
అక్కరకురాని ‘ఉపాధి’
వెంటనే విడుదల చేయాలి
కష్టపడి పని చేస్తున్నా వేతనాలు అందడం లేదు. వెంటనే ప్రభుత్వం వేతనాలు విడుదల చేయాలి. పనిచేస్తున్నాం కానీ కుటుంబాన్ని పోషించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి?
విజయ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు, హత్నూర
ఆందోళనకు వెనుకాడం
వెంటనే మూడు నెలల బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. అధికారులకు ఇప్పటివరకు వినతి పత్రాలు ఇచ్చాం. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చాలీచాలని వేతనాలు ఆపై నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి? వెంటనే వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన బాట పట్టేందుకు వెనుకాడమన్నారు.
సాయిలు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శి
హత్నూర (సంగారెడ్డి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వలసల నివారణ కోసం కూలీలకు గ్రామాల్లోనే పని కల్పిస్తూ పనులను పర్యవేక్షిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు లేవు. క్షేత్రస్థాయిలో అధికారుల ఆదేశాలు పాటిస్తూ కూలీలకు పని కల్పించడమే కాకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం ప్రతినెలా రావడం లేదు. జిల్లాలో 619 గ్రామపంచాయతీలలో 486 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. 2006లో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్లను నియామకం చేపట్టింది. 2019లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను పక్కకు పెట్టారు. తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యమాలు చేసి కోర్టు కేసు ద్వారా తిరిగి 2023 సెప్టెంబర్ 11న ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగంలో చేరారు. అప్పటినుంచి గ్రేడ్ వన్ ఫీల్డ్ అసిస్టెంట్కు రూ.12,120, గ్రేడ్ 2 ఫీల్డ్ అసిస్టెంట్కు రూ.10,120, గ్రేడ్ 3 ఫీల్డ్ అసిస్టెంట్కు రూ.9,100 వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది. కానీ గత మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు గ్రామంలోని పనులు కల్పించడంతోపాటు జాబ్ కార్డులను చూసి రికార్డులు రాయాలి. వీటితోపాటు ప్రస్తుత ప్రభుత్వం అదనంగా గ్రామపంచాయతీ కార్యక్రమాల్లో కూడా వాడుకుంటుందని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాల చేరవేతలోనూ...
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు చేరవేయడంలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు భాగస్వాములు అవుతున్నారు. కానీ మాకు వేతనాలు ఇప్పించాలని జిల్లా మండల స్థాయి అధికారులకు సైతం నెలల తరబడి వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఇకనైనా వేతనాలు మంజూరు చేయకుంటే ఆందోళన బాట పట్టేందుకు జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు ఇప్పటికే సమావేశమై కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఉపాధి హామీ పథకం రోజురోజుకు క్షేత్రస్థాయిలో నిర్వీర్యం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు.
మూడు నెలలుగా లేని వేతనాలు
జిల్లాలో 486మంది
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
వినతి పత్రాలిచ్చినా ఫలితం శూన్యం
ఆర్థిక ఇబ్బందుల్లో సిబ్బంది
ఆందోళనకు దిగే అవకాశం!

అక్కరకురాని ‘ఉపాధి’

అక్కరకురాని ‘ఉపాధి’