పట్టభద్రుల పట్టమెవరికి ? | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల పట్టమెవరికి ?

Published Mon, May 27 2024 2:04 AM

Warangal and Khammam and Nalgonda Graduates Constituency By Election Set for Monday

బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ 

నేడు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో 52 మంది ఉన్నా, ప్రధానపోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పారీ్టలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.

సోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వారి తరఫున ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్‌ కాల్స్‌ ద్వారా ఆయా పారీ్టల అధినేతలతోపాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు. మిగతా గుర్తింపు పొందిన పారీ్టలతోపాటు స్వతంత్రులు పోటీలో ఉన్నా, ప్రధాన పారీ్టలకు పోటీగా ప్రచారం చేయలేకపోయారు.  

నిరుద్యోగులకు బీఆర్‌ఎస్‌ అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్‌ 
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచి్చనా, నియామకాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, ఉద్యోగులది అదే పరిస్థితి అంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయడంతోపాటు ఎన్నికల తర్వాత పాలనలో పారదర్శకత, ఉద్యోగ కల్పన, జాబ్‌ క్యాలెండర్‌ తీసుకొచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోంది. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తమ పార్టీ అభ్యరి్థని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతూ ప్రజల్లోకి వెళ్లింది. 

కాంగ్రెస్‌ మోసం చేసిందంటున్న బీఆర్‌ఎస్‌ 
ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. జాబ్‌ క్యాలెండర్‌ లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదని, తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను తాము భర్తీ చేశామని కాంగ్రెస్‌ చెబుతూ మోసం చేస్తోందని ఆరోపిస్తోంది.

ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చిందో ఎప్పుడు పరీక్షలు పెట్టిందో కాంగ్రెస్‌ పార్టీ చెప్పాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఎన్నికలో పట్టుభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బీఆర్‌ఎస్‌ అభ్యరి్థని గెలిపిస్తే పెద్దలసభలో ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల కల్పనకు జాబ్‌క్యాలెండర్‌ ప్రకటించేలా ఒత్తిడి తెస్తామని, పోరాడే పారీ్టకి పట్టం కట్టాలంటూ పట్టభద్రులకు బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేస్తోంది.

రెండూ మోసకారి పార్టీలే అంటున్న బీజేపీ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండూ మోసకారి పారీ్టలేనని, వాటి వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ వాటిని విస్మరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ కంటే అధికంగా అబద్ధాలు చెబుతూ మోసం చేస్తోందని బీజేపీ అంటోంది.

నోటిఫికేషన్‌ ఇచ్చి ఉద్యోగాల నియామకంలో బీఆర్‌ఎస్‌ విఫలం కాగా, కాంగ్రెస్‌ పార్టీ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, పరీక్షలు నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలతో ప్రజలు, పట్టభద్రులను మోసం చేస్తోందని ప్రచారంలో ఆరోపణలు గుప్పిచింది. ఇలాంటి పారీ్టలకు బుద్ధిచెప్పి బీజేపీకి మద్దతు ఇస్తే నిరుద్యోగుల తరఫున పోరాడుతామని పట్టభద్రులకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి త్రిముఖ పోటీలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement