
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక శాసన సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్రావు పార్టీకి ఝలక్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో నేడు అధికార పార్టీలో చేరారు. సుమారు రెండు వేల మంది అనుచరులతో భారీ ర్యాలీతో వచ్చి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరికొంత మంది ముఖ్య నేతలు సైతం టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. కాగా దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు సోలిపేట రామలింగారెడ్డి ఆగష్టులో మరణించిన విషయం విదితమే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నారు.(చదవండి: మీ లింగన్న లాగే అందుబాటులో ఉంటా: సుజాత)
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్రావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటించడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురైన చెరుకు శ్రీనివాస్రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దుబ్బాక బీజేపీలోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రఘునందన్రావుకు టికెట్ కేటాయించడం పట్ల తోట కమలాకర్రెడ్డి విమర్శలు చేయగా, పార్టీ ఆయనను బహిష్కరించింది. నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల సందడి ఊపందుకుంది.
షెడ్యూల్ వివరాలు
నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9
నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17
ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19
పోలింగ్ తేదీ : నవంబర్ 3
కౌంటింగ్ తేదీ నవంబర్: 10
Comments
Please login to add a commentAdd a comment