solipeta ramalinga Reddy
-
రసవత్తరం: వ్యతిరేకతపై విపక్షాల ఆశలు
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వమంతా దుబ్బాకలో తిష్టవేసి ప్రచారం చేస్తోంది. ఓ వైపు ప్రచారం చేస్తూనే.. ఏ ఏ వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయని లెక్కలు వేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మాత్రం అన్నీ తానై మంత్రి హరీశ్రావు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలతోపాటు, రామలింగారెడ్డి మృతితో వచ్చే సానుభూతి అనుకూలించి అత్యధికంగా ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోని ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. సాక్షి, సిద్దిపేట : సంక్షేమ పథకాల్లో దుబ్బాక నియోకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగ్, చేగుంట మండలాల పరిధిలో ఇప్పటి వరకు 78,187 మంది రైతులకు రైతుబంధు, 52,823 మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు, 5,599 మందికి కల్యాణ లక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్ కిట్స్ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయి. వీరందరూ ప్రభుత్వంపై విధేయతతో ఉండటంతో వారి ఓట్లు తమకే పడుతాయని టీఆర్ఎస్ నాయకులు లెక్కలు వేస్తున్నారు. మృతి చెందిన రామలింగారెడ్డి భార్య సుజాతను పోటీలో దింపడంతో సానుభూతి కూడా తోడవుతందని చర్చిస్తున్నారు. నియోజకవర్గంలో 1,97,468 మంది ఓటర్లు ఉండగా గత ఎన్నికల్లో 89,299 టీఆర్ఎస్ పార్టీకి రాగా సమీప అభ్యర్థి మద్దుల నాగేశ్వర్రెడ్డికి 26,779 ఓట్లు మాత్రమే వచ్చి 62,520 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డి గెలుపొందారు. అయితే ఈ సారి మెజార్టీ లక్ష దాటుతుందని టీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (ఫేక్ వీడియో: బీజేపీ నేతపై కేసు) వ్యతిరేక పవనాలపై విపక్షాల ఆశలు ఉప ఎన్నికలో విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు, మల్లన్న సాగర్ రిజర్వాయర్లో ముంపునకు గురైన గ్రామాల ఓటర్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. 50 టీఎంసీల సామర్థ్యంలో 26 కిలోమీటర్ల చుట్టుకొలతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్లో తొగుట మండలంలోని వేముఘాట్, తురుక బంజరుపల్లి, పల్లెపాడు, దస్తగిరి నగర్, పల్లెపాడు తండ, ఏటిగడ్డ కిష్టాపూర్, తిరుమలగిరి, తండ, లక్ష్మాపూర్,రాంపూర్, వడ్డెర కాలనీ, బి–బంజరు పల్లి మొత్తం ఆరు గ్రామ పంచాయతీలు, ఆరు మధిర గ్రామాలతోపాటు తుక్కాపూర్, తోగుట గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో 10వేల ఓటర్లు ఉంటారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. వారందరూ తమకే ఓటు వేస్తారు అంటే తమకే వేస్తారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. (రాములమ్మ రాజకీయం ముగిసినట్లేనా..?) ఇలా రైతులకు రావల్సిన నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ కాలనీ సంబంధిత వివరాలను అక్కడి ప్రజలకు వివరిస్తూ మొత్తం ఓటర్లను తమ వైపు తప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఎల్ఆర్ఎస్పై వ్యతిరేకత, 57 సంవత్సరాలకే పెన్షన్ పథకం అమలు చేయకపోవడం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, రైతు రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకు భృతి లాంటి అంశాలు తమకు అనుకూలిస్తాయని విపక్ష పార్టీలు ఆశలు పెంచుకుంటున్నాయి. ఇలా దుబ్బాక ఎన్నికలో రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడువకుండా ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. పోటీలో 23 మంది దుబ్బాకటౌన్ : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. శనివారం అధికారులు నిర్వహించిన స్క్రూట్నీలో 12 మంది అభ్యర్థుల నామినేషన్లు పలు కారణాలతో తిరస్కరించారు. దీంతో 34 మంది అభ్యర్థులు మిగలగా సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో చివరకు పోటీలో 23 మంది అభ్యర్థులు నిలిచారని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. -
ఇద్దరు నేతల మరణం.. సానుభూతి ఎవరికి?
దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబంపై ఉన్న సానుభూతితోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ శాతం ఓట్లు సాధించేందుకు టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కూడా ఏడాది క్రితమే మరణించడంతో ఆ సానుభూతితో పాటు, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధిని చూపుతూ ఆయన కుమారుడు శ్రీనివాస్రెడ్డి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరిద్దరితో పాటు వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన రఘునందన్రావు ఈ విడత తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : విద్యార్థి దశ నుంచి విప్లవోద్యమాల బాట పట్టిన సోలిపేట రామలింగారెడ్డి, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొని నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అనంతరం 2004 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన ఆగస్టు 6న మృతి చెందాడు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సోలిపేట సతీమణి సుజాత ఎన్నికల ప్రచారం సందర్భంగా రామలింగారెడ్డితో ఆయా గ్రామాల ప్రజలతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ... కంట తడి పెట్టడం.. ఉద్యమ కాలం నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిపించిన సంఘటనలు గుర్తు చేయడంతో మహిళలు కన్నీరు పెట్టడం. రామలింగారెడ్డికి ఇచ్చిన మద్దతే తనకు ఇవ్వాలని, ఆయన ఆశయ సాధనకోసం ప్రజల మధ్య ఉండి శ్రమిస్తానని చెప్పడం, పాత జ్ఞాపకాలను నెమవేసుకుంటూ.. ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు, మహిళలు ఆమె దగ్గరకు వెళ్లి అప్యాయంగా పలకరించడం.. అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. (కేబినెట్లోకి కవిత: ఎవరికి చెక్పెడతారు..!) అనుకూలంపై అంచనా.. ముందుగా దొమ్మాట, తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో సీనియర్ నాయకుడుగా పేరున్న మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి 1989, 1994,, 1999 వరుస ఎన్నికలతోపాటు, 2009లో జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన ఆయన పొత్తులో భాగంగా టికెట్ రాకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందారు. ముత్యంరెడ్డి రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలా ముత్యంరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆయన కుమారుడు ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతన్నారు. (పిట్ట కథలు వద్దు: పవన్కు ఎస్తేర్ కౌంటర్) వరుస ఓటమి చవిచూసినా.. వరుసగా ఓటమి చవిచూసినా ఎక్కడా తగ్గకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు ఈ సారి ప్రజల సానుభూతి పెరుగుతందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్లో కీలక నాయకుడిగా పనిచేసిన ఆయన తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీలో చేరారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన రఘునందన్రావుకు ఈ సారి అధికంగా ఓట్లు వస్తాయని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్కా సవాల్!) ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలన అంటనే ప్రజలు భయపడిపోతున్నారన్నారు. రాష్ట్రంలో మంచి పాలన కోసం ప్రజలు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎల్ఆర్ఏస్ పేరుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టవద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. దుబ్బాకలో సర్వే ప్రకారం కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రెండో స్థానం కోసమే టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయన్నారు. మధ్యకాలంలో కాంగ్రెస్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి భయపడే మంత్రి హరీశ్రావు రోజు దుబ్బాకలోనే తిరుగుతున్నారన్నారు. చేనేత సమస్యలపై లోక్సభలో చర్చిస్తా.. దుబ్బాక నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి చెరుకు మత్యంరెడ్డి చాల అభివృద్ధి పనులు చేశారని ఆయన చేసిన సేవలే ఆయన కుమారుడు శ్రీనివాస్రెడ్డి గెలుపునకు నాంది పలుకుతాయన్నారు. ప్రచారంలో భాగంగా చేనేత కార్మికులను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలను పార్లమెంటులో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర్రెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్రెడ్డి, శ్రావణ్కుమార్రెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, శ్రీరాం నరేందర్, సంజీవరెడ్డి, ఆకుల భరత్ తదితరులు ఉన్నారు. -
దుబ్బాకలో కాంగ్రెస్కు బిగ్ షాక్!
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక శాసన సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్రావు పార్టీకి ఝలక్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో నేడు అధికార పార్టీలో చేరారు. సుమారు రెండు వేల మంది అనుచరులతో భారీ ర్యాలీతో వచ్చి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరికొంత మంది ముఖ్య నేతలు సైతం టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. కాగా దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు సోలిపేట రామలింగారెడ్డి ఆగష్టులో మరణించిన విషయం విదితమే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నారు.(చదవండి: మీ లింగన్న లాగే అందుబాటులో ఉంటా: సుజాత) ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్రావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటించడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురైన చెరుకు శ్రీనివాస్రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దుబ్బాక బీజేపీలోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రఘునందన్రావుకు టికెట్ కేటాయించడం పట్ల తోట కమలాకర్రెడ్డి విమర్శలు చేయగా, పార్టీ ఆయనను బహిష్కరించింది. నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల సందడి ఊపందుకుంది. షెడ్యూల్ వివరాలు నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19 పోలింగ్ తేదీ : నవంబర్ 3 కౌంటింగ్ తేదీ నవంబర్: 10 -
దుబ్బాక బీజేపీలో ముసలం
సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక బీజేపీలో ముసలం ఏర్పడింది. పార్టీ అభ్యర్థిగా మాధవనేని రఘునందర్రావును ఖరారు చేయడంపై స్థానిక బీజేపీ నేత తోట కమలాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన్రావు లాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీ అధిష్తానం పునరాలోచించాలని కమలాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించారు. మరోవైపు తోట కమలాకర్రెడ్డిని పార్టీ నుంచి బీజేపీ తొలగిస్తూ ప్రకటన చేసింది. (దుబ్బాక... మనకు కీలకం ) ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే రఘునందన్రావుకే టికెట్ దక్కింది. గతంలో ఆయన దుబ్బాక నుంచి రెండు పర్యాయాలు బీజేపీ తరఫున పోటీ చేశారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్రెడ్డి తెరమీదకు వచ్చింది. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.(దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత) నవంబర్ 3న ఉప ఎన్నిక దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్ 3న జరగనుంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును విధించారు. నవంబర్ 10న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. (కాంగ్రెస్ గూటికి చెరుకు శ్రీనివాస్రెడ్డి) పోటీకి దూరంగా సీపీఐ ఉప ఎన్నికకు సీపీఐ పోటీకి దూరంగా ఉండనుంది. పార్టీ నేత చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాల్లో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయన్నారు. రెండ్రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని చాడ వెంకట్రెడ్డి తెలిపారు. షెడ్యూల్ వివరాలు.. నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19 పోలింగ్ తేదీ : నవంబర్ 3 కౌంటింగ్ తేదీ నవంబర్: 10 -
సోలీపేట సుజాతను గెలిపిద్దాం : హరీష్ రావు
సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించారు. దీంతో ఎలాగైనా సీటును కైవసం చేసుకునేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 'తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్గా నిలిచాయి. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు. పేదల కోసం ఎంతగానో కృషి చేశారు. దుబ్బాక దశ-దిశను మార్చిన గొప్ప వ్యక్తి అతను. ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రామలింగారెడ్డి సతీమణి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. (దుబ్బాక ఉప ఎన్నికలు: కోవిడ్ నిబంధనలు) రామలింగారెడ్డి భార్య అంటే మాకు చెల్లె లాంటిది. ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం రామలింగారెడ్డి సతీమణిని కలిసి మాతో పాటు ప్రచారానికి తీసుకెళ్లడానికి వచ్చాం' అని తెలిపారు. సోలీపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకొని దుబ్బాకను మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్దామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలీపేట సుజాత మాట్లాడుతూ..కేసీఆర్ తనకు కన్నతండ్రి లాంటివారన్నారు. తన భర్త చనిపోతే కేసీఆర్ ఇంటికి వచ్చి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. పార్టీ టికెట్ కేటాయించినందుకు కెసిఆర్ , మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. రామలింగారెడ్డి ఆశయాలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. (దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత) -
రేపు దుబ్బాకలో ‘పారగమ్యత’ పుస్తకావిష్కరణ
సాక్షి, దుబ్బాక: దుబ్బాకలో 20వ తేదీన ‘పారగమ్యత’ పుస్తకాన్ని మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు టీయూడబ్లుజే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘సాక్షి’తో పాటు పలు పత్రికల్లో రాసిన వ్యాసాలను ‘పారగమ్యత’ అనే పేరుతో పుస్తకంగా అచ్చువేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం దుబ్బాక పట్టణంలోని నీలకంఠ పంక్షన్ హాలులో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంట చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, వడితల సతీష్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సెన్, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో పాటు పలు ప్రముఖ దినపత్రికల ఎడిటర్లు, పత్రికా ప్రతినిధులు, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతక్క, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ గాయకులు గోరేటి వెంకన్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా కో ఆర్డినేటర్ వర్ధెల్లి వెంకటేశ్వర్లు, తెలంగాణ సీఎం పీఆర్వో రమేశ్ హజారితో పాటు పలువురు మేధావులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు, మేధావులు, ఉద్యమకారులు, సాహితి అభిమానులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ముందుగా మెదక్ జిల్లా చేగుంటలో అనుకున్నారని కొన్ని కారణాల వల్ల ఈ వేదికను దుబ్బాకకు మార్చినట్లు తెలిపారు. -
రామలింగారెడ్డి భార్యకే దుబ్బాక టికెట్?
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నికలో దివంగత శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. టికెట్ కేటాయింపునకు సంబంధించి పార్టీ అధిష్టానం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఖరారైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ను సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంతో పాటు, మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్రెడ్డి కూడా ఆశిస్తున్నారు. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీ నాయకులు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. తమ కుమారుడు సతీష్రెడ్డికి అవకాశం ఇవ్వాలని రామలింగారెడ్డి భార్య సుజాత కోరుతున్నా, పార్టీ నాయకులు మాత్రం సుజాత అభ్యర్థిత్వంవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ సోకడంతో హోం క్వారంటైన్లోకి వెళ్లిన మంత్రి హరీశ్రావు కోలుకుని సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. క్వారంటైన్ సమయంలో ఫోన్ ద్వారా దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులను సమన్వయం చేసిన మంత్రి హరీశ్రావు మంగళవారం నుంచి క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. -
సోలిపేట సతీమణి అభ్యర్థిత్వం ఖరారు!
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో నిలవనున్నారు. ఇందుకు సంబంధించి గులాబీ దళ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. దీనిని సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజాత పేరు ఏకగ్రీవం కావడంతో దుబ్బాక, సిద్ధిపేటలో సోలిపేట కుటుంబ అనుచర వర్గం సంబరాలు చేసుకుంటోంది. (చదవండి: దుబ్బాకపై టీఆర్ఎస్ కన్ను) మరోవైపు.. టికెట్ ఆశించి భంగపడి. అసంతృప్తితో ఉన్న చెరకు ముత్యరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డితో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు మంతనాలు జరుపుతున్నారు. కాగా సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక శాసన సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో ఆయన కుటుంబానికి బాసటగా ఉంటానని, రాజకీయంగా ఆదుకుంటామని కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్గా కొనసాగుతున్న సందర్భంలోనే, ఆయన అకాల మృతి నేపథ్యంలో సోలిపేట కుటుంబానికి కూడా హామీ ఇచ్చారు. దీంతో ఇరువురు నేతల తనయులు టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించగా.. చివరికి సోలిపేట సతీమణి సుజాతకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.(చదవండి: ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!) -
జాతీయ స్థాయిలో పార్టీపై కేసీఆర్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పందించారు. కొత్త రాజకీయ పార్టీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని కొట్టిపారేశారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై భవిష్యత్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్సీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం సీఎం మాట్లాడారు. (10న రెవెన్యూ చట్టంపై ప్రకటన) దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఏ ఒక్కరూ ఆశామాషీగా తీసుకోవద్దని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సభ్యులకు హితబోధ చేశారు. అన్ని అంశాలపై సభలో చర్చిద్దామన్నారు. పూర్తి సమాచారంతో అందరూ మాట్లాడాలని సూచించారు. రెవిన్యూ చట్టంతో రాష్ట్ర రూపురేఖలు మారతాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సీఎం నివాళి అర్పించారు. ఆయన మృతితో దుబ్బాకలో ఉప ఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. పార్టీ అభ్యర్థి ఎంపికపై కొంత ఉత్కంఠ ఉన్నా.. సోలిపేట కుటుంబంలోనే ఒకరికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత సమావేశమైన కేబినెట్ కొత్త రెవెన్యూ చట్టం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం సభ్యులతో చర్చించనున్నారు. -
ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!
సాక్షి, మెదక్ : తండ్రుల అకాల మృతితో తనయులు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇరువురు నేతల అకాల మృతితో ఏర్పడ్డ దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయ రంగు పులుముకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో తమ కుటుంబానికి బాసటగా ఉంటానని రాజకీయంగా మిమ్మల్ని ఆదుకుంటానాని హామీ ఇచ్చారు. తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్ కొనసాగుతూ సందర్భంలోనే ఎమ్మెల్యే అకాల మృతి తో వారి కుటుంబానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఇరువురు నేతల పుత్రులు టిఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొమ్మాట నియోజకవర్గంలో మొదలై నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన దుబ్బాక నియోజకవర్గం ఆనాడు టీడీపీకి కంచుకోట తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ వశమైంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఎన్నికలో పోటీ నుంచి తప్పుకుని రామలింగారెడ్డి కి మద్దతు ఇస్తే భవిష్యత్తులో పార్టీలో లో మంచి గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ స్థాయి పదవిని కట్ట పెడతామని అప్పట్లోనే సీఎం కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి కి హామీ ఇచ్చారు. ఆ తర్వాత చెరుకు ముత్యంరెడ్డి గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కి భరోసాగా ఉంటామని తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ గుర్తించి అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఆ తదుపరి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతూ క్రియాశీలక కార్యక్రమాలలో కొనసాగుతున్నారు. ఇద్దరికీ హామీ ఇచ్చిన సీఎం.. దుబ్బాక ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు ఆరో తేదీన అనారోగ్య కారణంతో మరణించడం వల్ల దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే రామలింగారెడ్డి అంత్యక్రియలకు స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రామలింగారెడ్డి సతీమణి లేదా తనయుడికి సముచిత స్థానం కల్పించాలని ఆలోచనలో ఉన్నారు. ఇదే అభిప్రాయాన్ని మరికొంతమంది నాయకులు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇరువురు నేతల మృతితో టికెట్ ఎవరికీ కేటాయించాలి అనే సందిగ్ధంలో అధికార పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. క్రింది స్థాయి నాయకుల్లో ఇదే అంశం ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఇదే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పించినా మరొకరితో కంటే అయ్యే అవకాశం ఉంది. కనుక ఇరువురు నేతల కుటుంబాలకు ఒకరికి ఎమ్మెల్యేగా మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ పలు సేవా కార్యక్రమాలలో నిమగ్నమై నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు గా ఉన్నాడు. . అధిష్టానంపై ఒత్తిడి అయితే ముందు తన తండ్రి ముత్యంరెడ్డి హామీ ఇచ్చారు గనుక తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగా రెడ్డి తనయుడు సోలిపేట సతీష్ రెడ్డి కూడా దుబ్బాక నియోజక వర్గంలో యువజన కార్యక్రమాలకు సంబంధించి అనేక పనులు నిర్వహిస్తూ తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక బరిలో ఎవర్నినిలబెడతారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆశావాహులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మరికొందరు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ లోపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా దుబ్బాక నియోజకవర్గం పై పట్టు సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపొందలని పక్కా ప్రణాళిక బీజేపీ పార్టీ నుండి మాధవనేని రఘునందనరావు, తోట కమలాకర్రెడ్డి దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మద్దుల సోమేశ్వర్ రెడ్డి నరసింహారెడ్డి కర్నాల శ్రీనివాస్ తో పాటు మరొక ముగ్గురు నేతలు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఉప ఎన్నిక సమయం మరో ఐదు మాసాలు ఉండగానే దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ పార్టీలో లో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తనయులు పోటీ పడడం తమకు కలిసొస్తుందని భావించిన బీజేపీ ఇప్పటికే ప్రచారం గెలుపు ప్రణాళిక మొదలుపెట్టి ముందువరుసలో నిల్చుంది. గతంలో లో దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు ఈసారి ఎలాగైనా గెలుపొందలని పక్కా ప్రణాళికతో పార్టీ ప్రచార కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. తోట కమలాకర్ రెడ్డి తనకు టికెట్ కేటాయిస్తే యువత ఓటు బ్యాంకుతో ఎలాగైనా విజయం సాధిస్తాం అన్నా భీమాను వ్యక్తం చేస్తున్నాడు. దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ గెలుపు భీమా గా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆశావహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర క్యూ కడుతున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి ముత్యం రెడ్డి అనుచర గణం 70000 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డిని గెలిపించారు. కానీ త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు ఇరువురు నేతలు ఒకే పార్టీ నుండి కనుక పోటీ చేస్తే సీటు దుబ్బాక స్థానం బీజేపీ కి అనుకూలంగా మారనుంది. అధిష్టానం బుజ్జగింపు ఏ ఒక్కరూ వెనక్కి తగ్గినా ఆ సీటు టీఆర్ఎస్ ఖాతాలోనే సురక్షితంగా ఉంటుందని విశ్లేషణ కొనసాగుతుంది. ప్రతి పార్టీలోనూ ఇద్దరు ముగ్గురు పోటీకి దిగడం అధిష్టానం పిలుపుమేరకు టికెట్ ఒకరికి కేటాయిస్తే ఎవరైతే తప్పుకోకుండా పోటీలో ఉండాలనుకుంటున్నారో వారే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచే పరిస్థితులు దుబ్బాక నియోజక వర్గంలో మొదలవుతున్నాయి. -
రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా
సాక్షి, సిద్దిపేట: దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం రామలింగారెడ్డి సంతాప సభ నిర్వహించిన తర్వాత లక్షణాలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో రామలింగారెడ్డి భార్య, కుమారుడు, ఇద్దరు పిల్లలకు పాజిటివ్ ఉన్నట్లు మంగళవారం తేలింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రామలింగారెడ్డి మరణం నుంచి సంతాప సభ వరకు తమతో కలసి ఉన్నవారు. తమను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు కోరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు పాజిటివ్ సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
సోలిపేట సేవలు మరువలేనివి: మంత్రి హరీశ్
దుబ్బాకటౌన్: సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకకు చేసిన సేవలు మరువలేనివని.. సీఎం కేసీఆర్ మెచ్చిన గొప్ప ఎమ్మెల్యే రామలింగన్న అని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంతాపసభకు ఆయన హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి కుటుంబీకులకు మంత్రి హరీశ్రావు ఆత్మీయ భరోసానిచ్చారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన లింగన్న.. శాసనసభ్యుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. విప్లవకారుడిగా, జర్నలిస్టుగా, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, అంచనాల కమిటీ చైర్మన్గా రాష్ట్రానికి రామలింగారెడ్డి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఆయన ఆశయాలు నేరవేర్చేందుకు అందరం కృషి చేసినప్పుడే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. -
సామాన్యుడి నుంచి ఎమ్మెల్యే వరకు..
దుబ్బాకటౌన్ : సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నాలుగుమార్లు శాసనసభ్యుడిగా పనిచేసినా.. తుదిశ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతాన్ని వీడని నాయకుడిగా దుబ్బాక ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. రామలింగారెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి గ్రామంలో పోలీస్పటేల్. రామలింగారెడ్డి చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలతో పెరిగారు. పాఠశాలకు రోజూ నడిచి వెళ్లేవారు. టెన్త్ అయ్యాక చదువుకోకుండా వ్యవసాయం చేస్తూ దోస్తులతో తిరుగుతుండడంతో తండ్రి రామకృష్ణారెడ్డి బలవంతంగా ఆయనను దుబ్బాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించారు. 1981లో ఇంటర్లో చేరిన ఆయన.. ప్రగతిశీల విప్లవభావాలతో పీడీఎస్యూలో చేరారు. అదే సమయంలో దుబ్బాక జూనియర్ కళాశాలలో రాడికల్ విద్యార్థి సంఘం పురుడుపోసుకోవడంతో అందులో రామలింగారెడ్డి చేరి ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టారు. కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో వైస్ప్రెసిడెంట్గా గెలిచారు. అప్పటి పీపుల్స్వార్ అగ్రనేత శాఖమూరి అప్పారావుతో ఏర్పడిన పరిచయం రామలింగారెడ్డిని పూర్తిస్థాయి విప్లవకారుడిగా మార్చింది. ఆర్ఎస్యూ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఆర్ఎస్యూను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల్ని ఉద్యమంలో చేర్చడంలో ముఖ్యపాత్ర పోషించారు. పోలీసు నిర్బంధం పెరగడంతో కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత కుటుంబసభ్యుల ఒత్తిడితో బయటకు వచ్చారు. 1985లో జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టారు. మొదట్లో ఆంధ్రజ్యోతిలో, ఆ తరువాత ‘ఉదయం’లో దుబ్బాక విలేకరిగా పనిచేశారు. అనంతరం ‘వార్త’పత్రిక తరఫున దుబ్బాక, జహీరాబాద్, సిద్దిపేటలో పనిచేశారు. జర్నలిస్టుగా పలు సంచలన కథనాలతో పేరు తెచ్చుకున్నారు. జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. మొదటి టాడా కేసు రామలింగారెడ్డిపైనే.. జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు రాసిన ఆయనపై 1989లో రాష్ట్రంలోనే మొదటి టాడా కేసు నమోదైంది. పోలీసులు ఆయనను జైలులో పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఎగశాయి. ఆయనపై పెట్టి న కేసులో సరైన ఆధారాల్లేవంటూ కోర్టు కొట్టివేసింది. జర్నలిస్టుగా ఉన్న సమయంలో కూడా పీపుల్స్వార్ గ్రూపులో కేంద్ర, రాష్ట్ర కమిటీ ముఖ్య నేతలతో సంబంధాలు కొనసాగించడంతో చాలాకాలం ఆయనపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. కేసీఆర్ వెన్నంటి ఉంటూ.. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డిది కీలకపాత్ర. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన జర్నలిస్టుగా ఉంటూనే పలు కథనాలు రాసి ఉద్యమ బలోపేతానికి కృషి చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ను ఏర్పాటు చేసే క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లినపుడు రామలింగారెడ్డి వెన్నంటి ఉండి ఆయన గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు. అప్పటి నుంచి రామలింగారెడ్డి కేసీఆర్కు నమ్మినబంటుగా మారారు. ఈ క్రమంలో కేసీఆర్ రామలింగారెడ్డిని పిలిచి 2004లో టీఆర్ఎస్ తరపున దొమ్మాట నియోజకవర్గం టికెట్ ఇచ్చా రు. ఆ ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలవడం ద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. 2008 ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఆయన 2009లో ఓటమిపాలయ్యారు. మళ్లీ 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం లో భాగంగా రామలింగారెడ్డిపై 30కిపైగా పోలీస్ కే సులు నమోదయ్యాయి. రామలింగారెడ్డి జీవితకాలమంతా కుటుంబం కంటే ఎక్కువగా ఉద్యమాలు, పేదలకు సేవచేయడంలో గడిచిపోయింది. పేరు: సోలిపేట రామలింగారెడ్డి తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి పుట్టిన ఊరు: చిట్టాపూర్ దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా పుట్టిన తేదీ: 1962, అక్టోబర్ 2 భార్య: సుజాత సంతానం: సతీష్రెడ్డి, ఉదయశ్రీ జర్నలిస్టుగా: రెండు దశాబ్దాలపాటు వివిధ పత్రికల్లో పనిచేశారు ఎమ్మెల్యేగా విజయం: 2004, 2008, 2014, 2018 (దొమ్మాట/దుబ్బాక) -
దుబ్బాక ఎమ్మెల్యే ‘సోలిపేట’ కన్నుమూత
సాక్షి, సిద్దిపేట : అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి (57) గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కాలిపై కురుపుతో బాధపడుతున్న ఆయన 15 రోజుల క్రితం హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి 2.15 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం ఆయన స్వగ్రామం చిట్టాపూర్లో అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పెద్దసంఖ్యలో అభిమానులు చిట్టాపూర్ తరలివచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. కాలిపై కురుపుతో ఆస్పత్రిలో చేరి.. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కొంతకాలంగా కుడికాలుపై కురుపుతో బాధపడుతున్నారు. అది కాస్తా పెద్దదవడంతో జూలై 22న చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ డాక్టర్లు కాలికి శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇన్ఫెక్షన్ అయి.. శరీరమంతా వ్యాపించింది. కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులతోపాటు, మెదడుకు కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో రామలింగారెడ్డి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, మున్సిపల్శాఖ మంత్రి తారకరామారావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి.. సోలిపేట ఆరోగ్య విషయమై డాక్టర్లతో సంప్రదించారు. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. అప్పటికే మూత్రపిండాలు, కాలేయం పనిచేయకపోవడంతో పది రోజులు మృత్యువుతో పోరాడిన సోలిపేట బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. స్వగ్రామం చిట్టాపూర్లో అంత్యక్రియలు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం చిట్టాపూర్లో గురువారం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని ఉదయాన్నే చిట్టాపూర్కు తరలించారు. సొంతింటి వద్ద పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నీ తానై అంత్యక్రియల ఏర్పాట్లను చూశారు. స్వయంగా పాడె మోసి రామలింగారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై సోలిపేట భౌతికకాయాన్ని ఉంచి చిట్టాపూర్లోని కూడవెల్లి వాగు ఒడ్డున ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ కుమారుడు సతీష్ తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు. కంటతడి పెట్టిన కేసీఆర్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి వార్త వినగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్లోని ఆస్పత్రిలో సోలిపేట చికిత్స పొం దుతుండగానే పలుమార్లు ఆరోగ్య పరిస్థితి పై సీఎం ఆరాతీశారు. సోలిపేట మరణ వార్త తెలియగానే ప్రగతి భవన్ నుంచి హుటాహుటిన చిట్టాపూర్ చేరుకున్నారు. రామలింగారెడ్డి పార్థివదేహంపై పూలమాల ఉంచి నివా ళి అర్పించారు. కన్నీటి పర్యంతమవుతూ.. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్రెడ్డి వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటా నని ధైర్యం చెప్పారు. ఉద్యమకాలం నుంచి సోలిపేటతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్దిసేపు అక్కడే విషణ్ణవదనంతో కూర్చుండిపోయా రు. రామలింగారెడ్డి ఆస్పత్రిలో చికిత్సపొం దిన తీరును, ఆయన మరణానికి కారణాల ను మంత్రి హరీశ్రావును అడిగి తెలుసుకు న్నారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని హరీశ్రావుకు చెప్పి వెళ్లిపోయారు. ప్రముఖుల నివాళి.. రాష్ట్రం నలుమూలల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చిట్టాపూర్కు చేరుకున్నారు. సోలిపేట పార్థివదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, కల్వకుంట్ల తారక రామారావు, ఈటల రాజేందర్, ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, సత్యవతిరాథోడ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి శుభాష్రెడ్డి, బోడెపూడి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతికిరణ్, జోగు రామన్న, పెద్ది సుదర్శన్రెడ్డి, హన్మంత్ షిండే, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు హాజరై నివాళులర్పించారు. తీరని లోటు.. గవర్నర్, సీఎం సహా పలువురి నివాళి దుబ్బాక ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా సోలిపేట అందించిన సేవలు మరువలేనివని గవర్నర్ అన్నారు. సోలి పేట మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్లు దాస్యం వినయ్భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పద్మా దేవేందర్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దిగ్భ్రాంతి రామలింగారెడ్డి మృతి పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్ర మార్క, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మె ల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన సేవలు మరువలేనివి: బండి సంజయ్ సోలిపేట అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా సిద్దిపేటకు తీరని లోటని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. రామలింగారెడ్డి కుటుంబీకులకు జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. -
ముగిసిన రామలింగారెడ్డి అంత్యక్రియలు
సాక్షి, మెదక్: దివంగత నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు గురువారం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. మధ్యాహ్నం 3.10 గంటలకు చిట్టాపూర్లోని స్వగృహం నుంచి ప్రారంభమైన రామలింగారెడ్డి అంతిమ యాత్ర ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు సాగింది. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు రామలింగారెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, బాల్క సుమన్, పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి తదితరులు రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామమైన చిట్టాపూర్ ఒక్కసారిగా మూగబోయింది. కన్నీళ్లతోనే ఆయనను ఆఖరుసారి చూసేందుకు అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. (దుబ్బాక ఎమ్మెల్యే మృతి; సీఎం కేసీఆర్ సంతాపం) -
కంటతడి పెట్టుకున్న సీఎం కేసీఆర్
-
కంటతడి పెట్టుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో చిట్టాపూర్ శోకసంద్రంగా మారింది. ఆయన మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ నేడు మధ్యాహ్నం చిట్టాపూర్కు చేరుకున్నారు. అనంతరం రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఆప్త మిత్రుడిని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు రామలింగారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (దుబ్బాక ఎమ్మెల్యే మృతి పట్ల కేసీఆర్ సంతాపం) బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచిన రామలింగారెడ్డి అంత్యక్రియలను మరికాసేపట్లో చిట్టాపూర్లోని ఆయన వ్యవసాయ క్షేత్రం వద్ద అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననుండటంతో సిద్దిపేట పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అంత్యక్రియల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు కరోనా ఉధృతిని సైతం లెక్క చేయకుండా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 1982 నుంచి ఉదయం, వార్త పత్రికల్లో పని చేసిన జర్నలిస్టులు, TUWJ రాష్ట్ర ప్రతినిధులు విరహథ్ అలీ ఎమ్మెల్యే భౌతికకాయాన్ని సందర్శించారు. తమ మధ్య మూడు దశాబ్దాల అనుబంధం ఉందంటూ వారి మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత) -
దుబ్బాక ఎమ్మెల్యే మృతి; సీఎం కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. సోలిపేట రామలింగరెడ్డి మృతి పట్ల టీఆర్ఎస్ నేతలు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. ‘తెలంగాణ ఉద్యమ సహచరుడు, జర్నలిస్టు, ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం నన్ను కలచివేసింది. వారి మృతి తెలంగాణకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు, నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. దుబ్బాక అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన నాయకుడు’ అంటూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ట్విటర్లో పేర్కొన్నారు. ‘దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో ఉన్న అనుబంధం మరువలేనిది. తెలంగాణ రాష్ట్రం కోసం బలంగా ఆకాంక్షించిన వారిలో ఆయన ఒకరు. వారు జర్నలిస్ట్ గా, ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసుకున్నారు’ అంటూ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. ‘దుబ్బాక శాసనసభ్యుడు, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి గారి ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్న..వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ‘తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయింది. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి ప్రజల అభీష్టం నెరవేర్చిన మహనీయుడు’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రామలింగారెడ్డి, రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సహచరుడు,ఎమ్మెల్యే, శాసనసభ అంచనాలు,పద్దుల కమిటీ చైర్మన్ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.వారు ప్రజా జీవితంలో చేసిన సేవలు మరువ లేనివి.సమాజం పట్ల బాధ్యతగా ఉన్న నాయకుడు. జర్నలిస్టుగా,ఎమ్యెల్యేగా చాలా చురుకైన పాత్ర పోషించారు.రామలింగారెడ్డి లేరనేది ప్రజలకు తీరని లోటు.వారి మృతి పట్ల ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సానుభూతి ప్రకటించారు. -
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిశారు. ఆయన మరణ వార్త జిల్లా, నియోజకవర్గ ప్రజలను విచారంలో ముంచింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గం నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన మృతిపట్ల టీఆర్ఎస్ నేతలు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుములుకున్నాయి. రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయన భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. 2004 లో మొదటి సరిగా దుబ్బాక నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2009లో ఓటమి అనంతరం 2014, .2019 ఎన్నికల్లో గెలుపొందారు. అంతకు ముందు రామ లింగారెడ్డి వివిధ వార్తా పత్రికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా, జహీరాబాద్, దుబ్బాక, సిద్దిపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో పని చేశారు. జర్నలిస్ట్ నాయకుడిగా రాష్ట్రంలో పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. నక్సలైట్ ఉద్యమంలోనూ పాల్గొని కొన్ని రోజుల పాటు పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతదేహాన్ని ఆయన స్వస్థలం చిట్టాపూర్కు తరలించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామలింగారెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆత్మీయులు, రాజకీయ నాయకులు, అభిమానులు.. చిట్టాపూర్కు చేరుకుంటున్నారు. రామలింగారెడ్డి అకాల మరణంతో చిట్టాపూర్ శోక సంద్రంగా మారింది. -
ఆస్పత్రిలో దుబ్బాక ఎమ్మెల్యే
దుబ్బాకటౌన్: అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని బుధవారం మంత్రి టి.హరీశ్రావు పరామర్శించారు. రామలింగారెడ్డికి కిడ్నీ సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స కోసం మూడు రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. దీంతో మంత్రి హరీశ్రావు ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కాగా, రామలింగారెడ్డి ఆరోగ్యం కొద్దిగా మెరుగు పడిందని ఆయన కుమారుడు సతీష్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రి వర్గాలతో ఫోన్లో ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు అందుతున్న చికిత్స గురించి ఆస్పత్రి ఎండీ డాక్టర్ నాగేశ్వర్రెడ్డిని అడిగినట్లు సమాచారం. మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే మంత్రి కేటీఆర్ సైతం ఆస్పత్రి వర్గాలతో మాట్లాడినట్లు తెలిసింది. -
జీవించే హక్కు వీరికి లేదా?
