నేడు టీడీపీ – జనసేన ఉమ్మడి సభకు హాజరయ్యేవారు వేలల్లోనే
ఏడు ఎకరాల్లో వేదిక, రెండు హెలిప్యాడ్లు, వీఐపీ రెస్ట్ రూమ్లు
మిగతా 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు
ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీలు.. వచ్చేది 33 వేల మందే
సాక్షి, అమరావతి: పిల్ల కాలువను సముద్రంలా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. టీడీపీ – జనసేన ఉమ్మడిగా ప్రత్తిపాడు వద్ద నేడు తలపెట్టిన తొలి సభను జనవాణినితో ఉప్పొంగిన ‘సిద్ధం’ సభలతో పోలుస్తూ చంకలు గుద్దుకుంటోంది.
చంద్రబాబు – పవన్ కోసం రెండు హెలిప్యాడ్లు, సేద తీరడం కోసం సభా ప్రాంగణంలో సగం స్థలంలో ఏర్పాట్లు చేశారని, అక్కడి మైదానంలో వేల మంది మాత్రమే కూర్చునే వీలుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమరనాదంతో వైఎస్సార్సీపీ భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జన సముద్రాలను తలపించాయి.
మార్మోగుతున్న రణ నినాదం..
సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ భీమిలిలో గత నెల 27వతేదీన సిద్ధం తొలి సభను నిర్వహించారు. సీఎం జగన్ సమర శంఖం పూరించిన ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. సిద్ధం రెండో సభను ఈనెల 3న ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద నిర్వహించారు.
వేదికపోనూ కార్యకర్తలు, అభిమానులు కూర్చొని సభను వీక్షించడానికి 110 ఎకరాల మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి 6 – 7 లక్షల మందికిపైగా ఈ సభకు తరలివచ్చారు. ఇక రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ మూడో సభకు వేదికపోనూ ప్రజల కోసం ఏకంగా 250 ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాట్లు చేశారు.
ఈ సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరి«ధిలోని 52 నియోజకవర్గాల నుంచి 10 నుంచి 11 లక్షల మంది హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా రాప్తాడు సిద్ధం సభ నిలిచిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఉన్న విశ్వాసానికి ‘సిద్ధం’ సభలు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు.
స్థైర్యం నింపేందుకు పాట్లు...
జనసేన 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రెండు పార్టీల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ‘సిద్ధం’ సభలు ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుండగా మరోవైపు టీడీపీ – జనసేనలో భగ్గుమన్న విభేదాలతో క్యాడర్ చెల్లాచెదురైంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీడీపీ–జనసేన శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఎల్లో మీడియా తంటాలు పడుతోంది.
మొత్తం 33 వేల కుర్చీలు
టీడీపీ–జనసేన నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఉన్న 22 ఎకరాల మైదానాన్ని ఎంచుకున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే రెండు పార్టీల నేతలు సుమారు 500 మంది కూర్చోవడానికి వీలుగా వేదికతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వేర్వేరుగా హెలికాఫ్టర్లలో రానుండటంతో అక్కడకు సమీపంలో రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు.
వేదిక, హెలి ప్యాడ్లు, వీవీఐపీల రెస్ట్ రూమ్ల నిర్మాణానికి ఏడు ఎకరాలు పోగా మిగిలిన 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు సిద్ధం చేశారు. ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీలు వేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంటే 22 గ్యాలరీల్లో 33 వేల కుర్చీలు పట్టే అవకాశం ఉంది.
మొత్తం కుర్చీలన్నీ నిండిపోయి 15 ఎకరాల ప్రాంగణం కిక్కిరిసిపోతే దాదాపు 60 వేల మంది హాజరైనట్లు లెక్క అని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇలా వేల మంది మాత్రమే హాజరయ్యే సభలను జన సముద్రాలతో పోల్చడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సభకు ఓ నమస్కారం!
సాక్షి, భీమవరం: టీడీపీ – జనసేన ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలిసభ ‘తెలుగు జనజెండా’కు అసమ్మతి సెగ తగిలింది. పొత్తుల పేరుతో 24 సీట్లకే పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు, శ్రేణులు ఈ సభకు ముఖం చాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సభా ప్రాంగణం, ఏర్పాట్ల విషయంలో రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం కొరవడటంతో ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్ద తణుకు నియోజకవర్గ ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు నిరసన గళం వినిపించారు. తణుకులో ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శివరామరాజును పిలవకపోవడంతో ఆయన వర్గీయులు హాజరు కాలేదు.
కొత్తపేటలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, ఆయన అనుచరులు డుమ్మా కొట్టారు. మండపేటలో ఉమ్మడి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ప్రకటించడంపై జనసేన ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ గుర్రుగా ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ సీటు కందుల దుర్గేష్కు సీటు కేటాయించపోవడంతో సభకు దూరంగా ఉండాలని ఆయన వర్గం భావిస్తున్నట్లు సమాచారం.