మీ దగ్గర ఆధారాలుంటే.. సిట్‌ ఎందుకు?: వెల్లంపల్లి | Ex Minister Vellampalli Srinivas Fires On Chandrababu Naidu Laddu Politics, More Details Inside | Sakshi
Sakshi News home page

మీ దగ్గర ఆధారాలుంటే.. సిట్‌ ఎందుకు?: వెల్లంపల్లి

Published Sun, Sep 29 2024 12:28 PM | Last Updated on Sun, Sep 29 2024 1:36 PM

Ex Minister Vellampalli Srinivas Fires On Chandrababu Laddu Politics

సాక్షి, తాడేపల్లి: లడ్డూలో కల్తీ జరిగితే ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు? బాధ్యులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదంటూ.. చంద్రబాబు నీచ రాజకీయాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు బాబు డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

శ్రీవారి భక్తుడని చెప్పుకునే బాబు ఇలాంటి రాజకీయం చేస్తారా?. జులై 23న రిపోర్ట్‌ వస్తే సెప్టెంబర్‌ 19 వరకు ఏం చేశారు?. 2 నెలలు ల్యాబ్‌ రిపోర్ట్‌ను ఎందుకు బయటపెట్టలేదు’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్‌ నిలదీశారు. ‘‘చంద్రబాబు,ఈవో మాటలకు పొంతన లేదు. మీ దగ్గర ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి కదా?. సిట్‌ ఎందుకు?’’ అంటూ వెల్లంపల్లి దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: ‘టీడీపీ ఆఫీస్‌లో టీటీడీ రిపోర్ట్.. ఏంటీ గూడుపుఠాణి?’

‘‘చంద్రబాబు వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆధారాల్లేకుండా అడ్డమైన ఆరోపణలు చేశారు. తప్పు జరిగితే ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదు?. కంటితుడుపు కోసం ఇప్పుడు సిట్ వేశారు. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రే ఆరోపణలు చేశాక ఇక సిట్ దర్యాప్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏఆర్ ఫుడ్స్ నిజంగానే తప్పు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. సనాతన ధర్మం గతంలో లేనట్టు  పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. చెప్పులు వేసుకుని దీక్షలు చేయటం పవన్ కళ్యాణ్‌కే చెల్లింది. ఇలాంటి దారుణాలను మేము ఎప్పుడూ చూడలేదు. మాటలు చెప్పే ముందు సనాతన ధర్మాన్ని పవన్ పాటించాలి

..ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన రెండు నెలల వరకూ దాన్ని ఎందుకు బయట పెట్టలేదు?. ఆ రిపోర్టు గురించి టీడీపీ ఆఫీసులో మాట్లాడటం ఏంటి?. వనస్పతి కలిసిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపామని ఈవో శ్యామలరావు జులై 23న చెప్పారు. జంతువుల కొవ్వు కలిసిందని సెప్టెంబరు 18న చంద్రబాబు కూటమి మీటింగ్‌లో మాట్లాడారు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. కానీ వనస్పతి కలిసిన ట్యాంకర్లను వెనక్కు పంపామని సెప్టెంబరు 20న ఈవో శ్యామలరావు చెప్పారు. మళ్లీ చంద్రబాబు సెప్టెంబరు 22న మాట్లాడుతూ ఆ నెయ్యిని వాడారని మరీసారి అబద్దాలు చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రా? టీటీడీ ఈవోనా?. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే రకం చంద్రబాబు.

..హరికృష్ణ మృతదేహం పక్కనే పొత్తుల గురించి చర్చించిన నీచ చరిత్ర చంద్రబాబుది. సూపర్ సిక్స్ పథకాల నుండి డైవర్షన్ కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు. లడ్డూ విషయమై సుప్రీంకోర్టు విచారణ జరపాలి. తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చేసిన తప్పును ఒప్పుకుంటూ చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. చంద్రబాబూ నీ తప్పు ఒప్పుకో.. లేకపోతే వెంకటేశ్వరస్వామి ఒప్పుకోడు.

వరదల మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వరదల పేరుతో చంద్రబాబు వందల కోట్లు వసూలు చేశారు. అందులో పదిశాతం ఖర్చు పెట్టినా బాధితులను ఆదుకోవచ్చు. వరద బాధితులపై లాఠీ ఛార్జి చేసిన ఘనత చంద్రబాబుది. సాయం చేయమని కోరితే లాఠీఛార్జి చేస్తారా?. పరిహారం ఎగ్గొట్టడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వీటన్నిటికీ చంద్రబాబు బాధ్యత వహించాలి’’ అని వెల్లంపల్లి డిమాండ్‌ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement