
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని విస్తరించి పేదలకు మంచి వైద్యం అందేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విషం చిమ్మడం దారుణం అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన హయాంలో ఆరోగ్య శ్రీని పూర్తిగా నిరీ్వర్యం చేయడం ఆనాడు రాధాకృష్ణకు కన్పించలేదా అని ప్రశ్నించారు. నిరుపేదల నిధికి సర్కారు గ్రహణం అంటూ ఆంధ్రజ్యోతి రాసిన అవాస్తవ రాతలపై ఆదివారం ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు రూ.680 కోట్లు బకాయిలు పెట్టిపోతే వైఎస్ జగన్ సీఎం అయ్యాక చెల్లించిన విషయం జగమెరిగిన సత్యం అన్నారు. ఈ విషయం రాధాకృష్ణకు తెలియకపోవటం ఆశ్చర్యకరం అన్నారు. ఆరోగ్యశ్రీకి ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచడంతో పాటు, జబ్బుల సంఖ్యను 2,434కు పెంచడం విప్లవాత్మక నిర్ణయం అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు మాత్రమే సీఎం సహాయ నిధికి రిఫర్ చేయాలని ఎమ్మెల్యేలకు సూచించడంలో తప్పేముందని నిలదీశారు.