
జైపూర్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తానెప్పుడూ అడ్డు పడలేదని, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోతే సమావేశాల ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించలేదని రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆరోపించారు. గురువారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న డిమాండ్కు తాను ఎప్పడూ అడ్డు చెప్పలేదని, పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టే మొదట్లో ఒప్పుకోలేదన్నారు. సాధారణ అసెంబ్లీ సమావేశాలా? లేక బల పరీక్ష కోసం అసెంబ్లీ సమావేశాలా? అన్నదానిపై సీఎం గహ్లోత్ స్పష్టతే ఇవ్వలేదని గవర్నర్ మిశ్రా ఆరోపించారు.
రాజ్భవన్ ముందు ఎమ్మెల్యేలతో సీఎం గహ్లోత్ ధర్నాకు దిగడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. 1995 లో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్భవన్ ముందు ధర్నా గురించి ప్రస్తావించగా... ఈ ధర్నాకు, గహ్లోత్ చేసిన ధర్నాకు చాలా తేడా ఉందని స్పష్టం చేశారు. సీఎం గహ్లోత్ మెజారీ ఉందని చూపించేంత వరకూ ప్రభుత్వంపై తానేమీ వ్యాఖ్యలు చేయనని ఆయన స్పష్టం చేశారు.
(చదవండి : రాజస్తాన్ డ్రామాకు తెర)
రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలి కదా అని ప్రశ్నించినగా,.‘అవును గవర్నర్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. అయితే కోర్టు ఆదేశాలను, నిబంధనలను కూడా శ్రద్ధతో చూడాల్సి ఉంటుంది కదా’అని గవర్నర్ మిశ్రా పేర్కొన్నారు. కాగా, అనేక నాటకీయ పరిణామాల తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ మిశ్రా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నట్లు బుధవారం మిశ్రా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment