో మంచి మాటలు మాట్లాడి .. చేసిన అన్యాయానికి క్షమాపణలు చెప్పి మారతాడనుకుంటే.. మళ్లీ దగాకోరు విధానాలతో తిరుగుతుండ్రని నిందించారు. ఇక తలకిందికి పెట్టి తపస్సు చేసినా మీరు గెలువరనీ, కేటీఆర్‌ కారును జుమరాత్‌ బజారుకు తరలించండ్రనీ సూచించారు. 

నేను అల్లాటప్పాగా రాలేదు...  
‘సీఎం కుర్చీ నుంచి దిగిపోవడానికి నేను అల్లాటప్పాగా రాలేదు. నిరంకుశ ప్రభుత్వంపై పదేళ్లు పోరాడి సీఎం కురీ్చలో కూర్చున్నా. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ దిగిపోవాలని కేసీఆర్‌ ఎందుకు అనడం లేదు. కుమార్తె బెయిల్‌ కోసం ఎంపీ సీట్లను ఆయన మోదీకి తాకట్టుపెట్టారా’అని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

వరంగల్‌ బిడ్డ కడియం కావ్యను లక్ష మెజారిటీతో గెలిపించే దిశగా బూత్‌ లెవల్‌లో మారుమూల గ్రామాల్లో ఇంటింటా తిరిగి పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరెందర్‌రెడ్డి, వరంగల్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు పాల్గొన్నారు.  

మోదీ నిన్ను ప్రశి్నస్తున్నా.. వరంగల్‌కు ఎలా వస్తావు.. 
‘ఓట్ల కోసం వస్తున్న ప్రధాని నరేంద్రమోదీని ప్రశి్నస్తున్నా.. జవాబు చెప్పినంకనే వరంగల్‌లో అడుగు పట్టాలని కూడా డిమాండ్‌ చేస్తున్నా. కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు సోనియాగాంధీ నేతృత్వంలో అప్పటి పీఎం మన్మోహన్‌సింగ్‌ ఆధ్వర్యంలో లోక్‌సభ, రాజ్యసభల్లో విభజన చట్టం చేసి ప్రత్యేక రాష్ట్రం వచి్చంది. తెలంగాణ ప్రాంతానికి సముచిత న్యాయం చేసేందుకు ఖమ్మం జిల్లాలోని బయ్యారం ఉక్కు, వరంగల్‌ జిల్లాలోని కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చేందుకు ఒప్పందం చేస్తే ఇక్కడి ప్రజల ప్రయోజనాలను విస్మరించిన నువ్వు వరంగల్‌కు ఎలా వస్తావ్‌’అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

వర్షం కారణంగా కరీంనగర్‌లో సీఎం సభ వాయిదా
అకాల వర్షం కారణంగా మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లో జరగాల్సిన సీఎం ఎ.రేవంత్‌రెడ్డి బహిరంగ సభ వాయిదా పడింది. కరీంనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా స్థానిక ఎస్సారార్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన జనజాతర సభ కోసం సీఎం రావాల్సి ఉంది. అయితే మంగళవారం మధ్యాహ్నం నుంచే ఒక్కసారిగా గాలిదుమారంతో టెంట్లు ఎగిరి, భారీవర్షానికి సభాస్థలిలో నీరు నిలిచిపోవడంతో సభను వాయిదా వేశారు.

 
Advertisement
 
Advertisement