సమాజానికి రాజకీయం అవసరం. నలుగురు కూడి ఓ సమస్యకు పరిష్కారం వెతికే అద్భుత క్రతువే రాజకీయం. రాజకీయంలో భిన్న ఆలోచనలుంటాయి. అంతులేని విజ్ఞాన శోధన ఉంటుంది. వాటిలో తార్కి కత ఉంటుంది. ఏకాభిప్రాయాలు, విస్తృతాభిప్రాయాలు, విభేదాలు కూడా ఉంటాయి. ఈ సంఘర్షణలోంచే భిన్న రాజకీయ దృక్పథాలు ఉత్పన్నమవుతాయి. విప్లవ భావజాలం పుట్టుకొస్తుంది, అది పరిసరాలను, ప్రాంతాలను, అవసరాలను బట్టి సాయుధ పోరాటంగానూ మారవచ్చు లేదా శాంతి మార్గంలోనూ నడవవచ్చు. ఎలా రూపాంతరం చెందాలనేది అక్కడి ప్రజల విశ్వాసాలు, అవసరాలు, ఆకాంక్షలను బట్టి ఉంటుంది. ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజద్రోహమే పాలకులకు ఎప్పుడూ ప్రజా విశ్వాసాలు మూఢంగా ఉండాలి. రాజభక్తిని ప్రదర్శించే విధంగానే ఉండాలి. అంతే కానీ అవి బలమైన భావజాలంగా మారొద్దు. రాజ్యహింసను, దోపిడీని, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదగొద్దు. అట్లా ఎదిగితే వాళ్లు రాజద్రోహులు అవుతారు. వాళ్ల మీద పోలీసు నిర్బంధం పెరుగుతుంది. ఇనుప గజ్జల బూట్ల కింద పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రజా విశ్వాసాల మీద నిర్బంధ దాడి మొదలవుతుంది. ఇక్కడే ధర్మదేవత అడ్డం పడి ప్రజా హక్కులను రక్షించాలి. పౌర స్వేచ్ఛను కాపాడాలి. కానీ ఎందుకో న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక శాఖ తీరుగానే ఆలోచన చేస్తోంది. పోలీసులు చేసే హక్కుల ఉల్లంఘనకు అంగీకార ముద్ర వేసే ధోరణి క్రమంగా బలపడుతోంది. నిర్బంధించడం రాజ్యానికి కొత్తేమీ కాదు ప్రధాన మంత్రి మోదీని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారనే అభియోగం మోపి పుణే పోలీసులు హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. అంతకుముందు ప్రొఫెసర్ సాయిబాబా మీద కూడా దేశ ద్రోహం కిందనే జైల్లో పెట్టారు. ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో ప్రజా సంఘాల నాయకులను ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించటం అనేది రాజ్యానికి కొత్తేమీ కాదు. ప్రపంచాన్ని కోవిడ్–19 మహమ్మారి కబళి స్తున్న సమయం ఇది. అన్ని వ్యవస్థలను లాక్డౌన్ చేసి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. వయసు మళ్ళిన వృద్ధుల మీద ఆ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఇటువంటి వాళ్లకు సామాజిక దూరమే పరిష్కారమని వైద్య పరిశోధనలు, పరిశీలనలు చెబుతున్నాయి. కరోనా కేసుల్లో మహారాష్ట్ర రికార్డు దేశంలోకల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మే 9 నాటికి ఈ రాష్ట్రంలో అత్యధికంగా 19,063 కేసులు నమోదు కాగా 1,089 పాజిటివ్ కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య ఈ శుక్రవారానికి 731కి చేరుకుంది. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే 714 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. సమూహాలుగా ఉంటే వైరస్ వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే పుణే జైలులో స్థాయికి మించి ఖైదీలను బంధించి ఉంచారని, ఖైదీలకు సులువుగా కరోనా అంటుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోవడానికి తమకు తాత్కాలికంగా బెయిలు మంజూరు చేయాలని వరవరరావు, సోమాసేన్ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ వారి ఇద్దరి బెయిల్ అభ్యర్థన పట్ల అభ్యం తరం చేసింది. కోర్టు బెయిలు నిరాకరించింది. మరో వైపు నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆయనకు పిత్తాశయం, క్లోమ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. 90 శాతం అంగవైకల్యం, దాదాపుగా కుప్పకూలిన వ్యాధినిరోధక సామర్థ్యం. ఛాతీ నొప్పి, గుండెదడ తదితర ఆరోగ్య సమస్యలతో ఉన్న సాయిబాబా జీవించే హక్కులో భాగంగా న్యాయస్థానాల్లో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంటే అంగీకరించలేదు. 25 కేసులు కొట్టేసినా వీవీని వదలని రాజ్యం వరవరరావు మీద కుట్ర కేసులు కొత్తేమీ కాదు.ఆయన మీద 25 రకాల కేసులు పెట్టారు. ఇందులో ఒకటి అంటే ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్లో కుట్ర చేశారని 1974లో 46 మందిపై కుట్ర, రాజద్రోహ అభియోగం మోపారు. నాటి నక్సలైట్ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన వరవరరావు, చెరబండరాజు, కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, ఎం.టి.ఖాన్లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్ కోర్టు అందరినీ నిర్దోషులుగా తేల్చింది. 1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ రాంనగర్ కుట్ర కేసు పెట్టారు. కొండపల్లి సీతారామయ్య, వరవరరావు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్లో వరవరరావు, సూరి శెట్టి సుధాకర్లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005 మే 30న నిజామాబాదులో అరెస్ట్ చేశారు. 2010 ఆగస్ట్ 2న నిజామాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఆ కేసును కొట్టేశారు. రాజ్యహింస ప్రజా విశ్వాసాలపై దాడి ఇలా ఏ కేసు స్టడీ చేసినా రాజ్యహింసే ఉంది. ప్రజా విశ్వాసాల మీద పోలీసుల దాడి కనిపిస్తుంది. బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టు ఈ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరపాలి. సామూహిక ప్రదేశాల్లో నివసించడం వలన కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒక్కసారి వ్యాధి అంటుకుంటే ఒకవైపు వృద్ధాప్యం మరోవైపు వ్యాధి నిరోధక శక్తిని పోగొట్టుకున్న వీళ్లు తట్టుకుని నిలబడటం కష్టం. అదే జరిగితే వాళ్ల జీవించే హక్కును రాజ్యాంగం హరించినట్లు అవుతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ తరహాలో కాకుండా న్యాయవ్యవస్థ విభిన్నంగా, తార్కిక ఆలోచన చేయాలి. ఉద్యమకారులకు సత్వర న్యాయాన్ని అందించాలి. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని హక్కుల ఉద్యమకారులపై పెట్టిన రాజద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలి. జీవించే హక్కును గౌరవించాలి. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
కరోనాపై మన యుద్ధం గెరిల్లా పంథాలోనే
‘తెప్పలుగ చెరువు నిండినప్పుడు ఊరి గొప్పలు పదివేలు గదరా సుమతీ..! ఊరి పటేండ్ల మూతి మీసం మిడిసి పడుతది. గౌడ్లోళ్లు కాటమయ్య పండుగ చేస్తరు . బైండ్లోళ్ళ కథలుంటయ్.. చిందోళ్ళ పాటలు ఉంటాయ్. పీర్లు దుంకులాడుతాయి.. సబ్బండ జాతులు దూలాడుతాయి’ అని సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళి ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకానికి ముందుమాటలో చెప్పారు. ఆ కూర్పులో నా బాల్యం ఉంది. కట్టకింది పంట పొలాన్ని చూస్తూ కట్ట మీద నిలబడి మీసం మెలేసిన మా నాయిన జ్ఞాపకాల దొంతర ఉంది. బెస్తోళ్ళ వలకు చిక్కిన తొలి కొర్రమట్ట బాపు పటేల్ గిరి మెప్పు కింద పులుసు అయిన యాది ఉంది. ప్రకృతి గమనంలో బాపు కాలం చేశారు. ఆయనతో పాటే చెరువూ ఎండి పోయింది. వాగులు, వంకలు, వర్రెలు జ్ఞాపకాలు అయ్యాయి. ఇక ఆ విషాదం ఓ గతం. చెదిరిపోయిన జ్ఞాపకం. కృష్ణా, గోదావరి నదులు నడకలు నేర్చి తెలంగాణ బీడు భూముల మీద నడయాడుతున్నాయి. అటు కృష్ణా బేసిన్ ఇటు గోదావరి బేసిన్ పరిధిలోని ఎత్తిపోతల పథకాలు ఒక్కొక్కటిగా పూర్తయి చెరువులను నింపుతున్నాయి. బీడు భూములను మాగాణీగా మారుస్తున్నాయి. తెలంగాణ వైతాళికుడు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఒకవైపు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరోవైపు గ్రామ దేవతలై గ్రామాలకు ప్రాణం పోస్తున్నాయి. పల్లె ఇప్పుడు పేద తల్లి కాదు. కరువు, కల్లోలాల నుంచి బయటపడిన అన్నపూర్ణ. కరోనా విష పురుగులు ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ పల్లె తల్లి కలవరపడుతోంది. కన్న బిడ్డలను రమ్మంటోంది. కడుపులో పెట్టుకొని సాకుతానని భరోసాను ఇస్తోంది. కానీ మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవి ష్యత్తు కోసం, యావత్ మానవ జాతి మనుగడ కోసం కనిపించని శత్రువుపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఈ మహమ్మారితో యుద్ధం అంటే స్వీయ గృహనిర్బంధమే. అమ్మ రమ్మని పిలిచినా వెళ్లకుండా మనలను మనం నియంత్రించుకోవలసిన సమయం ఇది. కాలం అనుకూలంగా లేని ఈ సమయంలో గెరిల్లా పంథానే మన ముందున్న మార్గం. కలసిరాని ఈ కాలంలో రెండడుగులు వెనక్కి వేసి మన సమయం వచ్చేంతవరకు పరిసరాలను గమనిస్తూ ఉండటం ఎంతో ముఖ్యం. మనం ఇప్పుడు పల్లెకి పోతే పచ్చగా ఉన్న పల్లె కూడా కరోనా రాకాసి కోరలకు చిక్కి వల్ల కాడై పోతుంది. ఈ విపత్తును ఆపటానికి సీఎం బరువెక్కిన హృదయంతో ఇరవై ఒక్క రోజులు కర్ఫ్యూ పెట్టారు. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉందాం. ఇది తాత్కాలికమే. ఇదిలా ఉంటే.. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా 282 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈ సీజ న్లో కాళేశ్వరం ద్వారా 58 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయడంలో అది 340 టీఎంసీలకు చేరింది. ఇందులో ప్రధానంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల ద్వారానే కనీసంగా 120 టీఎంసీలు, ఏఎంఆర్పీ ద్వారా మరో 50 టీఎంసీల మేర నీరు ఎత్తిపోస్తుండగా, దేవాదుల, ఎల్లం పల్లి, గుత్ప, అలీసాగర్ వంటి పథకాల కింద మరో 70 టీఎంసీల ఎత్తిపోతల కొనసాగుతూ వస్తోంది. రెండు బేసిన్ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేసింది. రెండు బేసిన్లలోని 22 ఎత్తిపోతల పథకాల పరిధిలో 96 పంప్హౌస్లు ఉండగా, 318 పంపుల నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో 270 పంపులు జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అటునుంచి మిడ్మానేరు వరకు ఎత్తిపోశారు. మిడ్మానేరులోకి ఈ సీజన్లో మొత్తంగా 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులోంచి 30 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యామ్కు తరలించారు. ఆ నీటిని వదిలి తొలిసారిగా ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న 681 చెరువులు నింపారు. వీటి నీటి నిల్వ సామర్థ్యం 8.63 టీఎంసీలు. ఈ యాసంగిలో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకానికి అవసరమైన సమాచారం కోసం రచయిత వెంకన్నతో కలిసి పాలమూరు జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి పారిన కాల్వలను, పచ్చబడిన పంట పొలాలు, బాగుపడిన బతుకులను కళ్ళ నిండా చూశాను. పుస్తకావిష్కరణ కోసం వెంకన్న సొంత ఊరు కర్విరాల కొత్తగూడెం వెళ్ళినప్పుడు సూర్యాపేట జిల్లాలో మత్తడి దుంకుతున్న చెరువులను, అలుగుళ్ళ ఎదురెక్కుతున్న చేపజాతులను చూశాను. ఎక్కడి కాళేశ్వరం... ఎక్కడున్న కర్విరాల కొత్తగూడెం. ఆ ప్రజలు కల్లో కూడా ఊహించని పరిణామం. తుంగతుర్తి దాటిన తరువాత కర్విరాల పల్లె పొలిమేర నుంచి జలజల జారిపోతున్న పిల్ల కాల్వల్ల నీళ్ళు చూస్తుంటే...! నా నియోజకవర్గం దుబ్బాక మదిలో మెది లింది. జవగళ్ళ భూములున్నా.. నీళ్ళు లేక బిక్కటిల్లిన నేల నాది. మల్లన్న సాగర్ తో బతుకు చిత్రం మారబోతదని భూములు త్యాగం చేశారు. ఆ కల ఈడేరబోతోంది. కాళేశ్వరం నీళ్ళు దుంకులాడుకుంటు వస్తున్నాయి. అనంతగిరి– అన్నపూర్ణమ్మ నిండింది. ఇక అక్కడి నుంచి రంగనాయక్ సాగర్ కు నీళ్ళు ఉరుకులాడుతున్నయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్కు 16.18 కి.మీ. టన్నెల్ పనులు పూర్తికాగా 8 పంపులు సిద్ధమయ్యాయి. రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కి.మీ. మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్యాయర్ను నింపేలా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 25 నాటికి కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరుతాయి. కనీసంగా 240 కిలోమీటర్ల దూరం గోదావరి తరలి రానుంది. రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపుతూ, కొండపోచమ్మ వరకు మొత్తంగా 400 చెరువులు నిండుతాయి. ఈ మహా క్రతువుల్లో సీఎం మహా సంకల్పం అనిర్వచనీయమైనది, మంత్రి హరీశ్ రావు పట్టుదల గొప్పది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శ్రమను అభినందించకుండా ఉండలేము. మల్లన్న సాగర్ నిండితే దుబ్బాక ప్రాంతంలో వ్యవసాయం మాత్రమే కాదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల భవిష్యత్తుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. నేల స్వభావం, పంట దిగుబడులపై అధ్యయనం చేసి సంబంధిత పంట ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ నేను ఇటీవలే మంత్రి కేటీఆర్ను కలిసి విజ్ఞప్తి చేశాను. దానికి ఆయన స్పందిస్తూ స్పష్టమైన హామీ ఇవ్వటం నా నియోజకవర్గం ప్రజల అదృష్టం. భవిష్యత్తు కోసం పల్లె అన్ని విధాలుగా రూపుదిద్దుకుంటుంది. 21 రోజులు మాత్రమే కాదు 6 నెలల విపత్తు వచ్చినా మూడు పూటల బువ్వ పెట్టి ఆశ్రయం ఇచ్చే దిశగా పల్లె ఎదుగుతోంది. అయితే దాన్ని అనుభవించేందుకు భవిష్యత్తులో మనం ఉండాలి. మనం ఈ కష్టకాలం నిబ్బరంతో ఎదుర్కొందాం. ఉన్న ఊర్లో వైపు ఆలోచన చేయకుండా ఈ 21 రోజులు ఎక్కడికక్కడ స్వీయ నిర్బంధంలో ఉందాం. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి సీనియర్ జర్నలిస్ట్, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94413 80141 -
కమతంపై పోలీసు పెత్తనం
అది 20వ శతాబ్దం... 1941 జూన్ 17, సూర్యాపేట – జనగామ రోడ్డు. మాసిన షేర్వానీ, చిరిగిన అడ్డ పంచ నడుముకు చుట్టి ఓ బక్కపలచని ఫకీరు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కండలు తిరిగిన గూండా ఒకడు కొడవలితో ఫకీరు మెడ మీద వేటు వేశాడు. ఇంకోడు కత్తితో పొడిచాడు. చనిపోయిన ఆ ఫకీరు షేక్ బందగి అయితే... చంపిన వారు విస్నూర్ దేశముఖ్ గూండాలు. షేక్ బందగికి వారసత్వంగా వచ్చిన పట్టా భూమిని విస్నూరు దేశముఖ్ బంటు దౌర్జన్యంగా మలుపు కున్నాడు. బందగీ అడ్డం తిరుగుతాడు. తగాదా తుదకు కోర్టుకెక్కింది. కార్వాయి నడిచి నడిచి బందగి వైపే ఫైసలా అయింది. బక్క రైతుకు భూమి దక్కటాన్ని జీర్ణించుకోలేని దేశముఖ్ బందగీని హత్య చేయించాడు. పారిన ఫకీరు నెత్తురు తెలంగాణ సాయుధ పోరాటానికి , ఇక్కడి భూ పోరాటాలకు జీవధార అయింది. 21వ శతాబ్దం.. 60 ఏళ్ల కల సాకారమైంది. తెలంగాణ జననేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు అడగకుండానే కమ్యూనిస్టులను మించిన ఎజెండాను రూపొందించి అమలు చేశారు. 70 ఏళ్లుగా లొసుగులతో సాగిన భూ రికార్డులను ప్రక్షాళన చేశారు. ఎవరి హద్దులు వాళ్లకు చూపించి బీద, బిక్కీ, బడుగు, బక్క రైతుల భూములకు ఎవరికి వారివి పక్కాగా పట్టా చేసి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.55 కోట్ల వ్యవసాయ భూమి ఉండగా వివాదరహితంగా ఉన్న 2.38 కోట్ల ఎకరాల భూమికి పక్కాగా పాసుబుక్కులు తయారు చేసి ఇచ్చారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పునరుద్ధరణ చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కాళేశ్వరం, సీతారామ సాగర్ ఒక్కొక్క ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ కృష్ణా, గోదావరి జలాలను కాలువలకు మళ్లించి చెరువులను నింపారు. ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలకు చేయూతనిచ్చి సాగును గాడిలో పెట్టేందుకు ‘రైతుబంధు’ పథకాన్ని అమలు చేశారు. దీంతో చిగురించిన చెట్టు మీదికి పిట్టలు వచ్చి వాలినట్లుగా వలసపోయిన జనాలు తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు. కొత్త ఆశలతో సాగుకు సిద్ధమయ్యారు. కమతం మీదికి సాగుకు వచ్చిన సన్న, చిన్నకారు రైతులకు అక్కడక్కడ మళ్లీ బందగీ అనుభవాలే ఎదురవుతున్నాయి. బడా పెట్టుబడిదారుల వైపు నిలబడిన పోలీసులు, లేని సమస్యలను ఉత్పన్నం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. వందలాది ఎకరాలను కొనుగోలు చేసి భూముల చుట్టూ పెన్సింగ్ వేసి ఏక ఖండిక కమతాలుగా మార్చుకున్న పెట్టుబడిదారులు మధ్యలో ఉన్న వలస కూలీలకు చెందిన ఎకరం, అర ఎకరం భూములను అక్రమంగా కలిపేసుకున్నారు. సొంత భూములలో సాగు చేసుకునేందుకు తిరిగి వచ్చిన వలస కూలీలు లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి పట్టా దారి హక్కు పుస్తకాలు సంపాదించుకుని వస్తే పోలీసులు లాఠీలు పట్టుకొని గెట్టుకు అడ్డంగా, కబ్జాదారులకు అండగ నిలబడుతున్నారు. కబ్జా మీద ఎవరు ఉంటే వారిదే భూమి అనే చట్టవిరుద్ధ నిబంధనలను అమలు చేస్తున్నారు. పట్టాదారుల మీద ఆక్రమణ కేసులు బనాయిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటుగా కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ సమస్యలు విపరీతంగా ఉత్పన్నమవుతున్నాయి. బాధితుల అభ్యర్థన మేరకు నా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ను సంప్రదిస్తే ‘రెవెన్యూ రికార్డులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతానికి భూమి ఎవరి అధీనములో ఉందో వారే హక్కుదారులు. భూమి మీదికి వెళ్ళినవారు ఆక్రమణదారులు. అటువంటి వారిపై అక్రమ కేసులు పెడతాం’ అన్నారు. డీజీపీ ఆదేశాలమేరకే నడుచుకుంటున్నామని మరో సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన సమాధానంతో అవాక్కయ్యాను. పట్టా రైతుకు అన్యాయం జరుగొద్దనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ తీరు మార్చుకోకపోతే గతంలోలాగే మళ్లీ ప్రజల్లో అశాంతి రగిలే అవకాశం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్, మొబైల్ 9440380141 -
చెద పట్టిన నిప్పు
అవకాశం దొరికినప్పుడల్లా తాను నిప్పులాంటి మనిషినని తరచు చెప్పుకునే చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వ్యవస్థలను తనకు అనుకూలంగా మలుచుకుని చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. 1988లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సొంత అల్లుడు కదా అని కర్షక పరిషత్ బాధ్యతలు అప్పగించిననాటినుంచీ ఈ అక్రమాలు సాగుతూనే ఉన్నాయి. అందుకు చంద్రబాబు వివిధ సందర్భాల్లో ప్రకటించిన ఆస్తులే సాక్ష్యంగా నిలుస్తాయి. ఏడాదికి రూ. 36,000 ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు ఆయన తొలిసారి చెప్పగా, ఆయన, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు 2019నాటికి రూ. 1,034 కోట్లకు ఎగబాకాయి. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి 2005లో ఈ ఆస్తుల వ్యవహారంపై విచారణ జరపాలని కోరుతూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసిన కేసు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు విచారణకు వచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ‘ధర్మనందనా! రాజు అబద్ధం ఆడకూడదు.. ఇంద్రియ సుఖాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. ప్రయోజకమైన విష యాలు తప్ప స్వప్రయో జక ఆలోచనలు చేయ కూడదు. బంధుప్రీతి ఉండకూడదు. రాగ ద్వేష రహితంగా పాలన సాగించటం రాజధర్మం’. ధర్మరాజుకు మయుడు కట్టి ఇచ్చిన అందమైన రాజ భవనం మయసభ లోకి తొలిసారి పాదం మోపిన నారద మహర్షి ధర్మరాజుకు చెప్పిన మాటలివి. ధర్మరాజు ఆ మాటల్ని శ్రద్ధగా ఆలకించి, ‘మహర్షీ! నా య«థాశ క్తిని అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పాలన సాగిస్తున్నాను’ అని చెప్తాడు. రాజసూయ యాగం ముందు నారదుడు ధర్మరాజుకు రాజధర్మం బోధించిన సందర్భం ఇది. నాకు ఓటు హక్కు వచ్చే నాటికి ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టారు. ఓటేశాను. ఆయనలో రాజును చూస్తాను అనుకున్నా. కానీ రీలు చిత్రం, రియల్ చిత్తం ఎప్పటికీ ఒక్కటి కాదుగా..! ఎన్టీఆర్ బంధుప్రీతి, రాగద్వేషాలకు తలొగ్గారు. ఒక తరం రాజకీయ అవినీతికి బీజాలు వేశారు. 1988లో కర్షక పరిషత్ను ఏర్పాటు చేసి దాని పీఠం మీద సొంత అల్లుడు చంద్రబాబును కూర్చోబెట్టారు. అప్పటినుంచి అబద్దం, అధర్మం, అవినీతి, అన్యా యం, రాజ్యాంగబద్దం అయ్యాయి. రాజంటేనే అవినీతికి కంకణబద్ధుడు అనే పేరువచ్చింది. చంద్రబాబుకు తొలి పదవి కర్షక పరిషత్ చైర్మన్గా నియామకమే నిబంధనా విరుద్ధం. దీన్నే రైతు సంఘం నేత పెద్దిరెడ్డి చెంగల్రెడ్డి హెకోర్టులో సవాల్ చేశారు. దీనికి జవాబుగా చంద్రబాబు స్వయంగా అఫిడవిట్ దాఖలు చేశారు. దానిలో తన ఆస్తుల్ని వివరిస్తూ.. ‘నేను సంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబానికి 77.4 ఎకరాల భూమి ఉంది. 1986 మార్చి నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుం బానికి రూ.2.25 లక్షల ఆదాయం వచ్చింది. 1986లో మేం విడిపోయాం. ఆ తరవాత నేను స్వయంగా వ్యవసాయం చేయించాను. ఏడాదికి రూ. 36 వేలు ఆర్జించాను’ అని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఏమార్చటానికి ప్రయత్నించారు. నిజానికి చంద్రబాబు 2.5 ఎకరాల ఆసామి. వ్యవసాయమే చేయడం రాదు. ఆయనెప్పుడూ వ్యవసాయం చేయలేదు. ఈ అఫిడవిట్ ఇచ్చిన ఆరేళ్లకు అంటే 1992లో రూ.76 లక్షల భారీ పెట్టు బడితో హెరిటేజ్ ఫుడ్స్ను పెట్టాడు. స్వయంగా వ్యవ సాయం చేస్తూ ఏడాదికి రూ.36వేలు ఆర్జిం చిన బాబు ఆరేళ్లలో రూ 76 లక్షలు ఎలా ఆర్జించార న్నది బేతాళునికి కూడా అంతుచిక్కని సమాధానం. 1994లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన బాబు 1999లో నాటి స్పీకరు ఎదుట తన ఆస్తులు ప్రకటించారు. తమ కుటుంబానికి రూ.7.79 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు చెప్పారు. 2004 నాటికి రూ.20 కోట్లకు, 2009 నాటికి రూ.60 కోట్లు ఉన్నట్లు ఎన్నికల అఫిడ విట్లో పేర్కొన్నారు. 2019 నాటికి ఈ ఆస్తులు రూ. 1,034 కోట్లకు ఎగబాకాయి. ఇందులో బాబు మొత్తం ఆస్తుల విలువ 20.44 కోట్లు. ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు రూ. 648.13 కోట్లు. లోకేశ్కు రూ.320.45 కోట్లు. ఆయన భార్య బ్రాహ్మణి ఆస్తులు రూ.33.15 కోట్లు, కుమారుడు దేవాన్‡్ష మొత్తం ఆస్తుల విలువ రూ. 20 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. చాక్లెట్ చేతికి ఇస్తే కింద పడకుండ తినలేని పసి వయసులో దేవాన్ష్ రూ. 20 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో బాబుగా రికే తెలియాలి. చంద్రబాబు అక్రమ ఆస్తుల గుట్టు మొట్ట మొదట బయట పెట్టింది ఆయన అత్తగారు నంద మూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదా యానికి మించిన ఆస్తులు సంపాదించారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని 2005లో లక్ష్మీ పార్వతి తొలిసారి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. విచారణ జరుగకుండా చంద్ర బాబు స్టే తెచ్చుకున్నారు. అది మొదలు మద్యం ముడుపుల కేసు, ఏలేరు కుంభకోణం, ఐఎంజీ భారత్ కేసు, హెరిటేజ్ ఫుడ్స్లో మోహన్బాబుతో వివాదం, ముఖ్యమంత్రిగా హెరిటేజ్ ఫుడ్స్కు రాయితీలు ఇచ్చిన కేసు, అవినీతి మీద పాల్వాయి గోవర్ధన్రెడ్డి వేసిన కేసు ఇలా మొత్తం 17 కేసుల్లో విచారణ జరగకుండా చంద్రబాబు స్టేలు తెచ్చు కున్నారు. ఆ స్టేలను మెరుగుపరిచి తాను నిప్పులాంటి మనిషినని చెప్పుకుంటూ వచ్చాడు. ఆర్థికబలం, అధికార బలంతో చంద్రబాబు వ్యవస్థలను ఏమార్చారు. ఇందుకు కోర్టులు కూడా మినహాయింపు కాదు. ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు, ఆయన బినామీలు అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ, దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ భార్య విజయమ్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పుడు హైకోర్టు ధర్మాసనం చంద్రబాబు ఆస్తులపై సీబీఐ, ఈడీల ప్రాథమిక విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మురళీమోహన్, సీఎం రమేష్ తదితరులు హైకోర్టు ఆదేశాలను నిలిపి వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచిం చింది. తర్వాత ఆ కేసు అనేక మలుపులు తిరిగి చివరికి స్టే ఉత్తర్వులతో ఆగిపోయింది. ఈ కేసు విచారణ పేరుతో ఎనిమిది బెంచ్లు మార్చ డంపై కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా బెంచ్లు మార్చడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాలలో ఇలాంటి పరి స్థితులు ఉండవేమిటని కూడా కోర్టు ప్రశ్నించింది.ఈ కేసు సంగతి అలా ఉంచితే 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాతనైనా చంద్రబాబు అక్రమ ఆస్తులపై లక్ష్మీపార్వతి పెట్టిన కేసు విచా రణకు ఏసీబీ కోర్టు సిద్ధం కావటం ఆహ్వానించదగిన పరిణామం. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాలపై ప్రజలకు మరింత గౌరవం పెరుగుతుంది. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ ఛైర్మన్ మొబైల్ : 94403 80141 -
కోడెలను బలిపీఠం ఎక్కించిందెవరు?
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు పిరికివాడు కాదు. ఇంట్లో బాంబులు పేలిన నాడే భయపడలేదు. సీబీఐ కేసును ఎదుర్కొన్న మనిషి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? సత్తెనపల్లి నియోజకవర్గంలో కే ట్యాక్స్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. పరిస్థితులు తారుమారై చుట్టుముట్టిన వేళ తన అధినాయకుడు చంద్రబాబు ఆపన్నహస్తం కోసం ఎదురుచూసి, మానసికంగా అలసిపోయి కోడెల ఈ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు జరిగిన పరిణామాలు రూఢీ పరుస్తున్నాయి. ఆయనకు అవమానాలు, కేసులు కొత్తేమీ కాదు. కానీ నమ్ముకున్న చంద్రబాబు ద్రోహంతోనే ఆయన గుండె పగిలింది. ఆత్మహత్యలకు మానసిక నిపుణులు ఎన్నో కారణాలు చెబుతున్నారు. పరిస్థితులతో ఇమడలేకపోవడం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదురయ్యే సంఘట నలు, మూర్తిమత్వలోపాలు, జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడటం, కొన్ని సంఘటనలు జరుగుతాయని ఊహించుకుని భయపడటం, అవగాహన లోపం, ఆర్థిక ఇబ్బందులు, ఘర్షణలు, సామాజిక అంశాలు కూడా ఒక్కోసారి ఆత్మహత్యకు కారణమవుతాయట. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు వీటికి అతీతుడు కాలేకపోయారు. పరిస్థితులు ఒక్కసారిగా చిక్కుముళ్లుగా పడి ఉరితాళ్లై చుట్టుముట్టినప్పుడు చావును వెతుక్కున్నారు. అట్లాగని కోడెల పిరికివాడు కాదు. ఇంట్లో బాంబులు పేలిన నాడే భయపడలేదు. సీబీఐ కేసును ఎదుర్కొన్న మనిషి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఫ్యాక్షన్ రాజకీయాలతో పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న, వ్యక్తిగత, కుల, రాజకీయ, వృత్తి అస్తిత్వంతో తన ఉనికిని నిలబెట్టుకుంటున్న క్రియాశీలక నేత. అటు వంటి నాయకుని మరణానికి ఎవరు బాధ్యులు? అతను ఎంత మనోవేదన అనుభవించి ఉంటే ఆత్మహత్యకు పాల్పడ్డాడో అర్థం అవు తుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కోడెల మరణం దేశ రాజకీయాల్లో నిజంగానే ఒక కేస్ స్టడీగా తీసుకొని పరిశోధన చేయాల్సిన అంశమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా పరమైన దూకుడు పెంచారు. అవినీతి రహిత రాష్ట్రాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు పోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల దాహంతో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, అధిక ధరలకు అప్పగించి ఖజానాను దోచేశారని, రివర్స్ టెండర్ల ప్రక్రియకు వెళ్తామని చెప్పి.. చేసి చూపించారు. ఇది నిరూపితమైంది కూడా. అట్లాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో కే ట్యాక్స్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్ను సొంతానికి వాడుకున్నట్టుగా కోడెలపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. అతను, అతని కుటుంబంపై మొత్తం ఇరవై మూడు కేసులు నమోదు అయినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఆయనను మానసికంగా కుంగదీసే ఉంటుంది. పరిస్థితులు తారుమారై చుట్టుముట్టిన వేళ తన అధినాయకుడు చంద్రబాబు ఆపన్నహస్తం కోసం ఎదురుచూసి, మానసికంగా అలసిపోయి కోడెల ఈ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు జరిగిన పరిణామాలు రూఢీ పరుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని తప్పు పట్టలేం. ఇందులో దాగి ఉన్న రాజకీయ కోణాన్ని కూడా విస్మరించలేం. ఎట్లా అయితేనేమి కోడెల చట్టబద్దంగా బోనులో ఇరుక్కున్నారు.ఇటువంటి సమయంలో అండగా నిలవా ల్సింది చంద్రబాబే. మంచో చెడో పార్టీ పెద్దగా చంద్రబాబు కోడెల భుజం తట్టి ‘నేనున్నాను’ అని భరోసా ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ చంద్రబాబు ఆ పని చేయలేదు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న చంద్రబాబు చుట్టూ అవినీతి ఆరోపణలు, నోటుకు కోట్లు తదితర కేసులు ముసురుకుంటున్నాయి. ఈ కేసుల నుంచి ఆయనను రక్షించటంతో పాటు మరణం అంచున ఉన్న టీడీపీకి జీవ గంజి పోయటానికి ఎవరో ఒకరు బలిపీఠం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ బలిపీఠం తానే ఎక్కుతానని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వాగ్దానం చేశారు. ‘తాను ఆత్మహత్య చేసుకొని చంద్రబాబును రక్షించుకుంటా’ అని శపథం చేశారు. ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్య చేసుకోవడం యాదృచ్ఛి కమే. ఆత్మహత్యను వైద్య పరిభాషలో ‘క్రైఫర్ హెల్ప్’గా పరిగణిస్తా రట. ఏదైనా సహాయం కోసం అర్థించినపుడు ఎవరూ సహాయం అందజేయకపోతే చివరి పరిష్కారంగా ఆత్మహత్యను ఎంచుకోవడం జరుగుతుంది. కోడెలకు సరిగ్గా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆయ నకు అవమానాలు, కేసులు కొత్తేమీ కాదు. కానీ నమ్ముకున్న చంద్రబాబు ద్రోహంతోనే ఆయన గుండె పగిలింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఒక సారి నాదెండ్ల భాస్కర్రావు, మరోసారి పిల్లనిచ్చిన సొంత అల్లుడు చంద్రబాబు నాయుడు చేతుల్లో వంచనకు గురి అయ్యారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ టెక్సాస్లో గుండెకు బైపాస్ శస్త్రచికిత్స చేయించుకొని తిరిగి వచ్చేసరికి నాదెండ్ల భాస్కర్రావు గద్దె మీద కూర్చొని నేనే సీఎం అన్నాడు. అప్పుడు ఎంతో గుండె నిబ్బరాన్ని, రాజకీయ పరిణతిని చూపించిన ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఫలితంగా సెప్టెంబర్ 16న భాస్కర్రావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. తిరిగి రామారావు ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1995 ఆగస్టులో చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినప్పుడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి నిలబడిన ఎన్టీఆర్ తనవాడు అనుకున్న, సొంత అల్లుడు చేసిన ఘాతుకానికి తట్టుకోలేకపోయారు. నలుగురికి చెప్పుకోలేక లోలోపల మదనపడి గుండె పగిలి మరణించారు. తాజాగా కోడెల పరిస్థితి కూడా ఇదే. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి అతనేమీ అనుకూలతను ఆశించి ఉండరు. కానీ అనుకూల వర్గం నుంచి ఒక బలమైన రక్షణ కవచాన్ని కోరుకుంటారు. అసెంబ్లీ ఫర్నిచర్ ను సొంతానికి వాడుకున్నాడనే అవమాన భారమే కోడెల ఉసురు తీసిందని టీడీపీ నేతల ఆరోపణ. కానీ ఆయన గతంలో ఇంతకన్నా దారుణమైన అవమానాలను అనుభవించారు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్ వచ్చినప్పుడు బాధితుల కోసమని బియ్యం సేకరించి వాటిని అమ్ముకున్నా రనే ఆరోపణలు కోడెలపై వచ్చాయి. ఇటువంటి అమానవీయ ఆరో పణలు ధైర్యంగా ఎదుర్కొన్న కోడెలకు అసెంబ్లీ ఫర్నిచర్ ఆరోపణ ఒక లెక్కా. ఇరవై రోజుల క్రితం మాత్రలు మింగి తొలిసారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మొదటి ఆత్మహత్య ప్రయత్నం సంద ర్భంలోనే అధినేతగా చంద్రబాబు నేరుగా కోడెల ఇంటికి వెళ్లి ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి, మూడు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయనలో అభద్రతా భావాన్ని పెంచారు. సంక్లిష్ట సమయంలో అండగా నిలవాల్సిన చంద్రబాబు చేసిన నమ్మకద్రోహమే కోడెల మనసు విరిచి ‘అసహజ’ నిర్ణయానికి దారితీసింది. కోడెల మరణాన్ని, అంతిమ యాత్రను కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ యాత్రగా మలిచారు. కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు భోరున విలపిస్తుండగా, కొందరు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు జిందాబాద్ అని నినాదాలు చేస్తుంటే చంద్రబాబు విక్టరీ సింబల్ చూపిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రలో నడవటం అత్యంత జుగుప్సాకరంగా అనిపించింది. దేశంలో అంతరిస్తున్న రాజకీయ విలువలకు కోడెల ఆసహజ మరణం ఒక కేస్ స్టడీ కావాలి. అధికార పీఠంపై యావ తప్ప ఒక లక్ష్యం, సిద్ధాంతం లేని వ్యక్తి నాయకత్వం ఎంత ప్రమాదకరమో భావితరం తెలుసుకోవాలి. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ శాసనసభ అంచనాలు, పద్దులు కమిటీ చైర్మన్ ‘ 94403 80141 -
సోలిపేట రామలింగారెడ్డికి రెండోసారి
సాక్షి, దుబ్బాక: రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియమితులయ్యారు. ఆదివారం శాసనసభ సమావేశాలు ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డిని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్గా నియమిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. రెండోసారి చైర్మన్ గా.. రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రెండోసారి నియమితులయ్యారు. 2014లో తెలంగాణ అసెంబ్లీ మొట్టమొదటి అంచనాల కమిటీ చైర్మన్ గా ఎన్నికైన రామలింగారెడ్డి అసెంబ్లీ రద్దయ్యేంతవరకు ఆ పదవిలో కొనసాగారు. మళ్లీ రెండో సారి రామలింగారెడ్డిని అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్గా సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా.. నమ్మిన బంటుగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఉన్నారు. ఆయనపై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ తాను విద్యాబుద్ధులు నేర్చుకొని ఇంతటి స్థాయికి చేరుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన దుబ్బాక టికెట్ను (అప్పటి దొమ్మాట) రామలింగారెడ్డికి టీఆర్ఎస్ నుంచి 2004 కేటాయించడంతో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008 బై ఎలక్షన్లో సైతం విజయం సాధించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా .. సోలిపేట రామలింగారెడ్డి మొత్తం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో, 2008 బై ఎలక్షన్ లో దొమ్మట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2018 డిసెంబర్లో నాలుగోసారి 65 వేల పై చిలుకు మెజార్టీతో రాష్ట్రంలోనే మెజార్టీలో 6వ స్థానంలో నిలిచారు. నక్సలైట్..జర్నలిస్టు నుంచి అంచనాల కమిటీ వరకు... సోలిపేట రామలింగారెడ్డి ప్రస్థానం మొదట నక్సలైట్ ఉద్యమం నుంచి ప్రారంభమైంది. తాను దుబ్బాక జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే వామపక్ష ఉద్యమాల ప్రభావం రామలింగారెడ్డిపై తీవ్రంగా పడింది. రామలింగారెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి చిట్టాపూర్లో పోలీస్పటేల్ ఏ లోటు లేని కుటుంబం. అయినప్పటికినీ అప్పటి రోజుల్లో గ్రామాల్లో పేదలపై భూస్వాముల అరాచకాలు ఆయనపై తీవ్రప్రభావం చూపింది. ఇంటర్ చదువుతున్న రోజుల్లో మొదట్లో పీడీఎస్యూ విద్యార్థి సంఘం జనశక్తి అనుంబంధంతో మొదలుకాగా కొద్దిరోజుల్లోనే పీపుల్స్వార్ అనుబంధ సంస్థ రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్యూ)లో చేరారు. ఆ క్రమంలోనే పీపుల్స్వార్ రాష్ట్ర నాయకులు శాఖమూరి అప్పారావుతో పరిచయం రామలింగారెడ్డిని పూర్తిస్థాయిలో ఉద్యమం వైపు నడిపించింది.ఆర్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో పోరాటాల్లో క్రియాశీల పాత్ర పోషించాడు. ఆయనపై కక్ష గట్టిన పోలీసులు దేశంలోనే మొట్టమొదటి టాడాకేసు జర్నలిస్టుగా ఉన్న రామలింగారెడ్డిపై పెట్టారు. అప్పట్లో దేశవ్యాప్తంగా మేధావులు, జర్నలిస్టులు పెద్దెత్తున ఉద్యమించడంతో టాడాకేసును రద్దుచేశారు. జర్నలిస్టుగా, రచయితగా ఆర్ఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ పేరుతో రచనలు, కవితలు రాశారు. 2001 టీఆర్ఎస్ ఆవిర్భావంలో క్రీయాశీల పాత్ర పోషించారు. ఉద్యమంలో వందకు పైగా కేసులు.. తెలంగాణ ఉద్యమంలో అత్యధిక కేసులు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పైనే నమోదయ్యాయి. వందకు పైగా కేసులతో చాలా రోజులు జైలులో, కోర్టుల చుట్టూ తిరగారు. రాష్ట్రంలోనే ఉద్యమంలో ప్రతి సంఘటనలోను రామలింగారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామలింగారెడ్డి బయోడేటా పేరు: సోలిపేట రామలింగారెడ్డి పుట్టినతేది: 02 అక్టోబర్ 1962 పుట్టిన స్థలం: చిట్టాపూర్, దుబ్బాక మండలం. తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి. విద్యార్హతలు: డిగ్రీ భార్య: సుజాత పిల్లలు: కుమారుడు సతీష్రెడ్డి, కూతురు ఉదయశ్రీ. రాజకీయ ప్రస్థానం: చదువుకొనే రోజుల్లో పీపుల్స్వార్ గ్రూపుతో సంబంధాలు, జర్నలిస్టుగా 2 దశాబ్ధాలకు పైగా పనిచేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
పీఏసీ చైర్మన్గా అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవి ఎంఐఎం పార్టీని వరించింది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. అలాగే అంచనాల కమిటీ చైర్మన్గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియమితులయ్యారు. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. కాగా పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయం. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో ఏడుగురు సభ్యులు ఉన్న మజ్లిస్ పార్టీ... తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. -
ఎంపీ అరవిందును కలిస్తే తప్పేంటి..?
