
సాక్షి,అమరావతి: ‘అల్జీమర్స్ చంద్రబాబు.. ఆల్ జీరో టీడీపీ’ అని ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. మంచిని వినలేని విఫల ప్రతిపక్షమని రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి, మేలు జరగడానికి ఏమాత్రం ఇష్టపడని తెలుగుదేశం పార్టీ.. చివరికి విఫల ప్రతిపక్షంగా మిగిలిందన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన మాట్లాడారు.
‘ఇది చాలా దురదృష్టకరం. ఆ పార్టీ సభ్యులు శాసనసభకు వస్తూనే.. ఎప్పుడెప్పుడు సభ నుంచి బయటకు వెళ్దామా.. అనే లక్ష్యంతో వస్తున్నారేమో.. ప్రజలకు జరుగుతున్న మంచిని.. జరగబోయే మంచిని వారు వినలేకపోవడం కూడా చాలా బాధాకరం. ఈ పరిస్థితిని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని’ చెల్లుబోయిన తెలిపారు. అసెంబ్లీలో సీఎం జగన్.. చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో చెప్పకనే చెప్పారని.. ఒక అబద్దాన్ని నిజం చేయాలనే చంద్రబాబు ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమైందని స్పష్టం చేశారు.
సీఎం జగన్దే ఆ ఘనత
ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న సీఎం జగన్ దేశంలోనే ముందు వరుసలో నిలిచారని కొనియాడారు. చేయనిది చెప్పలేను.. చేయగలిగిందే చెబుతాను. చెప్పిన మాట చేసి చూపించేందుకు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించనంటూ.. ఎన్నికల మ్యానిఫెస్టోను తూ.చా తప్పకుండా నూటికి నూరుశాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతోందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షం
చంద్రబాబు పరిపాలన కాలంలో లెక్కలేనన్ని చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల్ని కనీసం పట్టించుకోని పరిస్థితి, రైతులకెక్కడా ఇన్పుట్ సబ్సిడీ గానీ ఇన్య్సూరెన్స్ గానీ అందించిన దాఖలాలే కనిపించవు. ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారు. పేదరికాన్ని రూపుమాపాలనే ఆలోచన కూడా చేయలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇష్టానుసారంగా అనుమతులిచ్చి.. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలన్నింటీనీ నిర్వీర్యం చేశారు. ఇన్ని తప్పుడు పనులు చేసిన టీడీపీ.. ఇవాళ మేం శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే.. ప్రజలకు జరిగన మేలు గురించి చెబుతుంటే వినలేని పరిస్థితిలో ఉండటం బాధాకరం. సభలోకి ఫ్ల కార్డులు పట్టుకురావడం.. నిండు సభలో స్పీకర్ను అగౌరపరిచేలా కాగితాలు చించి వారిపై విసరడం, విజిల్స్ వేయడం ఎంతవరకు సబబని మంత్రి చెల్లుబోయిన చంద్రబాబును ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉండగా ప్రజలకు ఏమీ చేయకున్నా.. మా ప్రభుత్వం వచ్చాక మేం చేసిన ప్రజామేలును వివరిస్తుంటే.. ప్రతిపక్ష సభ్యులు అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాని ఈ సందర్భంగా కోరారు.
పవన్కళ్యాణ్ మాటలు ప్రజాస్వామ్యంలోనే ఒక వింత
పేదవాడ్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం. అలాంటి మహోన్నతుల ఆశయాలకనుగుణంగా సీఎం జగన్ తన పరిపాలనలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. డీబీటీ ద్వారా అర్హులైన పేదల ఖాతాల్లో రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిని జమచేసి మేలు చేశారు. ఇది పవన్కళ్యాణ్కు నచ్చడం లేదంట. ఇతను రాజకీయాల్లోకొచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కాదా..? నిత్యం మోసాలతో ప్రజల్ని మభ్యపెట్టే చంద్రబాబు పక్కన చేరి పవన్ సాధించేదేముంది..? ఒకపక్కన ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున మంచి చేస్తుంటే.. అన్నిరంగాల ప్రజలు ప్రభుత్వ మంచిని హర్షిస్తోంటే.. ఈ పవన్కళ్యాణ్ మాత్రం ఎందుకు విమర్శిస్తున్నట్టు..? మంచిని ప్రోత్సహించాల్సిన సంస్కారం ఆయనకు లేదా..? కేవలం ఒక కులానికే ప్రతినిధిగా ఆయన మాటలతీరును ప్రజాస్వామ్యవాదులంతా తప్పుబడుతున్నారు. మంచి చేస్తోన్న ప్రభుత్వాన్ని గద్దె దింపుతానంటూ.. ప్రజల ముందుకొస్తున్న పవన్కళ్యాణ్ మాటలు ఈ ప్రజాస్వామ్యంలోనే వింతగా చెప్పుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment