తొగుట(దుబ్బాక): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని ఎల్లారెడ్డిపేటలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మన్నె లోకేంధర్ (39) తనకున్న ఎకరం పొలంతోపాటు సిద్దిపేట పట్టణ వ్యాపారవేత్తకు చెందిన నాలుగు ఎకరాల భూమిని నాలుగేళ్లుగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. రోజూ మాదిరిగా గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లి పొలం గట్లపై ఏపుగా పెరిగిన గడ్డిని కోస్తున్నాడు. ఈ క్రమంలో బోరుమోటార్కు సమీపంలోకి వెళ్లి గడ్డి కోస్తుండగా కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. అక్కడే చుట్టుపక్క ఉన్న అన్న పోచయ్య, సమీప రైతులు వచ్చిచూడగా మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య శైలజ, కుమారులు ఆదికై లాష్ (5), వాసుదేవ్ (3), వృద్దురాలైన తల్లి ఉన్నారు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనిల్ తెలిపారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఇంటి పనులు చేస్తుండగా పొలం వద్దకు వెళ్లొస్తానంటూ చెప్పి తిరిగిరాని లోకాలకు పోయావా అంటూ లోకేందర్ భార్య శైలజ కన్నీరుమున్నీరుగా విలపించడం అందరనీ కంటతడి పెట్టించింది.
చెన్నాపూర్ గ్రామంలో వ్యక్తి
శివ్వంపేట(నర్సాపూర్) : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధి చెన్నాపూర్ గ్రామంలో గురువారం సాయత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సింగిరెడ్డి సుధాకర్రెడ్డి(45) గ్రామంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. శివారు పనులు చేసేందుకుగాను తడకలు సరిచేస్తుండగా ఇంటికి దగ్గరగా ఉన్న విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్తో మృతి చెందాడు.
మృతదేహంతో రాస్తారోకో :
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని మృతదేహంతో గోమారం– చిన్నగొట్టిముక్ల ప్రధాన రోడ్డుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో చేశారు. సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మధుకర్రెడ్డి విద్యుత్ సిబ్బందితో ఫోన్ మా ట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామ ని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి
ములుగు(గజ్వేల్) : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు మండలం కొక్కొండ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ కథనం మేరకు..గ్రామానికి చెందిన ఆశెల్లి అనిల్గౌడ్(30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. 26న సొంత ఆటో నడుపుతూ మండలంలోని బస్వాపూర్ నుంచి కొత్తూర్ వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో నోవా కంపెనీ సమీంపలోకి రాగానే ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. పక్కనే ఉన్న కాల్వలో పడటంతో అనిల్గౌడ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడి చిన్ననాన్న నాగులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ
టేక్మాల్(మెదక్): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన మండల కేంద్రమైన టేక్మాల్లో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ కథనం మేరకు.. టేక్మాల్ గ్రామానికి చెందిన చింత పోచమ్మ(40) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. నిత్యం మాదిరిగానే 26న సాయంత్రం కల్లు తాగేందుకు ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. గ్రామానికి చెందిన తిమ్మిగారి మధుసూదన్ పోచమ్మ కట్టెల మిషన్ వైపు వెళ్లినట్లు చెప్పడంతో అటువైపు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మృతురాలి కూతురు జ్యోతిక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు.
పొలం వద్ద గడ్డి కోస్తుండగా ప్రమాదం
తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో ఘటన
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో రైతు మృతి