రోడ్లు, భవనాల నిర్మాణాల్లో వేగం పెంచండి
● పెండింగ్ పనులు పూర్తి చేయండి ● జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● రహదారులు, భవనాల శాఖ పనుల పురోగతిపై సమీక్ష
సిరిసిల్ల: జిల్లాలోని రోడ్లు, భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో గురువారం ఆర్అండ్బీ ఇంజినీర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 12 రోడ్లు, 8 భవనాలు(వైద్య కళాశాలతో) ఏడు బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. రోడ్డు భవనాల శాఖ పరిధిలో పెండింగ్ రహదారి పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు ఏదైనా తాత్సారం ఉంటే వివరాలు అందించాలని, ప్రభుత్వానికి లేఖ రాసి బిల్లుల చెల్లింపు త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రతి రోడ్డు నిర్మాణ స్థితిగతుల గురించి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులోకి వచ్చే రోడ్డు పనులు ప్రాధాన్యతతో చేపట్టి పూర్తి చేయాలన్నారు. రోడ్డు నిర్మాణ పనులకు ఎక్కడా ఇసుక సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యత ప్రామాణాలతో చేపట్టాలని అన్నారు. వీర్నపల్లి దగ్గర పాఠశాల సమీపంలో సీసీరోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయించాలని కలెక్టర్ సంబంధిత తహసీల్దార్ను ఫోన్లో ఆదేశించారు. ఎన్నికల కోడ్ కూడా ముగిసిందని అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి పనులు జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. డీఎంఎఫ్టీ పరిధిలో పెండింగ్ బిల్లుల వివరాలు సమర్పించాలని, వెంటనే చెల్లించనున్నట్లు తెలిపారు. రూ.166 కోట్లతో చేపట్టిన వైద్య కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని వీటిని నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు, అన్నదానసత్రం, వీర్నపల్లి వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ముస్తాబాద్ మండలంలో తహసీల్దార్ ఆఫీస్ నిర్మాణం, కోర్టు భవనాల పనుల టెండర్ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణయ్య, డీఈఈలు శాంతయ్య, కిరణ్కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment