
సాక్షి, చెన్నై: గతంలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ సినీ నటి ఖుష్బూకు ఈసారి బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇటీవల బీజేపీలోకి చేరిన ఆమె చేపాక్కం–ట్రిప్లికేన్ నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా ఆ స్థానం అన్నాడీఎంకేకు వెళ్లింది. దీంతో ఆ నియోజకవర్గానికి పక్కనే ఉన్న థౌజండ్ లైట్స్ సీటును బీజేపీ ఖుష్బూకు ఖరారు చేసింది. అలాగే ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఎల్మురుగన్ తారాపురంలో, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ సినీ నటుడు కమల్ హాసన్ బరిలో ఉన్న కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
ఇక డీఎంకే నుంచి సీటు ఆశించి భంగపడ్డ మదురై జిల్లా తిరుప్పరగుండ్రం డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే శరవణన్ ఆదివారం బీజేపీలో చేరారు. ఆయనకు మదురై ఉత్తరం సీటును బీజేపీ కేటాయించింది. డీఎంకే నుంచి బీజేపీలో చేరిన రెండో ఎమ్మెల్యేగా శరవణన్ నిలిచారు. మిత్రపక్షం బీజేపీకి అన్నాడీఎంకే కన్యాకుమారి లోక్సభ స్థానంతో పాటు 20 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment