![TDP Janasena Alliance Ticket Fight East Godavari District - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/10/tdp-2.jpg.webp?itok=jEiLJj64)
టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలిజాబితా ప్రకటించిన తర్వాత అన్ని స్థానాల్లోనూ ఏదో ఒకరకంగా రచ్చ జరుగుతోంది. అభ్యర్థులను ప్రకటించని ఏరియాల్లో సైతం గొడవలు మొదలయ్యాయి. స్థానికులను విస్మరించి బయటి ప్రాంతాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేస్తే సహించేదిలేదంటూ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలు ఓపెన్గా ప్రకటిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులను కూడా వివిధ కారణాలతో అక్కడి క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఇంతకీ తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం.
జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సొంత పార్టీ అభ్యర్ధులపై టీడీపీలోనే వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబికింది. పి.గన్నవరం అభ్యర్ధిగా మహాసేన రాజేష్ పేరును ప్రకటించడంతో.. స్థానిక నేతలు పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి, తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మహాసేన రాజేష్ను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. ఆ తర్వాత జరిగిన టీడీపీ సమన్వయకమటీ సమావేశానికి వచ్చిన జనసేన కార్యకర్తలు టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు. రాజేష్ కు పి.గన్నవరం టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో తనపట్ల తీవ్రస్థాయిలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చూసిన రాజేష్ పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇదే జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలోని పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. టీడీపీ సీనియర్ నేత రెడ్డి సుబ్రమణ్యం ఇక్కడ ఇంఛార్జిగా ఉన్నా, ఆయనను ఏ మాత్రం పట్టించుకోకుండా తనకే సీటు దక్కతుందనే ఆలోచనతో అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటాన్ని రెడ్డి సుబ్రమణ్యం తప్పుపడుతున్నారు. పార్టీ నాయకత్వం అసలు అభ్యర్ధినే ప్రకటించకుండా...సుభాష్ తానే అభ్యర్ధిలా వ్యవహరించడంపట్ల సుబ్రహ్మణ్యం మండిపడుతున్నారు. రౌడీ షీటర్ సుభాష్ మాకొద్దంటూ టీడీపీ కార్యకర్తలు ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతోపాటు ప్లెక్సీలు, బ్యానర్లు మంటల్లో వేసి దగ్ధం చేశారు.
మరోవైపు అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించకుండానే రామచంద్రాపురం నియోజకవర్గానికి రెడ్డి సుబ్రమణ్యం సతీమణి పేరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో కూడా దీనిపై తీవ్ర స్థాయిలో రగడ చెలరేగింది. చివరకు ఈ విషయం తనకు తెలియదని, పార్టీ ఎవరి పేరు ప్రకటిస్తే వారే అభ్యర్థిగా ఉంటారని రామచంద్రాపురం ఇంఛార్జి రెడ్డి సుబ్రమణ్యం స్పష్టం చేశాకే జనసేన వర్గాలు శాంతించాయి.
Comments
Please login to add a commentAdd a comment