యువత పోరును జయప్రదం చేయాలి
సింగరాయకొండ: కూటమి ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయినా సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు అమలు చేసి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చి యువతను మోసం చేసిందని దుయ్యబట్టారు. వైఎస్సార్ ఉన్నతాశయంతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుబట్టారు. బుధవారం జిల్లా కేంద్రం ఒంగోలులో చేపట్టే యువత పోరు కార్యక్రమానికి యువత, వారి తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తల్లికి వందనానికి అరకొర నిధులా?
తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్రంలో 1.20 కోట్ల మంది తల్లులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల ప్రకారం సుమారు 15 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేవలం 9 వేల కోట్లు మాత్రమే ప్రకటించారని మండిపడ్డారు. ప్రస్తుతం నూతన విధానం ప్రకారం 10 రోజుల పాటు విద్యార్థి ఎటువంటి కారణం లేకుండా పాఠశాలకు రాకపోతే అతని పేరు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారని ఆ ప్రకారం జిల్లాలో 45 వేల మంది విద్యార్థుల పేర్లు తొలగించారని ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికి కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టినప్పటికీ నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా కేటాయింలేదని ఆరోపించారు.
మెడికల్ కాలేజీలపై నిర్లక్ష్యం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డాక్టర్ కావాలన్న పేద పిల్లల కలలను నిజం చేసేందుకు 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 11 మెడికల్ కాలేజీలు మామే నిర్మించారని గుర్తు చేశారు. ఈ కాలేజీల ద్వారా 2,500 మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. మార్కాపురం, ఆదోని, పులివెందులలో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఇంకా పనులు ఉన్నాయని వాటిని గాలికి వదిలేసి పేద విద్యార్థులు డాక్టర్ కోర్సు చదవకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు పనిచేయవద్దని, వారికి పనిచేస్తే పాముకు పాలు పోసినట్లేనని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగంగా చెప్పడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో ఆరాచక పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఎప్పుడో ఏదో అన్నారని పార్టీ కార్యకర్తలతో కేసులు పెట్టించి కోర్టు ముందు హాజరుపరచకుండా వైఎస్సార్ సీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురి చేయడాన్ని ఆక్షేపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ను హోం మంత్రి అనిత చెత్త యాప్ అంటున్నారంటే మహిళలపై ఆమెకు ఉన్న గౌరవం అర్థమవుతోందన్నారు. అనంతరం యువత పోరుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ ఇంటలెక్చువల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, ఎంపీపీ కట్టా శోభారాణి, బీసీ సెల్ రీజినల్ కో ఆర్డినేటర్ బొట్లా రామారావు, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మాకినేని వెంకట్రావు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్, జిల్లా బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడు పుట్టా వెంకట్రావు, జిల్లా ఆర్గనైజేషన్ మెంబరు కట్టా ఆనంద్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మారంరెడ్డి గంగాధర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పరిటాల సునీల్కుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వసంతరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు యనమల మాధవి, ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షుడు భువనగిరి సత్యనారాయణ, పంచాయతీరాజ్ విభాగం షేక్ వన్నూరు, సోషల్ విభాగం అధ్యక్షుడు వేమిరెడ్డి పెద్దిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా కిరణ్కుమార్, ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సలీం, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు కొమ్ము ప్రభుదాస్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గాదంశెట్టి గుప్తా, జిల్లా ప్రచార విభాగం మాజీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సురేష్ పిలుపు
Comments
Please login to add a commentAdd a comment