సాక్షి, హైదరాబాద్: ‘నేను పార్టీ మారితే బాగుండని మా పార్టీ నేతలే కొందరు ఆనందపడ్డారు. నేను వేరే పార్టీలోకి వెళ్లాలని వారు కోరుకుంటున్నారు. సెపె్టంబర్ 17న ఓ మైనార్టీ ఎమ్మెల్యేగా బీజేపీలో చేరతానని ఎలా అనుకుంటారు’అని టీఆర్ఎస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ వ్యాఖ్యా నించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివా రం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో పిచ్చాపాటీ గా మాట్లాడారు. ‘మా ఇంటి పక్కనే ఉండే నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరి్వంద్ను కలిస్తే తప్పేంటి. నేను పార్టీ మారాలనుకుంటే చెప్పే వెళ్తా. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. గోడమీద పిల్లిలా ఉండను’ అని షకీల్ కామెంట్ చేశారు. నేను గతం లో బీజేపీ నిజామాబాద్ జిల్లా మైనార్టీ మోర్చాలో పనిచేశా. నా మీద కేసులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. గతంలో నా మీద ఉన్న రెండు కేసుల్లో నిర్దోíÙగా నిరూపించుకున్నా. నా మీద ఒక్క కేసు ఉన్నట్లు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తా’అని షకీల్ ప్రకటించారు. విప్ పదవితో గాంధీ సంతోషంగా లేరు ‘పదవులు రావాలని కోరుకోవడం.. రాకుంటే బాధ ఉండటం సహజం. అందరికీ పదవులు కావాలంటే సాధ్యం కాదు. మనలో ఎవరికి పదవులు వచి్చనా ఒకరికొకరు సహకరిం చుకోవాలి’అని మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్రావు అన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తనకు విప్ పదవి రావడం పట్ల హ్యాపీగా లేరు. మంత్రి కావాలని అనుకున్నారు. ఈ విషయం తెలిసి తుమ్మల నాగేశ్వర్రావు తన ఇంటికి పిలిచి మంద లించారు. కమ్మ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవితోపాటు విప్ పదవి కూడా ఇచ్చారు. ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వంతో చర్చించాలి తప్ప రచ్చ చేసుకోవద్దని చెప్పారు. ఎవరికి పదవి వచి్చనా జిల్లాలో అందరినీ కలుపుకుపోవాలని చెప్పామని భాస్కర్రావు వ్యాఖ్యానించారు. – ఎమ్మెల్యే భాస్కర్రావు నారదాసు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు ‘టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు ఎవరు’ అనే అంశంపై ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లు.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లోనూ ప్రస్తావనకు వస్తున్నాయి. అసెంబ్లీ లాబీలో ఎదురైన మీడియా ప్రతినిధులు ‘తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు అనే ది అప్రస్తుతమని’ ఇటీవల ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు చేసిన కామెంట్లను ప్రస్తావించారు. రామలింగారెడ్డి స్పందిస్తూ.. నక్సలిజం భావజాలం నుంచి వచి్చన నారదాసు అలా మాట్లాడటం కరెక్ట్గా లేదనే విషయాన్ని ఆయనకు ఫోన్ చేసి చెప్పానన్నారు. తన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వక్రీకరిస్తున్నారని సమాచారం అం దడంతో అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తులకు లింగ వివక్ష ఉండదు. ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాటలను వక్రీకరించవద్దు’అని కోరారు. – ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి -
ముత్యంరెడ్డి మృతి పట్ల హరీష్రావు దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధకరమన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ సమాజం మంచి నాయకున్ని కోల్పోయిందని అన్నారు. గ్రామ సర్పంచ్గా, టీటీడీ బోర్డు సభ్యులుగా, ఎమ్మెల్యే, మంత్రిగా ఆయన జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు మరిచిపోలేనివని హరీష్ అన్నారు. చివరి దశ వరకు ప్రజా జీవితంలో పరితపించారని, నేటి నాయకులకు ముత్యంరెడ్డి స్ఫూర్తి అని అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో ముత్యంరెడ్డి భౌతిక ఖాయంను సందర్శించిన హరీష్.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత చెరుకు ముత్యంరెడ్డి మృతిపట్ల దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఆయన స్వగ్రామం తొగుట మండలం తుక్కాపూర్లో మంగళవారం మధ్యాహ్నం ముత్యంరెడ్డి గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
పులిని ప్రేమిస్తారు.. ఆదివాసులను తరిమేస్తారు..!
గిరిజనుల ఇంటిలో మనువు, పురుడు,పుణ్యం, కార్యం ఏదైనా తొలిబొట్టు పెట్టి పిలుచుకునేది బావనే. పులికి ఆదివాసులకి ఇదే బంధుత్వం. ఫారెస్టు అధికారులతో సహా నాగరికులు అంతా పులిని క్రూర మృగంగా చూస్తే.. ఆదివాసులు మాత్రం పులిని ‘బావా’ అని సంబోధిస్తారు. గిరిజనులు బావకు ఇచ్చే మర్యాద పులికి ఇస్తారన్న మాట. ఆదివాసుల దైనందిన చేతల్లోనూ ఇదే కనిపిస్తుంది. తమ నివాసాల పరిధిలో సంచరించే పులి గుణం తెలుసుకొని మసులుకుంటారు. ఆడపులి, ముసలి బావ పులుల ఆవాసాల్లోకి దాదాపుగా ఆదివాసులు వేటకు వెళ్లరు. అవి తిని రేపటి కోసం దాచుకున్న జంతు మాంసపు భాగాలను తీసుకోరు. అది పులులకు ఆదివాసులకు మధ్య ఉన్న అనుబంధం. గిరిజనుల జీవన చర్యలు జంతుజాల జీవనచక్రంలో జోక్యం చేసుకోవు. ప్రకృతే వాళ్ల మధ్య ఆ విధమైన సర్దుబాటు చేసింది. ఇవేమీ పట్టకుండా అటవీ అధికారులు ఆగి, అదను చూసి ఆదివాసుల మీద పడుతున్నారు. అడవుల నుంచి వారిని తరిమేస్తున్నారు. ఆటవిక తెగలు, ఆధునిక ప్రపంచం రెండు వేర్వేరు సహజాతాలు. అడవిలో పుట్టి పెరిగారు. జంగల్ వాళ్లది. జల్, జమీన్ వాళ్లది. అటవీ సరిహద్దులు అనేవి రాష్ట్రాలకు, పాలకులకే గానీ, ఈ విభజన రేఖలు ఆదివాసులకు ఏమి తెలుసు. గ్లోబలైజేషన్ మీదపడి అడవిని విధ్వంసం చేస్తుంటే...మనుగడ కోసం గిరిజనం తావు దొరికిన చోటికి వెళ్లిపోతోంది. అది వారికి ప్రకృతే చూపించిన మార్గం. వెంటపడి తరుముతున్న ప్రపంచీకరణ విధ్వంసాన్ని నిలవరించి ఆదివాసులకు, ఆధునిక ప్రపంచానికి మధ్య ఉన్న అంతరాన్ని అధ్యయనం చేసి అపురూప మానవ జాతులను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా మూలవాసు లను నిలవరించాలనుకోవటం దుర్మార్గం. పర్యావరణ సమతూకానికి, అటవీ ఆవరణ వ్యవస్థ మనుగడకు పులుల సంరక్షణ అవసరమే. పులి పెరిగిన చోట తప్పనిసరిగా జంతు జీవజాల సమతుల్యత ఉంటుంది. పులులు సహజంగా పుట్టి పెరిగే చోట అభయారణ్యాలను అభివృద్ధి చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఫారెస్టు అధికారులు పదేపదే గిరిజన గూడేల మీద దాడులకు తెగబడు తున్న కవ్వాల్ పులుల అభయారణ్యం వాస్తవంగా పులుల శాశ్వత ఆవాసానికి అస్సలు అనుకూలం కాదు అనే వాదనలు చాలాకాలంగా వినవస్తున్నప్ప టికీ.. గడిచిన ఐదేళ్ల నుంచి అటవీ శాఖ ఈ అభయా రణ్యం నిర్వహణకు రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఇదిగో పులి, అదిగో పులి అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో శాశ్వత ఆవాసం కలిగిన ఒక్క పులిని కూడా అటవీ అధికా రులు చూపెట్టలేకపోయారు. ఎండాకాలంలో మహా రాష్ట్రలోని తాడోభా అడవుల నుంచి వలస వచ్చి పోయే పులులను సీసీ కెమెరాల్లో బంధించి ఇదే మన పులి అని చెప్పుకుంటున్నారు. ఈ వైఫల్యం నుంచి తప్పించుకోవటానికే అటవీ అధికారులు అన్యా యంగా ఆదివాసుల మీద పడుతున్నారు. అభయార ణ్యంలో మనుషులు సంచారం చేస్తున్నందువల్లే పులులు రావటం లేదనే శాస్త్రీయత ఏమాత్రం లేని వాదనను ముందుపెడుతున్నారు. నాగరిక మను షుల సంచారం, అటవిలో ఆదివాసుల జీవనం... రెండింటినీ ఒకే గాటున ముడిపెట్టి చూపిస్తున్నారు. ఆదివాసీ సంస్కృతి, జీవన విధానం విభిన్న మైనది. ఆటవిక సమాజంలో బావతోనే బంధుత్వం ఎక్కువ. గిరిజనుల ఇంటిలో మనువు, పురుడు, పుణ్యం, కార్యం ఏదైనా తొలిబొట్టు పెట్టి పిలుచుకు నేది బావనే. పులికి ఆదివాసులది ఇదే బంధుత్వం. నాగరికులు అంతా (ఫారెస్టు అధికారులతో కలిపి) పులిని క్రూర మృగంగా చూస్తే.. ఆదివాసులు మాత్రం పులిని ‘బావా’ అని సంబోధిస్తారు. గిరిజ నులు బావకు ఇచ్చే మర్యాద పులికి ఇస్తారన్న మాట. ఆదివాసుల దైనందిన చేతల్లోనూ ఇదే కనిపిస్తుంది. తమ నివాసాల పరిధిలో సంచరించే పులి గుణం తెలుసుకొని మసులుకుంటారు. గాండ్రించే పులిని ‘కోపగొండి’ అని, మందకొడి చలనం ఉన్న పులిని ‘పెంటిది’, వయసు మళ్లిన పులిని ‘ముసలి బావ’ ఇలా సంబోధిస్తారు. పెంటిది, ముసలి బావ పులుల ఆవాసాల్లోకి దాదాపుగా ఆదివాసులు వేటకు వెళ్లరు. అవి తిని రేపటి కోసం దాచుకున్న జంతు మాంసపు భాగాలను తీసుకోరు. అది పులులకు ఆదివాసులకు మధ్య ఉన్న అవినాభావ అనుబంధం. వేసవి కాలం మినహా మిగిలిన రెండు కాలాల్లో (వర్షాకాలం, చలికాలం) ఐదు గంటలకే అడవిలో సూర్యాస్తమయం అవుతుంది. అదే సమయంలో వన్య జీవరాశులు తావుల్లోంచి బయటికి వస్తాయి. చీకటి పడటానికంటే ముందే గిరిజనులు గుడిసెకు చేరుకుంటారు. ఏడు గంటల వరకు వంటావార్పు, భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని నిద్రలోకి జారు కుంటారు. రాత్రంతా వన్యప్రాణులు ఆడవిలో స్వేచ్ఛా ఆహార ఆన్వేషణ చేస్తాయి. మళ్లీ సూర్యో దయం వేళకు గుహలు, పొదల్లోకి వెళ్లిపోతాయి. తిరిగి ఆదివాసుల దిన చర్య మొదలవుతుంది. అటవీ ఆవరణ వ్యవస్థలో గిరిజనుల జీవన చర్యలు ఎక్కడ కూడా జంతుజాల జీవనచక్రంలో జోక్యం చేసుకోవు. ప్రకృతే వాళ్ల మధ్య ఆ విధమైన సర్దుబాటు చేసింది. ఇవేమీ పట్టకుండా అటవీ అధికారులు ఆగి, అదను చూసి ఆదివాసుల మీద పడుతున్నారు. ఆదివాసుల సాంస్కృతిక మూలాల విధ్వంసంతో మొదలైన ఈ దాడి వాళ్ల జీవనాన్ని, జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. వాళ్ల కాలి కింది నేల, జీవితాన్నిచ్చిన ప్రకృతి ఇప్పుడు పరాయిది అయిపోయింది. ఆదివాసులు అంటేనే నిత్య అనుమానితులుగా, పూర్తి అభద్రత జాతిగా మార్చేశారు. గత ఏడాది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం జలగలంచ గూడెం మీద పోలీసులు, ఫారెస్టు అధికారులు విరుచుకుపడ్డారు. మహిళల చీరలు లాగి, పసిపిల్లలను చెట్లకు కట్టే శారు. పురుషులను వన్యప్రాణి కంటే ఘోరంగా వేటాడినట్టు వెంటపడి కొట్టారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫారెస్టు శాఖ తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది తిరగక ముందే తాజాగా కొమ్రం భీం జిల్లా కాగజ్నగర్ మండలం కోలాంగొంది గూడెంపై పాశవిక దాడులకు తెగ బడ్డారు. మనం మనుషులుగా పుట్టినందుకు సాటి మనుషుల పట్ల కనీసం చూపాల్సిన కనికరం లేకుండా వారిని బంధించి వేంపల్లి కలప డిపోలో కుక్కిన తీరు జుగుప్సాకరం. ‘2005 డిసెంబర్ 13 తరువాత తిరస్కరణకు గురైన దరఖాస్తుదా రులందరినీ అడవి నుంచి వెళ్లగొట్టాలని సుప్రీంకోర్టు తీర్పుకు’ లోబడే తాము ఆదివాసులను బయటికి పంపిస్తున్నామని సమర్ధించుకోవటానికి చూడటం నీతిమాలిన చర్య. సుప్రీంకోర్టు తీర్పు మీద పునఃస మీక్ష జరగాలనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం రక్షిత అడ వులైనా, రిజర్వు అడవులైనా అందులో నివసించే గిరిజనులకు హక్కులు కల్పించాలి. పోడు భూము లకు పట్టాలు ఇవ్వాల్సిందేనని గిరిజనులు పోరాటం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రికి గాని, స్థానిక కలెక్టర్కు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధికారికి కానీ ఏ మాత్రం సమాచారం లేకుండా ఫారెస్టు అధికారులు ఏకపక్ష నిర్ణయంతో, గిరిజన గూడాల మీద పడి దాడులు చేయటం చట్టాలను ఉల్లంఘించటమే. దీనికి అటవీ శాఖ ప్రధాన సంరక్ష ణాధికారి తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంది. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే సెల్ : 94403 80141 -
భూమిపై రైతుకే పక్కా హక్కు
ఏప్రిల్ మాసం చివరి వారంలో అనుకుంటా... సిద్దిపేట కలెక్టర్తో పనుండి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన. ఆయన ఏదో పనుండి బయటికి పోయిండట.10 నిమిషాల్లో వస్తారు... చాంబర్లో కూర్చోమన్నారు. నేను బయటికి వచ్చి సాధారణ విజి టర్స్ లాంజ్లో కూర్చున్నా... 60 ఏళ్లకు పైబడిన ఓ పెద్దాయన, రెండు చేతులతో దండం పెడుతూ... ‘రామలింగన్నా’ అంటూ బోరున ఏడుస్తూ దగ్గరకు వచ్చాడు. చేతిలో సంచి ఉంది..అందులో పట్టాదారు పాసుపుస్తకం, భూమి హక్కు పత్రాలు ఉన్నాయి. దగ్గరకు తీసుకొని నిమ్మళపరచి అడిగితే హసన్ మీరాపూర్ గ్రామం అని చెప్పాడు. ఆయన పేరు మీద 6 ఎకరాల భూమి ఉండగా వీఆర్వో రెండు ఎకరాలు వేరేవాళ్ల మీదకు మార్చిండట. 3 నెలల నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని చెప్పాడు. ఎలా గోలా తన్లాడి సరి చేయించాను కానీ... గ్రామాల్లోని రెవెన్యూ రికార్డుల్లో వందల కొద్ది తప్పులు ఉన్నాయి. మొఘలుల కాలం నుంచి ఇప్పటి వరకు పాలకులెవ్వరూ రైతుకు భూమిపై హక్కులు కల్పించలేదు. యజమానులకు టైటిల్ గ్యారంటీ ఇవ్వలేదు. 1985కు ముందు పటేల్, పట్వారీ వ్యవస్థ అమల్లో ఉండేది. మా నాన్న రామకృష్ణారెడ్డి దుబ్బాక మండలం చిట్టాపూరుకు పోలీస్ పటేల్గా ఉన్నారు. అయితే అగ్రకుల ఆధారి తంగా నియమించబడే పటేల్, పట్వారీల వ్యవస్థకు వ్యక్తిగతంగా నేను వ్యతిరేకమే. కానీ ఆ కాలం లోనే గ్రామీణ–రెవెన్యూ కొంత మేలు. ఎన్టీఆర్ ప్రభుత్వం పట్వారీ వ్యవస్థను హడావుడిగా రద్దు చేసింది కానీ భూ రికార్డుల నిర్వహణ కోసం ఒక పకడ్బందీ వ్యవస్థను రూపొందించలేకపోయింది. ఇక్కడే రెవెన్యూ శాఖ పునాది దెబ్బతిన్నది. పట్వారీ వ్యవస్థలో రెవెన్యూ రికార్డుల నిర్వాహణ కోసం ప్రతి గ్రామానికి ఒక మాలిపటేల్ ఉండేవాడు. అతనికి గ్రామం మీద పూర్తి అవగాహన ఉండేది. రెవెన్యూ రికార్డుల్లో అతి ముఖ్యమైన పహాణీ ఆయన చేతిలోనే ఉండేది. భూమి హక్కు ఉండి, మోకా మీద ఉన్న రైతుల పేర్లే పహా ణీలో నమోదు చేసేవాళ్లు. రికార్డుల్లో 95 శాతం కచ్చితత్వం ఉండేది. పట్వారీ వ్యవస్థ రద్దు తర్వాత పట్వారీల స్థానంలో రెండు మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటుచేసి ప్రతి క్లస్టర్ గ్రామానికి ఒక గ్రామ రెవెన్యూ అధికారిని నియమించారు. ఆయనకు స్థానిక గ్రామాల మీద పట్టు ఉండేది కాదు. రైతుల పేర్లు, వారి పేరు మీద ఉన్న భూ విస్తీర్ణం నమోదులో తప్పులు దొర్లేవి. అవే తరువాత ఏడాదికి ఒప్పులుగా చెలామణి అయ్యేవి. మోక మీది హద్దు రాళ్ల ఇబ్బం దులు, సర్వేయర్ల కొరత ఇవన్ని వెరసి రెవెన్యూ రికార్డుల నిర్వాహణ అనేది గందరగోళమైపోయాయి. రెవెన్యూ రికార్డు సరిగా లేనందున పట్టా కాలంలో ఒకరి పేరుంటే లబ్ది కాలంలో మరొకరి పేరు వస్తోంది. కాలగమనంలో భూముల విలువ విపరీతంగా పెరగటం, సర్వేరాళ్ల ఆనవాళ్లు లేకుండా పోవటం, రెవెన్యూ నియమ నిబంధనలు లోపభూయిష్టంగా ఉండటంతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాత రికార్డులను తిరగరాసి కొత్త రికార్డులే సృష్టిం చారు. నా నియోజవర్గం దుబ్బాకలో పట్టాలు ఉండి, భూములు లేని రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. మోకా చూపించమని వాళ్లు జీవిత కాలం అంతా రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరుగుతూనే ఉన్నారు. వీళ్లందరి సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరకాలి? ఇప్పుడున్న చట్టాలన్నీ పాతవి. అప్పటి కాల పరిస్థితులకు అనుగుణంగా ఆ చట్టాలనుచేశారు. ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వీటన్నిటి మేళవింపుతో రైతు మేలే లక్ష్యంగా కొత్త చట్టాలు రావాలి. అప్పుడు మాత్రమే రైతులకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడదే పనిలో ఉంది. రైతులకు టైటిల్ గ్యారంటీ ఇచ్చి, ఆ భూముల్లోకి కృష్ణా గోదావరి జలాలను పారిస్తే వ్యవసాయ సంక్షోభ నిర్మూలనకు ఓ తొవ్వ దొరికినట్లే అని కేసీఆర్ మొదటి నుంచి ఆలోచన చేస్తున్నారు. వెంటనే అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్య పరిష్కారంలో భాగంగా మొదటి దశలోనే సాదాబైనామాలను క్రమబద్ధీకరణ అమల్లోకి తెచ్చారు. ఆనవాళ్లు లేకుండా పోయిన సర్వే రాళ్లను తిరిగి పునరుద్ధరించేందకు భూ సర్వే ప్రతిపాదనలు తెచ్చారు. ఆ తరువాత భూ రికార్డుల ప్రక్షాళన చేశారు. 24 గంటల నిరంతర విద్యుత్తు ఇచ్చారు. మరోవైపు ఏటా రూ 25 లక్షల కోట్ల ఖర్చుతో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో పంట పొలాల్లోకి నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వటం కోసం రైతుకు నగదు అందించే రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. రైతు బీమాతో ఒక భరోసా నింపారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు టైటిల్ గ్యారంటీ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు కంక్లూసివ్ టైటిల్ ఇప్పించాలనే ఆలోచనల ద్వారా పాతతరం పాలనా వ్యవస్థల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టడాన్ని దుబ్బాక శాసనసభ్యునిగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే ‘ 94403 80141 -
నల్లదండు నాయకుడు
రాజకీయం అంటే వైరుధ్య భావాలుంటాయి. విభిన్న సిద్ధాంతాలు ఉంటాయి. ఇవేమి గిట్టని నేతగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం తీరు నాకెప్పుడు ఆసక్తికరంగానే కనిపిస్తుంది. నక్సలైటుగా నాపై టాడా కేసులు మోపి జైల్లో పెట్టిన నాటి నుంచి, ఏపీ సీఎం హోదాలో ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయేవరకు బాబు నడక, నడత ప్రతీదీ ఆశ్చర్యమే. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా క్షేత్రం లోకి రావాల్సిందే. యుద్ధం చేయాల్సిందే. కానీ మారీ చుని తీరుగా చంద్రబాబు జుగప్సాకరమై రాజకీయ రాక్షస క్రీడ ఉత్సుకత గొల్పుతూనే ఉంటుంది. బాబు ఏలుబడిలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు చచ్చుబడిపోయి పోలీసుస్వామిక వ్యవస్థ వేయి మదపుటేనుగుల బలాన్ని పుంజుకుంది. ఆయన పాలనలో హక్కులకోసం గొంతెత్తకూడదు. ఆత్మగౌరవం కోసం రోడెక్కకూ డదు. అరాచకాలను నిలదీయకూడదు. రాజ్యాంగాన్ని ప్రశ్నించొద్దు. నిలబడితే లాఠీలు లేస్తాయి. నినదిస్తే ఆడబిడ్డలపైనా గుర్రాలు పరుగెత్తుతాయి. నిలదీస్తే నయీంలు, నల్లదండు ముఠాలు పుట్టుకొస్తాయి. చట్టాలను ఏమార్చటం, పోలీసు అధికారులను వశంచేసుకొని వాళ్లకింత చలిగంజి పోసి గుంజకు కట్టేయటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. అప్పట్లో మావోయిస్టు గెరిల్లాలతో నేరుగా తలపడలేక నల్లదండు, బ్లాక్ కోబ్రా పేరుతో నరహంతక ముఠాలను సృష్టించి, బాబే ఆ ముఠా నాయకుడు అయ్యాడు. నయీం, శేషన్న లాంటి కిరాతకులను చేరదీసి అరాచకాలకు ఒడిగట్టాడు. 1999–2003 వరకు హైదరా బాద్ నగరం చుట్టుపక్కల నయీం నేరాలు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అతడికి సీఏం కార్యాలయంతోనే సంబంధాలు ఉండేవి. పోలీసులు ఉన్నతాధికారులు, చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు అండ ఉండేది. చంద్రబాబు నాయుడు నయీంను భూ దందాలకు వాడుకున్నారు. హైటెక్ సిటీ చుట్టు పక్కల విలు వైన భూములను బాబు సారథ్యంలోనే నయీం కబ్జా పెట్టాడు. ఓ పోలీసు అధికారి పర్యవేక్షణలో ఈ వ్యవహారం సాగేది. మాదాపూర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో అమాయక ప్రజలను బెదిరించి నుంచి వేల ఎకరాల భూములను లాక్కున్నారు. ఈ భూ కబ్జాలతోనే రూ. వందల కోట్లు సంపాదించి, వాటిని బినామీ సంస్థల్లో పెట్టు బడులుగా పెట్టి అధికారం బలంతో ఇవాళ రూ. లక్షల కోట్లకు అధిపతి అయ్యారు. చంద్రబాబు అవినీతికి పరాకాష్టగా ఇక్కడో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు తల్లి అమ్మణ్ణమ్మ. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పాలు అమ్ముకొని జీవనం చేస్తారని చంద్రబాబు నాయుడే చాలాసార్లు చెప్పుకున్నారు. పాలు అమ్ముకునే పెద్దావిడ 2000 సంవత్సరంలో రూ. 40 లక్షలు పెట్టి హైదరాబాద్లోని మదీనాగూడలో 5 ఎకరాల భూమిని, బంజారాహిల్స్ రూ. 35 లక్షలతో మరో భవనాన్ని కొనుగోలు చేశారు. సరే ఆమె రెక్కల కష్టంతోనే కొన్నారు అనుకుందాం. మన సాంప్రదాయంలో వారసత్వ భూములు ఎవరికి చెందుతాయి? ఎంతమంది సంతానం ఉంటే అంతమందికి చెందు తాయి కదా? కానీ ఆస్తులు కొనుగోలు చేసిన మరుసటి ఏడాదికే అమ్మణ్ణమ్మ తన చిన్నకొడుకు పిల్లలను వదిలేసి, బాబు కొడుకు లోకేశ్కు బహుమతిగా ఇచ్చింది. అదే మదీనా గూడలో బాబు భార్య భువ నేశ్వరికి కూడా 5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఎలా కొన్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. నయీం మధ్యవర్తిత్వం చేసి ఆ భూములను బాబు కుటుంబానికి ఇచ్చాడని అప్పట్లో బహిరంగంగానే ప్రజల్లో చర్చ జరిగింది. ఇట్లా వేల ఎకరాలు నల్లదండు ముఠా చేతుల్లోకి వెళ్లిపోయాయి. రూ. లక్షల కోట్లు అడ్డంగా సంపాదించిన చంద్రబాబు నల్లడబ్బుతో ఓటుకు కోట్లుతో తెలంగాణ లోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణను అస్థిర పరచాలనే కుయుక్తి పన్నారు. ఆ కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయారు. విజయవాడ కమిషనర్గా పనిచేస్తున్న తన సామా జిక వర్గానికే చెందిన పోలీసు అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకున్నారు. ఆయన రాష్ట్ర శాంతి భద్రతలను గాలికి వదిలేసి టీడీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్గా తయారయ్యారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముకు ప్రాణహాని పొంచి ఉన్నా.. ఆయనకు పట్టింపు ఉండదు, ప్రతిపక్ష నాయకుని మీద హత్యాయత్నం జరిగే వరకు వీళ్లకు తెలియదు. కానీ అదే ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణలో టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తోందో సర్వే చేస్తారు. ఆ రిపోర్టు చంద్రబాబుకు ఇచ్చి ఏ పార్టీతో రాజకీయ పొత్తు పెట్టుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుని మీద హత్యాయత్నం జరినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ, తెలుగుదేశం నేతలకే కళ్లు బైర్లు కమ్మేలా హత్యాయత్నం జరిగిన 30 నిమిషాల్లో ప్రెస్మీట్ పెట్టి అది ప్రచారం కోసం చేసిన పని అని ప్రకటించటం దుర్మార్గం కాదా? ఇటువంటి అధికారుల మీద నమ్మకం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించగలదా? తెలుగుదేశం జెండాలను ఒంటి నిండా కప్పుకొని విచ్చలవిడిగా తిరుగాడుతున్న అధికారులను ఈసీ పక్కనపెడితే అది ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రని ఆరోపణలు చేసే బాబు అనైతిక రాజకీయ క్రీడను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తోంది. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే మొబైల్ : 94403 80141 -
16 ఎంపీ సీట్లు గెలిచి సత్తా చాటుతాం
సాక్షి, దుబ్బాకటౌన్: తెలంగాణలో టీఆర్ఎస్కు ఎదురు లేదని, పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి తమ సత్తా చాటుతామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఏలా ఉన్నా తెలంగాణలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్లు గెలిచే పరిస్థితుల్లో లేవన్నారు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో ఎంఐఎం ఓక చోట మిగతా 16 పార్లమెంటు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జంకుతున్నారన్నారు. దేశం కోసం సైనికులు ప్రాణాలు అర్పిస్తే వారి త్యాగాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మోదీ ప్రభుత్వం జాతీయహోదా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో టీఆర్ఎస్ క్రీయాశీలకపాత్ర.. దేశంలో ఏ పార్టీకి అధికారంలోకి వచ్చే సరిపడ మోజార్టీ వచ్చే పరిస్థితులు కనబడడం లేదన్నారు. 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పుతాడన్నారు. టీఆర్ఎస్ కేంద్రంలో కీలక భూమిక పోషించబోతుందన్నారు. రాజేష్ కుటుంబానికి అండగా ఉంటాం.. దుబ్బాక పట్టణానికి చెందిన దివ్యాంగుడైన రాజేష్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే రామలింగారెడ్డి హామీనిచ్చారు. రాజేష్ కుటుంబానికే డబుల్ బెడ్రూం ఇండ్లలో మొదటి ఇల్లు ఇస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో దుబ్బాక టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఆస స్వామి, మహిళ విభాగం అధ్యక్షురాలు దాత్రిక నారాయణ భాగ్యలక్ష్మీ, నాయకులు రొట్టె రమేష్, అస్క రవి, లచ్చపేట నర్సింహులు పాల్గొన్నారు. -
వారి త్యాగం అపూర్వం.. మరి రాజకీయమో?
పుల్వామా దాడి ఉగ్రవాద ఉన్మాదం. ఇటువంటి రాక్షస చర్యలు భారతీయ సైన్యం, భరత ప్రజల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించే రోజులు పోయాయి. వాస్తవాధీన రేఖ దాటివెళ్లి ఉగ్ర శిబిరా లను మట్టుబెట్టిన వాయుసేనను చూసి దేశం గర్వి స్తోంది. త్రివిధ దళాలకు యావత్తు దేశం సెల్యూట్ చేస్తోంది. రక్షణ దళాల త్యాగాల మీద, అసమాన శౌర్య సాహసాల మీద ఎటువంటి మచ్చ లేదు. ఉన్న దల్లా ఓ విషాదం అలుముకున్న వేళ.. కాశ్మీర్ చుట్టూ అల్లుకున్న వివాదాస్పద రాజకీయాల గురించే చర్చ. కాశ్మీర్ అశాంతి ఇప్పటిది కాదు, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే అలుముకుంది. దానికిౖ వెపు పాకిస్తాన్ ఉగ్రవాదం, మరో వైపు స్వార్థపూరిత రాజ కీయ పార్టీల వైఖరి తోడయింది. కాశ్మీర్ చిన్న రాష్ట్రమే, భారత చిత్రపటంలో హిమాలయాల్లోకి విసి రేసినట్టున్న ఒక మంచు రాష్ట్రమే... కానీ దేశ రాజకీ యాలను వేగంగాప్రభావితం చేయగల రాష్ట్రం అది. దేశం ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. మళ్లీ కాశ్మీర్ అల్లకల్లోలమే ముందుకొచ్చింది. మోదీకి మరో రాజకీయ అవకాశం దొరికింది. హిందుత్వ ఎజెండాతో రాజ్యాధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల్లో మత హింసను పురిగొ ల్పింది. కషాయపు భావజాలాన్ని వ్యతిరేకించిన వారిపై గోవధ పేరుతో మూక దాడులకు పాల్పడ్డది. మేధావులు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతల మీద దేశ ద్రోహం కేసులు మోపి జైల్లో పెట్టింది. హిందూమతోద్ధారకుణ్ణి నేనే, సనాతన ధర్మ వ్యాప్తి అంతా తన భుజస్కంధాలపైనే ఉందన్నట్లు ఫోజు కొట్టే మోదీ, అమిత్ షాలు జమ్మూకశ్మీర్, పొరుగు దేశం పాక్లోని హిందువుల గురించి ఎందుకు పట్టిం చుకోలేదన్నది ఆశ్చర్యం కలిగించే ప్రశ్న. పాక్లో హిందూ మహిళల దుస్థితి దారుణంగా ఉంది. భారత్ నుంచి పాక్ విడివడిన నాటి నుంచి అక్కడ హిందూ మహిళలపై అకృత్యాలు జరుగు తూనే ఉన్నాయి. పాక్లో మైనారిటీలుగా ఉన్న హిందువుల రక్షణకు సరైన చట్టాలు లేవు. హిందూ మహిళలు అత్యాచారాలు, కిడ్నాపులు, బలవంతపు మతమార్పిడుల బారిన పడి, సెక్స్ బానిసలుగా బతుకీడుస్తున్నారు. అక్కడ హిందూ మహిళలెవరూ తమకు వివాహం జరిగిందని నిరూపించుకోలేని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఏ కారణంగా నైనా భర్త మరణిస్తే, అతని ఆస్తిపాస్తుల్లో వాటా కూడా అతని భార్యకు దక్కదు. కనీసం అక్కడి హిందువులకు పాక్ ప్రభుత్వం అందజేసే ’నేషనల్ డేటా బేస్ రెగ్యులేషన్ అథారిటీ’ గుర్తింపు కార్డులు పొందే వెసులుబాటు కూడా లేదు. పాక్–భారత్ దేశాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగాయి, జరు గుతున్నాయి. ఈ చర్చల్లో రాజకీయ ఎజెండా తప్ప, పాక్లోని హిందువుల రక్షణ మీద ఇప్పటి వరకు ఎందుకు చర్చలు జరుపలేదు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 డిసెంబర్ 25న తన రష్యా, ఆప్ఘనిస్థాన్ పర్యటన ముగించుకొని న్యూఢిల్లీకి వస్తూ.. మార్గమధ్యంలో ఉన్నట్టుండి లాహోర్లో ల్యాండైపోయారు. మోదీ ఆకస్మికంగా లాహోర్లో అడుగుపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్లో జిందాల్ గ్రూపు నకు చెందిన సజ్జన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఒత్తిడి మేరకే ఆయన పాకిస్తాన్ వెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏ దేశం వెళ్లినా అక్కడి ప్రవాస భారతీయులతో కలిపి ‘ఛాయ్ పే చర్చ’ పెట్టటం మోదీకి అలవాటు. హిందుత్వ ఎజెండాతోనే అధికారంలోకి వచ్చిన మోదీ∙పాక్ వెళ్లినప్పుడు అక్కడి హిందూవులను ఎందుకు కలవలేకపోయారు? అక్కడ వారికి జరుగు తున్న అన్యాయాలను ఎందుకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? ఆయన పాక్లో అడుగు పెట్టేటప్పటికే ఇరు దేశాలమధ్య ద్వైపాక్షిక చర్చలపై ప్రతిష్టంభనతోపాటు.. సరిహద్దుల్లో పాక్ రేంజర్లు య«థేచ్చగా కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని వుంది. మోదీ పాక్ వెళ్లి, నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను కలిసినప్పుడు కశ్మీర్ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. 2014 నుంచి 2019 వరకు కశ్మీర్ రక్షణలో దాదాపు 900 మంది సైనికులు అశువులు బాశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అధి కారిక లెక్కల ప్రకారం 527 మంది సైనికులు చని పోయారు. 1,363 మంది గాయపడ్డారు. ఒకరు యుద్ధ ఖైదీగా చిక్కారు. మళ్లీ యుద్ధం వస్తే ఎంత మంది వీరుల ప్రాణాలను తింటుందో తెలియదు. సైనికుడు అంటే యుద్ధంలో ప్రాణాలు అర్పించే మర మనుషులు కాదు. వాళ్లకు భార్య పిల్లలు ఉన్నారు. వాళ్లకు ఓ కుటుంబం ఉంది. ఏడాదికి ఓ మారైనా వారి కుటుంబం ఆత్మీయ కౌగిలి కోరుకుంటుంది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని అధి కార పీఠాన్నిచ్చే అక్షయ పాత్రగా చూడకుండా ఓ శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే మొబైల్: 94403 80141 -
జిల్లాకు మొండిచేయి
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ ముహూర్తం నిర్ణయించారు. కొత్తగా 9 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్వపు మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, సంగారెడ్డి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. సిద్దిపేట నుంచి హరీశ్రావు వరుసగా ఆరో పర్యాయం విజయం సాధించడంతో పాటు, ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. మరోవైపు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చిన శాసనసభ్యులు పద్మా దేవేందర్రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఏ ఒక్క శాసనసభ్యుడికి మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంపై చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : గజ్వేల్ నుంచి వరుసగా రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13న వరుసగా రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హోం శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన సుమారు రెండు నెలల తర్వాత తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు మంగళవారం ముహూర్తం నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో తొమ్మిది మంది శాసనసభ్యులకు మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది చోట్ల విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఉద్యమనేతగా, నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచిన హరీశ్రావుకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావించారు. పిన్న వయసులోనే వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డుతో పాటు, ఏకంగా లక్షా ఇరువై వేల మెజారిటీతో విజయం సాధించిన ఘనత హరీశ్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయనకు ప్రాధాన్యత ఉన్న శాఖ దక్కుతుందని భావించినా, తాజా విస్తరణలో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. మరో ఇద్దరు నేతలకు నిరాశ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ, అసెంబ్లీకి నాలుగో పర్యాయం ఎన్నికైన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించారు. మరో ఉద్యమ నేత, అసెంబ్లీకి మూడో పర్యాయం ఎన్నికైన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి కూడా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, హరీశ్తో సహా ఇతర ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో హరీశ్కు చోటు కల్పించిన విషయాన్ని ఆయన అనుచరులు ప్రస్తావిస్తున్నారు. 70వ దశకం తర్వాత ఇదే తొలిసారి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 1970వ దశకం నుంచి ఏర్పాటైన ప్రతీ మంత్రిమండలిలోనూ జిల్లాకు చెందిన శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 1970వ దశకంలో పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, అంజయ్య, కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రివర్గాల్లో జిల్లా నుంచి మదన్ మోహన్ ప్రాతినిధ్యం వహించారు. మర్రి చెన్నారెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంలోనూ మదన్మోహన్తో పాటు బాగారెడ్డికి మంత్రి పదవి దక్కింది. టి.అంజయ్య జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన సందర్భంలోనూ మదన్మోహన్కు మంత్రి పదవి దక్కింది. 1983, 85లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కరణం రామచంద్రరావు, 1989లో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్రెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రి వర్గాల్లో గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కొంతకాలం పి.రామచంద్రారెడ్డి కూడా కోట్ల మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించారు. 1994 నాటి ఎన్టీఆర్ కేబినెట్లో కరణం రామచంద్రరావు, ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గంలో కరణం, ముత్యంరెడ్డి, బాబూమోహన్ పనిచేశారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ అటు ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లోనూ కొంతకాలం మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 మధ్యకాలంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో గీతారెడ్డి, ఫరిదుద్దీన్, దామోదర రాజనర్సింహ, సునీత లక్ష్మారెడ్డి మంత్రులుగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఏ ఒక్కరికీ చోటు దక్కకపోవడం ఆరు దశాబ్దాల్లో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా?
రాజ్యానికి విశ్వాసాలు ఎప్పుడూ మూఢంగానే ఉండాలి. అవి బలమైన భావజాలంగా మారకూడదు. రాజ్యహింసను, మత విద్వేషాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజ్యం వాళ్లను రాజద్రోహుల కింద జమ కడుతుంది. ఈ క్రమంలోనే 90 శాతం ఆంగవైకల్యంతో, 15 రకాల వ్యాధులతో ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫరేరా, అంబేడ్కర్ మనవడు ఆనంద్ తేల్తుంబ్డేలు రాజద్రోహులయ్యారు. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో అమాయకులను ఏళ్లకు ఏళ్లుగా జైళ్లో బంధించే హింస కొనసాగుతుంటే, కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ రాజ్య హింసకు అంగీకార ముద్ర వేసే ధోరణి బలపడుతోంది. దేశంలో, రాష్ట్రలో ఎప్పుడు సాధారణ ఎన్నికలొచ్చినా.. ప్రజల్లో సానుభూతి పవ నాలు తగ్గినట్లు అనిపిం చినా.. పాలకులపై హత్యా యత్నం కుట్రలు బయట కొస్తుంటాయి. నిఘా వర్గాలు చెమటోర్చి కుట్రను పసిగట్టి ‘అత్యవసరం’గా బయట పెడుతూనే ఉంటాయి. ఇది రాజ్యం అల్లిన విషవలయం. ఆధిపత్య అస్తిత్వాల పాలనలో ఈ వృత్తం పునరావృతమవుతూనే ఉంటుంది. రాజ్యా ధికారం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ‘రాజ్యం’ లో వివిధ రూపాల్లో హింస రచన జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగమే ఇలాంటి కుట్రకోణాలు. వరవరరావుతోపాటు హక్కుల ఉద్యమకారులపై మోపిన రాజద్రోహం ఎన్నికల అంకగణితంలో ఓట్ల లెక్కను సాధించే ఓ అధ్యాయం మాత్రమే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను హత్య చేసేందుకు పాకిస్తాన్ సహాయంతో కుట్ర పన్నుతున్నారని గుండెలు బాదుకుంటూ మొత్తుకుని ఓట్లు, సీట్లు సంపాదించిన మోదీ.. వేగంగా పడిపోతున్న తన పొలిటికల్ గ్రాఫ్ను నిల బెట్టుకోవటానికి మరో హత్యాయత్నంను తెర మీదకు తెచ్చారు. ప్రధానిని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారని పుణే పోలీసులు ఆరోపించటం, హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర కేసులు పెట్టి, నెలనెల తరబడి వాళ్లను జైల్లో బంధించి ప్రజల్లో ఓ మిధ్యా సానుభూతి వలయాన్ని పరిచి రాజ్యాధికారం సుస్థిరపరుచుకునే ప్రయత్నమే. రాజ్యానికి విశ్వాసాలు ఎప్పుడూ మూఢంగానే ఉండాలి. అవి బలమైన భావజాలంగా మారకూ డదు. రాజ్యహింసను, మత విద్వేషాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజ్యం వాళ్లను రాజద్రోహుల కింద జమ కడుతుంది. అట్లానే కాళ్లు చేతులు చచ్చుబడి పోయి, 90 శాతం ఆంగవైకల్యంతో, 15 రకాల వ్యాధులతో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబ, దాదాపు వృద్ధాప్యం అంచుల్లో ఉన్న న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫరేరా, అంబేడ్కర్ మన వడు ఆనంద్ తేల్తుంబ్డేలు రాజద్రోహులు అయ్యారు. ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో అమా యకులను ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించే హింస కొనసాగుతుంటే, కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ. రాజ్యహింసకు అంగీకార ముద్రవేసే ధోరణి బలపడుతోంది. బ్యాంకులను లూటీ చేసి రూ కోట్లకు కోట్లు కొల్లగొట్టి దేశంలో కృత్రిమ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించే ఆర్థిక నేరగాళ్లు మాత్రం దేశ ద్రోహులు కాదు. దేశీయ బ్యాంకుల నుంచి రూ వేల కోట్ల దబ్బును దర్జాగా విదేశాలకు పట్టుకుని పోతుంటే ఏ చట్టం కూడా వాళ్లకు అడ్డు రాదు. బడుగు బలహీన, మధ్య తరగతి వర్గాలు తమ చెమట, రక్తమాంసా లను రూపాయిగా మలిచి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వైట్ కాలర్ దొంగలు ఎత్తుకుపోతుంటే రాజ్యం కళ్లు మూసుకుంటోంది. నీరవ్ మోదీ అనే వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 11,360 కోట్లు, నీలేష్ ఫరేఖ్ రూ. 2,500 కోట్లు దోచుకుని విదేశాలకు వెళ్లిపోయేంతవరకు రాజ్యా నికి తెలియదు. విజయ్ మాల్యా బ్యాంకులకు రూ. 9,500 కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయాక కానీ మనకు ఆ విషయం తెలియదు. రైతులు పంట రుణాలు తీసుకుని తిరిగి కట్టలేకపోతే రెవెన్యూ రిక వరి(ఆర్ఆర్ యాక్ట్) కింద ఆస్తులు జప్తు చేస్తారు. ఆçస్తులు జప్తు చేయటాన్ని అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు వేలమంది ఉన్నారు. కానీ వీళ్ల మెడలు వంచి పొరుగు దేశాల నుంచి పట్టుకొని వచ్చి తిన్నది కక్కేయటానికి మన రాజ్యాంగంలో చట్టాలు, ఐపీసీ సెక్షన్లు ఏమీ ఉండవు. దేశంలో కుట్ర కేసులు కొత్తేమీ కాదు. ప్రభుత్వా నికి వ్యతిరేకంగా సికింద్రాబాద్లో కుట్ర చేశారని 1974లో ‘సికింద్రాబాద్ కుట్ర కేసు’ పెట్టారు. 1971 నుంచి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా ఈ కుట్ర కేసు నమోదు చేశారు. 46 మందిపై కుట్ర, రాజద్రోహ నేరం అభియోగాలు మోపారు. నాటి నక్సలైట్ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వర వరరావు, చెరబండరాజు, ఎం.టి.ఖాన్లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్ కోర్టు సికింద్రాబాద్ కుట్ర కేసులో అంద రినీ నిర్దోషులుగా ప్రకటించింది. 1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ రాంనగర్ కుట్ర కేసు పెట్టారు. కొండ పల్లి సీతారామయ్య వంటి నక్సల్స్ నేతలు, వరవర రావు తదితర విప్లవ రచయితలను నిందితులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత 1995లో కేఎస్పై కేసు ఉపసంహరించుకున్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్లో వరవరరావు, సూరిశెట్టి సుధా కర్లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి మావోయిస్టు, విప్లవ రచయితలు కుట్ర పన్నారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఔరంగాబాద్లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005లో మే 30న నిజా మాబాదులో అరెస్ట్ చేశారు. ఆయుధాలు సేకరించారు, ప్రభుత్వంపై యుద్ధ ఏర్పాట్లు చేశారన్న పోలీసుల వాదనతో విభేదిస్తూ.. 2010 ఆగస్ట్ 2న నిజామాబాద్ అడిషనల్ సెషన్స్జడ్జి ఆ కేసును కొట్టేశారు. 2004లో చంద్రబాబు ప్రభు త్వం కృత్రిమ లేఖ లతో నా మీద కూడా టాడా కేసు పెట్టింది. అభియోగం తప్పు అని కోర్టులు అంతిమ తీర్పులు ఇచ్చాయి. నిజమే..! కానీ కృత్రిమ లేఖ లతో, ఊహా త్మక అభియోగాలతో అక్రమంగా చార్జిషీట్ మోపిన పాలకులు, పోలీసుల మీద చర్యలు ఏవి? రాజ్యాంగంలో అటువంటి చట్ట సవరణ ఎందుకు తీసుకురావటం లేదు? కనీసం ఆత్మవిమర్శ అయినా చేసుకోవాలి. పరిపాలన చివరి దశలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని హక్కుల ఉద్యమ కారులపై పెట్టిన రాజద్రోహం కేసు లను ఉపసంహరించుకోవాలి. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే సెల్ : 94403 80141 -
పంటసిరితో తెలంగాణ కళకళ
ఒకప్పుడు దేశమంతటా కరువు తాండవించినా.. తెలంగాణలో మాత్రం కరువు ఛాయలు రాలేదు. 250 ఏళ్లుగా ఇక్కడ తిండి గింజలకు ఇబ్బంది లేదు. కాకతీయులు తవ్వించిన చెరువులు ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాయి. 1630–32లో, 1702–04లో దక్కన్ ప్రాంతంలో కరు వొచ్చి, దాదాపు 2మిలియన్ల మంది చనిపోయారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. దెబ్బతిన్న అప్పటి ముస్లిం పాలకులు చెరువుల మీద దృష్టి పెట్టారు. కొత్త చెరువులు తవ్వించారు. పాత చెరువులు పున రుద్ధరించారు. నాటినుంచిæ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు కరువు ప్రభావం లేదు. హరిత విప్లవాని కంటే ముందే దేశ వాప్తంగా వరి దిగుబడి ప్రతి ఏడాది 1.3 శాతం చొప్పున పెరు గుతూ వస్తే. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో దిగుబడి శాతం 2.2 శాతం ఉంది. 1967 తరువాత దేశంలో హరిత విప్లవం ఊపందుకుంది. 1990 నాటికి భార తదేశంలో వరి వార్షిక దిగుబడి 3.6 శాతానికి పెరి గింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఈ దిగుబడి 1.9 శాతానికి పడిపోయింది. కారణం.. రైతును ఆధునిక సేద్యం వైపుకు మళ్లించాల్సిన గత పాలకులు తెలంగాణ ప్రాంత వ్యవసాయాన్ని విస్మరించారు. చేసిన ప్రయోగాలన్ని గుంటూరు, గోదావరి జిల్లాలను బేస్గా చేసుకొని పరిశోధనలు జరిగాయి. ఆంధ్ర ప్రాంత సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని తట్టుకోగల వరి వంగడాలను రూపొందించటంపైనే పరిశోధనలు జరిగాయి. ఎంటీయు, ఆర్జీఎల్ ఎన్ఎల్ఆర్ వంటి ఆంధ్ర ప్రాంత వాతావరణాన్ని తట్టుకొని నిలవగలిగే వంగ డాలను తెలంగాణ ప్రాంత రైతాంగం మీదికి రుద్దడంతో తెలంగాణ ప్రాంతంలో అనుకున్నంత దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేడు తెలంగాణ దశాబ్దాల కష్టాలను అన్నిటినీ అధిగమించింది. ఇప్పుడు గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ మాగాణుల్లో పారుతున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు శ్రమించి ‘తెలంగాణ సోనా’(ఆర్ఎన్ఆర్–15048), బతుకమ్మ వడ్లు వంటి కొత్త వంగడాలు ఆవిష్కరించారు. ఫలితంగా కరువులతో అల్లాడిన రైతులకు ఈ యాసం గిలో కరువు తీరా పంట పండింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 61 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. వరి దిగుబడి 2015–16 యాసంగితో పోలిస్తే 2015–16 యాసంగిలో మూడు రెట్లు పెరిగింది. 2015–16 యాసంగిలో 7.21 లక్షల టన్నులు రాగా, 2016–71లో ఏకంగా 26.41 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది. 2016–17లో 38.01 దిగుబడి లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఆ రికార్డును బద్దలు కొడుతూ 2018–19లో 61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది.. గత రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా 2013–14 ఖరీఫ్లో 56.56 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది, అప్పటితో పోలిస్తే ఇప్పటి దిగుబడి ఏకంగా 4.44 లక్షల టన్నులు అదనం. మొత్తంగా 25.65 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. ఇది తెలంగాణ వ్యవసాయ పురోగతికి తొలి సంకేతం. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే ‘ 94403 80141 -
దుబ్బాకలో రసవత్తర ‘పోరు’
దుబ్బాకటౌన్: దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రచార పర్వం ముగియడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటివరకు పోటాపోటీగా ప్రచారం చేపట్టిన పార్టీలు ప్రచార గడువు ముగియడంతో తెరవెనుక రాజకీయాలు నడిపిస్తున్నారు. పోలింగ్కు కేవలం ఒక్కరోజు మాత్రమే వ్యవధి ఉండటంతో ప్రధాన పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మరింత జోరుగా చొచ్చుకుని వెళ్తున్నారు. గ్రామాల్లో ఏమాత్రం సమయాన్ని వృథా చేయకుండా ప్రధాన పార్టీల నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తమకే ఓట్లు పడేలా విశ్వప్రయత్నాలు చేయడంలో తలమునకలయ్యారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే జోరుగా చర్చలు సాగుతున్నాయి. గ్రామాల్లో నలుగురు కలిసిన చోట.. ప్రధాన కూడళ్లు.. హోటళ్లు.. పొలం పనుల దగ్గర ఇలా ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ. ఎవరు గెలుస్తారు.. మీ ఊర్లో ఎట్లుంది.. ఏ పార్టీకి ఓట్లు వేస్తారన్న చర్చలే నడుస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి మొదటి విడతలోనే టికెట్ కేటాయించడంతో ఇప్పటికే గ్రామాలన్నీ చుట్టివచ్చారు. అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించారు. బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావుకు సైతం బీజేపీ అధిష్టానం మొదటి విడతలోనే టికెట్ కేటాయించడంతో ఆయన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేపట్టారు. మహాకూటమి పొత్తులో భాగంగా దుబ్బాకను టీజేఎస్కు కేటాయించడంతో ఆ పార్టీ తరఫున చిందం రాజ్కుమార్ బరిలో ఉండటం.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం చివరిరోజున కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దుల నాగేశ్వర్రెడ్డి టికెట్ తెచ్చుకుని ప్రచారం చేపట్టడం జరిగిపోయింది. అభివృద్ధితో దూసుకుపోయిన సోలిపేట దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ప్రచారంలో దూసుకపోయారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం ద్వారా రూ. 500 కోట్లతో ఇంటింటికీ స్వచ్ఛమైన గోదావరి జలాలు అందించడం, రూ.8 వేల కోట్లతో మల్లన్నసాగర్ రిజర్వాయర్, పంటకాలువల నిర్మాణం, మల్లన్నసాగర్తో నియోజకవర్గంలో లక్షా 35 వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు, రూ.160 కోట్లతో 160 చెరువల అభివృద్ధి, రాష్ట్రంలోనే 4 వేల డబుల్ బెడ్రూంల నిర్మాణాలతో అగ్రస్థానంలో ఉండటం, ఇప్పటికే 2 వేల ఇండ్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని, దుబ్బాకలో 100 పడకల ఆసుపత్రి, రూ. 10 కోట్లతో సీఎం కేసీఆర్ చదువుకున్న బడి నిర్మాణం, రూ.17 కోట్లతో సమీకృత భవన సముదాయం, 7 కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు, నార్సింగ్, రాయపోల్ కొత్త మండలాలు, 21 కొత్త గ్రామపంచాయతీలతో పాటు రెండువేలకు పైగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ప్రజలకు వివరిస్తూ చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రామలింగారెడ్డి ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలోనే పింఛన్లు వస్తుండటంతో రామలింగారెడ్డి భారీ మోజార్టీతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రతిపక్షాల్లో ఆశలు నాలుగేళ్ల అభివృద్ధిపై సోలిపేట రామలింగారెడ్డి ప్రచారం చేస్తుండగా.. ప్రతిపక్ష బీజేపీ, కూటమి అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లారు. అభివృద్ధి, సంక్షేమం ఆయుధాలుగా బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు ప్రచారం చేశారు. ఆయన తరఫున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కూడా బరిలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. దాంతోపాటు రాష్ట్ర నాయకుడు కిషన్రెడ్డి కూడా రఘునందన్రావు తరఫున దుబ్బాకలో పర్యటించారు. ఆయన్ను గెలిపిస్తే మంచి నాయకుడు అవుతాడని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా మహాకూటమి మాత్రం టీఆర్ఎస్ కుటుంబ పాలనపై గురి పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టింది. కాగా ఈ సీటును పొత్తుల్లో భాగంగా టీజేఎస్కు కేటాయించినా కాంగ్రెస్ తరఫున మద్దుల నాగేశ్వర్రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండటంతో కూటమి పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థంకాక కొందరు ఇంటికే పరిమితం అవుతుండటం కూడా కూటమికి పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. ఏదేమైనా విజయం ఎవరిని వరిస్తుందో.. ఏ పార్టీల ప్రభావం ఎంత ఉందో తెలియాలంటే ఈనెల 11వ తేదీ వరకు ఆగాల్సిందే. -
హస్తానికి షాకిచ్చిన మాజీ మంత్రి
సాక్షి, మెదక్ : దుబ్బాక నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించేందుకు గులాబీ దళం పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ను ప్రయోగించింది. ఆపధర్మ మంత్రి హరీష్ రావు, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు ఆదివారం చెరుకు ముత్యం రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని వారి ముందు ఆయన కంటతడి పెట్టారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. దుబ్బాక అభివృద్ది వెనుక ముత్యం రెడ్డి శ్రమ ఎంతో ఉందని అన్నారు. ఆయన చేరికతో మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాగా నియోజకర్గంలో రామలింగారెడ్డిని ఓడించాలంటే ముత్యం రెడ్డిలాంటి నేతను బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించిన విషయం తెలిసిందే. కానీ మహాకూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా దుబ్బాక స్థానాన్ని టీజేఎస్కు కేటాయించడంతో ముత్యం రెడ్డికి మొండిచెయ్యి ఎదురైంది. దీంతో తీవ్ర మనస్థానం చెందిన ముత్యం రెడ్డి టీఆర్ఎస్ చేరుతున్నట్లు ప్రకటించారు. ముత్యం రెడ్డి పార్టీని వీడడంతోతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే అని స్థానిక నేతలు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి గులాబీ పార్టీ తరుఫున రామలింగారెడ్డి పోటీలో నిలవగా..టీజేఎస్ నుంచి చిందం రాజ్కుమార్ బరిలో నిలిచారు. -
‘గరుడ పురాణం’ పాత సినిమానే!
తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు పాపపు ఆలోచనలకు ఒడిగట్టారు. జగన్ మో హన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని కూడా తన క్షుద్ర రాజకీయ కుట్రలోకి లాగారు. ఇదంతా తెలం గాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆడిన నాటకమేనట, కేసీఆర్, కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు సృష్టించాలని, అస్థిర పరచాలని చూశారని అంటూ నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కావాలనుకుంటే కొట్లాడి తెచ్చుకునే వాళ్లం. ఇచ్చిన మాటకోసం తల నరుక్కునే మనుషులు మా నేతలు. చంద్రబాబు తరహాలో కుట్రలు చేయటం మాకు చేతకాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లిస్తున్న ‘గరుడ పురాణం’ పాత రోజుల్లోని ‘అంతిమ తీర్పు’ సినిమా కథ తరహాలో సాగుతోంది. కథానాయకుడే ఒక్కొక్కరిని చంపేస్తూ .. చంపేసిన తీరు తన పత్రికలో కథనంగా రాయటం సినీ ఇతివృత్తం. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ‘ఆపరేషన్ గరుడ’ సాగుతోంది. సినిమా నటుడు శివాజీని తెరపై చూపిస్తూ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కనుసన్నల్లో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కలిసికట్టుగా రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ని మించిన హత్యా రాజకీయ చిత్రమిది. ఆయన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఆం్ర«ధా జనం విసిగిపోయారు. అక్రమాలు, అబ ద్ధపు మాటలతోనే గడిపారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుతూ మళ్లీ జనంలోకి వెళ్లాలి. దొంగ మాట లతో... మాయల ఫకీరు వేషాలతో జనాన్ని తన వైపు తిప్పుకోవాలి. ఆ ప్రయత్నంలోంచి పుట్టిందే ‘ఆపరేషన్ గరుడ’. ఇదో ఫ్రీ ప్లాన్డ్ స్కెచ్. విశాఖపట్టణం ఆర్కే బీచ్లోనే ఈ పథకానికి బీజాలు పడ్డాయి. గత ఏడాది జనవరిలో హోదా కోసం అక్కడి యువత విశాఖ ఆర్కే బీచ్లో మౌన దీక్ష చేపట్టింది. పోలీ సులు 144 సెక్షన్ పెట్టి మద్దతుదారులు ఎవరూ రాకుండా కట్టుదిట్టం చేశారు. కానీ అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన సినిమా నటుడు శివాజీ, చంద్రబాబు మీద ఐదు ప్రశ్నలు సందిస్తున్నానంటూ జనం దృష్టిని ఆకర్షించారు. దీనికి ఓ వర్గం మీడియా విçస్తృత ప్రచారం కల్పించింది. ఏడు నెలల కిందట నుంచి చంద్రబాబు మార్కు రాజకీయ దృశ్య రూపకం తెర మీదకు వచ్చింది. ‘ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఐటీ, సీబీఐలతో దాడులు చేయిస్తారని, ముఖ్య రాజకీయ పార్టీ నేతపై ప్రాణాపాయంలేని దాడి చేస్తారని.. అనంతరం రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తారని దాని పేరే ‘ఆపరేషన్ గరుడ’ అంటూ నటుడు శివాజీ జోస్యం చెప్పారు. దీనికి స్వయంగా చంద్రబాబే ఓ వర్గం మీడియాలో పెయిడ్ ఆర్టికల్స్లాగా విస్తృత ప్రచారం కల్పించి జనంలోకి వదిలారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీ మీడియా ముందుకు రావటం, దాడి చేసిన వ్యక్తి కులాన్ని ప్రస్తావిస్తూ, ఆ వ్యక్తి జగన్ అభిమానేనని, ప్రచారం కోసమే అతను హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు ప్రకటించటం కట్టు కథలు చెప్పినట్టే అనిపించింది. అతడి జేబులో 8 పేజీల లేఖ ఉందని (తరువాత ఇది 11 పేజీలకు పెరిగింది) ముందస్తుగానే ప్రకటించటం రాజ్యాంగ విరుద్ధం. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని మీద హత్యాయత్నం జరిగినప్పుడు దర్యాప్తు జరుపకుండానే ఒక ఉన్నతస్థాయి అధికారి చెప్పటం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అనూహ్య సంఘటనలు జరిగాయి. మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు హత్య, జగన్పై హత్యాయత్నం రెండూ పోలీసు వైఫల్యాలే. నేరాలను పసిగట్టి, సమాచారం అందించే పోలీసు ఇంటెలిజెన్సీ వ్యవస్థను చంద్రబాబు సొంత పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అక్కడి సిబ్బందిని తెలంగాణకు పంపించి తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు అనుకూలమైన నియోజకవర్గాలు ఏవో తేల్చాలని ఆదేశించారు. అధికారులు అంతా తెలంగాణ ఎన్నికల సర్వే బిజీలో ఉండటంతోనే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పట్టుతప్పింది. వీటన్నిటికి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు మానం, అభిమానం లేవు. నీతి నియమాలు లేవు. ఎన్ని అడ్డదార్లు తొక్కైనా అధికారంలో ఉండాలనేది ఆయన ఫిలాసíఫీ. పిల్లనిచ్చిన పాపానికి సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. అధికారం కోసం త్రాచుపాములా సొంత వాళ్లను తినటానికి కూడా వెనుకాడని తత్వం ఆయనది. ప్రతి విషయాన్ని రాజకీయంగా ఆలోచన చేసే నీచ మనస్తత్వం ఆయనది. తెలంగాణలో శాసన సభ్యులను కొనుగోలు చేసి మా ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర చేసి చట్టానికి అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు నాయుడు. తెలంగాణ అంటే ఆత్మ గౌరవానికి బలిదానాలకు ప్రతీక. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పునాది రాళ్లు వేసిన రోజునే ఉద్యమ నాయకుడు కేసీఆర్ అక్కడికి వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా దీవిం చారు. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని మాటిచ్చారు. మాట కోసం తల నరుక్కుంటాడు కానీ చంద్రబాబు తరహా కుట్రలు చేసే మనిషి చంద్రశేఖర రావు కాదు. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే ‘ 94403 80141 -
దుబ్బాక బరిలో విజయశాంతి?
దుబ్బాక టౌన్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి పేరు ఖారారైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉందని.. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న నాయకులను బరిలో దింపితే గెలుపు కష్టమేనని భావించిన పార్టీ అధిష్టానం, విజయశాంతిని రంగంలో దింపితే గెలుపు అవకాశాలుంటాయన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విజయశాంతికి తెలపడంతో ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి బరిలో ఉండటంతో పాతకాపులకు టికెట్ ఇస్తే గెలుపు డౌటేనని ఇటీవల కాంగ్రెస్ సర్వేల్లో వెల్లడైనట్లు తెలిసింది. మహాకూటమి దుబ్బాక టికెట్పై పట్టుబడుతుండటం.. కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డితోపాటు ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఏంజేబీ ట్రస్టు అధినేత మద్దుల నాగేశ్వర్రెడ్డి, టీపీసీసీ ప్రధా న కార్యదర్శి పన్యాల శ్రావణ్కుమార్రెడ్డిలు జోరుగా యత్నాలు చేస్తుండటంతో టికెట్ ఎవరికి వస్తుందో అర్థంకాక కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్నా రు. ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికిచ్చినా మిగతా ఇద్దరు సహకరించడం కష్టమేనని భావించిన అధిష్టానం తెరపైకి విజయశాంతి పేరును తెరపైకి తెచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్దాస్ కమిటీకి ఇచ్చిన జాబి తాలో విజయశాంతి పేరు కూడా ఉందని మాట్లాడుకుంటున్నారు. విజయశాంతి కూడా మంగళవారం ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుబ్బాక నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం ఇదంతా వాస్తవం కాదని.. తమకే టికెట్ వస్తుందంటూ చెప్పుకుంటున్నారు. -
బనిజేరుపల్లి అవ్వ జెప్పిన మాట
ఎన్నికల సమరం... ఊరు వాడల్లో కార్యకర్తల కప్పదాట్లు, చేరికలు ఊపందుకున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాసం రాసే తీరిక ఎక్కడా? మూడు, నాలుగు గంటల పాటు నిలకడగా మనసుపెట్టి రాసే సమయం ఉందా? అదే కాలాన్ని ఓటర్ల కోసం ఖర్చు చేస్తే నాలుగు ఓట్లు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలు చుట్టుముట్టాయి. మనుసు మాత్రం నువ్వు జర్నలిస్టువు కూడా అనే విషయం మర్చిపోతున్నావు అని గుర్తు చేస్తోంది. ఈ మానసిక సంఘర్షణతోనే బనిజేరుపల్లి వెళ్లాను. ఇది నా నియోజకరవర్గంలోని ఓ చిన్న పల్లెటూరు. మల్లన్న సాగర్ ముంపు గ్రామం. ఈ ముంపు ఊళ్లను బూచిగా చూపించే ప్రతిపక్షం ఓట్ల సాగు చేయాలనుకుంటోంది. ఊరు ముంగిట ఇంటి అరుగుల మీద 70 ఏళ్ల అవ్వ కూర్చొని ఉంది. మాట కలిపాను. ‘ఓటు ఎవరికేస్తావు అవ్వా’ అని అడిగాను. ‘కారుకు’ వేస్తా అంది. ‘ఊరును నీళ్లల్ల ముంచినందుకా?’ అని వ్యంగ్యంగా అడిగాను. ‘ఎవరయ్య నువ్వు?’ అని గద్దింపు స్వరంతోనే ఎదురు ప్రశ్నించింది.‘ పింఛిని రూపాయలు ఇంటికి వస్తున్నయి. నా పింఛిని కాయితం పోయి ఎమ్మోరా (తహశీల్దారు) ఆఫీసు కాడ గోడు గోడున ఏడుస్తుంటే రామలింగన్న జూసి ఏడ్వకు అవ్వ నేను ఇప్పిస్త అని నా భుజాల మీద చెయ్యేసి తీసుకొని పోయి కాయితం ఇప్పిచ్చిండు. గెలిస్తే కేసీఆర్ రూ. 2016 ఇస్తానంటోండు’ అని చెప్పింది. తెలంగాణ ఆకాంక్షతో యువత నెత్తుర్లు చింది స్తున్న వేళ అధికార పక్షంగా కాంగ్రెస్ తెలంగాణ నినాదాన్నే అవహేళన చేసింది. కేసీఆర్ వీరోచిత ఉద్యమంతో గత్యంతరం లేక తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి మళ్లీ అవే తప్పులు చెస్తోంది. విలువలను, సిద్దాంతాలను, ఆదర్శాలను పక్కపెట్టి టీడీపీతో జత కట్టటం కాంగ్రెస్కి ఆత్మహత్యా సదృశమే. అభివృద్ధికి ఆటంకం ఉండొద్దని, కేసీఆర్ పాలనకు రెఫరెండం కావాలని ప్రజా తీర్పునకు వెళ్లాలని నిర్ణయించారు. దీన్ని చంద్రబాబు అవకాశంగా తీసుకోవాలనుకున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ ఆయన. ఇందులో చంద్రబాబు, ఆయన తొత్తు రేవంత్రెడ్డి ఈ రోజు కాకపోతే రేపైనా జైలుకు పోవటం ఖాయం. దీని నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఆ కేసు ఫైళ్లను మాయం చేసేందుకు, కుదరకపోతే తారుమారు చేసేందుకు శత విధాల ప్రయత్నిం చాడు. బాబు ప్రతి ఎత్తును కేసీఆర్ చిత్తు చేశారు. ఇక చివరి అస్త్రంగా తెలంగాణలో అధికారిక ప్రవేశానికి ఒక సాకు.. ఒక అవకాశం వెదుకుతున్నాడు. ఆయన లక్ష్యం ఒక్కటే. తెలంగాణ నాయకత్వాన్ని ధ్వంసం చేసి, దొంగతనంగా ఫైళ్లను ఎత్తుకుపోవాలే. ప్రాజెక్టులకు అడ్డంపడి పంటలు ఎండబెట్టాలే. కానీ ఇక్కడ తెలుగుదేశం కూకటి వేళ్లతో పెకిలించుకుపోయింది. ఈ నేపధ్యంలోనే ఆయన దృష్టి అంపశయ్య మీదున్న దివాళాకోరు కాంగ్రెస్ మీద పడింది. మహా కూటమి పేరుతో దాన్ని ఉచ్చులోకి లాగాడు. కోట్లాది రూపాయల డబ్బు, మూడు హెలీకాప్టర్లు పంపుతానని కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానానికి ఆశ చూపెట్టి ముగ్గులోకి దిం చాడు. ‘బాలనాగమ్మ’ నాటకంలో మాయల ఫకీర్ బాలనాగమ్మను కుక్కను చేసి ఆడించినట్టుగా చంద్రబాబు కాంగ్రెస్ని ఆడిస్తున్నాడు. అసెంబ్లీ రద్దుకు ముందే ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల అమలు తీరుపై సమగ్రమైన పరిశోధన జరిగింది. దాని ఫలితాలను వడబోసి తీసిన సారంనుంచే కేసీఆర్ టీఆర్ఎస్ మినీ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఇప్పుడు ఇస్తున్న పంట పెట్టుబడి సాయం రూ 8 వేల నుంచి ఏకంగా రూ 10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆసరా పింఛన్లను రెట్టింపు 1.000 నుంచి రూ.2016కు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంచుతామని చెప్పారు. 2021 నాటికి కోటి ఎకరాల మాగాణం ఖాయమని, ఈ క్రమంలో అన్ని అడ్డంకులు అధిగమించి, ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని ప్రతినబూనారు. టీఆర్ఎస్ మినీ మ్యానిఫెస్టో మీద పుంఖానుపుంఖాలుగా చర్చలు జరిగాయి... జరుగుతున్నాయి. వితండవాదాలు, విషపు ప్రచారాలను జనం విన్నారు. నిజానిజాలు అర్థం చేసుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈనెగాసి నక్కలపాలు చేయకుండా తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారో అవ్వ జెప్పిన మాటలను బట్టి తెలుస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే 94403 80141 -
వారంట్ బూచితో ఇంత లేకితనమా?
ప్రజా మేలు కాంక్షించే నాయకుని ఆలోచనలు వేరే ఉంటాయి వివాదాన్ని దౌత్యం ద్వారా పరిష్కరించుకోవటమే రాజనీతి. వరుసగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబుకు బాబ్లీ ప్రాజెక్టు గుర్తుకురాలేదు. కానీ బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో వచ్చిన వారంట్ను తెలంగాణ ప్రభుత్వం కుట్రగా చెప్పుకుంటూ సానుభూతి ఓట్ల కోసం తన్లాడటం చంద్రబాబు మార్కు పాలిటిక్స్లో భాగమే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నదీజలాల పంపిణీలో రాజనీతిని ప్రదర్శించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో స్నేహ హస్తాలను సాచారు. మాకు కావలసింది నీళ్లు తప్ప వివాదాలు కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర çఫడ్నవిస్ను ఒప్పించారు. ‘రాజకీయ విలువలు అస్థి రమైనవి’ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు అంటాడు. అర్థిక శాస్త్రం చదివిన చంద్ర బాబుకు ఏ ఘడియల్లో ఇది వంటబట్టించుకున్నాడో గానీ కౌటిల్యుడే సిగ్గుపడే టట్లు ఆ పదాల ‘అర్థా’న్నే మార్చేశారు. తెలంగాణ పల్లెల్లో ఉద్యమం ఉరకలె త్తుతున్న రోజుల్లో ‘రెండు కళ్ల సిద్ధాంతాన్ని’ ముంద టేసుకున్నారు. రెండు నాల్కల మాటలకైతే లెక్కే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో ‘మీది ఏ ఇజం’ అని జర్నలిస్టులు అడిగితే ‘నాకు ఏ ఇజం లేదు.. టూరిజం’ అన్నాడు. ఆయన ఏ పని చేసినా రాజకీయంగానే ఆలోచన చేస్తారు. ప్రతి పనిని ఓటుతోనే సరితూకం చేస్తారు. పిల్లని చ్చిన మామకు వెన్నుపోటు పొడిచినా... ఒకప్పుడు నరేంద్ర మోదీని రాష్ట్రంలోకి రాకుండా నిషే«ధిం చాలని నినదించి.. ఆ తరువాత ఆయన్ను కౌగిలించు కొని, మోకరిల్లినా.. ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మఘోషిం చేలా ఏకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టు కున్నా... అంతిమంగా అధికార పీఠం దక్కించుకోవా లనే యావే. తాజాగా బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో వచ్చిన వారంట్ను తెలంగాణ ప్రభుత్వం కుట్రగా చెప్పుకుంటూ సానుభూతి ఓట్ల కోసం తన్లా డటం చంద్రబాబు మార్కు పాలిటిక్స్లో భాగమే. ఆ మధ్యకాలంలో ఓ ఎన్బీడబ్ల్యూ వారంట్ వాట్సాప్లో చెక్కర్లు కొట్టింది. అటు తిరిగి.. ఇటు తిరిగి నాకూ చేరింది. తీరా చూస్తే ఆ వారంట్ నాదే. తెలంగాణ ఉద్యమ సమయంలో అయిన కేసు అది. రెండేళ్లుగా కోర్టుకు హాజరు కాకపోవటంతో సిద్దిపేట కోర్టు వారంట్ ఇచ్చింది. నా రాజకీయ ప్రత్యర్థులు ఎవరో దాన్ని వాట్సాప్లో పెట్టారు. ‘రామలింగారెడ్డి అధికార దుర్వినియోగం చూడండి’ దానికో క్యాప్షన్ పెట్టారు. నేను ఆ ఓ లాయర్ను పట్టుకొని రీకాల్ పిటిషన్ వేయించాను. కోర్టుకు గైర్హాజరు అయ్యే వాళ్లకు భారత శిక్షాస్మృతిలో ఇది సర్వ సాధారణ వారంట్. రాజకీయ నేతలకైతే ఇటువంటి వారంట్లు అతి సాధారణం. చంద్రబాబు నాయుడుకు బాబ్లీ ఆందోళన కేసులో వచ్చిన ఎన్బీడబ్ల్యూ వారంట్ కూడా నూటికి నూరుపాళ్లు ఇటువంటిదే. చంద్ర బాబునాయుడుకు కోర్టులు, కేసులు కొత్తకావు. ఆయన మీద 29 అవినీతి కేసులు ఉన్నాయి. వీటి మీద కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని రాజ్య పాలన చేస్తున్నాడు. ఇటీవల బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో వచ్చిన నాన్బెయిలబుల్(ఎన్బీడబ్ల్యూ) వారంటు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పటి వరకు ఆయనకు 37 సార్లు కోర్టు నుంచి నోటీసులు అందాయి. నిందితులు కోర్టుకు హాజరుకావడం లేదనే కారణంపైన 2015 సెప్టెంబర్ 21 మొదటిసారి ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. అప్పుడు చంద్రబాబు – మోదీ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత 35 సార్లూ ఎన్బీడబ్ల్యూ జారీ చేస్తూ వచ్చింది. అప్పుడూ ఏ చప్పుడూ లేదు. తెలంగాణలో సాధారణ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బాబ్లీపై వారెంట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి అంపశయ్యమీద ఉన్న టీడీపీకి ఇంత జీవగంజి పోయటానికి, రెండోది కాంగ్రెస్తో టీడీపీ పొత్తు వ్యవహారంపై రెండు రాష్ట్రాల ప్రజానీకం, పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరు ణంలో దీనిపై చర్చ జరగకుండా కప్పిపుచ్చేందుకు 37వ ఎన్బీడబ్ల్యూ వారంట్ కుట్రగా కనిపించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడకుండా చేశారు. సమస్యను పరిష్కరిం చడానికి బదులు మరింత జటిలం చేశారు. ప్రతి చిన్న విషయానికి మహారాష్ట్రతో గిల్లికజ్జాలు పెట్టుకు న్నారు. నిజానికి 2010లో చంద్రబాబు నాయుడు బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగటం కూడా ఓట్ల స్టంటే. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన బాబుకు తెలంగాణ ప్రజల మద్దతు లభించక పోవటంతో బాబ్లీ బాట పట్టారు. వివా దాన్ని దౌత్యం ద్వారా పరిష్కరించుకోవటమే రాజ నీతి. వరుసగా తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసినప్పుడు బాబుకు బాబ్లీ ప్రాజెక్టు గుర్తుకురాలేదు. అధికారం పోగానే ప్రాజెక్టు గుర్తొచ్చి ఫైటింగ్ కోసం పోయిండు. బాబ్లీ వివాదం ఎప్పటికీ తెగకుండా చేశారు. పైగా తెలంగాణ ప్రాజెక్టులు అంటేనే మహారాష్ట్ర ఒంటి కాలు మీద లేచే పరిస్థితికి తీసుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాజనీతిని ప్రదర్శించారు. ‘మాకు కావలసింది నీళ్లు తప్ప వివాదాలు కాదు. రైతు ఎక్కడివాడైనా రైతే. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల రంగంలో తీవ్రంగా నష్టపోయాము. తెలంగాణ ఉద్యమం ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే సాగునీటి రంగానికి మేము అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాము. ముంపు సమస్య లేకుండా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశాము, సహకరిం చండి అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కడుపులో కల్మషం లేకుండా కావాల్సింది ఏమిటో విడమరచి చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను ఒప్పించారు. గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై మూడు బ్యారేజీల నిర్మాణానికి సీఎంలు పరస్పరం అంగీకారం తెలిపారు. తెలం గాణ సీఎం కేసీఆర్, మహా రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్న వీస్ సంతకాలు చేశారు. మొదటి ఒప్పందం: గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో, 16 టీఎంసీల నీటినిల్వ సామ ర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీ కారం కుదిరింది. ఈ బ్యారేజీ ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగా రెడ్డి జిల్లాల్లో 18.19 లక్షల ఎకరాలు కొత్తగా సాగు లోకి వస్తాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయ కట్టు స్థిరీకరణ చెందుతుంది. రెండో ఒప్పందం : ప్రాణహితపై తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో, 1.8 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. దీని వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్–కాగజ్నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మూడో ఒప్పందం: పెన్గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో చనఖా – కొరాటా బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, జైనథ్, బేలా మండలాలకు సాగునీరు అందుతుంది. కృష్ణా, గోదావరి జలాలను ఎలాగైనా ఆంధ్రాకు మళ్లించుకుపోవాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు, ప్రాజెక్టులు నిర్మాణం కాకుండా కోర్టు కేసులతో అడ్డం పడి తెలంగాణ భూములను ఎండబెట్టాలనే దుర్భు ద్ధితో ఉన్న కాంగ్రెస్ పార్టీలు జతకట్టి ఓట్ల కోసం వస్తు న్నారు. ఇటువంటి తోడు దొంగల పట్ల తెలంగాణ జనం జాగ్రత్తగా ఉండాలే. ఓటుతోనే తరిమికొట్టాలి. సోలిపేటరామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసనసభ్యులు ‘ 94403 80141 -
అక్రమ రవాణాపైనా రాజకీయ దురుద్దేశాలేనా?
అవి 2006 మార్చి మాసం చివరి రోజులు... అప్పట్లో దుబ్బాక దొమ్మాట నియోజక వర్గం కింద ఉండేది. నేను తొలి సారి దొమ్మాట నుంచే గెలిచాను. పొద్దంతా నియోజకవర్గంలో తిరిగి మా ఇంటి ముందు మామిడి చెట్టు కింద కూలబడ్డా. కార్యకర్తలుంటే వాళ్లతో మాట్లా డుతున్నా. అప్పుడే ఓ మిత్రుడు ఓ అపరిచిత వ్యక్తితో కలిసి వచ్చాడు. అప్పట్లో అతను మా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు ఓ జాతీయ పార్టీలోకి వెళ్లిపోయాడు. ఆయనను మధుసూదన్ రావుగా పరిచయం చేశాడు. నిజామాబాద్ జిల్లా అని ‘హ్యూమన్ ట్రాఫికింగ్‘ బ్రోకర్ అని చెప్పాడు. సాదా సీదా లేబర్ను కాకుండా హైక్లాస్ మనుషులను అమెరికా పంపిస్తుంటాడని, గుజరాత్, మహారాష్ట్రల్లో మంచి పేరున్న వ్యక్తిగా చెప్పారు. మా ప్రజలు నా గురించి ఏమ నుకుంటున్నారు అని ఉత్సాహం కొద్ది అడిగాను. ‘నువ్వు అవినీతిపరునివి అనుకుంటున్నారు’ అని చెప్పారు. ‘ఓర్నీ... నేను ఎమ్మెల్యేను అయ్యాక నియోజకవర్గానికి ఒక రూపాయి అభివృద్ధి పనులు కూడా రాలేదు కదా! అప్పుడే ఎక్కడ అవినీతికి పాల్పడబోయిన’ అన్నాను. మధుసూదన్రావు వ్యాపారానికి నా సహాయం కావాలన్నారు. ప్రశ్నార్థకంగా చూశాను. ‘గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఇంగ్లండ్, అమెరికా వెళ్లిపోయిన కొందరు వ్యక్తులు అక్కడి వ్యాపారాల్లో బాగా స్థిరపడిపో యారు. ఇండియాలోని తమ భార్యాపిల్లలను అక్కడికి రప్పించుకుంటున్నారు’’ అని చెప్పారు. వాళ్ల వీసాలకు నా సిఫారసు కావాలన్నారు. ‘ఎమ్మెల్యేలకు ఇటువంటి అధి కారం కూడా ఉందా?’ అని అడిగాను. గుజరాతీలను నా బంధువుల పేరు మీద నా సిఫారసు లెటర్తో వీసా ఇప్పించి అమెరికా పంపించాలని కోరారు. జర్నలిస్టుగా మనుషుల అక్రమ రవాణా కేసుల గురించి నేను చది వాను. ‘ఇంతకు ముందు నన్ను మీరు అవినీతిపరుడు అన్నారు.. ఇంతకు మించిన అవినీతి ఇంకేమీ ఉండదు. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయను’ తెగేసి చెప్పాను. మరో ఆరు నెలలకు అనుకుంటా... ఇంకో మిత్రుడు ఎర్రమంజిల్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు విందుకు ఆహ్వా నించారు. అప్పటి సహచర ఎమ్మెల్యే సోయం బాపురావు నాకు కాల్ చేసి విందుకు కలిసి వెళ్దాం అన్నారు. ఇద్దరం కలిసే వెళ్లాం. మేం వెళ్లేటప్పటికే అక్కడ కాసిపేట లింగయ్య, మరి కొంతమంది రాజకీయ మిత్రులు ఉన్నారు. భోజనానికి కూర్చున్నాం. ఓ వ్యక్తి నాకు వడ్డిస్తూ ‘ఈ ఎమ్మెల్యే గారు పేదరికంలో ఉన్నట్టున్నారుగా’ అని అన్నాడు. ‘నేను ఎట్టుంటే నీకేంది.. నువ్వు వడ్డించేదో వడ్డించు’ అని కాస్త కటువుగానే అన్నాను.. నన్ను ఆహ్వా నించిన వ్యక్తి కల్పించుకుంటూ.. ‘అన్నా.. ఇతను రషీద్, మనుషులను విదేశాలకు పంపుతారు’ అని పరిచయం చేశారు. పాస్పోర్టు కోసం నన్ను సహాయం చేయమని అడిగారు. నన్ను ఒప్పించటానికి జగ్గారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన సమ యంలో ఆయన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్ సాయిరెడ్డి పేర్లతో గుజరాత్కు చెందిన వారిని అమెరికా పంపినట్లు చెప్పారు. నకిలీ డాక్యుమెం ట్లతో వీసాలు పొందిన ముగ్గురినీ జగ్గారెడ్డి తన వెంట అమెరికాకు తీసుకెళ్లారని, వారిని అక్కడ ఉంచి తిరిగి హైదరాబాద్ వచ్చేశారని నన్ను ఒప్పించేందుకు ప్రయ త్నం చేశారు. ఇలా సహకరించినందుకు రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ వస్తాయని చెప్పారు. నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన వ్యక్తిని. నా బ్యాక్ గ్రౌండ్ జర్న లిజమే. ఏమీ లేకుండానే కేసీఆర్ నన్ను పిలిచి టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి గెలిపించారు. నేను డబ్బుకోసం ఆశపడి తప్పుడు పనిచేస్తే... భవిష్యత్తులో నాలాంటి దిగువ కుటుంబాల నుంచి వచ్చే యువతను ఎవరూ నమ్మరు. నేను ఆ పని చేయలేను అని చెప్పేసి వచ్చేశాను. అదేరోజు హరీశ్రావుకు ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పాను. ఇందులో మన ఎమ్మెల్యేలు కూడా ఇరుక్కున్నా రని చెప్పాను. ఒక మీడియా సంస్థను కలిస్తే వాళ్లు వరు సగా రెండు కథనాలు ప్రచురించారు. ఈలోగా హరీశ్ రావు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ దృష్టికి తీసు కువెళ్లారు. ఆ తరువాత అసలు తతంగం అంతా బయటికి వచ్చింది. ఇప్పుడు ‘హ్యూమన్ ట్రాఫికింగ్’లో జగ్గారెడ్డి నిండా ఇరుక్కుపోయారు. ఆయన కుటుంబం పేరుతో అమెరి కాకు వెళ్లిన గుజరాతీయులు 14 ఏళ్లయినా తిరిగి రాక పోవటంతో ‘అమెరికన్ కాన్సులేట్ అధికారులు’ అనుమా నించి హైదరాబాద్ సిటీ నార్త్ జోన్ పోలీసులకు సమా చారం ఇచ్చారు. జగ్గారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా తన సిఫారసుతో ఇప్పించిన పాస్పోర్టుల డాక్యుమెంట్లను పోలీసులు పరిశీలించారు. అందులో కొడుకు, కూతురు, భార్యపేర్లు ఉన్నా ఫొటోలు మాత్రం వేరేవారివిగా ఉన్న ట్లుగా గుర్తించారు. గుజరాత్కు చెందిన ఒక కుటుంబాన్ని అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు నిర్ధారణ చేశారు. ఇదీ వాస్తవంగా జరిగింది. ఇందులో రాజకీయ కక్ష సాధింపు ఎక్కడ ఉంది? రాజకీయ దురుద్దేశం ఏముంది? ఆరోపణలు ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఆరో పణలు పక్కన పెట్టి వాస్తవిక దృక్పథంలో ప్రజల్లోకి రావాలి. అప్పుడే జనం మనలను విశ్వసిస్తారు.. ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయిస్తారు. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసనసభ్యులు ‘ 94403 80141 -
ముందస్తుతో ఆ ‘రెండూ’ మునగడం ఖాయం
అంపశయ్య మీద ఉన్న పార్టీలన్నీ ‘ఇప్పుడు ఎన్నికలు ఎందుకు’ అని అడుగుతున్నాయి. ఈ పార్టీల నేతలకు ముందస్తు ఎన్నికలు మింగుడు పడతలేదు. చంద్రబాబు నాయుడుకు మానం, అభిమానం లేవు. నీతి నియమాలంటే లెక్కేలేదు. ఎన్ని అడ్డదార్లు తొక్కి అయినా అధికారంలో ఉండాలనేది ఆయన ఫిలాసఫీ. పిల్లనిచ్చిన పాపానికి సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్ని కుప్పిగంతులు వేశారో లెక్కే లేదు. ఇప్పుడు అధికారం కోసం మరోసారి అపవిత్ర పొత్తులకు తెరతీస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ప్రజల్లోకి వస్తారట. తెలంగాణ నీళ్లను ఎట్లా దారిమళ్లించుకొని తీసుకుపోదామని నిత్యం ఆలోచించే బాబుతో మన కాంగ్రెస్ వాజమ్మలు పొత్తుకు సిద్ధమయ్యారు. ఇలాంటి వాళ్లకా తెలంగాణ ప్రజలు ఓటు వేసేది? తెలంగాణలో టీడీపీ కూకటి వేళ్లతో కూలిపోయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వటవృక్షం తెలంగాణలో కూలిపోవటం ఖాయం. అధికార పార్టీని ఇరకా టంలో పెట్టడానికి ‘ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా’ అంటూ ప్రతిపక్షాలు సవాలు విసురుతాయి. ఏడాది ముందుగానే కేసీ ఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి నిలబడితే ప్రతిపక్షాలు ఇప్పుడెందుకు అంటు న్నాయి. సంచలనాలు, సాహస నిర్ణయాలకు కేసీఆర్ మారు పేరు. నేడు తెలంగాణలో ప్రగతి రథచక్రం పరుగులు పెడు తోంది. వర్గపోరుతో బజార్ల పడుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్కి ఈ వేగాన్ని తట్టుకునే సామర్ధ్యం లేక బేల చూపులు చూస్తోంది. 60 ఏళ్ల వలసాంధ్ర పాలనలో తెలంగాణను పీల్చి పిప్పిచేశారు. కేసీఆర్ నాయ కత్వంలో అవతరించిన బంగారు తెలంగాణ నాలు గేళ్ల పసికూన. ఈ నాలుగేళ్ల కాలంలోనే 40 ఏళ్లంత వేగంగా అభివృద్ధి జరిగింది. ఈ పరిపాలన చూపించే కేసీఆర్ ప్రజాతీర్పుకు íసిద్ధమయ్యారు. ఇక్కడో యదార్థం చెప్పాలి. నీళ్లు లేక అల్లాడుతున్న జనం బాధలు చూడలేక జడ్చర్లకు చెందిన ఓ కాంగ్రెస్ నేత పాతికేళ్ల క్రితం ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వద్దకు పోయి ‘అయ్యా గుక్కెడు నీళ్లు లేక మా ప్రాంత జనం వలస పిట్టలైపోతున్నారు. జూరాల నీళ్లిచ్చి చెరువు నింపండి’ అని అడిగితే, ఆ సీఎం వెటకారంగా ‘అరే, రెడ్డికి గొంతెండి పోతుందట. చెంబుల నీళ్లు పట్రారా’ అని ఆయనకు చెంబులో నీళ్లు తాపిచ్చి ‘ఇగపో’ అన్నాడట. ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంతాన్ని వెను కబాటుతనంలో ఉంచారు. మద్రాసు రాష్ట్రంలో మద్రాసు నగరానికి రాళ్లు ఎత్తటానికి, ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు, ఆంధ్రప్ర దేశ్లో హైదరాబాద్ నగరానికి, ఇలా దేశంలో ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా లక్షల సంఖ్యలో కూలీలను తరలించటానికి పాలమూరు జిల్లాను రిజర్వు చేసి పెట్టారు. అందుకోసమే సారవంతమైన తీర భూము లున్నా, వాటికి సాగునీటిని కల్పించే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేశారు. 1.02 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే జూరాల ప్రాజెక్టు, 87,500Sఎకరాలకు నీళ్లిచ్చే సామర్ధ్యం ఉన్న రాజోలిబండ (ఆర్డీఎస్), 1.10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే సామర్ధ్యం ఉన్న భీమా, 3.40 లక్షల ఎకరాలకు నీళ్లనిచ్చే కల్వకుర్తి, 2 లక్షల ఎకరాలకు నీరివ్వగలిగే నెట్టెంపాడు ఎత్తిపో తల పథకాలు ఏళ్ల తరబడి ఫైళ్లలోనే మగ్గుతూ వచ్చాయి. 2.28 లక్షల ఎకరాలకు సాగు నీళ్లనిచ్చే చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కల్వకుర్తి ప్రాజెక్టుకు 30 ఏళ్లు నిండాయి. ఇప్పుడు అనేక ప్రాజె క్టులు ముగింపునకు వచ్చాయి. అభివృద్ధి ఫలాలు జనం అనుభవిస్తున్నారు. పాలమూరు భూముల్లో 9 లక్షల ఎకరాల్లో నీళ్లు పారుతున్నాయి. ఎన్నికల హమీ లను అమలుచేస్తూనే, డెబ్బయికి పైగా కొత్త పథ కాలు అమలు చేశారు. కేసీఆర్ చిత్తశుద్ధితో పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. రాష్ట్రం వచ్చిన కొత్తలో మన పొలాలకు నీళ్లు పెట్టుకుందా మని సాగర్ నీళ్లకోసం పోతే చంద్రబాబు నాయుడు పోలీసులను పెట్టి మన అధికారులను కొట్టించారు. ఢిల్లీకి పోయి పంచాయితీ పెట్టించారు. పాలమూరు ఎత్తిపోతలు, మల్లన్న సాగర్ మీద దొంగ కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. తెలంగాణను అస్థిర పరచాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఉసిగొల్పిన రేవంత్రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరిని కోట్లు ముట్టజెప్పి కొనాలని ప్రయత్నించి దొరికిపో యారు. తన లేఖ వల్లే తెలంగాణ ఏర్పడిందని చంద్ర బాబు తెలంగాణకు వచ్చి చెబుతారు. ఏపీకి పోయి రాత్రికి రాత్రే అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని, దాన్ని తాము వ్యతిరేకించామని అమాయకంగా మాట్లాడతారు. కేసీఆర్ ఇవన్నీ తట్టుకున్నారు. అన్ని టికి నిబడ్డారు. ఓ వైపు చంద్రబాబు ఆగడాలను అడ్డుకుంటూనే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపుగా నడిపించారు. తెలంగాణ అభివృద్ధిని స్వయంగా చూసిన ప్రధాని మోదీ నిండు పార్లమెంటులో ‘రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చూస్తున్నా. కేసీఆర్, చంద్రబాబు గొడవలతో నా దగ్గరకు వచ్చే వాళ్లు. చంద్రబాబు నాయుడిది ఇప్పటికీ అదే ఏడుపు. కానీ కేసీఆర్ అభివృద్ధి మీద దృష్టిపెట్టారు. రాష్ట్రాన్ని అభి వృద్ధి చేసుకుంటున్నారు’ అని చెప్పారు. నిజానికి మోదీ మాకు రాజకీయ ప్రత్యర్ధి. అయినా కేసీఆర్ కార్యదక్షతకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇన్ని విజయాలు, ఇంత వేగవంతమైన అభి వృద్ధి చేసి చూపించారు గనుకనే కేసీఆర్ మరోసారి అవకాశం ఇవ్వండని ప్రజల్లోకి వచ్చారు. శాసన సభను రద్దు చేసిన వెంటనే 105 స్థానాలకు అభ్య ర్థులను ప్రకటించారు. వేగంగా జరుగుతున్న పరిణా మాలతో దిమ్మతిరిగిపోయిన ప్రతిపక్షపార్టీలు, తమ పరిస్థితి ఏమిటో, తక్షణ కర్తవ్యం ఏమిటో తెలియక ఆలోచనలో పడ్డాయి. అభ్యర్థుల ఎంపిక, అంతర్గత కలహాలు, కాంగ్రెస్ విషయంలో అయితే అధి ష్ఠానముద్ర– ఇన్ని సమస్యలతో అంపశయ్య మీదున్న పార్టీలన్నీ , ‘ఇప్పుడు ఎన్నికలు ఎందుకు’ అని అడుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువుదాకా సాగదీసి, కోట్లకు కోట్లు మూటగట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసే అలవాటున్న ఈ పార్టీల నేతలకు ముందస్తు ఎన్నికలు మింగుడు పడతలేదు. చంద్రబాబు నాయుడుకు మానం, అభిమానం లేవు. నీతి నియమాలంటే లెక్కేలేదు. ఎన్ని అడ్డదార్లు తొక్కి అయినా అధికారంలో ఉండాలనేది ఆయన ఫిలా సఫీ. పిల్లనిచ్చిన పాపానికి సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. సోదర రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలి. అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలనే ఆలోచనతో 10 ఏళ్లపాటు హైదరాబాద్లో ఉండనిద్దా మనుకుంటే ఆయన నమ్మక ద్రోహానికి ఒడిగట్టారు. నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో ఎన్ని అడ్డదార్లు తొక్కారో లెక్కే లేదు. ఇప్పుడు అధి కారం కోసం మరోసారి అపవిత్ర పొత్తులకు తెర తీస్తున్నారు. కాంగ్రెస్తో పెట్టుకొని ప్రజల్లోకి వస్తా రట. తెలంగాణ నీళ్లను ఎట్లా దారిమళ్లించుకొని తీసుకుపోదామని నిత్యం ఆలోచించే బాబుతో మన కాంగ్రెస్ వాజమ్మలు పొత్తుకు సిద్ధమయ్యారు. ఇలాంటి వాళ్లకా తెలంగాణ ప్రజలు ఓటు వేసేది? తెలంగాణలో టీడీపీ కూకటి వేళ్లతో కూలిపోయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వట వృక్షం తెలంగాణలో కూలిపోవటం ఖాయం. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు దుబ్బాక శాసన సభ్యులు 94403 80141 -
మా ఊరు పాలమూరు గావాలే
‘నిండిన చెరువుతో బతుకు మారిన పల్లె ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన దృశ్యం’పై ఓ జర్నలిస్టు మిత్రుడు పరిశోధనాత్మక గ్రంథం రాస్తున్నాడు. ఈ ఏడాది జూలై 12న పాలమూరు జిల్లా గ్రామాల పరిశీలనకు వెళ్తుంటే నేనూ తోడు వెళ్లాను. భీమా ప్రాజెక్టు గ్రామాల్లో తిరిగాం. భీమా ఫేజ్–1తో భూత్పూరు, సంగంబండ రెండు రిజర్వాయర్ల కింద మక్తల్, నర్వ, అమరచింత, మాగనూరు, కృష్ణా మండలాలకు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఫేజ్–2 కింద శంకరస ముద్రం, రంగసముద్రం, ఏనుకుంట రిజర్వాయర్ల కింద మరో లక్ష ఎకరాలు సాగులోకి వచ్చింది. ఏగిలువారక ముందే నర్వ మండలం లక్కెర్ దొడ్డి గ్రామం చేరినం. ఈ పల్లె మీదుగా యాంకీ వైపు వెళ్లాం. కంది, ఆముదం, వరి, మొక్కజొన్న చేలతో భూమికి రంగే సినట్లు పచ్చగా పరుచుకు న్నాయి. అమరచింత, నర్వ మండలాల్లో 25 గ్రామాలు తిరిగి చీకటి పడే వేళకు నర్వ గ్రామం వచ్చాం. ఇక్కడే నా జర్నలిస్టు మిత్రునికి ఓ బీడీ కార్మికురాలితో పరిచయం ఉంది. పేరు రాజేశ్వరి. ‘రాజేశ్వరి యవ్వనం అంతా బీడీలు చుట్టటంతోనే గడిచిపోయిందని, నెత్తురు సచ్చి, బొక్కలు తేలి, చావుకు దగ్గరైన మనిషని, ఇప్పుడు బతికి ఉందో లేదో’ అనే అనుమానం వ్యక్తంచేస్తూ మార్గమధ్యం లోనే చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్లాం. రాజేశ్వరి ఉంది. కానీ జర్నలిస్టు మిత్రుడు చెప్పిన ఛాయలు ఒక్కటీ ఆమెలో కనిపించలేదు. సంపూర్ణ ఆరో గ్యంగా ఉంది. రాజేశ్వరిని కదిలిస్తే‘ఇప్పుడు బీడీలు సుడతలేను. పోయిన ఏడాదే భీమా కాల్వ నీళ్లు ఒది లిండ్రు. సెర్లళ్లకు నీళ్లిడిసిండ్రు. ఎకరన్నర భూమి ఉంటే సాగు జేసుకున్నం. వడ్లు నాగుకు తెచ్చి మొలక అలికినం. తొలి ఏడాది 46 క్వింటాళ్ల దిగు బడి వచ్చింది. అప్పు సప్పులు పోనూ రూ. 36 వేలు మిగిలినయి. ఆసుపత్రికి పోతే టీబీ లేదన్నరు. తిండి బాగా తినమన్నరు. బలం మందులు రాసిండ్రు’ ఆమె చెప్పుకుంటూ పోతూనే ఉంది. కరువు జిల్లా పాలమూరు ప్రాజెక్టులు తెచ్చిన మార్పులు ఒక్కొక్కటి నెమరేసుకుంటుంటే నీటిపా రుదల శాఖ మంత్రి హరీశ్రావు కష్టం గుర్తొచ్చింది. 2015 అక్టోబర్ 1న నీటి పారుదల శాఖ అధికా రులతో మంత్రి హరీశ్రావు సమావేశం అయ్యారు. అనుకోకుండా ఆ సమావేశానికి నేనూ వెళ్లాను. పాల మూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల మీద సమీక్ష అది. ‘వచ్చే ఏడాది జూన్ నాటికి కృష్ణమ్మ జలాలు పంట పొలాలను తడపాలి.æమీకేం కావాలో చెప్పండి’ అని ఇంజనీర్లను అడిగారు. ఇంజనీర్లు గుక్కతిప్పుకో కుండా చిట్టా చదివారు. వేల కోట్ల ఖర్చు, పైగా అనుమతులు అంటే చిన్న మాటలా? ఆస్థానంలో మరో వ్యక్తి ఉంటే చేతులు ఎత్తేసేవాడే. కానీ హరీశ్ రావు ‘ఓకే డన్.. ఇక మీ పనుల్లో ఉండండి’ అని చెప్పాడు. ‘వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు జిల్లా రైతాంగానికి 5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అంది స్తాం’ అని ప్రకటన చేశారు. ఆయనతో కలిసి నేను ఉద్యమంలో పని చేసిన. పట్టుపడితే వదలడు. ఏదో ఒక మూల అనుమానం ఉన్నప్పటికీ కాళ్లకు చక్రాలు కట్టుకొని కాలచక్రంతో పోటీపడుతూ గిర్రున తిరు గుతూ కల్వకుర్తి, కోయిల్సాగర్, జూరాల, భీమా ప్రాజెక్టులను పూర్తి చేశారు. నిత్య ప్రయాణంతో అటు కాళే శ్వరానికి.. ఇటు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల మధ్య బాటపడ్డది. పెద్ద మేస్త్రీ అవతార మెత్తి ప్రాజెక్టుల వద్ద ఎన్ని నిద్రలేని రాత్రులు గడి పారో చెప్పటం కష్టం. ఎట్టకేలకు కల్వకుర్తి ఎత్తిపో తల ద్వారా 1.6 లక్షలు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షలు, భీమా ద్వారా 1.4 లక్షలు, కోయిల్ సాగర్ కింద 8 వేల ఎకరాల కొత్త ఆయకట్టుతో చెప్పినట్టు గానే 5 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు.2017–18లో ఈ విస్తీర్ణం 6.5 లక్షలకు పెరిగింది. జూరాల కింద ఆయకట్టుతో కలిపితే అది 7.5 లక్ష లకు చేరింది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునః నిర్మాణం చేసి నది నీళ్లతో నింపితే ఇంకో 2.68 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది.పాలమూరు పల్లెల్లో ఇంతకాలం కరువెందుకు రాజ్యమేలింది? కళ్ల ముందు నీళ్లున్నా... కంటి నిండా నీళ్లతో వలసెందుకు పోయిండ్రు? పనిగట్టుకొని పాలమూరును ఎండబెట్టింది ఎవడు’? ఇలా ఎన్నోప్రశ్నలు,ఇంకెన్నో ఆలోచనలు మెదడును మెలిపెడు తుంటే చీకట్లోనే తిరుగుబాట పట్టాం. పొలంలో పొద్దంతా కాయకష్టం చేసుకొని ఇంటికి చేరిన పల్లె జనం రేపటి సూర్యోదయం కోసం మెల్లగా నులక మంచాల మీద వాలిపోతున్నారు. మా కారు వేగం అందుకుంది... మల్లన్న సాగర్ నీళ్లతో రేపటి మా దుబ్బాక పల్లెల్లో కూడా కాల్వ కింది భూములు, ధాన్యం రాశుల మీద ఓ పుస్తకం రాయగలననే భరోసాతో... సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే ‘ 94403 80141 -
వాళ్లను విధ్వంసకర శక్తులుగానే హైదరాబాద్ చూస్తుంది
రాముని మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అయితేనేమి, ‘ధర్మాగ్రహ యాత్ర’ పేరుతో మత వైషమ్యాలకు పురిగొల్పే ఆధ్యాత్మిక గురువు అయితేనేమి, వాళ్లను హైదరాబాద్ నగరం విధ్వంసకర శక్తులుగానే చూస్తుంది. విశ్వనగరంలో మతం చిచ్చుపెట్టే వాళ్లను ఉపేక్షించేది లేదని కేసీఆర్ మరోసారి రుజువు చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోయింది. కేసీఆర్ ఆది నుంచి సనాతన ధార్మికుడు. ఆధ్యాత్మిక ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని, అవి తెలంగాణ సౌభాగ్యానికి పాటుపడాలని కోరుకునే నాయకుడు ఆయన. నేడు ప్రశాంత హైదరాబాద్ మహానగరంగా మరోసారి నిలబడింది. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాదులు, సమస్త శాస్త్రాలు మను షుల్ని చీకటి నుంచి వెలుతురు వైపు నడిపించాలి. శాస్త్ర విజ్ఞానం పెరిగి ఆకాశం ఆవలి దిక్కు గుట్టు విప్పుతున్న వేళ అంధ విశ్వాస్వాలు చెలరేగి మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తున్నాయి. మత విశ్వాసాల పేరుతో హత్యలకు, దాడు లకు, ధర్నాలకు, బంద్లకు పూనుకో వటం ఎంత దౌర్భాగ్యం.lభారత జను లది వైవిధ్యభరిత జీవన విధానం. ఆసేతు హిమాచల భారతావ నిలో భిన్న జాతులు, విభిన్న భాషలు, భావోద్వేగాలు, సంస్కృ తులు, ఆచారాలు, అవసరాలు ఉంటాయి. ఇంతటి జీవన వైవి« ద్యం ప్రపంచంలో మరే దేశంలో కన్పించదు. ఈ దేశంపై బయటి వారి దండయాత్రలు, అంతర్యుద్ధాలు శతాబ్దాల ఏలుబడిలో ఎక్కడి ఆచారాలు అక్కడ స్థిరపడిపోయాయి. అందుకే మతాలు, సంస్కృతులమధ్య అంతరాలు అనుబంధాలు ఏర్పడ్డాయి. భిన్న త్వంలో ఏకత్వమే లౌకిక భారత బలం. రోజు రోజుకు దేశంలో మత అసహనం పెరిగిపోతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను.‘మీ ఇంట్లో మీ ఆడవాళ్ళ ముఖాన బొట్టు, మెడలో మంగళసూత్రం, నల్లపూసల గొలుసు, కాళ్లకు మెట్టెలు... ఇవి అన్ని ఓ మతంలో భాగమే... ఆ మతాన్ని గురించి మాట్లాడకపోతే మీరు ఇంట్లో మీ ఆడవాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రాలు, నల్లపూసలు, బొట్టు, మెట్టెలు తీసేయండి’ అని పోస్టులు పెట్టారు. మతం అనేది ఒక విశ్వాసం. ఎవరి విశ్వాసాలు వాళ్లకు, ఎవరి నమ్మకాలు వాళ్లకు ఉంటాయి. మతోన్మాద శక్తులు మతం అంటే జీవన విధానం అనే దగుల్భాజీ మాటలను తెర మీదకు తెచ్చారు. వీళ్లే దేశంలో ప్రజలు ఏం తినాలో, ఏం తాగా లనే ఆహారపు అలవాట్లను నిర్దేశిస్తున్నారు. కట్టు, బొట్టు లాంటి సంస్కృతి, సాంప్రదాయాలను, నియంత్రించేందుకు భౌతిక దాడులకు దిగుతున్నారు. గోరక్షణ పేరుతో మనుషులను పాశవి కంగా చంపేస్తున్నారు. అది తప్పు అన్న బుద్ధి జీవులను నిర్ధాక్షి ణ్యంగా చంపించేస్తున్నారు. 2015 ఫిబ్రవరి 16న మహారాష్ట్ర వామపక్షవాది గోవింద్ పన్సారేను హత్య చేశారు. అదే ఏడాది ఆగస్టు 30న కన్నడ సాహితీవేత్త ఎంఎం కాల్బుర్గి(77)ని, 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన ఇంటి ఆవరణలో సీనియర్ జర్నలిస్ట్ గౌరీలంకేశ్(55)ను దుండగులు కాల్చి చంపారు. ఈ ముఠా హిట్ లిస్ట్లో జ్ఞానపీఠ్ గ్రహీత గిరీశ్ కర్నాడ్, కన్నడ రచ యిత ప్రొఫెసర్ కెఎస్ భగవాన్, సాహితీవేత్త బిటి లలితా నాయక్, నిడు మామిడి మఠం స్వామీజీ వీరభద్ర చెన్నమళ్లస్వామి, హేతు వాది సీఎస్ ద్వారకానాథ్ ఉన్నట్టు బయటపడింది. తెలంగాణ సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరి త్రను కలిగిన ప్రాంతం.. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన హిందూ రాజులు, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ రాజ వంశాలకు చెందిన ముస్లిం పాలకులు పాలించారు. భారత ఉప ఖండంలో మొట్టమొదటి సంస్కృతి కేంద్రంగా ఈ ప్రాంతం ఆవి ర్భవించింది. కళలు, సంస్కృతులపై ఆసక్తికలిగిన అప్పటి, ఇప్పటి పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక బహుళ సాంస్కృ తిక ప్రాంతంగా మార్చారు. ఇక్కడ రెండు వేర్వేరు సంస్కృతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. బోనాలు, బతుకమ్మ, దసరా, ఉగాది, సంక్రాంతి, మీలాద్–ఉన్–నబి, రంజాన్ వంటి మతపరమైన పండుగలు, డెక్కన్ ఫెస్టివల్ వంటి ఇతర వేడుక లను కూడా జరుపుకుంటారు. విభిన్న భాషలు, సంస్కృతులకు తెలంగాణ రాష్ట్రం చాలాకాలం నుండి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ‘దక్షిణానికి ఉత్తరం. ఉత్తరానికి దక్షిణం’గా, ‘గంగా– యమున తెహజీబ్’గా పిలవబడుతున్న తెలంగాణ రాష్ట్ర రాజ ధాని హైదరాబాద్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన నగరం. హిందూ, ముస్లిం, సిక్కు, పార్శి, మరాఠి సర్వ జనుల సంగమ విశ్వనగరం ఇది. రాముని మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అయితేనేమి , ‘ధర్మాగ్రహ యాత్ర’ పేరుతో మత వైషమ్యా లకు పురిగొల్పేlఆధ్యాత్మిక గురువు అయితేనేమి, వాళ్లను హైదరా బాద్ నగరం విధ్వంసకర శక్తులుగానే చూస్తుంది. విశ్వనగరంలో మతం చిచ్చుపెట్టే వాళ్లను ఉపేక్షించేది లేదని కేసీఆర్ మరోసారి రుజువు చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోయింది. కేసీఆర్ ఆది నుంచి సనాతన ధార్మికుడు. ఆధ్యాత్మిక ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని, అది తెలంగాణ సౌభాగ్యానికి పాటుపడాలని కోరు కునే నాయకుడు ఆయన. రాజ్యం బాగుండాల, రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలనే ఆకాంక్షతో దేశవ్యాప్తంగా ఉన్న 1221 మంది పండితులను పిలిచి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో అయుత చండీమహాయాగం చేశారు. ఈ క్రతువులో 20 లక్షల మందికి పైగా ప్రజలు భాగస్వాములు అయ్యారు. శిధిలావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను పునః నిర్మాణం చేసి పూర్వ వైభవం తెచ్చారు. సర్వ మతాల ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ఎన్నో మజీదులను, చర్చిలను పునః నిర్మాణం చేశారు. ఇక్కడో ఉదాహరణ. మీర్ ఉస్మాన్ అలీఖాన్కు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక సేనను తయారు చేసుకోవాల్సి వచ్చింది. అది తయారుచేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, అత్యాచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీయే ఐనా అందుకు తన పోలీసులతో, పాలనతో ప్రోత్సహించినవారు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆ బలమే లేకపోతే హైదరాబాద్ నగరంలో షోయ బుల్లాఖాన్ వంటి పత్రికా సంపాదకుణ్ని బర్కత్పురాలో రజాకార్లు చంపగలిగేవాళ్లు కాదు. రజాకార్లు విద్వేషాలు రెచ్చగొట్టారనేది స్పష్టం. నిజాం వాళ్ళను పెంచి పోషించాడన్నదీ çసుస్పష్టం. దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణలో భీంరెడ్డి నర్సింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి యువ నేతలు ఆయుధాలు పట్టాల్సి వచ్చింది. అదే తెలం గాణ సాయుధ పోరాటం అయింది. నిజాం చివరి రోజుల్లో తీసు కున్న ఈ నిర్ణయం 400 ఏళ్ల అద్భుత పరిపాలనకు మాయని మచ్చను తీసుకొచ్చింది. ‘రాజ్యాంగమెంత మంచిదైనా పాలకులు మంచివారు కాకపోతే అది చెడుగా మారుతుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా పాలకులు మంచివారైతే మంచిదిగా మారు తుంది’ అని రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడు డా‘‘ అంబేడ్కర్ చేసిన హెచ్చరిక ఎప్పటికీ పాలకులను అప్రమత్తులను చేస్తూనే ఉంది. ఆ అప్రమత్తత నుంచి పుట్టిన ఆలోచనే కేసీఆర్ తీసుకున్న కఠిన నిర్ణయం. నేడు ప్రశాంత హైదరాబాద్ మహానగరంగా మరోసారి నిలబడింది. వారం రోజులుగా నగరంలో జరుగుతున్న సంఘటనల పట్ల కేసీఆర్ నిర్ణయాన్ని సకల మతాలు, సబ్బండ జాతులు స్వాగతిస్తున్నాయి. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు మొబైల్ : 94403 80141 -
రైతుబంధుతో ప్రతిపక్షాలకు బొంద: సోలిపేట
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 8 వేలు ఇస్తున్న రైతుబంధు పథకంతో ప్రతిపక్షాలను రైతులే బొంద పెట్టడం తప్పదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ రైతులను గత పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. రైతులకు సాగునీరు, సాగుకు పెట్టుబడి, గిట్టుబాటు ధర వరకూ అన్ని సమస్యలను పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా, రైతు బాంధవునిగా పనిచేస్తున్నారని అన్నారు. రైతుబంధు వద్దని ప్రతిపక్షనేతలు అనగలరా అని ప్రశ్నించారు. -
కేంద్రం దాష్టీకం ఇంకానా?
సందర్భం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఎన్నో అంశాలు, విధానాలు ఇన్నాళ్లూ సువిశాల భారతావనిలో స్వైరవిహారం చేశాయి. అధికారాల వికేంద్రీకరణపై కేసీఆర్ భావన దేశంలోని పలురాష్టాలకు స్ఫూర్తినిస్తోంది. భారత ప్రజలది వైవిధ్యభరిత జీవన విధానం. అనువంశి కంగా అబ్బిన అద్భుతమైన సామాజిక నైపుణ్యాలే భరత మాతకు మణిహారాలు... ఆసేతు హిమాచల భారతావ నిలో భిన్న జాతులు, విభిన్న భాషలు, భావోద్వేగాలు, సంస్కృతులు, ఆచారాలు, అవ సరాలు ఉంటాయి. ఈ దేశం బయటివారి దండయా త్రలు, అంతర్యుద్ధాలు, శతాబ్దాల ఏలుబడిలో రాజులు, రాజ్యాలు, సామంత రాజులతో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తమ తమ భాషలు, యాసలు, సాహిత్య సౌర భాలతో సంపూర్ణం అయ్యాయి. ఎక్కడి ఆచారాలు అక్కడ స్థిరపడిపోయాయి. అందుకే మతాలు, సంస్కృ తుల మధ్య అంతరాలే కాకుండా, రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని ప్రాంతాల మధ్య వైవిధ్యం ఉంటుంది. అనేక వైవిధ్యాలు, అంతకుమించిన వైరుధ్యాలు, అవస రాలు ఉన్న భారతావనిని గుడ్డెద్దు చేలో పడ్డట్టు కేంద్రీ కరణ సిద్ధాంతంతో ఒకే పంథాలో పాలించాలనుకో వటం పౌరుల హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. 70 ఏళ్ల ఏలుబడిలో జాతీయ పార్టీలు ఢిల్లీ అధికా రాలను గుప్పిట్లో పెట్టుకున్నాయి. మన పిల్లలు లక్షల్లో అమెరికాకు, బయటి దేశాలకు వలస పోతున్నారు. మౌలిక వసతులు, యువశక్తి మన కంటే తక్కువగా ఉన్న అమెరికా శరవేగంగాæఅభివృద్ధి చెందటానికి కార ణం ఏమిటీ? అక్కడి రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఉంటుంది. ఎవరి జీడీపీ వాళ్లకు ఉంటుంది. అమెరికా తరహాలోనే మన దగ్గర కూడా ఢిల్లీ పీఠం నుంచి రాష్ట్రాలకు రాజకీయ అధికార వికేంద్రీకరణ జరగాలి. అమెరికాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నట్టు భారతదేశాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా గుర్తించాలనేదే కేసీఆర్ ఆలో చన. వికేంద్రీకరణ జరగాలంటే ఈ జాతీయ పార్టీలు చేయవు. వచ్చే ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు అఖండ మెజార్టీ సంపాదించి, వారిలోవారు సయోధ్య సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. పార్లమెంటులో బిల్లు పెట్టి రాజ్యాంగాన్ని ఫెడరల్ సిస్టంలోకి మార్చాలి. రాష్ట్రాలకు తగినంత స్వాతంత్య్రాన్ని కల్పించాలి. పర స్పర పోటీలతో రాష్ట్రాలు తమతమ వనరులు పూర్తిగా ఉపయోగించుకొని స్వయం సమృద్ధి సాధించాలి. పాలనాపరమైన కీలక అధికారాలన్నీ ఢిల్లీ చేతిలో కేంద్రీకృతం కావటం వలన రాష్ట్రాల్లో అభివృద్ధి జరగటం లేదని ప్రధాని మోదీకి కూడా తెలుసు. 2014 ఎన్నికల్లో మోదీ గుజరాత్ అభివృద్ధిని ఉదాహరణగా చూపిస్తూ రాష్ట్రాలకు విస్తృతమైన అధికారాలు ఉండాలని చెప్తూ ఓట్లు అడిగారు. తీరా గద్దె మీద కూర్చున్న తరువాత రాష్ట్రాలకు అధికారాలను అందిస్తే తమ పెత్తనం ఎక్కడ చేజారిపోతుందోననే భయంతో ప్రజలను మభ్యపెడుతు న్నారు. స్థానిక వనరుల వెలికితీత, వినియోగాన్ని బట్టి అభివృద్ధి జరుగుతుంది. సైన్యం, దేశ రక్షణ, అంతర్జా తీయ వ్యవహారాలు, కరెన్సీ, జాతీయ రహదారులు తదితర జాతీయ విధానాలు కేంద్రం అధీనంలోనే ఉండాలి. ప్రజలను నేరుగా ప్రభావితం చేసే విద్య, వైద్యం, రోడ్లు, రవాణా, తాగు, సాగునీరు... తదితర అంశాలతో సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేసుకునే అధికారాన్ని పూర్తిస్థా యిలో రాష్ట్రాలకు అప్పగించాలి. 85 శాతం దళిత గిరిజనులు, ముస్లిం, బీసీ సామాజిక వర్గాలు ఉన్న తెలం గాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని చెప్పటం ఎలా న్యాయం అవు తుంది? ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఎన్నో అంశాలు, విధానాలు ఇన్నాళ్లూ సువిశాల భారతావనిలో స్వైరవిహారం చేశాయి. ఇన్నాళ్లకు కేసీఆర్ ఫెడరల్ పేరుతో మౌలిక మార్పుకు ప్రయత్నాలను ప్రారంభిం చారు. దేశంలోని పలు రాష్ట్రాల అవసరాలు కూడా దీనికి ఆసరా కాబోతున్నాయి. ఏపీ పునర్ విభజన చట్టం మేరకు ఆ రాష్ట్రానికి హోదా ఇవ్వాలని వైఎస్సార్ సీపీ అధినేత పట్టుబడుతున్నారు. ఏకంగా మోదీ ప్రభు త్వంపై అవిశ్వాసం పెట్టారు. ప్యాకేజీ అంటూ పాట పాడిన ఆంధ్ర సీఎం బాబు కూడా వైఎస్ జగన్ని అను సరించాల్సి వస్తోంది. కావేరీ జలాల పంపిణీ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనందుకు తమిళనాడు కేంద్రం మీద మండిపడుతున్నది. కలకత్తా మెట్రో రైలు మార్గం విస్తరణ ప్రాజెక్టు నిధులు సహా, పశ్చిమ బెంగాల్కు ఇవ్వవలసిన చాలా నిధులను కేంద్రం విడుదల చేయ డం లేదని ఆ రాష్ట్ర నాయకత్వం ఆరోపణ.. ఇలా.. ఏ రాష్ట్రం వ్యథలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నప్పుడు తామే ప్రత్యా మ్నాయమని ఎవరైతే ప్రజలను మెప్పించగలరో వారే విజేతలు. 1967 నుంచి 2014 వరకు వెలువడిన ఎన్ని కల ఫలితాలు ఈ అంశాన్నే చెప్తున్నాయి. అవకాశ వాద రాజకీయాలకంటే ప్రత్యామ్నాయ రాజకీయాలకే ప్రజల ఆశీస్సులు ఉంటాయి. కొద్ది మంది వ్యక్తులైనా నిఖార్సైన ప్రత్యామ్నాయ విధానాలను ప్రజలకు వివరిస్తూ, వారిని చైతన్యవంతం చేయగలిగితే అవకాశవాద జాతీయ పార్టీ లను మట్టి కరిపించటం పెద్ద కష్టమేమీ కాదు. ఇందులో ఒంటి చేత్తో తెలంగాణ సాధించి, సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ సాధించిన ఘన విజయం ఒక తిరుగులేని ఉదా హరణ. పట్టుదల, నిరంతర శ్రమ, నిజాయితీతో క్షేత్ర స్థాయిలో పనిచేస్తే అది గుజరాత్ అయినా, తెలంగాణ అయినా ప్రజలు తప్పక ఆదరిస్తారు. - సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే మొబైల్ : 94403 80141 -
అసెంబ్లీలో రోడ్ల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల అంశం అసెంబ్లీని కుదిపేసింది. ప్రభుత్వ తీరుపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. గురువారం అసెంబ్లీలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు బీటీ పునరుద్ధరణపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రశ్న వేశారు. ఈ అంశంపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని రోడ్ల పరిస్థితిని వివరిస్తూ వాపోయారు. ప్రజలు తిట్టకుండా వెళ్లడం లేదు: రామలింగారెడ్డి అధికారుల తప్పుడు నివేదికల వల్ల దుబ్బాకలోని పలు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ‘సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్కు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఆ రోడ్డు మీదుగా వెళ్లే వారు తిట్టకుండా వెళ్లడం లేదు. ఇదే రహదారిని ముస్తాబాద్ నుంచి అవతలి వరకు బాగా చేశారు. రోడ్లను మరమ్మతు చేయకుండానే చేసినట్లు నివేదికలు రూపొందించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. కొన్ని రోడ్లలో నడుము లోతు గుంతలు ఏర్పడ్డాయి. ఆ రోడ్డుపైనే మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లొస్తుంటారు. ఆయనకు పరిస్థితి తెలుసు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పరిస్థితి మారడం లేదు. పంచాయతీరాజ్ మంత్రికి వివరించినా ఫలితం లేదు. ముస్తాబాద్ రోడ్డును గత పదేళ్లలో ఒక్కసారి మరమ్మతు చేసినట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తా’అన్నారు. వాస్తవాలను పట్టించుకుని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిధుల్లేవంటున్నారు: భాస్కర్రావు ఇదే అంశంపై మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడారు. తన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాలేదన్నారు. ‘పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల మంత్రులను అడిగితే నిధుల్లేవంటున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినందుకో ఏమోగానీ మా నియోజకవర్గంలోని రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’అని వాపోయారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ మాట్లాడుతూ.. ‘అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలు సరిగా ఉండటం లేదు. అందుకే మరమ్మతు పనులు జరగడం లేదు’ అన్నారు. సగానికే ఆగిపోతున్నాయి: రమేశ్ అధికారులు నివేదికలు సరిగా రూపొందించకపోవడం వల్ల కొన్ని రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ చెప్పారు. ‘వర్ధన్నపేట నియోజకవర్గంలోని సింగారం వంటి రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. రెండు గ్రామాల మధ్య రోడ్డు దూరాన్ని సరిగా లెక్కగట్టక మధ్య వరకే బీటీ ఆగిపోతోంది. అక్కడ గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’అన్నారు. అసెంబ్లీలో దాదాపు 15 మంది తమ నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిని చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ చేతులు ఎత్తారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి జోక్యం చేసుకుని.. ‘ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇదే సమస్యను ప్రస్తావిస్తున్నారు. దీనిపై చర్చ జరిగితే మంచిది. అందరి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంత్రి సమాధానం ఇవ్వాలి’ అన్నారు. 358 గ్రామాలకు రోడ్లు లేవు: జూపల్లి తెలంగాణ ఏర్పడిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రోడ్ల అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు పడిగాపులు కాయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. 2004–2014 మధ్య బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.416 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.2,240 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. 14 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతు చేశామని.. 2,925 కిలోమీటర్ల రోడ్లను విస్తరించామన్నారు. మరో 4,695 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 358 పంచాయతీలకు బీటీ రోడ్లు లేవని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరాలకు తగినట్లు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
గో‘దారి’ మళ్లితే.. గొడవే
సందర్భం రాష్ట్రాల అభ్యర్థనలను లెక్కించకుండా మొండిగా నదులను అనుసంధానం చేసి తెలంగాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. తెలంగాణ ఉద్యమం బలంగా పల్లెల్లోకి చొచ్చుకుపోవటానికి, విస్తరించటానికి, బలపడటా నికి నీళ్లే కారణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం. రైతులు, కూలీలు, కులవృ త్తులు, చేతి వృత్తులు, సబ్బండ జాతులు అంతా కలిస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవు తుంది. ఈ వ్యవస్థకు మూలం వ్యవసాయం. నీళ్లుంటేనే పల్లె పచ్చగా ఉంటుంది. నీళ్ల విలువేంటో తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో యేటా 25 వేల కోట్ల నిధులు ప్రాజెక్టులకు కేటాయించి కోటి ఎకరాల మాగా ణికి జీవం పోసే దిశగా వడివడిగా అడుగులు వేస్తు న్నారు. గోదావరిలో మనకొచ్చే 954 టీఎంసీల వాటా లో ఒక్క చుక్క వృథాగా పోకుండా జల ప్రాజెక్టులకు రూపం ఇచ్చారు. ఇప్పుడు నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను బలవంతంగా తీసుకపోయి కృష్ణా, కావేరిలోకి మళ్లించి దిగువ రాష్ట్రాల్లో ఓట్ల సాగుకు మోదీ సర్కారు తహతహలాడుతున్నట్లుంది కృష్ణా నదిలో 79 శాతం పరీవాహక ప్రాంతం తెలం గాణలోనే ఉంది. అంటే ముప్పావు వంతు జలాల వాటా తెలంగాణకు దక్కాలే. కృష్ణానది నీటి లభ్యత 811 టీఎంసీలు. ఈ లెక్కన కనీసం 600 టీఎంసీలు తెలం గాణకు రావాలే. కానీ అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం తెలంగాణకు 161 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వాటాను 111కు కుదించింది. పోయిన నీళ్లు ఎలాగు పోయాయి, కనీసం ఉన్న గోదా వరి జలాలనైనా పోతం చేసుకుందామంటే కేంద్రం తెర మీదకు తెచ్చిన నదుల అనుసంధానంతో మళ్లీ తెలంగా ణను ఎండబెట్టేటట్టే కనబడుతోంది. ఒడిశా రాష్ట్రంలోని మహానదిలో 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీలు మొత్తం కలసి 890 టీఎం సీల మిగులు జలాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం లెక్కలు చెప్తోంది. మహానదిని గోదావరితో కలసి, గోదా వరిని కృష్ణానది మీదుగా కర్ణాటక, తమిళనాడు సరి హద్దుల్లో ఉన్న కావేరి నదికి అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉండగా.. నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం కలిపి 684 టీఎంసీల జలాలే వాడు కుంటున్నారని, మిగిలిన 270 టీఎంసీల నీళ్లు మిగులు జలాలే అని చెప్తోంది. ఇవి అన్యాయమైన లెక్కలని జలరంగ నిపుణులు దివంగత విద్యాసాగర్రావు బతికి ఉన్నంతకాలం నెత్తి నోరు బాదుకున్నారు. ఇప్పుడు గోదావరి మీద కాళే శ్వరం, కంతనపల్లి, తుపాకుల గూడెం, దుమ్ము గూడెం, దేవాదుల ప్రాజెక్టులు రూపం పోసుకుంటున్నాయి. పాత ప్రాజెక్టులు ఉండనే ఉన్నాయి. ఏ నది జలాలైనా ప్రస్తుత, కనీస భవిష్యత్తు పరీవాహక ప్రాంత అవస రాలను తీర్చాలి. అంటే మరో 30 ఏళ్ల నాటికి పెరగ నున్న జనాభా, వారికి అవసరమైన నీటి పరిమాణాన్ని నిర్థారించి లెక్కగట్టాలి. ఆ తరువాతే మిగులు జలాలను గుర్తించాలి. కానీ కేంద్రం మాత్రం 20 ఏళ్ల కిందట 75 శాతం నీటి లభ్యతతో తీసిన లెక్కలు చెప్తోంది. ఆ లెక్కలు ఇప్పటి నీటి లభ్యతతో ఎలా సరిపోలుతాయి? భవిష్యత్తు అవసరాలపై కేసీఆర్ ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక ఉంది. నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టు కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలు మనకు అవసరపడుతాయి. మరో వైపు మహానదిలో అసలు మిగులు జలాలే లేవు అని ఒడిశా ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకో కుండా మొండిగా నదులను అనుసంధానం చే సి తెలం గాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజా నీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. నదుల అనుసంధానం అనేది ఇప్పటి ముచ్చటేం కాదు. 1960లో 4,200 కిలోమీటర్ల పొడవైన హిమా లయ ప్రాంత కాల్వలను, 9,300 కిలోమీటర్ల పొడవైన దక్షిణ ప్రాంత కాల్వలను ఢిల్లీ–పట్నాల వద్ద కలపాలని కెప్టెన్ దస్తూన్ తొలిసారి ప్రతిపాదించారు. ఆ తరువాత 1972లో అప్పటి కేంద్ర మంత్రి, ఇంజనీరు కేఎల్రావు కావేరి–గంగా నదుల ప్రతిపాదన చేశారు. సోన్, నర్మద, పెన్ గంగ, ప్రాణహిత, గోదావరి, కృష్ణా నదుల మీదుగా కావేరి నదితో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ రెండు కూడా ఆచరణ సాధ్యం కాదని అప్పట్లోనే కేంద్రం తేల్చి చెప్పింది. నాటినుంచి నదుల అనుసంధాన ప్రతిపాదనపై చర్చ జరుగుతూనే ఉంది. అనుకూల వర్గం కంటే వ్యతిరేక వర్గమే ఎక్కువగా ఉండ టంతో ప్రభుత్వాలు ఈ ప్రక్రియను పక్కన పెట్టాయి. పశ్చిమ కనుమల్లో వర్ష ప్రభావం ఎక్కువ. అక్కడ స్థిరమైన వర్షపాతం ఉంది. అంతా గుట్టలు, లోయలతో కూడిన ప్రాంతం కాబట్టి వ్యవసాయ భూమి, నివాస ప్రాంతాలు కూడా తక్కువే. ఏటా వందల కోట్ల క్యూసె క్కుల జలరాశులు వచ్చి చేరుతున్నాయి. ఇందులో 90 శాతం నీళ్లు పశ్చిమంగా ప్రవహించి వృథాగా అరేబియా మహా సముద్రంలో కలుస్తున్నాయి. కేంద్రం ముందుగా ఈ జలాల వినియోగంపై దృష్టి పెట్టాలి. వీటిలో పావు వంతు నీళ్లను ఒడిసిపట్టుకుని, తూర్పు దిశగా తీసుకు వచ్చి మహానదిలోకి మళ్లిస్తే ఆ జలాలు గోదావరి, కృష్ణాల మీదుగా కావేరి నదిని తడుతాయి. అప్పుడు నాలుగు నదులేమిటీ? దక్షిణ భారతంలోని నదులన్నిం టినీ అనుసంధానం చేయవచ్చు. మోదీ అటు దిశగా ఆలోచన చేయకుండా గోదావరిని కృష్ణా, కావేరితో అను సంధానం చేస్తానంటే మాత్రం తెలంగాణ ప్రజలు మరో మహా ఉద్యమానికి సమాయత్తం అవుతారు. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త దుబ్బాక శాసనసభ్యులు మొబైల్ : 94403 80141 -
జలసిరిలో తెలంగాణ మాగాణం
అభిప్రాయం తాగునీరు, సాగునీరు కోసం తెలంగాణం దశాబ్దాలుగా పెట్టిన గోసకు కేసీఆర్ ఇప్పుడు చరమగీతం పాడుతున్నారు. పల్లెల్లో నీళ్ల కష్టాలు చెల్లిపోతున్నాయి కాబట్టే నీళ్లపై పాడిన అజరామర పాటలు ప్రజల జ్ఞాపకాల్లోంచి కనుమరుగు కానున్నాయి. భాషకు సాహిత్యమే సర్వస్వం కాకపోవచ్చు... కానీ తెలంగాణ భాష, యాసలకు సాహిత్యం తోనే నిండుదనం. ప్రజల గోసే తెలంగాణ సాహిత్యం. కష్టమొచ్చినా.. కన్నీరొలికినా పాటందుకుంటరు. పంట పండినా పాటే.. ఎండినా పాటే. పూట పూటకు పాటపాడి, పాటతోనే పూటెళ్ల దీస్తరు. ఇక్కడ ఆరని దుఃఖం ఉంది. బూరుగు గడ్డిల బురుక పిట్ట ఎగిరినట్టు... గోగు పువ్వు గొంతుల రాగం ఊరినట్టు ఊరి ఊరికో పాట వినిపిస్తది. ప్రాచీన కవుల నుంచి ఇప్పటి ప్రజా కవుల వరకు కష్టాలు, చెమట చుక్కల నేపథ్యమే కథా వస్తువులు. ప్రజా సాహిత్యానిదే ఆధిపత్యం. పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన రచనల్లో శ్రమైక జీవనే కనిపిస్తుంది. ‘తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో... తడిగొంతులారిపోయో తుమ్మెదాలో రాకరాక నల్లల్లొస్తే ఒక్క బిందే నిండదాయో... కుండలెనుకా కుండలాయో కోసు పొడుగు లైనులాయే తుమ్మెదాలో’ ఇది ప్రజా గాయని బెల్లి లలిత నరహంతకుడు నయీం చేతిలో దారుణహత్యకు గురి కావటానికంటే ముందు మా దుబ్బాకలో చివరిసారిగా ఆలపించిన పాట. రెండు దశాబ్దాల పాటు ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్న పాట అది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కూడా ఆ పాట సజీవమే. కానీ ఇప్పుడా పాట మెల్లగా ప్రజల మధ్యలోంచి వెళ్లిపోతోంది. నేను అధికారి పార్టీ ఎమ్మెల్యేను అని చెప్పటం కాదు పల్లెల్లో నీళ్ల కష్టాలు చెల్లిపోతున్నాయి. మిషన్ భగీరథ ఎండిన ప్రతి గొంతును తుడుపుతోంది. పాలమూరు, కాళేశ్వరం నీళ్లు ప్రతి ఎకరంలో పారబోతున్నాయి. తల్లి గోదారై వచ్చి పొక్కిలైన ప్రతి ఇంటి లోగిల్లో కల్లాపి జల్లుతోంది. నీళ్ల కష్టం తీరినప్పుడు ఆ పాట క్రమంలో ప్రజల్లోంచి వెళ్లిపోయి కాలగర్భంలో ఒదిగిపోతుంది. మా దుబ్బాక ప్రాంతానికి కూడెళ్లి వాగే పెద్ద నది. వాగు పొంగి ప్రవహిస్తే..మా పంటలను ముంచకుంటే చాలు అనుకునే వాళ్లం. కానీ ఆ నీళ్లకు అడ్డంపడి మలుపుకోవాలన్న సోయే మాకు లేకుండే. మా నీళ్లన్నీ అప్పర్ మానేరు మీదుగా గోదావరిలో కలిసేవి. కేసీఆర్ దుబ్బాక పాఠశాలలోనే చదువుకున్నాడు. కూడెళ్లి వాగులో ఈత కొట్టిండు. అప్పటి నుంచే ఆయనకు ఈ వాగు నీళ్ల మీద ఆలోచన ఉండేది. నేను జర్నలిస్టుగా పని చేస్తున్న కాలంలోనే ‘రామలింగారెడ్డి కూడెళ్లి నీళ్లు ఎటు పోతున్నయో ఎందుకు రాయవయ్యా’ అని అడిగేవారు. వెళ్లిపోయిన కూడెళ్లి నీళ్లనే కాదు... గోదావరి నీళ్లనే మళ్లించి ఇప్పుడు రైతన్నల పాదాలు కడుగుతున్నారు. ఇప్పటికే తపాస్పల్లి నిండి కొండపాక పల్లెలను తడిపింది. వచ్చే జూన్ మాసం నాటికి తెలంగాణ మాగాణం అంతా తడుస్తుంది. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల మీద కూడా పదుల సంఖ్యలో పాటలు వచ్చాయి. కాంగ్రెస్ వాళ్లు పని గట్టుకొని ఆ పాటలు రాయిస్తున్నారు. ఏ వేదిక మీదకు వచ్చినా మల్లన్న సాగర్ ప్రస్తావనే తీసుకు వస్తున్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్లు మల్లన్న సాగర్ మీద 300 కేసులు వేశారు. 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటని అంటున్నారు. ఇక నన్నైతే సాగర్లోనే ముంచాలని చూస్తున్నారు. అయినా నేను దాన్ని తప్పుబట్టను. ఎందుకంటే ప్రశ్నించటం.. ఎదురించటం అనేది తెలంగాణ ప్రజా సాహిత్యంలో అంతర్భాగమే. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కడుతున్న తొగుట మండలానికి భౌగోళికంగా ప్రాధాన్యం ఉన్నది. నైసర్గికంగా ఎత్తయిన ప్రదేశంలో ఉండటం. గోదావరి, కృష్ణానది బేసిన్ల పరీవాహక ప్రాంతాల మధ్యగల ప్రదేశం ఇది. ఇక్కడ +557మీ వద్ద నీటిని నిల్వ చేస్తే అక్కడి నుంచి సొంత ఆయకట్టు 1.25 లక్షల ఎకరాలతో పాటుగా, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఎగువకు నీటి సరఫరా చేయడంతో పాటుగా, చుట్టూ అన్నీ వైపులనున్న స్కీంలకు నీటిని అందించి ఆదుకోవచ్చు. భవిష్యత్తు అవసరాలపై కేసీఆర్ ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక ఉంది. నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టు కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలు వాడుకునే విధంగా కేసీఆర్ వ్యూహ రచన చేశారు. కృష్ణా నదిపై కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతలకు ఒక రూపం వస్తోంది. సాగునీటి మంత్రి హరీశ్రావు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరు జిల్లా లో రోజుకు 1600 క్యుసెక్కుల నీళ్ల చొప్పున ఇస్తూ కొల్లాపూర్, నాగర్కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేశారు. శతాబ్దాల కాలంగా ఫైళ్లలోనే మగ్గిన నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షలు, భీమా ద్వారా 1.4 లక్షల ఎకరాలు, కోయిల్సాగర్ ద్వారా 8 వేల ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీరందించింది. భవిష్యత్తు కోటి ఎకరాల నా తెలంగాణ మాగాణంలో.. ‘నాగేటి సాళ్లల్ల నా తెలంగాణా... నా తెలంగాణా... నవ్వేటి బతుకులు నా తెలంగాణ... నా తెలంగాణ. పారేటి నీళ్లల్ల పానాదులల్లా... పూసేటి పువ్వుల్ల పునాసలల్లా కొంగుజాపిన నేల నా తెలంగాణా... నా తెలంగాణ. పాలు తాపిన తల్లి నా తెలంగాణా... నాతెలంగాణ’ అని నా గురువు నందిని సిధారెడ్డి రాసిన అద్భుత సాహిత్యమే చిరస్మరణీయం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ 94403 80141 సోలిపేట రామలింగారెడ్డి -
కారాగారంలో కారుణ్యం..?!
ఆదివాసీల కాళ్లకింది భూమిని పెకిలిస్తున్న అభివృద్ధిని ప్రశ్నించినందుకు కాదు.. వాళ్ల హక్కుల కోసం ప్రపంచ మేధావులను ఏకం చేయబూనడమే ప్రొఫెసర్ సాయిబాబ చేసిన మహానేరం. ఆ కారుణ్యమే నేడు కారాగారం పాలయ్యింది. మేత కోసం అడవికి వెళ్లి పులి నోటికి చిక్కిన ఆవు తన బిడ్డకు పాలిచ్చి పరుగు పరుగున వస్తా వదిలిపెట్టమని ప్రాధేయపడితే మనసు కరిగిన పులి ఆవును వదిలేసిందని నా బాల్యంలో తెలుగు వాచకంలోని ‘ఆవు– పులి’ పాఠ్యాంశంలో చదువు కున్నా. నిజాయితీ, నిబద్ధత బండరాయిలాంటి గుండె ఉన్న మనిషినైనా కదిలిస్తుం దని మా తెలుగు మాస్టారు చెప్తే మనసులోనే మననం చేసుకున్నా. కానీ కాలనాగులు కన్న పిల్లలనే కొరికి తిన్న ట్టుగా కనికరమే లేకుండా రాజ్యం ప్రొఫెసర్ సాయి బాబను జైలులోనే చిదిమేయజూస్తోంది. 90 శాతం శారీరక వైకల్యం, అంతకు మించిన అనారోగ్యంతో ప్రొ. సాయిబాబ అంపశయ్య మీదున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. పోలీసుల డైరెక్షన్లో ఆయ నను జైలులోనే అనారోగ్యంతో చంపాలని చూస్తున్నారు. జాతీయ మానవ హక్కుల కమిటీ కల్పించుకొని ప్రొ. సాయిబాబ జీవించే హక్కును గౌరవించాలి. 1975 జూన్ 25 మనకు ఎప్పటికీ గుర్తే ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పటాపంచలు చేసిన రోజు. ‘అత్యవసర పరిస్థి్థతి’ ప్రక టిస్తూ అప్పటి ప్రధాని ఇందిరమ్మ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. రాజ్యాంగం కల్పించిన సర్వ పౌర హక్కు లనూ హరించిన రోజు. నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయిగానీ దండ కారణ్యంలో అప్పుడూ ఇప్పుడూ కూడా ఎమర్జెన్సీనే. ఎందుకంటే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులే నేడూ కొనసా గుతున్నాయి. అప్పుడు అత్యవసర పరిస్థితి అని ప్రకటిం చారు. ఇప్పుడు ప్రకటించకుండానే దానిని అమలు చేస్తున్నారు. విశ్వాసాలు మూఢంగా ఉన్నా ఫరవాలేదు. కానీ అవి బలమైన భావజాలాలు కాకూడదు. దోపిడీ, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే ఆయుధాలు కాకూడదంటూ విశ్వాసాల మీదే పోలీసులు దాడి చేస్తుంటే, పౌర స్వేచ్ఛను కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ.. కార్యనిర్వా హక శాఖ తీరుగా ఆలోచన చేసి పోలీసులు చేసే హక్కుల ఉల్లంఘనకు అంగీకార ముద్ర వేసే ధోరణి క్రమంగా బలపడుతోంది. దేశానికి రాజకీయం అవ సరం. నలుగురు కూడి ఓ సమస్యకు పరిష్కారం వెతికే ఆద్భుత క్రతువే రాజకీయం. రాజకీయంలో భిన్న ఆలో చనలు ఉంటాయి. అంతులేని విజ్ఞాన శోధన ఉంటుంది. తార్కికం ఉంటుంది. ఏకాభిప్రాయాలు, విస్తృతాభిప్రా యాలు, విభేదాలు ఉంటాయి. వీటిలోంచే భిన్న రాజ కీయాలు పుట్టుకొస్తాయి. ఈ సంఘర్షణలోంచే విప్లవ భావజాలం పుట్టుకొస్తుంది, అది పరిసరాలను, ప్రాంతా లను, అవసరాలను బట్టి సాయుధ పోరాటంగానూ మారవచ్చు. లేదా శాంతి మార్గంలోనూ నడవవచ్చు. అప్రకటిత నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న దండ కారణ్య ఆదివాసీల ఉద్యమం ఇందులో భాగమే. అడ విలో పుల్లలేరుకున్నందుకు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బతుకుతున్నందుకు ఆదివాసీలను జైళ్లలో పెట్టారు. నిజా నికి మనకన్నా ప్రజాస్వామ్యయుతమైన, చైతన్యమైన ప్రపంచం ఆదివాసీలది. ప్రేమించే హక్కు, సహ జీవనం చేసే హక్కు మన సమాజంలో లేదు. తమదైన ఒక ప్రత్యేక సంస్కృతి, భూభాగం, ఆచార వ్యవహారాలు కలిగిన ఆదివాసీలకు తమదైన రాజ్యాంగం, చట్టం ఉన్నా యన్నది మనం అంగీకరించం. ఆదివాసీలను తుడిచి పెట్టే మానవ హననంగానే గ్రీన్ హంట్ జరుగుతోంది. మానవతావాదులు, మేధావులు దీన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేశారు. రాజకీయ విశ్వాసాలు ఉన్న వ్యక్తిగా ఢిల్లీ యూనివర్సిటీæ ప్రొఫెసర్ సాయిబా బకు ఆదివాసీలపై స్పష్టమైన అవగాహన ఉంది. వాళ్ల హక్కుల కోసం పోరాడాలనే తపన ఉంది. ఆదివాసీ హక్కుల కోసం కడవరకు నిలవాలనే ఆదివాసీ ఉద్యమ బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ల హక్కుల కోసం ప్రపంచ మేధావులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆది వాసీల హక్కుల కోసం మాట్లాడటం కూడా ఈ రాజ్యంలో నేరమే అని నాకు సాయిబాబను చూసిన తరువాతే తెలిసింది. నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయి బాబ ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆయ నకు శిక్ష విధించే కొద్ది రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధికి సంబంధించిన ఆపరేషన్ మూడు వారా లలో చేయాలని డాక్టర్లు సూచించారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రొ. సాయిబాబకు జైలులో ఏ విధ మైన వైద్య సహాయం అందలేదు. క్లోమ గ్రంధికి సంబం ధించిన నొప్పి తీవ్రతరం అయింది. ఛాతి నొప్పి, గుండె దడ రావడం జరిగింది. జీవించే హక్కులో భాగంగా ప్రొ. సాయిబాబ న్యాయస్థానాల్లో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంటే అంగీకరించలేదు. ఇక్కడో విషయం చెప్పాలి. రూ. వందల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపా దించి, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైల్లో ఉన్న శశికళకు భర్త ఆరోగ్యం బాగాలేదని న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయి. క్రికెట్ ఆటను వ్యాపార, వ్యభిచార ఆటగా మార్చి వేల కోట్లు అక్రమంగా సంపాయించి జైలు పాలయిన లలిత్మోదీకి, ఆయన భార్య ఆరోగ్యం సరిగా లేదన్న కారణంగా బెయిల్ ఇచ్చారు. 90 శాతం శారీరక వైకల్యం, అంతకు మించిన అనారోగ్యంతో బాధ పడుతున్న సాయిబాబకు అవే న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించడంపై విస్తృత చర్చ జరగాలి. - సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ 94403 80141 -
టికెట్.. టికెట్..
సాక్షి, హైదరాబాద్: తమ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి నిధులను సమకూర్చి, కళాశాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకలో బెనిఫిట్ సినిమా షో వేయిస్తున్నారు. బుధవారం ఆయన సిని మా టికెట్లు పట్టుకొని అసెంబ్లీ లాబీలో కనిపించారు. చేతిలో టికెట్లను చూసిన విలేకరులు ఆయన చుట్టూ చేరి ‘టికెట్లు ఎంతకు ఇస్తున్నారన్న,’ ‘ఎమ్మెల్యేలను అమ్ముతున్నారా’ అంటూ ఆయనతో కొద్దిసేపు చిట్చాట్ చేశారు. టికెట్ ధర రూ.5 వేలని, తమ ప్రాంతానికి చెందిన ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు మాత్రమే అమ్ముతామని ఎమ్మెల్యే వివరించారు. కొంత మంది జర్నలిస్టు మిత్రులకు ఇచ్చేందుకు ఆ టికెట్లు తెచ్చానని పేర్కొన్నారు. బెనిఫిట్ షో ద్వారా రూ.15 లక్షలు కూడబెట్టి జిల్లా కలెక్టర్కు అప్పగిస్తామని, ఆ నిధులను కళాశాల అభివృద్ధికి ఖర్చు చేస్తారని చెప్పారు. పేద విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని చెప్పారు. -
ఆదివాసీల భవితకు భరోసా
సందర్భం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ అధికారుల సమావేశంలో ఎవరు చెబితే ఆదివాసీలపై దాడి చేశారని నిలదీయటం, ఆ సందర్భంగా నర్మగర్భంగా చెప్పిన మాటలు ఆదివాసీ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. గిరిజన స్త్రీలను, పసిపిల్లలను చెట్టుకు కట్టేసి లాఠీలతో చితక బాదుతున్న ఆటవిక సంఘ టన నన్ను కలవరపెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అడవుల్లో జలగలంచ గొత్తి కోయలకు చెందిన 30 మందిపై 300 మంది ఫారెస్టు సిబ్బంది చుట్టుముట్టి గొడ్డును బాదినట్టు బాదిన ఘటన అది. పోస్కో, వేదాంత కార్పొరేట్ కంపెనీలకు అడవిని అప్ప గించటం కోసం గ్రీన్హంట్ పేరుతోనో.. పులుల సంర క్షణ పేరుతోనో మాడ్ జాతులను వేటాడుతున్న వేళ కోయ, గోండు, గొత్తికోయలు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో తెలంగాణ అడవుల్లోకి వచ్చి నిమ్మల పడ్డారు. ప్రాంతం వేరైనా అడవి ఒక్కటే. జంగల్ వాళ్లది, జమీన్, జల్ వాళ్లదే. వాళ్ల అడవిలో వాళ్లను వది లేయటమే న్యాయం. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడు ఏజెన్సీలో 10 ఎకరాల లోపు భూమి సాగు చేసుకోవచ్చు. ఫారెస్టు అధికారులు చట్టాన్ని అతిక్రమించి గుడిసెలు పీకేసి, జీవనవిధ్వంసం చేసి నిర్వాసితులను చేయటం పార్లమెంటును దునుమా డటమే. ఈ అమానవీయ సంఘటనను అసెంబ్లీలో ప్రస్తావించాలని నిర్ణయించుకున్నా. కానీ ముందుగానే సీఎం కేసీఆర్ మానవత్వం చూపించారు. గొత్తికోయ లపై దాడిని తీవ్రంగా గర్హించారు. దాడులకు దిగిన ఫారెస్ట్ అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. ఇది తొలి తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలకు దక్కిన భరోసా. అడవిపై అప్పటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముండాలు, భిల్లులు, గోండులు, కోయలు, గొత్తికో యలు, కొండ రెడ్లు తిరుగుబాట్లు చేశారు. ఆ మాట కొస్తే క్రీపూ 431–404 పాల్పెనెసియన్ యుద్ధ కాలం నుంచి భూమిపై అధికారాలు, హక్కులు సంపాదించే క్రమంలో ఆదివాసీల భూములు ఆక్రమణకు గురి అవు తున్నాయి. భూములను, హక్కులను తిరిగి కాపాడు కునే క్రమంలో ఆదివాసీలు అప్పటి నుంచే పోరాట పంథాను ఎంచుకున్నారు. వాళ్ల ప్రతి పోరాటంలో భూ సమస్య ఉంది. ఆ భూముల్లో వాళ్ల బతుకు ఉంది. గిరి జన తిరుగుబాట్లను పాలకులు ఎప్పటికప్పుడు అణిచి వేస్తూనే ఉన్నారు. ఆదివాసీ పోరాటాలవల్లే 1917లో, 1959లో ఆదివాసీ భూ పరిరక్షణ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాన్ని తుంగలో కలిపినప్పుడే గోదావ రిలోయ ప్రతిఘటనా పోరాటాలు, దండ కారణ్య ఉద్య మాలు పుట్టుకొచ్చాయి. ఆపై ప్రభుత్వం 1/70 చట్టం, పీసా (పంచాయతీరాజ్ విస్తరణ) చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. ఉమ్మడి ఏపీలోని శ్రీకా కుళం నుంచి మహబూబ్నగర్ దాకా 31,845 చదరపు కిలో మీటర్ల వరకు గిరిజన ఉపప్రణాళిక ప్రాంతం విస్త రించి ఉంది. అయితే దాదాపు 845 గిరిజన గూడేలను, పెంటలను 5వ షెడ్యూల్లో చేర్చనందునే భూ పరి రక్షణ చట్టాలు ఉన్నా అమలు కావటం లేదు. రిజర్వు టైగర్ ప్రాజెక్టుల్లో పులికి, ఆటవికులకు మధ్య సంఘర్షణ జరుగుతోందని అటవీ సంరక్షణ అధికారులు చెప్తున్నారు. వారిని అడవి నుంచి బయటికి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆదివాసీ కూడా అటవీ ఆవరణ వ్యవస్థలో ఒక అంతస్థే. అడవి జంతువుకు, ఆదివాసీకి మధ్య ఒక స్పష్టమైన జీవన సర్దుబాటు ఉంది. ఆదివాసీలు సాయంత్రం ఐదు గంటల లోపే పనులు ముగించుకొని రాత్రి 7 గంటల లోపు వండుకొని తిని పడుకుంటారు. ఆ వేళకే అడవి జంతువులు బయటికి వస్తాయి. సూర్యోదయం వరకు యథేచ్ఛగా సంచరిస్తాయి. సూర్యోదయం తరువాత మళ్లీ ఆదివాసీ జీవన గమనం మొదలవుతుంది. ప్రకృతే వారికి ఆవిధంగా సర్దుబాటు చేసింది. ఇక్కడ పులికి ఆదివాసీకి బలమైన బంధుత్వం ఉంది. ఆదివాసీ పులిని బావ(పులిబావ) అని సంబోధిస్తాడు. ఆదిమ జాతుల్లో బావే ఆత్మీయుడు. పులి గాండ్రిస్తే కాలం కలిసి వస్తుం దని, చెట్టు ఫలిస్తుందని ఆదివాసీల నమ్మకం. ఎప్పటికీ వాటి క్షేమాన్నే కోరుకునే ఆదివాసీలతో పులి ఎక్కడ సంఘర్షణ పడుతుందో అటవీ శాఖ పెద్దలకే తెలియాలి. గ్లోబలైజేషన్లో భాగంగానే ఆధిపత్య దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మీద కన్నేశాయి. విస్తా రమైన ఖనిజ సంపదను తవ్వి పట్టుకుపోవటానికి కార్పోరేట్ శక్తులు యుక్తులు, కుయుక్తులతో వల విసు రుతున్నాయి. ప్రకృతిని వడిపెట్టి ధ్వంసం చేసి డాలర్లు పిండుకునే తరహా అభివృద్ధి, దాని విస్తరణ వన జీవుల ప్రాణాలను తోడేస్తోంది. ఈ విలయం ఆగాలి. అపు రూప మానవ తెగలను అడవిలోనే బతకనివ్వాలే. ఇటీ వల సీఎం కేసీఆర్ అటవీ అధికారుల సమావేశంలో ఎవరు చెప్తే ఆదివాసీలపై దాడి చేశారని నిలదీయటం, ఆ సందర్భంగా చెప్పిన మాటలు ఆదివాసీ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. వాళ్ల అడవిలో వాళ్లే ఉంటారనే సంకేతాలు వెలువడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక సబ్ ప్లాన్తో 2017–18 బడ్జెట్లో రూ. 6,112 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో 60 శాతం నిధులు ఇప్పటికే ఖర్చు చేసింది. గిరిజన యువతీ యువకుల్లో నైపుణ్యం వెలికితీసి వారిని తీర్చి దిద్దటం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జాకారంలో 500 ఎకరాలలో గిరి జన వర్సిటీని నెలకొల్పబోతోంది. గిరిజన సంస్కృతి, సాహిత్యాన్ని పాఠ్యాంశంగా చేయటంతో పాటు వాటిపై విస్తృతమైన పరిశోధనలు జరుగనున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే మొబైల్ : 94403 80141 -
బాబు వదిలిన బాణం రేవంత్: సోలిపేట
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా సాగుతున్న తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు వదిలిన బాణమే రేవంత్రెడ్డి అని దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన శాసనసభ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై రేవంత్ ప్రకటిస్తున్న విశ్వాసం, ఆయన చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మీద కడుతున్న ప్రాజెక్టులు అడ్డుకోవటానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవటంతో చివరి అస్త్రంగా రేవంత్రెడ్డిని వదిలారన్నారు. తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన రేవంత్, నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఎంతమంది ఎమ్మెల్యేలను కొనమని ఎంత డబ్బిచ్చాడో గుట్టు విప్పితే తెలంగాణ ప్రజలు ఆయన విశ్వసనీయతను నమ్ముతారన్నారు. -
నదుల అనుసంధానం ఎవరికోసం?
అభిప్రాయం నా చిన్నతనంలో కూడెళ్లి వాగు పొంగితే జాతరకు పోయినట్టు పోయి చూసి సంబురపడేటోళ్లు. కానీ ఆ నీళ్లు ఎటుపో తున్నయో మాకు సోయి లేకుండే. నీళ్లన్నీ అప్పర్మానేరు మీదుగా గోదావరిలో కలిసేవి. తెలంగాణ ఉద్యమ నేపధ్యం నీళ్ల గోసను విడమరిచి చెప్పింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం. నీళ్లుంటేనే పల్లె పచ్చగా ఉంటుంది. నీళ్ల విలువేంటో తెలిసిన సీఎం కేసీఆర్.. వెళ్లిపోయిన కూడెళ్లి నీళ్లనే కాదు. గోదావరి నీళ్లనే మలుపుకొచ్చి తెలంగాణ రైతుల పాదాలు కడగాలని సంకల్పించారు. బడ్జెట్లో ఏటా 25 వేల కోట్ల నిధులను ప్రాజెక్టులకు కేటాయించి కోటి ఎకరాల మాగాణికి జీవం పోసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గోదావరిలో మనకొచ్చే 954 టీఎంసీల వాటాలో ఒక్క చుక్క వృథాగా పోకుండా జల ప్రాజెక్టులకు రూపం ఇచ్చారు. ఇప్పుడు నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను బలవంతంగా తీసుకుపోయి కృష్ణా, కావేరిలోకి మళ్లించి దిగువ రాష్ట్రాల్లో ఓట్ల సాగుకు మోదీ సర్కారు తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణకు రావలసిన జలాలను కేటాయించడంలో మొద టినుంచి అన్యాయమే జరుగుతూ వచ్చింది. కనీసం ఉన్న గోదావరి జలాలనైనా పోతం చేసుకుందామంటే మోదీ ప్రభుత్వం తెర మీదకు తెచ్చిన నదుల అనుసంధానంతో మళ్లీ తెలంగాణను ఎండబెట్టేటట్టే కనబడుతోంది. మహానదిని గోదావరితో కలిపి, గోదావరిని కృష్ణానది మీదుగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కావేరి నదికి అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉండగా నిర్మించిన ప్రాజె క్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్ధ్యం కలిపి 684 టీఎం సీల జలాలే వాడుకుంటున్నారని, మిగిలిన 270 టీఎంసీల నీళ్లు మిగులు జలాలే అని కేంద్రం చెప్తోంది. ఇవి అన్యాయమైన లెక్కలు అని జలరంగ నిపుణులు దివంగత విద్యాసాగర్రావు బతికి ఉన్నంత కాలం నెత్తీనోరు బాదుకున్నారు. ఇప్పుడు గోదావరి మీద కాళేశ్వరం, కంతనపల్లి, తుపాకుల గూడెం, దుమ్ముగూడెం, దేవాదుల ప్రాజెక్టులు రూపం పోసుకుం టున్నాయి. ఏ నది జలాలనైనా మరో 30 ఏళ్ల నాటికి పెరగనున్న జనాభా, వారికి అవసరమైన నీటి పరిమాణాన్ని నిర్ధారించి లెక్క గట్టాలి. ఆ తరువాతే మిగులు జలాలను గుర్తించాలి. కానీ కేంద్రం చెప్పే లెక్కలు 20 ఏళ్ల కిందట 75 శాతం నీటి లభ్యతతో తీసిన లెక్కలు చెప్తోంది. ఆ లెక్కలు ఇప్పటి నీటి లభ్యతతో ఎలా సరి పోలుతాయి? నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టు కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలు మనకు అవసరపడతాయి. రాష్ట్రాల అభ్యర్ధనలను పరిగణనలోకి తీసు కోకుండా మొండిగా నదులను అనుసంధానం చేసి తెలంగాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. పశ్చిమ కనుమల్లో వర్ష ప్రభావం ఎక్కువ. అంతా గుట్టలు, లోయలతో కూడిన ప్రాంతం కాబట్టి వ్యవసాయ భూమి, నివాస ప్రాంతాలు కూడా తక్కువే. ఏటా వందల కోట్ల క్యూసెక్కుల జల రాశులు వచ్చి చేరుతున్నాయి. ఇందులో 90 శాతం నీళ్లు పశ్చి మంగా ప్రవహించి వృథాగా అరేబియా మహా సముద్రంలో కలు స్తున్నాయి. వీటిలో పావు వంతు నీళ్లను ఒడిసి పట్టుకుని, వాటిని తూర్పు దిశగా తీసుకొచ్చి మహానదిలోకి మళ్లిస్తే ఆ జలాలు గోదా వరి, కృష్ణాల మీదుగా కావేరి నదిని తడుతాయి. అప్పుడు నాలుగు నదులు ఏమిటీ? దక్షిణ భారతంలోని నదులన్నిటినీ అనుసం ధానం చేయవచ్చు. మోదీ అటు దిశగా ఆలోచన చేయకుండా గోదావరిని కృష్ణా, కావేరితో అనుసంధానం చేస్తానంటే మాత్రం తెలంగాణ ప్రజలు మరో మహా ఉద్యమానికి సిద్ధపడతారు. వ్యాసకర్త దుబ్బాక శాసనసభ్యులు ‘ 94403 80141 సోలిపేట రామలింగారెడ్డి -
దొంగదూతకి రాజకీయ హారతి
వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాదులు, నిజానికి సమస్త శాస్త్రాలు మనుషుల్ని చీకటి నుంచి వెలుతురు వైపు నడిపించాలి. ఇదేమీ చిత్రమో..! శాస్త్ర విజ్ఞానం పెరిగి ఆకాశం ఆవలి దిక్కు గుట్టు విప్పుతున్న వేళ అంధ విశ్వాస్వాలు చెలరేగి మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తున్నాయి. ఎంత దౌర్భాగ్యం కాకపోతే ఈడొచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేసి కాపురానికి పంపాల్సింది పోయి మూఢభక్తితో సాధ్వీని చేసి నయవంచక బాబా చేతిలో పెట్టడం, ఆ బాబా మృగంలా చెలరేగి లేడిపిల్లను వేటాడినట్టుగా మన బిడ్డల వెంటబడి చెరుస్తుంటే కండ్లు మూసుకొని తన్మయత్వంతో భజన చేయడం, పాలకులు భార్యబిడ్డలతో వెళ్లి బాబాల కాళ్లు కడిగి నెత్తిన పోసుకొని పరవశించి పోవటం చూస్తుంటే... భవిష్యత్తులో దొంగలు, ఖూనీకోర్లు, రేపిస్టులు దర్జాగా బాబాల రూపందాల్చే ప్రమాదం కనిపిస్తోంది. ఎట్టకేలకు డేరా సచ్చ సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా పాపం పండింది. పదో తరగతి కూడా ఉత్తీర్ణుడు కానీ మానవ మృగం దైవాంశ సంభూతునిగా, రాజకీయ ప్రభావశీలిగా ఎదగటం అబ్బురమేమీ కాదు. ఉత్తర భారత రాజకీయ పునాదుల మీద సిర్సా జిల్లాలోని డేరా సచ్చా సౌదా నిలబడింది. వందల మంది దళిత, నిరుపేద జనాల భూములపై డేరా వేస్తే అక్కడి ప్రభుత్వాలు వారి ఎర్ర తివాచీలు పరిచాయి. తెలంగాణలో నయీం, పంజాబ్, హరియాణాలో డేరా బాబా ఇద్దరూ ఒక్కటే. కాలుష్యపు రాజకీయ సాగులో ఎదిగిన వటవృక్షాలే. రాజ్యహింసకు, దుర్మార్గపు ఆలోచనకు, అక్రమ సంపాదనకు కార్యరూపం ఇచ్చేందుకు అప్పట్లో చంద్రబాబునాయుడు నయీం అనే విషనాగును పొంచి పోషించి, దాన్ని ప్రజల మీదకు వదిలాడు. కేసీఆర్ ప్రభుత్వం ఆ రాబందును వధించే నాటికి ఎంత మందిని చంపాడో.. ఎంత మంది భూములు గుంజుకున్నడో లెక్కే లేదు. గుర్మీత్సింగ్ ఆధ్యాత్మిక ముసుగు కప్పుకున్న నయా నయీం. సాధ్వీలుగా చేరిన 300 మంది బాలికల్లో 250 మందిపైగా బాలికలపై అత్యాచారం చేశాడు. ఎదురు తిరిగిన దాదాపు 300 మంది పురుషుల వృషణాలను ఛిద్రం చేసి నపుంసకులుగా మార్చాడు. సచ్చ సౌదా అంటే ‘సత్యం పలికే స్థలం’. కానీ ఇదే స్థలంలో పదుల సంఖ్యలో యవతీయువకులను హత్య చేసి పాతి పెట్టిన ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరిగినా అక్కడి పాలకులు ఆయన మీద ఈగ వాలనీయలేదు. ఎందుకంటే దళిత, ముస్లిం, క్రిస్టియన్ అణగారిన వర్గాల ఆరాధ్యదైవంగా ఎదిగిన గుర్మీత్ పంజాబ్ , హరియాణా రాష్ట్రాల్లో అత్యంత రాజకీయ ప్రభావశీల వ్యక్తిగా మారాడు. డేరా బాబా అనుగ్రహం ఉన్న వాళ్లదే ఆధికారం పీఠం అనే వాతావరణం సృష్టించాడు. అంతెందుకు, ఒకవైపు ఆయన మీద రేప్ కేసు విచారణ జరుగుతుండగా.. 2014లో ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ సిర్సా బహిరంగ సభలో గుర్మీత్ను పొగడ్తలతో ముంచెత్తాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పంజాబ్ సీఎం( కాంగ్రెస్) అమరీందర్సింగ్ అయన డేరాకు వెళ్లి మొకరిల్లి వచ్చినవారే. ప్రజారోగ్యాన్ని విస్మరించి, ప్రజా ఉద్వేగాలను అణ చి వేసే సంస్కృతి ఉన్న మన దేశంలో బాబాలు, బాణామతులు అంతకంతకు ఎదుగుతూనే ఉంటాయి. భారతావనిలో∙లైంగిక దాడులకు పాల్పడిన సన్యాసులలో డేరా బాబాయే మొదటివాడు కాదు. ధ్యానపీఠ ఆశ్రమ అధిపతి నిత్యానంద, జబల్పూర్ ఆశ్రమ అధిపతి వికాసానంద, హరియాణాలో సంత్ రాంపాల్, తిరుచురాపల్లి ఆశ్రమ పీఠాధిపతి ప్రేమానంద, గుజరాత్లో ఆశారాం బాబా ఇలా చెప్పుకుంటూ చాంతాండంత జాబితా ఉంది. దేశంలో వందమందిలో 70 మంది ప్రజలకు ఆరోగ్యం అందుబాటులో లేదు. ఉత్తరభారతదేశంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ప్రజలకు ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేదు. ఇటీవల ఆక్సిజన్కు డబ్బులు చెల్లించలేదని కాంట్రాక్టర్ బీఆర్డీ ఆసుపత్రికి నిర్దాక్షిణ్యంగా ఆక్సిజన్ సరఫరా నిలిపివేస్తే 70 మంది పసికందులు చనిపోయిన దుర్ఘటన జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ ఎంజీఎం (మహాత్మగాం«ధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్)లో ఇంక్యుబేటర్లు పని చేయకపోవటం వలన 52 మంది చిన్నారులు ప్రాణాలు విడిచిన సంఘటనలు ప్రభుత్వ వైద్యంపై ఉన్న అపనమ్మకాన్ని మరింత పెంచేవే. దీనితో ప్రజలు బాబాల వైపు మళ్లుతున్నారు. భక్తి ప్రవచనాలు, ప్రేత పిశాచ వినాశక మంత్రాలు, కొద్దిపాటి ఆసుపత్రుల నిర్మాణంతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటువంటి విద్యతోనే గుర్మీత్ బాబా దళితులను, అణగారిన వర్గాల వారిని ఆకర్షించాడు. వారినే మానవ కవచంగా ఉపయోగించుకొని కోట్లకు పడగలెత్తాడు. అటు కోట్లు, ఇటు నిమ్నజాతుల ప్రజల అండదండతో అంతులేని అరాచకాలకు తెగబడ్డాడు. బతికి ఉండగానే స్వర్గంలో సీటు రిజర్వ్ చేసే బాబాలు, పిల్లలు పుట్టించే బాబాలు, ముద్దుపెట్టి రోగం నయం చేసే బాబాలు చాలా మందే ఉన్నారు. ప్రజలు అజ్ఞానంతో ఉన్నంత కాలం బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు.. అలాంటివాళ్ల ముందు పాలకులు మోకరిల్లుతారనేది దాచేస్తే దాగని సత్యం. వ్యాసకర్త దుబ్బాక ఎమ్మెల్యే, సెల్ 9440380141 సోలిపేట రామలింగారెడ్డి -
జాతీయవాదమంటే దేశభక్తేనా?
జాతీయ వాదం అంటే సరిహద్దు వలయం అవతలి వైపు ఉన్న శత్రువులను గుర్తిం చడం మాత్రమేనా? అంతర్గతంగా పౌరుల మౌలిక వసతులు, జీవించే హక్కులను కాపాడటం కూడా జాతీయవాదమే. యుద్ధం.. యుద్ధ తంత్రంపై సహజంగానే నాకు ఆసక్తి ఎక్కువ. నేను పుట్టి, పెరిగిన పల్లె నేపథ్యమో.. దేశభక్తి భావమో కారణం కావచ్చు. మృగశిర కార్తె కాలంలోనే పుట్టలోంచి ఊసిళ్లు బయటికొచ్చినట్టు.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే ఉగ్రవాదం, దేశభక్తి అంశాలు తెరమీదకు వస్తాయి. హిందూ జాతీయ వాదమే దేశభక్తి అని, శత్రు దేశంపై యుద్ధ వాతావరణంతోనే తరగని ఓటు బ్యాంకు సొంతం చేసుకోవచ్చని కాషాయం నేతలకు బాగా తెలుసు. లౌకిక్ భారత్ అనే మాట చెప్పకపోయినా హిందూ జాతీయ వాదమే దేశభక్తి అనే అంతర్గత వాతావరణాన్ని దేశంలో తీసుకొచ్చారు. ఎక్కడైతే పాలకులు ప్రజా రక్షణను విస్మరిస్తారో.. అక్కడ ప్రజలే ఆయుధాలు పట్టుకుంటారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తరువాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందం చేసుకున్నాయి. సరిహద్దును అంగీకరించటంతో పాటు ఎలాంటి కాల్పులకు కవ్వింపులకు పాల్పడవద్దని ఒప్పందం చేసుకున్నారు. అయినా అడపా దడపా అక్కడ అల్లర్లు, కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అలాంటి వాతావరణమే ఉంది. అయినా కాశ్మీరీలు మన అంతర్భాగం. పక్కన పాకిస్తాన్ సైనికులతో పోరాడటానికి, భారత్లో అంతర్భాగమైన కాశ్మీరీ తిరుగుబాటుదారులను నిలవరించడానికి మధ్య స్పష్టమైన రక్షణ నిబంధనలు ఉన్నాయి. కళ్లు మూసుకుపోయిన పాము తన పిల్లలనే కొరికి తిన్నట్టుగా, సొంత దేశం పౌరుడినే వాహన బాయ్నెట్కు కట్టుకొని మన సైన్యాధికారి రక్షణ కవచంగా వాడుకోవడం తీవ్రమైన యుద్ధ నేరం కింద పరిగణించాల్సింది పోయి ఎన్ఎల్ గొగోయ్ అనే సైనిక మేజర్కు అవార్డుతో సత్కరించడం కశ్మీరీలను కవ్విం చటమే. దేశభక్తిని ఒలకబోసే బీజేపీ పాలనలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 1999 మే–జూన్ మాసంలో జరిగిన కార్గిల్ యుద్ధం బీజేపీ హయాంలోనే జరిగింది. మొదట దీన్ని కశ్మీర్ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా చెప్పారు. భారత వాయుసేనలు వెళ్లి సమీప కొండల మీద పాకిస్తాన్ దళాలు మకాం వేశాయి అని చెప్పేవరకు పాలకులకు తెలి యదు. ఆ యుద్ధంలో మనం గెలిచాం అనిపించినా మన వైపు నుంచి 527 మంది సైనికులు మరణించగా, 1,363 మంది గాయపడ్డారు. అదే ఏడాది డిసెంబర్ మాసంలో నేపాల్ నుంచి ఇండియాకు వస్తున్న విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్ దేశంలోని కాందహార్ అనే ప్రాంతంలో దింపి కరుడు గట్టిన తీవ్రవాదులు మౌలానా మసూద్ అజాద్, ఒమర్ సయీద్ షేక్, హామ్మద్ జర్గర్లను స్వయంగా అప్పటి రక్షణ మంత్రి జశ్వంత్ సిన్హా ఉగ్రవాదులకు అప్పగించారు. ఈ ఏడాది కశ్మీర్ అల్లర్లు, రాజ్కోట్పై దాడి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు. భారతావనికి బలమైన గూఢచర్య వ్యవస్థ ఉంది. ఆర్ఏడబ్ల్యూ(రా) లాంటి సంస్థలు ఉన్నాయి. ఇవి ఉగ్ర సమాచారాన్ని పసిగట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి. ఉగ్రవాదులు తండాలకు, తండాలుగా దేశ సరిహద్దుల్లో చొరబడుతుంటే ముందే పసిగట్టి చేసిన హెచ్చరికలను దాచిపెట్టి కాషాయపు దేశభక్తులు మౌనంగా ఉన్న ఫలితమే పై సంఘటనకు కారణం. భారతీయ సమాజంలో కొద్దిమంది మిగతా ప్రజ లంతా ఏం తినాలో.. ఎవరిని పెళ్లి చేసుకోవాలో.. ఏది దేశభక్తో.. ఎంతవరకు మాట్లాడాలో నిర్ణయిస్తున్నారు. ఒపీనియన్ మేకర్స్ వాళ్లే, మిగిలిన సమాజం అంతా వాళ్లకు కోరస్ పాడాలి. ఎక్కడైనా ధిక్కార స్వరం వినిపిస్తే వాడు దేశానికి ద్రోహం చేశాడనే వాతావరణాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారు. కాషాయం రంగు ఒంటి నిండా పులుముకున్న భజనపరులంతా ఏం చేసినా అది జాతీయవాదమేనట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోవు, గో మాంసం గురించి మాట్లాడిన ఓ ఎంఐఎం నాయకుడి మీద పోలీ సులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ ఇప్పించింది పక్కా కాషాయ కండువా కప్పుకున్న న్యాయవాది. ఇక్కడ అది వృత్తి ధర్మం అంటుండొచ్చు. కానీ ఈ అంశంలో వృత్తిని, వ్యక్తిని వేర్వేరుగా చూడటం సాధ్యమేనా? జాతీయ వాదం అంటే సరిహద్దు వలయం అవతలి వైపు ఉన్న శత్రువులను గుర్తించడం మాత్రమేనా? అంతర్గతంగా పౌరుల మౌలిక వసతులు, జీవించే హక్కులను కాపాడటం కూడా జాతీయ వాదమే. సంపద సృష్టించే సామర్థ్యం ఉండి, దారిద్య్ర రేఖకు దిగువనే పేదరికంలో మగ్గిపోతున్న చేతివృత్తుల జాతులకు ఉపాధి కల్పించడం జాతీయవాదమే. తెలంగాణ ప్రాంత ఆచరణాత్మక ఇబ్బం దులను దృష్టిలో పెట్టుకొని డబుల్ బెడ్రూం, గొర్రెలు, చేపల చెరువుల పునరుద్ధరణ పథకాలు అమలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాద భావజాలం సెంటిమెంటుతో అమిత్షా తెలంగాణ గడ్డ మీదకు అడుగుపెట్టారు. రజాకార్ ప్రభావిత గ్రామాల్లో తిరిగి తన పాచిక విసిరే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ సమాజం విభిన్నమైనది, విశిష్టత ఉన్న ప్రాంతం. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ సకల మతాల సాంస్కృతిక కేంద్రం. మత సామరస్యానికి ప్రతీక. ఇది అమిత్షా లాంటి వాళ్ల కంటి సైగలకు, ఉడుత ఊపులకు కదిలే ప్రాంతం కాదు. ఇక్కడ కాషాయపు గెంతులు కుప్పిగంతులు కాక తప్పదు. - సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త దుబ్బాక శాసన సభ్యులు, శాసనసభ అంచనాలు–పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
రైతు రాజ్యమే తెలంగాణ జెండా, ఎజెండా
సందర్భం 14 ఏళ్ల పోరాటం ... అసాధారణ త్యాగాలు, ఆత్మబలిదానాలతో లక్ష్యం ముద్దాడిన దక్షత మనది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈనెగాసి నక్కల పాలు కావద్దనే దృఢచిత్తం. తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దాడుతా అనే సంకల్పం. తెలంగాణ రాష్ట్ర సమితి 17 ఆవిర్భావ పండుగ వేళ ఓరుగల్లు వేదిక భవిష్యత్తు కర్షకుని కన్నీళ్లు తుడిచే రైతురాజ్యం తేవాలే. అది రామరాజ్యంగా మారాలె. పల్లెకు వ్యవసాయమే జీవనాధారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మోడు వారిన జీవితాలు చిగురిస్తాయని సబ్బండ వర్ణాలు ఆశతో ఉన్నాయి. వ్యవసాయంతో పాటు దాని మీద ఆధారపడిన కులవృత్తులు బలోపేతం కావాలి. పల్లె ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిని సాధించాలి. తెలంగాణ పల్లెలో ఇప్పటికీ బోర్లు వేస్తే.. 1000 అడుగుల లోతుకు వెళ్లినా నీళ్లు రాని దుస్థితి. ఒక బోరు వేసినప్పుడు నీళ్లు రాకపోతే ఇంకో బోరు వేయ టం... ఇలా నీటి చెమ్మ కోసం 5.. 10..15 బోర్లు వేసి రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. కృష్ణాగోదావరి నదుల నుంచి మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కలిపి తెలంగాణకు 1,071 టీఎంసీల జలాలు ఇచ్చినట్టు ఉమ్మడి రాష్ట్ర పాలకులు నివేదికల్లో పొందుపరిచారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న సాగుభూమికి రకరకాల లెక్కలు ఉన్నాయి. అడవులు, గ్రామ కంఠాలు పోను 1,11,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. మరి 1,071 టీఎంసీల కేటాయింపులు చేస్తే కోటి ఎకరాల మాగాణి నీళ్లెందుకు పారలేదనేది బేతాళ ప్రశ్న. ఇప్పుడు వాటా జలాలను సంపూర్ణంగా మన బీడు భూముల్లోకి మళ్లించడమే మన ముందున్న లక్ష్యం. కృష్ణాగోదావరి నదులపై 23 పెద్ద, మధ్య తరగతి జల ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇందులో కీలకమైనదే కాళేశ్వరం ప్రాజెక్టు. తక్కువ భూమి, అతి తక్కువ ముంపు నష్టంతో ఎక్కువ నీటిని నిల్వ చేసే లక్ష్యంతో ప్రాణహితకు పునఃర్జీవం పోసి కాళేశ్వరం రీడిజైన్ జరిగింది. ఇలా రూపొం దించిన ప్రాజెక్టులో భాగమే కొమురవెల్లి మల్లన్న సాగర్. మేడిగడ్డ బ్యారేజీ నుంచి టన్నెల్ ద్వారా నీళ్లను తరలించి 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ను నింపే ప్రయత్నం జరుగుతోంది. మొత్తం దాదాపు 18.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణలో 25 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి వనరులు అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రూ 90 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావటానికి ఓరుగల్లు వేదికగా మనమంతా పునరంకితం కావాలె. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల చెరువులను, కుంటలను పునర్నిర్మాణం చేసే మహా యజ్ఞం చేపట్టారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో, భూగర్భ జలాలతో కలిపి 500 టీఎంసీల నీళ్లు నిల్వ చేసినట్టే అని జాతీయ పరిశోధక సంస్థలు వెల్లడించాయి. మెత్తానికి అంపశయ్య మీదున్న రైతుకు ఊపిర్లు ఊది, కొత్త జవసత్వాలను నింపి మళ్లీ పొలం మీదకు పంపే మహా ప్రయోగశాలగా ఓరుగల్లు వేదిక కాబోతోంది. (నేడు తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) వ్యాసకర్త దుబ్బాక ఎమ్మెల్యే ‘ 94403 80141 సోలిపేట రామలింగారెడ్డి -
ఎరువులే రైతు గుదిబండలు
అభిప్రాయం పాలకుల ఆలోచనెప్పుడూ రైతుల కన్నీళ్లకు, కష్టాలకు జవాబు చెప్పే సూక్ష్మస్థాయి శోధనగానే ఉండాలి.. వరుస కరువు, ఎరువుల భారం, ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లు.. ఈ మూడింటి భారం దించిన రోజున సేద్యం దండగ కాదు పండగే అవుతుంది. వ్యవసాయం బతుకు దెరువు మాత్రమే కాదు. అది పల్లె జీవన విధానం. మట్టి మనుషుల సంస్కృతి. దేశ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) వ్యవసాయం వాటా 16 శాతం మాత్రమే కానీ దేశ జనాభాలో 53 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. వ్యవసాయం పండగ కావాలంటే పంటల ఉత్పాదకతలో మెరుగుదల ఉంటాలి. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయాన్ని రాబట్టడంతో పాటు లాభాలను చూడగలిగి తేనే రైతు బతుకుతాడు. కానీ ఏ రాష్ట్రంలో చూసినా వ్యవసాయం ఆశాజనకంగాలేదు. దాదాపు 17 రాష్ట్రాల్లో రైతు వార్షిక ఆదాయం రూ 20 వేలే ఉంది. అంటే నెలకు రూ. 1,666లు అన్నమాట. ఇలాగైతే వ్యవసాయం బతకటం చాలా కష్టం. జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గణనీ యంగా తగ్గుతోంది. 1999 నుంచి 2000 సంవత్సరంలో 60 శాతం ఉండగా.. 2011–12 కు వచ్చే సరికి 49 శాతానికి పడిపోయింది. 2004 నుంచి 2012 మధ్య కాలంలో 3 కోట్లమంది శ్రామికులు వ్యవసాయాన్ని వదిలేశారు. 2019–20 నాటికి మరో 2.5 కోట్ల మంది శ్రామికులు వ్యవసాయాన్ని వదిలిపెట్టవచ్చని అంచనా. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే పంట ఉత్పత్తిలో మెరుగుదల ఉండాలి. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయాన్ని రాబట్టడంతో పాటు, లాభాలు చూడగలిగితే రైతు బతుకుతాడు. దేశంలో ఏ ప్రాంతం, రాష్ట్రం కేసి చూసినా మన పలెటూళ్లలో రైతుకు ఎరువులు, విత్తనాలే గుదిబండలు. ఎదుగుతున్న పైరుకు అదును మీద ఎరువులు వేయాలంటే రైతు చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. యూరియా కట్టకైనా, కాంప్లెక్స్ ఎరువుకైనా షావుకారే దిక్కు. షావుకారి దోపిడీకి మా నాయన రామకృష్ణారెడ్డి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దుబ్బాక మండలం చిట్టాపూర్లో మాకు ఏడు ఎకరాలు ఉండేది. చెరువు కింద భూమి. వరి పండేది. మా కుటుంబానికి జీవనాధారం ఆ భూమే. అప్పటికే అప్పు సప్పో చేసి నాటు పట్టేది. ఇక మందు కట్టలు అంటే మా ఊరి షావుకారు దగ్గరకు వెళ్లాల్సిందే. ఆయన లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేది. మందు కట్ట ధర మీద రూ 150 ఎక్కువ రాసుకునేటోడు. పంట చేతికి అందే నాటికి దానికి రూ 3 చొప్పున వడ్డీ లెక్కకట్టేవాడు, ఇక్కడ ఇంకో షరతు ఉండేది. చేనులో పండిన పంట మందు కట్టలు ఇచ్చిన షావుకారికే అమ్మాలి. అది కూడా మార్కెట్ ధరతో సంబంధం లేకుండా, ఆయన నిర్ణయించిన ధరకే. ఆ పంటను కూడా మా నాయనే తీసుకుపోయి, సిద్దిపేట మార్కెట్లో అమ్మి డబ్బు తెచ్చి షావుకారు చేతిలో పెట్టే వాడు. అంత దుర్మార్గమైన దోపిడీ ఉండేది. నా యవ్వనపు తొలినాళ్లలో నక్సలిజం వైపు నా అడుగులు పడటానికి ఇలాంటి దోపిడీ ఓ కారణం. పల్లెల్లో ప్రతి రైతు పరిస్థితి ఇదే. దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న రైతాంగం కాళ్లకింది పునాది కదిలిపోతున్న సందర్భంలో పాలకుల ఆలోచనెప్పుడూ రైతుల కన్నీళ్లకు, కష్టాలకు జవాబు చెప్పే సూక్ష్మస్థాయి శోధనగానే ఉండాలి.. తెలంగాణలో 20 ఏళ్ల నుంచి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పందిరి మెట్ల మాదిరిగా పెనవేసుకొనిపోయిన కరువు, అప్పులు, ఆడబిడ్డ పెళ్లి, చేతి వృత్తుల విధ్వంసం, చెరువుల విలుప్తం.. వరుస కరువు, ఎరువుల భారం, ఎదిగిన ఆడబిడ్డ పెళ్లిళ్లే రైతు ఆత్మహత్యలకు కారణం. ఈ మూడింటి భారం దించిన రోజున వ్యవసాయం దండగ కాదు పండగే అవుతుంది. రైతన్న రాజన్న ఆయితాడు. ఇప్పటి వరకు రాజ్య పాలన చేసిన వాళ్లెవరూ ఆ స్థాయి శోధన కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఉద్యమ నేతగా, పెద్ద రైతుగా కేసీఆర్ రైతు కష్టాలకు మూలాలను అన్వేషించారు. పాలకపక్ష నేతగా అన్నదాత కన్నీళ్లు తుడిచే పరిష్కారం చూపెడుతున్నారు. ఒక్కొక్క సమస్యను విడగొట్టి రైతు కష్టాలు బాపే వైపు అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సమగ్ర ప్రగతికి సాగు భూమి, చేతి వృత్తుల అభివద్ధే వెన్నెముకలని ఉద్యమం తొలినాళ్లలోనే గుర్తించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నీళ్లు, నిధులు నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తానని పంతం పట్టారు. రెండేళ్లలో గోదావరి జలాలు తెలంగాణ బీడు భూముల్లోకి మలిపేందుకు కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారు. పల్లెను మళ్లీ పచ్చగా నిలబెట్టే మహాయజ్ఞం చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 36 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేస్తూ నాలుగు విడతల్లో 17 వేల కోట్లు రుణాలు మాఫీ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఆ పని చేయలేక నిక్కినీల్గుతున్నవేళ.. కేసీఆర్ ఉచిత ఎరువుల పంపిణీ పథకం రైతన్నకు మళ్లీ వ్యవసాయంపై భరోసాను ఇచ్చింది. రాష్ట్రంలో 57 లక్షల మంది సన్నచిన్నకారు రైతుల చేతిలో 1.57 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాలుసరి 25 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు వాడుతున్నారు. వాస్తవానికి రైతులు అవగాహనా లోపంతోనే మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారని, రాష్ట్ర రైతుల అవసరాలకు 17.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరిపోతాయని వ్యవసాయ శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఈలెక్కన చూస్తే ఎరువుల సబ్సిడీ మీద రాష్ట్ర ప్రభుత్వానికి యేటా 6,300 కోట్ల భారం పడుతుందని అంచనా. యూరోపియన్ దేశాలతో పాటు బ్రెజిల్, చైనా, ఇండోనేసియా, కజకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, సౌత్ ఆఫ్రికావంటి దేశాల్లో వ్యవసాయం సబ్సిడీలపై భారీగానే ఖర్చు చేస్తున్నాయి. అయితే రైతుకు అత్యంత అవసరమైన ఎరువుల మీద ఏ దేశంలోనూ ప్రణాళికబద్ధమైన విధానాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎరువులపై సబ్సిడీ ఇచ్చి, ఆ డబ్బు నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఈ విధానం భవిష్యత్తులో ప్రపంచ దేశాల సబ్సిడీ అమలుకు ఒక ఆసక్తికరమైన అంశంగా మారనున్నది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త టీఆర్ఎస్ శాసన సభ్యుడు, రాష్ట్ర శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
రాజకీయ వేదికగా వాడుకోనీయం
సభను అడ్డుకోవడమే ప్రతిపక్షాల లక్ష్యం: సోలిపేట సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరించారని, వారిని సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్, బీజేపీ రాజకీయ చేయాలనుకోవడం విచారకరమని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాల రాజులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీని విపక్షాలు రాజకీయ వేదికగా వాడుకోవాలని చూస్తున్నాయని, వారి ఆటలు సాగనీయమని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా టీడీపీ సభ్యులు రేవంత్, సండ్ర వెంకట వీరయ్య రన్నింగ్ కామెంట్రీ చేశారని, వారి సస్పెన్షన్ సబబేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఓకే రీతిన వ్యవహరిస్తున్నాయని, సభను సీఎల్పీ నేత జానారెడ్డి తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. -
పల్లెను మింగిన ‘పెద్దనోటు’
సందర్భం దేశ ఆర్ధిక వ్యవస్థలో కరెన్సీ వాటా కేవలం 10 శాతం మాత్రమే. ఇందులో 2 శాతం కరెన్సీ గ్రామాల్లోని సమాంతర ఆర్ధిక వ్యవస్థలోనే చెలామణి అవుతు న్నట్లు అంచనా. పెద్దనోట్ల రద్దు ఈ వ్యవస్థనే ఛిద్రం చేసింది. నరేంద్ర మోది చేపట్టిన ఆర్థికపరమైన సర్జికల్ దాడి నల్ల కుబేరులను కాకుండా, సగటు మనిషి ఆర్థిక వ్యవ స్థను, మహిళల వంటింటి బడ్జెట్ను ఒక కుదుపు కుది పింది. సాగు మడి చుట్టూ కర్షకుడు నేర్పుగా నిలబెట్టు కున్న అతి సున్నితమైన ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. రూ. 10, రూ. 20 నోటు ఖర్చుతో జీవనం చేసే రైతాంగం మీదకు బలవంతంగా పెద్ద నోట్లను ప్రయోగించారు. మార్కెట్లోకి తెచ్చిన ధాన్యానికి రూ. 500, రూ. 1,000 నోటుతోనే లెక్కలు కట్టి అంటగట్టారు. భారత ఆర్థిక వ్యవస్థలో కేవలం బ్యాంకింగ్ లావా దేవీలు మాత్రమే లేవు. కార్పోరేటు సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీల పెట్టుబడులకు, రాబడులకు వ్యూహ రచనలు చేసే పెద్ద మనుషుల ఊహలకు అందని మరో సమాంతర ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థలోనే అంతర్భాగం. ఈ ద్రవ్యనిధికి కర్త, కర్మ, క్రియ పల్లె జనం, రైతాంగమే. పెట్టు బడులు, మిగులు, షేర్ మార్కెట్ల మార్మికత తెలియని పేద జనం రెక్కల కష్టం పెట్టుబడుల మీద ఆధారపడి నడిచే ఆర్థిక వ్యవస్థ ఇది. కోట్ల మంది సంపాదన పోగేస్తే రూ. లక్షలు మాత్రమే చేతిలో ఉంటుంది. ఇదంతా బ్యాంకు రికార్డులకు అందని డబ్బు. అటక మీద పాత ఇనుపరేకు సందకలో తాత్కాలికంగా నిలువ ఉండి నిత్యం ప్రజా మార్కెట్లో తిరిగే ద్రవ్యం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పల్లెకు అల్లుకున్న బంధాలు, బంధుత్వాల మీద ఆధారపడి ఉంది. ఈS పొదరింట్లో బ్యాంకుల అవసరం బహు స్వల్పం. దేశంలో ఎక్కువ మంది సన్నకారు రైతులే. భూ కమతాలు చాలా చిన్నవి.. ఏడాది అంతా కష్టపడితే రూ. 25 నుంచి రూ. 30 వేల ఆదాయానికి మించిన దిగుబడి ఉండదు. ఈ ఆదాయం మీద ఒక్క రైతు కుటుంబం మాత్రమే కాకుండా కుమ్మరి, కమ్మరి, రజక, గీత, గొల్లకుర్మ, ముదిరాజు దళిత తదితర చేతి వృత్తుల వారికి, ఆడబిడ్డ, అల్లుడు, అయినవారు మొదలైన బంధువులు, వ్యవసాయ కూలీలు ఆధార పడి జీవనోపాధి పొందుతారు. వచ్చిన దిగుబడిలో సింహభాగం రైతు తీసుకొని మిగిలినవి ఎవరి వాటా వాళ్లకు పంచుతారు. వేలలో ఉండే ఈ మొత్తాలను దాచుకోవడానికి వారికి బ్యాంకుల అవసరం రాదు. అటక మీదున్న ఇనుపరేకు సందక సరిపోతోంది. సమ కూరిన డబ్బులో రైతు కొంత జీవనానికి వాడు కొని మరి కొంత సొమ్ము మరుసటి కారుకు పెట్టుబడిగా వినియోగిస్తే... మిగిలిన వారు వచ్చిన ఆదాయంతో కాలం గడుపుతారు. ఊర్లో ఎవరికైనా రోగమో, నొప్పో వచ్చినా మళ్లీ ఆ డబ్బే అక్కరకు వస్తుంది. ఆపద తీరుస్తుంది. ఇదంతా బ్యాంకు రికార్డులకు పన్నులు, లావాదేవీలకు దొరకని ‘లెక్క’. అంత మాత్రం చేత ఈ డబ్బును నల్లధనం అని అనగలమా? వాస్తవానికి పల్లెల్లో సజీవంగా ఉన్న ఈ విధానమే దేశ ఆర్థిక వ్యవ స్థకు పట్టుగొమ్మ. 2009–10 మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుది పేసిన సమయంలో కూడా సమాంతర ఆర్థిక వ్యవస్థే భారతదేశానికి అండగా నిలబడింది. వాస్తవానికి కరెన్సీ రద్దు అనేది ఇప్పుడే మొదటి సారి జరుగలేదు.1946, 1978 సంవత్సరాల్లో రెండు సార్లు పెద్ద నోట్లను రద్దు చేసినా ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కొద్ది శాతమే ఉన్న పెద్దనోట్లు కేవలం ధనవంతులకే పరిమితం కావటంతో సాధా రణ ప్రజలు ఇబ్బంది పడలేదు. రోజువారి జీవన కార్యాకలాపాలు సాఫీగానే సాగాయి. తాజాగా రూ. 500, రూ. 1,000 నోట్లు రద్దు సామాన్య జన జీవ నంపై పెను ప్రభావాన్ని చూపెడుతోంది. యాసంగి సాగుతో పొలం పనుల్లో బిజిబిజిగా ఉండాల్సిన గ్రామీ ణులు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు గాస్తున్నారు. రూ. 500 నోటు చేతిలో పట్టుకొని పూట బువ్వ కోసం పడిగాపులు కాస్తున్నారు. వాస్తవానికి దేశ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ వాటా కేవలం 10 శాతం మాత్రమే ఉంటే ఇందులో కనీసం 2 శాతం కరెన్సీ గ్రామీణ ప్రాంతంలో పాతుకుపోయిన సమాంతర ఆర్థిక వ్యవస్థలోనే చెలామణి అవుతున్నట్లు ఆర్థిక సర్వేలు చెప్తున్నాయి. నరేంద్రమోదీ చేసిన ఆర్థిక పరమైన సర్జికల్ స్రై్టక్ సరిగ్గా ఈ వ్యవస్థనే ఛిద్రం చేసింది. అకస్మిక పెద్ద నోట్ల నిర్ణయం రైతాంగాన్ని ఆత్మహత్యల వైపుకు పురిగొల్పుతోంది. సిద్ధిపేట జిల్లా మిర్దొడ్డి మండలం నా సొంత నియోజకవర్గం దుబ్బాకలోనే ధర్మారంలో రైతు కుటుంటాన్ని పెద్ద నోట్ల రద్దు కాటేసింది. పెండ్లికి ఎదిగిన ఆడబిడ్డ ఒకవైపు, అప్పుల కుంపటి ఇంకో వైపుతో ఇబ్బంది పడుతున్న వర్ద బాలయ్య అనే రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంకా అలాంటి మరణాలు మరిన్ని చూడక ముందే మోదీ గ్రామీణ సమాంతర ఆర్ధిక వ్యవస్థను పరిరక్షించే ప్రయత్నం చేయాలి. వ్యాసకర్త శాసనసభ అంచనా పద్దుల కమిటీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్రం 94403 80141 సోలిపేట రామలింగారెడ్డి -
ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి - ఎమ్మెల్యే సోలిపేట
మానవ మనుగడ సాధించాలంటే ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు. ఆదివారం దుబ్బాక మండలం కూడవెళ్లి రామలింగేశ్వర ఆలయంలో హరిత హారం కింద మొక్కలను ఎమ్మెల్యే నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నట్లుగా దుబ్బాక నియోజక వర్గ ప్రజలు హరిత హారంలో చురుగ్గా పాల్గొనడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన హరిత హారం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు సామాజిక వర్గాలు పాలు పంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. -
మా ఊర్లో చెట్ల పండుగ..మీరంతా రండి
♦ జిల్లా గీత కార్మికులకు సోలిపేట రామలింగారెడ్డి ఆహ్వానం ♦ చిట్టాపూర్లో 16న ‘సాక్షి’ ఆధ్వర్యంలో హరితహారం ♦ ఏకకాలంలో 5 వేల ఈత మొక్కలునాటే కార్యక్రమం ♦ ముఖ్యఅతిథులుగా హరీశ్రావు, పద్మారావు దుబ్బాక: ‘మా ఊరు చిట్టాపూర్లో పండుగ చేస్తున్నాం.. ఈ నెల 16న ఊరు ఊరంతా కలిసి చెట్లు నాటుతున్నాం. ‘సాక్షి’ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హరితహారంలో అందరం చేయి చేయి కలుపుదాం. కల్లు గీత కష్టసుఖాలు, ఈత వనాల పెంపకంపై మాటముచ్చట పెడదాం. గీత కార్మిక సోదరులూ.. కదిలిరండి’ అని శాసనసభ అంచనా పద్దుల చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పలువురు గీతకార్మిక నేతలకు ఫోన్ చేసి ఆహ్వానించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్లో సాక్షి ఆధ్యర్యం హరితహారం కార్యక్రమం చేపడుతున్నామని, 5 ఎకరాలకు పైగా గౌడ సొసైటీ భూమి, చెరువు శిఖం భూముల్లో దాదాపు 5 వేల ఈత మొక్కలను నాటుతున్నట్లు చెప్పారు. ఉద్యమంలా చేపడుతున్న ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుతో పాటు ఇతర ముఖ్య నేతలు, ఉన్నతస్థాయి అధికారులు పాల్గొంటారని వివరించారు. జిల్లా నలుమూలల నుంచి గీత కార్మిక సోదరులు భారీఎత్తున తరలిరావాలని రామలింగారెడ్డి కోరారు. -
ప్రాజెక్టుపై చంద్రబాబు కుట్ర: సోలిపేట
మల్లన్నసాగర్ వ్యతిరేక ఉద్యమానికి ఆంధ్రా నుంచి రూ.2కోట్ల్లు దుబ్బాక: మల్లన్న సాగర్ వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు డబ్బు పంపించారని శాసనసభ అంచనా పద్దుల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆరోపించారు. ఇందుకోసం రూ. రెండు కోట్లు వెచ్చించారని, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ద్వారా ముంపు గ్రామాల్లో ఖర్చు చేశారన్నారు. దీనిపై పూర్తి ఆధారాలను తాను శాసనసభలో బయటపెడతానన్నారు. ముంపు గ్రామాల ప్రజలు శాంతియుతంగా చేస్తున్న నిరసనల్లో సంఘ విద్రోహ శక్తులు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన దుబ్బాకలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు అడ్డుకునేందుకు చంద్రబాబు అన్ని అస్త్ర్రాలు ఉపయోగిస్తున్నారన్నారు. తెలంగాణలో తన కోవర్టు రేవంత్రెడ్డి ద్వారా చంద్రబాబు కుట్రలను అమలుపరుస్తున్నారన్నారు. డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికి జైలు ఊచలు లెక్కబెట్టిన రేవంత్కు ఇంకా బుద్ధిరాలేదని రామలింగారెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్ను సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకునే బాధ్యతను బీజేపీ లాబీయింగ్తో నాగం జనార్దన్రెడ్డికి, మల్లన్న సాగర్ను అడ్డుకునే బాధ్యతను చంద్రబాబు రేవంత్రెడ్డికి అప్పగించారని ఆరోపించారు. అన్ని ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని రామలింగారెడ్డి స్పష్టం చేశారు. -
రేవంత్ ఆంధ్ర ఏజెంట్
ఆయనకు చీము నెత్తురు ఉంటే చంద్రబాబు ఇంటిని ముట్టడించాలి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి :తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు పంపిన ఏజెంటే రేవంత్రెడ్డి అని, ఇలాంటి ఇంటి దొంగ పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అంచనా పద్దుల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో టెలిఫోన్లో మాట్లాడారు. రేవంత్కు సిగ్గూ శరం, చీమూ నెత్తురు ఉంటే సొంత జిల్లా మహబూబ్నగర్కు నీళ్లందించే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టొద్దని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్న ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను బలవంతంగా ఏపీలో కలుపుకున్నప్పుడు ఈ రేవంత్రెడ్డి కళ్లలో ఏం పెట్టుకున్నాడని ప్రశ్నించారు. ఆంధ్రా పెత్తనం పోయినా ఆంధ్ర వాళ్ల కుట్రలు మాత్రం కొనసాగటం దురదృష్టకమన్నారు. రేవంత్రెడ్డి ఒక దొరికిన దొంగ అని, ఓట్లకు నోట్ల కేసులో ఆయన జైలు జీవితం గడపాల్సిన రోజులు ముందున్నాయన్నారు. -
గొంతు తడిపిన జలధార
♦ దుబ్బాకలో సాక్షి జల రథాన్ని ప్రారంభించిన సోలిపేట ♦ ఒక్క రోజే 10 వేల లీటర్ల నీటి సరఫరా ‘తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నం.. సాక్షి జల రథాలు తరలిరావడంతో ప్రాణాలు లేసొచ్చాయి.. మా గొంతులు తడిశాయి..’ అంటూ దుబ్బాక వాసులు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో జల రథాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటి పొదుపుపై స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఒక్క రోజే సుమారు 10 వేల లీటర్ల నీటిని సరఫరా చేశారు. గర్జిస్తున్న కరువులో.. దుబ్బ తేలిన నేలలో దూప తీర్చిన సాక్షికి జేజేలు అంటూ స్థానికులు కొనియాడారు. దుబ్బాక/దుబ్బాక రూరల్: జలం లేక తల్లడిల్లుతున్న జనానికి ‘సాక్షి’ నీటిపథకం సాయం చేసింది. రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బాసటగా నిలవడంతో.. పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీకి గురువారం వాటర్ ట్యాంకర్ వచ్చింది. కాలనీలో దాదాపు 500 కుటుం బాలు ఉన్నాయి. త్రీఫేజ్ కరెంట్ వస్తేనే నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దళితులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు ‘సాక్షి’ ముందడుగు వేసింది. ఈక్రమంలో గురువారం నీటి ట్యాంకర్ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చింది. ‘సాక్షి పత్రిక పంపిస్తున్న తాగునీటిని వృథా చేయకుండా వాడుకుంటామని, భూ గర్భజలాలను భవిష్యత్ తరాలకు అందించడానికి పాటు పడుతామని’ కాలనీ వాసులతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయిం చారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. ప్రజల అవసరాల దృష్ట్యా సాక్షి పంపిస్తున్న రెండు ట్యాంకర్లతో పాటు అదనంగా మరో ట్యాంకర్ను పంపిస్తామన్నారు. ఈనెలాఖరులోగా మిషన్ భగీరథ నీళ్లు వస్తాయని, అప్పటి వరకు ‘సాక్షి’ నీళ్లను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పర్స యాదగిరి, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి గుండవెళ్లి ఎల్లారెడ్డి, నాయకులు బండి రాజు, కోమటిరెడ్డి సంజీవరెడ్డి, పర్స కృష్ణ, ఇస్తారిగల్ల స్వామి, గజం కల్యాణ్ తదితరులున్నారు. -
ఏమిటీ కాలుష్యం?
♦ వ్యర్థాలు ఎక్కడేస్తున్నారు? ♦ 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి ♦ ‘సాక్షి’ కథనాలే ఎజెండా ♦ అంచనా పద్దుల కమిటీ సమీక్షలో పీసీబీపై సోలిపేట ఫైర్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకుసీమపై పంజా విసురుతున్న కాలుష్య సమస్యపై రాష్ట్ర శాసనసభ అంచనా పద్దుల ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఫైర్ అయ్యారు. పటాన్చెరు, హత్నూర, చేగుంట పల్లెలను కాలుష్యం కబలిస్తోందని, జనం మీదికి విష వాయువులను, వ్యర్థ రసాయనాలను పల్లెలపైకి వదిలేస్తున్న కంపెనీల తీరుపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన తెలంగాణ రాష్ర్ట కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి అనిల్ను ఆదేశించారు. ఈపీటీఎల్కు తరలించి శుద్ధి చేయాల్సిన రసాయన వ్యర్థాలను పాశమైలారం, రుద్రారం, చేగుంట, హత్నూర ప్రాంతాల్లోని పరిశ్రమల యాజమాన్యాలు అడ్డగోలుగా చెరువులు, కుంటల్లో వేస్తున్నారని ఆయన సీరియస్ అయ్యారు. గురువారం రామలింగారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ శాసనసభ సమావేశ మందిరంలో అంచనా పద్దుల కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. పటాన్చెరు కాలుష్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన నేపధ్యంలో రామలింగారెడ్డి.. కాలుష్యాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకున్నట్లు తెలిసింది. పరిశ్రమల నుంచి రోజుకు ఎంత రసాయనిక వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వాటినేం చేస్తున్నారు? ఈపీటీఎల్లో (రసాయనిక వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్) ఎన్ని వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న పీసీబీ నివేదికలకు వాస్తవాంశాలకు పొంతన ఉందా? అంటూ ఆయన పీసీబీ అధికారులను నిలదీసినట్టు తెలిసింది. పాశమైలారంలో రాత్రి 10 తరువాత ఫార్మా కంపెనీలు పొగను వదిలేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ కాలుష్యంపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్ను ఆదేశించినట్లు తెలిసింది. -
అభినవ భగీరథుడు కేసీఆర్
దుబ్బాక : తెలంగాణ, మహారాష్ట్రాల జల ఒప్పందం చరిత్రాత్మకమని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అభినవ భగీరథుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత మగాణులు సస్యశ్యామలంగా కనిపించేలా కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గోదావరి నదిపై ఐదు బ్యారేజీలను నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ చేసిన ఒప్పందం చరిత్రాత్మకమన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం ఒక విజయమైతే, గోదావరి నది జలాలను తెలంగాణ ప్రాంతానికి తీసుకురావడం మరో విజయమన్నారు. హరిత తెలంగాణ కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ర్యాకం పద్మశ్రీరాములు, జడ్పీటీసీ ఏల్పుల గౌతమి మహేశ్, టీఆర్ఎస్ నాయకులు గుండవెళ్లి ఎల్లారెడ్డి, ఆస స్వామి, బండి రాజు, కొట్టె ఇందిర, గన్నె భూంరెడ్డి, అమ్మన మహిపాల్రెడ్డి, తౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టపాసులు కాల్చిన కార్యకర్తలు సిద్దిపేట: తెలంగాణ, మహారాష్ర్ట మధ్య గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణాకి మంగళవారం అంతరాష్ట్ర జల ఒప్పందం జరగడం పట్ల స్థానిక మంత్రి హరీశ్రావు ఇంట్లో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందాలపై సంతకాలు చేసిన వెంటనే మంత్రి ఇంట్లో టపాసులు పేల్చి , మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు బర్ల మల్లికార్జున్, మిద్దె రవి, మంత్రి వ్యక్తిగత సహాయకుడు రాంచందర్రావు తదితరులు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో తిరుపతి, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కీలక భేటీ!
నేడు సోలిపేట నివాసంలో టీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశం మండలి ఎన్నికపై వ్యూహ రచన మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డికే టికెట్ ఖరారు! సాక్షిప్రతినిధి, సంగారెడ్డి:స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరిగే ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తాజా మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్రెడ్డికే దాదాపుగా ఖరారైంది. అధికారికంగా ప్రకటించడం ఇక లాంఛనమే. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అయినప్పటికీ.... భారీ మెజార్టీతో గెలిచి ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు కౌన్సిల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలపై చర్చించేందుకు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు గురువారం రాత్రి 8 గంటల తరువాత హైదరాబాద్లోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నివాసంలో సమావేశం కానున్నారు. రామలింగారెడ్డిని పరామర్శించడంతోపాటు, కౌన్సి ల్ ఎన్నికల వ్యూహ,ప్రతివ్యూహాలపై చర్చించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువిశ్వసనీయంగా తెలిసింది. అనారోగ్యం కారణంగా పదిరోజుల కిందట సోలిపేట రామలింగారెడ్డి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కోలుకున్న ఆయన మంగళవారం డిశ్చార్జి అయ్యారు. ముఖ్యంగా ఆయన్ను పరామర్శించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పనిలోపనిగా కౌన్సిల్ ఎన్నికలపై కూడా చర్చిం చాలని నిర్ణయించారు. జిల్లాకు చెందిన ముఖ్యమైన 30 మంది నేతలను మాత్ర మే ఈ సమావేశానికి పిలిచారు. సమావేశానికి వచ్చే వారు... వారి వారి మండలాల్లో ఎంపీటీసీల సంఖ్య, ఏ పార్టీ నుంచి గెలుపొందారు?, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? , టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయా?, తదితర పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని ముందుగానే సూచించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన వి.భూపాల్రెడ్డి గత ఏడాది ముఖ్యమంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరాారు. ఎమ్మెల్సీ టికెట్ ఆయనకే ఇస్తామని కేసీఆర్ ఆయన చేరిక సమయంలోనే హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు భూపాల్రెడ్డికి టికెట్ ఖరారు చేసినట్టు తెలిసింది. మొత్తం 882 మంది ఓటర్లు ఉండగా ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం 880 ఓట్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 70 శాతం ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉండటం గమనార్హం. -
'రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి కేసీఆర్'
-
'రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి కేసీఆర్'
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు నివారించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆయన మాట్లాడారు. రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. అన్నదాతల సమస్యలను తీర్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. రైతాంగ సమస్యలపై ప్రతిరోజు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతాంగాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. రైతు ఆత్మహత్యలు అత్యంత బాధాకరమని అన్నారు. -
‘ఆసరా’ అందలేదని దిగులు వద్దు
దుబ్బాక: ఆసరా పథకం జాబితాలో తమ పేరు లేవనే బాధ వద్దని, అర్హులైన వారందరికీ పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లోని ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో పింఛన్ల ప్రక్రియ నెల రోజులు ఆలస్యమైనా రెండు నెలల పింఛన్ కలిపి వృద్దులు, వితంతువులకు రూ. 2 వేలు, వికలాంగులకు రూ. 3 వేలను అందజేస్తున్నామన్నారు. జాబితాలో తమ పేర్లు లేవని దిగులు చెందవద్దని, అవసరమైతే వారి దరఖాస్తులను మళ్లీ పరిశీలించి పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. పింఛన్ రాని లబ్ధిదారులు సంబంధిత అధికారులను కలిసి తమ దరఖాస్తులను సమర్పించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ప్రతి పక్షాల నోళ్లు మూయించే విధంగా ఆసరా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. పేద ప్రజలకు పెద్ద కొడుకుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి పక్షాల అసత్య ఆరోపణలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదని, ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ప్రతి పక్షాలు విమర్శంచకుండా ఉండడానికే ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్, తిమ్మాపూర్ సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డి, పద్మనాభునిపల్లి సర్పంచ్ ము క్కపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ పస్తం లక్ష్మి నరహరి తదితరులు పాల్గొన్నారు. -
‘మావోయిస్టు’ తల్లికి ఎమ్మెల్యే ‘ఆసరా’
దుబ్బాక: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన దుబాషి శంకర్ తల్లి నర్సమ్మ(80)కు మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘ఆసరా’గా నిలిచారు. సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా.. దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన దుబాషి నర్సమ్మకు అధికారులు పింఛన్ తొలగించారు. కొన్ని సంవత్సరాలుగా పింఛన్ తీసుకుంటున్న నర్సమ్మ ఇటీవల వెల్లడించిన పింఛన్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఎమ్మెల్యే ఎదుట గోడు వెలుబుచ్చింది. దీంతో చలించిన ఆయన ఆదివారం కలెక్టర్ రాహుల్బొజ్జాతో ఫోన్లో మాట్లాడుతూ పింఛన్ మంజూరు చేయాలని కోరారు. నర్సమ్మకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు శంకర్ 30 ఏళ్ల కింద అజ్ఞాతంలోకి వెళ్లాడు. యాదయ్యకు వ్యవసాయ ట్రాక్టర్ ఉండడం వల్ల నర్సమ్మకు అధికారులు పింఛన్ తొలగించారు. -
వృద్ధులకు ఊతకర్ర ‘సాక్షి’
తొలి ప్రయత్నంలోనే ఫలితాన్ని ఇచ్చిన ‘జనపథం’ 8 మంది వృద్ధులకు పింఛన్లు ఇప్పించిన ఎమ్మెల్యే సోలిపేట సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘సాక్షి’ జనపథం పండుటాకులకు ఊత కర్ర అయింది. ‘ఇక మాకు పింఛన్ రాదేమో’ అని ఆందోళనలతో ఉన్న పండుటాకుల ముఖాల్లో జనపథం బోసి నవ్వులు పూయించింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు వృద్ధులకు అందిస్తున్న ‘ఆసరా’కు వాళ్లు అర్హత సాధించారు. మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చొరవతో ఎనిమిది మంది వృద్ధులకు అప్పటికప్పుడు పింఛన్ మంజూరు అయింది. ఎస్కేఎస్ (సమగ్ర కుటుంబ సర్వే) డాటాలో వయస్సు తక్కువుండి కంప్యూటర్ రిజెక్టు చేసిన వారికి ఐడీ ప్రూఫ్ పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారుడిగా ఎంపిక చేశారు. కంప్యూటర్లో ఉత్పన్నమైన సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన మరో 10 మంది వృద్ధులు, వితంతవులకు కూడా త్వరలోనే పింఛన్ పునరుద్దరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మంగళవారం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని మారుమూల పల్లె అనాజ్పూర్లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘జనపథం’ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీపీ అబ్బగౌని మంగమ్మ, జెడ్పీటీసీ సర్వుగారి వీరమణి ఎంపీడీవో మచ్చేంధర్, గ్రామకార్యదర్శి రవి, గ్రామ నాయకులు దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీతన్నలు, నేతన్నలు పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఆసరా పథకంలో తమ పేర్లు ఉన్నాయో.. తొలగించబడ్డాయో తెలియక ఆందోళన పడుతున్న వాళ్లకు ‘సాక్షి’ జనపథం పరిష్కారం చూపింది. ‘సాక్షి’ కృషి బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాదిరాళ్లు: ఎమ్మెల్యే ఓ వర్గం మీడియా ఏసీ గదుల్లో, స్టూడియోల్లో కూర్చొని చర్చాగోష్టులంటూ తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళ పరుస్తోందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. దానికి భిన్నంగా సాక్షి మారుమూల పల్లెకు వచ్చి ప్రజల కష్టాలను, కన్నీళ్లను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, ప్రజా ప్రతినిధులను, అధికారులను ఒకే వేదిక మీదకు పిలిచి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే విధంగా అడుగులు వేయడం ఆహ్వానించదగిన పరిణామమని పేర్కొన్నారు. ఇలాంటి వేదికలు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాది రాళ్లు అవుతాయన్నారు.‘సాక్షి’ కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. అప్పటికప్పుడు లబ్ధిదారులు వీరే.. - పుల్లె బాలమల్లు (తండ్రి వెంకయ్య): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు. - జంగపల్లి మల్లయ్య (తండ్రి చంద్రయ్య): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు. - గడ్డం నారాగౌడ్ (తండ్రి బాలాగౌడ్): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు. - కొత్త ప్రమీల (భర్త గోపాల్రెడ్డి): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు. - చిట్మల్ వెంకటేశం (తండ్రి శివ్వయ్య): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు. - మహ్మద్ మౌలానా (తండ్రి రహ్మాన్): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు. - మంగళి మంగమ్మ (తండ్రి ఆంజనేయులు): పొరపాటున ఓఏపీగా నమోదవడం వల్ల పింఛన్ రద్దయింది. తిరిగి పీహెచ్సీ సర్టిఫికెట్ ఆధారంగా ఎంపిక చేశారు. - ఎర్ర నర్సయ్య (తండ్రి బూమయ్య): సర్టిఫికెట్ల ఆధారంగా వయస్సు లేకపోయినప్పటికీ ఫిజికల్ అప్పియెరెన్స్ ద్వారా ఎంపిక చేశారు. -
పండుటాకులకు ఊతకర్ర
⇒సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగిన ‘సాక్షి’ జనపథం ⇒ ఇబ్బందులను ఏకరువు పెట్టిన అనాజ్పూర్ గ్రామస్తులు ⇒అర్హత ఉండి కూడా పింఛన్ లిస్టులో పేరు లేదని బాధపడిన వృద్ధులు ⇒అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు 8 మంది పేర్లు చేర్పించిన సోలిపేట ⇒వారం రోజుల్లో మరో 10 మందికి కూడా పింఛన్ ఇప్పిస్తానని హామీ ⇒అర్హుల గుర్తింపునకు ఇది ఆరంభం మాత్రమే: రామలింగారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గాజు కళ్లు... ముడుతలు పడిన ఒళ్లు.. 60 ఏళ్ల వయసులో ఆసరాకోసం అల్లాడుతున్న అవ్వాతాతలకు సోలిపేట రామలింగారెడ్డి భరోసా ఇచ్చారు. గతంలో దౌల్తాబాద్ మండల కేంద్రంలో పింఛన్లు అందని పండుటాకులతో రాస్తారోకో చేయించి పాలకులను రోడ్డు మీదకు ఈడ్చిన ఆయన, ఇపుడు అధికారంలో ఉన్నా, అవ్వాతాతలవైపే మొగ్గు చూపారు. వారికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ‘సాక్షి’, సాక్షిటీవీ నిర్వహించిన జనపథం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పండుటాకులకు వచ్చేందంతా పండుగ రోజులేనని తెలిపారు. ప్రతి అవ్వకు, తాతకు, భర్తను కోల్పోయిన అక్కా చెళ్లెళ్లకు, అంగవైకల్యం ఉన్న అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆసరా’ అవుతారని భరోసా ఇచ్చారు. అవ్వా తాతలకు అన్యాయం జరిగితే రోడ్డెక్కటానికి వెనుకాడిది లేదన్నారు. పింఛన్జాబితాలో పేర్లు నమోదు మంగళవారం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని మారుమూల పల్లె అనాజ్పూర్లో ‘సాక్షి’, సాక్షి టీవీ ఆధ్వర్యంలో ‘జనపథం’ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ అబ్బగౌని మంగమ్మ, జెడ్పీటీసీ సర్వుగారి వీరమణి ఎంపీడీఓ మచ్చేందర్, గ్రామ కార్యదర్శి రవి, గ్రామ నాయకులు దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన సుమారు 450 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీతన్నలు, నేతన్నలు పాల్గొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఆసరా పథకంలో తమ పేర్లు ఉన్నాయో... తొలిగించారో... తెలియక ఆందోళన పడుతున్న వాళ్లకు ఈ వేదిక అనుమానాలన్నీ నివృత్తి చేసింది. అసరా లేక అల్లాడుతున్న పండుటాకులకు ‘సాక్షి’ జనపథం ఊతకర్ర అయ్యింది. సాంకేతిక సమస్యతో అర్హత లిస్టు నుంచి తొలగించిన 8 మంది వృద్ధుల పేర్లను, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అప్పటికప్పుడు స్థానిక ఎంపీడీఓ మచ్ఛేంద్రతో మాట్లాడి వారికి తొలి లిస్టులోనే నమోదు చేయించారు. నేటి నుంచి అమలు చేస్తున్న అసరా పథకంలో వాళ్లు రూ.1000 అందుకోనున్నారు. గతంలో కంటే ఎక్కువే గ్రామంలో మొత్తం 483 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరి పింఛన్ ఉంటే వారిలో ఒకరి పేరును ప్రభుత్వం తొలగించింది. ఏడున్నర ఎకరాలకు పైగా మెట్టభూమి ఉన్న వారిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం 349 మంది తొలి జాబితాకు అర్హత సాధించారు. వీళ్లలో 221 మంది వృద్ధులు, 99 మంది వితంతువులు, 29 మంది వికలాంగులు అర్హులుగా గుర్తించారు. అధికారుల ఇచ్చిన నివేదికల ప్రకారం గత పింఛన్లతో పోలిస్తే... కొత్త ప్రభుత్వం తొలి జాబితాలోనే 5 మందికి ఎక్కువగానే పింఛన్లు ఇచ్చిందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. ఈలెక్కన గత ప్రభుత్వాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎక్కువ పింఛన్లు ఇస్తోందని, ఒక్క అనాజ్పూర్ గ్రామంలో మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా పింఛన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. అన్నీ కన్నీటిగాథలే... ‘అయ్యా...నిరుడు నా భర్త టక్కరై పోయిండు. ముగ్గురు పిల్లల తల్లిని, ముగ్గురికి ముగ్గురూ సిన్నపిల్లలే..ఎట్టా బతను సారూ’.. అంటూ మడిగె లక్ష్మి అనే మహిళ కన్నీళ్లు పెట్టింది. రామలింగారెడ్డి ఈమె పేరు వితంతవుల జాబితాలో ఉందా? లేదా? చూసి చెప్పాలని అధికారులను కోరారు. మడిగె లక్ష్మి పేరు అర్హుల జాబితాలో ఉందని వారు చెప్పడంతో లక్ష్మికి కొంత ఊరట లభించింది. పిల్లలను ఏదైనా సంక్షేమ హాస్టల్లో చేర్పించేందుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక సోమని లక్ష్మిది మరో బాధ... భర్త మహారాష్ట్రకు వలసపోయి అక్కడే చనిపోయాడు. మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అయితే అక్కడి మరణ ధ్రువీకరణ పత్రం ఇక్కడ చెల్లదంటే అధికారులు మెలికలు పెట్టారు. ఈ విషయాన్ని లక్ష్మి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన అక్కడే ఉన్న అధికారుతో మాట్లాడారు. అప్పటికే ఆమె వింతంతు పింఛన్కు దరఖాస్తు చేసుకోవడంతో ఎంపీడీఓతో మాట్లాడి అర్హుల జాబితాలో సోమని లక్ష్మి పేరు చేర్చారు. అంతేకాకుండా దౌల్తాబాద్ తహశీల్దార్తో అప్పటికప్పుడు సెల్ఫోన్లో మాట్లాడి దళితులకు ఇచ్చే మూడు ఎకరాల భూమి కూడాఇవ్వాలని సూచించారు. దీంతో లక్ష్మి వేదిక మీదున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది. మరో యువతి జయమ్మ భర్త గత ఏడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఏం చెప్పిందంటే ‘ నాభర్తకు టక్కరై అగస్తంగ పోయిండు. ఆపతిబంధు పథకం కింద కాయితం పెట్టుకుంటే...ఎమ్మారో సారు నా కాయితం నాకు తిప్పి పంపిండు. భర్తలేని పింఛను కూడా కాయితం పెట్టుకున్న గాని వచ్చిందో.. రాలేదో తెల్వదు’ అని చెప్పింది. గ్రామ కార్యద ర్శి రవి జాబితాను పరిశీలించి అర్హత జాబితాలో ఆమె పేరు ఉన్నట్లు నిర్ధారించారు. ఇక ఆపద్భందు పథకం కోసం ప్రయత్నం చేస్తానని సోలిపేట రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. ఇలా సోమని రామసోమె... కర్రూరి నర్సయ్య.. ఆరే పోచమ్మ... మంజుల... ఎంకవ్వ.. రామవ్వ దాదాపు 450 మంది అనుమానాలను ఆందోళనలకు పరిష్కారం చేపే విధంగా జన పథం సాగింది. -
నేడు అనాజిపూర్లో సాక్షి ‘జన పథం’
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకెళ్తున్న ‘సాక్షి’ మరో వినూత్న కార్యక్రమంతో అధికారులనే ప్రజల వద్దకు తీసుకువస్తోంది.ప్రజల సాధక బాధకాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం అనాజిపూర్లో ‘జన పథం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితోపాటు స్థానిక ఎంపీడీఓ, తహశీల్దార్లు హాజరవుతున్నారు. ఈ ‘జన పథం’ కార్యక్రమంలో వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. -
కొట్లాడి బతుకుదాం
Vip రిపోర్టర్ సోలిపేట రామలింగారెడ్డి సోలిపేట రామలింగారెడ్డి... నక్సలైటుగా తుపాకీ ఎత్తినా..! జర్నలిస్టుగా కలం పట్టినా... ఎమ్మెల్యేగా శాసనసభలో గళం విప్పినా.. ఆయన ఎప్పుడూ పేదల పక్షపాతే. అణగారిన వర్గాల ప్రతినిధే. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మళ్లీ జర్నలిస్టు అయ్యారు. ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారి ఆదివారం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని చేనేత కాలనీ, చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం కార్యాలయంలో కలియ తిరిగారు. మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికులను పలకరించారు. నరాలను దారాలు చేసి బట్ట నేస్తున్న నేతన్నల కష్టాన్ని స్వయంగా చూశారు. నేతన్న గుండెలోతుళ్లో దాగి ఉన్న దుఃఖాన్ని తడిమారు. రోజురోజుకూ ‘పోగు’బంధం బలహీన పడటానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ‘మీకు న్యాయం జరక్కపోతే...మీ తరఫున పోరాడటానికి నేను సిద్ధం’ అంటూ హామీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత తనను మళ్లీ జర్నలిస్టును చేసిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ కోసం చేనేతలు ఉద్యమాలు చేసిండ్రు.. ఇక్కడి యువకుడు వంగ శేఖర్ ఆత్మత్యాగం చేసి అమరుడు అయ్యాడు. మీ హక్కులను పోరాడి సాధించుకోవడం మీకో లెక్కా? మీ పింఛన్ కట్ అయినా, మీకు అన్యాయం జరిగినా, మీ తరఫున నేను పోరాడతా. డిమాండ్ చేయండి... కొట్లాడండి. చావుతో సమస్య పరిష్కా రం కాదు. మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు. ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో నిలబడి కలబడిబతకాలి. -సోలిపేట రామలింగారెడ్డి రామలింగారెడ్డి: ఇన్నేళ్ల నుంచీ చేనేత రంగం అభివృద్ధి చెందక పోవటానికి కారణం ఏమిటి? బోడ శ్రీనివాస్: చేనేతను, టెక్స్టైల్స్ను ఈ రెండింటిని ప్రభుత్వాలు ఒకే గాటున పెట్టి చూస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే నిధులల్లో 90 శాతం నిధులు టెక్స్టైల్స్కు ఇస్తుంటే, మాకు ఇచ్చే నిధులు మాత్రం నామమాత్రంగా ఉంటున్నాయి. ప్రజలకు అవసరమైన బట్టలు చేనేతలు తయారు చేయలేకపోతున్నారు. పెద్దపెద్ద కంపెనీలు నేరుగా స్పిన్నింగ్ మిల్ నుంచి యారం(దారం) అర్డర్ చేసి దిగుమతి చేసుకుంటున్నాయి. వారు తయారు చేసిన బట్టను మార్కెట్లో అమ్ముకోవటానికి సకల సౌకర్యాలు ఉన్నాయి. మా దగ్గర అంత పెట్టుబడి లేదు. మా బట్టకు మార్కెట్లేదు. మా బతుకులకు మార్పులేదు. ఈ సర్కారును పెట్టుబడి పెట్టి చూడమని చెప్పండి..60 గజాల చీరను అద్దం లెక్కన నేసి అగ్గిపెట్టెలో మలిచి పెట్టి ఇయ్యకుంటే సూడురి. రామలింగారెడ్డి: దుబ్బాక చేనేత అంటేనే ఆత్మహత్యల అడ్డా అంటారు.. నిజానికి ఇక్కడ ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు? ఆలేటి కృష్ణహారి: ఆత్మహత్యలు నిజమే సార్.. ఎంత మంది అంటే ఏం జెప్పను సారు.. మొన్ననే వయిట్ల కేశాలు సచ్చిపోయే.. ఆళ్లిట్లోనే సీనివాసులు పోయెనా..! అంతకు మందే ఆలేటి భిచ్చపతి సచ్చిపోయే.. ఈ మధ్యనే గుండ్ల రాజేశం ఎళ్లిపోయే... ఎంత మందని సెప్పాలే సారు. ఈ సావులు ఇన్నాటియా సారు. నాకు యాదున్నంత వరకు 250కి పైనే సచ్చిపోయిండ్రు. ఈ సావులు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినయి. రామలింగారెడ్డి: ఆప్కో ద్వారా ప్రభుత్వమే మీ బట్టలు కొనుగోలు చేస్తుందని గతంలో చెప్పారు కదా? చీర్ల రఘుపతి: మా ముందటి తరపోళ్లు (ముందు తరం) బట్టనేసి కూసున్న కాన్నే అమ్ముకునేటోళ్లు. అప్పుడు రేషానికి, యారంకు ఇంత ధరలు ఎక్కడియి. ఆల్మగలు మూడు దినాలు కట్టపడితే నూరు రూపాయిలు (రూ.100) దొరికేటియి. ఇప్పుడు మిల్లు బట్టలొచ్చే... ఎక్కడ పడితే సింథటిక్ బట్టలు పెట్టి అమ్ముతుండురి. ఇగ మా బట్టలు కొనేటోళ్లే లేకపోయిరి. ఆప్కో ఆదుకుంటదీ...ఆప్కో ఆదుకుంటది అని జెప్పిరి కానీ ఆప్కో రాలే నా గీప్కో రాలే. మా బతుకులు కుక్కకంటే హీనం. చంద్రశేఖర్కు(కేసీఆర్) అన్ని తెలుసు. ఇక్కన్నే సదువుకున్నోడు. ఆయన మా బతుకుల మీద ఆలోచన జేస్తే బత్తం.. లేకుంటే సత్తం. రామలింగారెడ్డి: మగ్గం పని మీద రోజుకు ఎంత కూలి వస్తుంది? నాగభూషణం: ఎంత కష్టంజేసినా రోజుకు రూ.100 మించి కూలి పడదు. సొంతంగా నేసుకుందామంటే పెట్టుబడి లేదు. మగ్గం నేస్తున్న ప్రతొక్కరికి రోజుకు రూ.200... రూ.300 కూలీ పడితేనే మేం బత్తం లేకుంటే మళ్లా ఆత్మహత్యలు, ఆకలి చావులు స్టార్లు అయితయి. దుబ్బాకంతా స్మశానం అయింతది. రామలింగారెడ్డి: సచ్చి ఏం సాధిస్తారే ? చనిపోయిన వారి పిల్లల బాధలు చూస్తున్నారు కదా? తుమ్మ వెంకట్రాజం: ఈడు మీదున్నొళ్లు పని జేస్తెనే రోజుకు రూ.50... రూ.60ల పనైతది, ఎంత జేసినా రూ.100 లోపే పనైతది. అగజూడు... నేను ఇప్పుడు 65 ఏండ్లుంట. నేను నేస్తే కాదు. ఎంత జేసినా నాకు రూ.40 కూడా పడవు. మందులకు నెలకు రూ.2 వేలు మించిపోతన్నయి. ఇగనేను ఉరేసుకొనో....మందు మింగో సావుకపోతే బతికి ఏమన్నా ఫాయిదా ఉందా లింగన్న. రామలింగారెడ్డి: ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరు అంటున్నారు.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ దగ్గర ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా? బోడ శ్రీనివాస్: మేం రెండు రకాల బట్టలు తయారు జేస్తున్నం. ఒకటి షర్టింగ్... ఇంకోటి బెడ్ షీట్లు. ప్రస్తుతం మేం షర్టింగ్ చేస్తే మీటర్కు రూ.48 ఉంటది. దీంతోటే చేనేతకు కూలీ రూ.14 ఇస్తరు. మేం ఎంత కష్టపడినా నాలుగైదు మీటర్లకు మించి నేయలేము. ఈ లెక్కన మాకు పడేది రూ.56 నుంచి రూ.70 వరకే. అదే ప్రభుత్వం ప్రోత్సహించి లెనిన్ షర్టింగులు మాతో నేపిస్తే... దానికి మీటర్కు రూ.500 పడుతది. వీవర్ కూలీ రూ.50 ఇస్తరు. ఈ లెక్కన రోజుకు ప్రతి చేనేతకు రూ.300 వరకు పడే అవకాశం ఉంది. మేం సంఘం తరఫున షాంపిల్ కింద రూ.10 లక్షలు పెట్టి లెనిన్ బట్ట నేసినం. అప్పుడు నెలకు రూ.8 వేలు, రూ.9 వేలు వరకు గిట్టుబాటు అయింది. రామలింగారెడ్డి: ఆత్మహత్య చేసుకున్న వారి పిల్లల పరిస్థితి ఏమిటీ? లావణ్య: ఏముందు సారూ...నా మొగడు చేనేత సంఘపొళ్లకు నేను రేపు చస్తానని మరీ చెప్పి రంగుల్లో కలిపే నట్రేట్ తాగి సచ్చిపోయిండు. అప్పులోళ్ల బాధలకు ఏగలేకనే నట్రేట్(నైట్రేట్) తాగిండు. కూతురు పెళ్లి కోసం ఉన్న ఇళ్లు అమ్ముకున్నా అప్పులు తీరలేదు. ఇళ్లుకొన్నొళ్లు ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నరు. అప్పులోళ్ల బాధలెక్కువయ్యాయి.. చేనేత సంఘ సభ్యులు కలిసి చందాలు చేసి అంత్యక్రియలు చేశారు. అద్దె ఇంట్లోనే ఉంటున్నా. వైట్ల శ్రీనివాస్ భార్య లావణ్య: మగ్గానికయ్యే పెట్టుబడుల కోసం అప్పులు చేసిండు. అప్పులోళ్లు రోజు ఇబ్బంది పెడుతుంటే అప్పులు తీర్చే మార్గం లేక నైట్రేట్ను మింగి ఇద్దరు చిన్న కూతుళ్లను విడిచి వెళ్లిండు. బతకడమే భారమవుతోంది. వీరబత్తిని శ్రీనివాస్ భార్య బాలమణి : అప్పులు తీర్చే మార్గం లేక నైట్రేట్ను రెండేళ్ల కిందమింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఉండడానికి కనీసం ఇళ్లు కూడా లేదు. ఒకనొక కూతురు రేవతి (9) సాకడమే కష్టమవుతోంది. కనీసం వితుంతువు పెన్షన్ కూడా రావడం లేదు. అద్దె ఇంట్లోనే దుర్భర జీవనాన్ని గడుపుతున్నా.