
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. నార్సింగి మండల కేంద్రానికి చెందిన బేడబుడగ జంగాల దుర్గయ్య కుమారుడు శివకుమార్(30) గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ గ్యాస్ స్టవ్, మిక్సీ కుక్కర్లు బాగు చేస్తుంటాడు. సోమవారం చేగుంట మండలం మక్కరాజ్పేటలో గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఎక్సెల్ పై నార్సింగి జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి దుర్గయ్య ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
నీటి కుంటలో పడి యువకుడు
అల్లాదుర్గం(మెదక్): నీటి కుంటలో పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్ఐ ప్రవీణ్రెడ్డి కథనం మేరకు.. టేక్మాల్ మండలం దన్నూర గ్రామానికి చెందిన నాయికిని సురేశ్(25) ముస్లాపూర్ గ్రామానికి చెందిన మమతతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది.పెళ్లి చేసుకొని ఇల్లరికం అల్లుడిగా వెళ్లారు. సోమవారం సురేశ్ అదే గ్రామానికి చెందిన ఆగమయ్య, సంగమేశ్తో కలిసి సీతారామా కుంటలో ఎడ్లను కడగడానికి వెళ్లారు. సురేశ్ కుంటలో మునిగిపోయాడని ఆగమయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే సురేశ్ను బయటికి తీసి జోగిపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సురేశ్ మృతిపై అనుమానం ఉందని తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పారిశ్రామిక వాడలో సెక్యూరిటీ గార్డు
మనోహరాబాద్(తూప్రాన్):అనారోగ్యంతో పారిశ్రామిక వాడలో సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. మంగళవారం ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన రాజు గాంధీ (58) ఆరు నెలల నుంచి మండలంలోని ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో మూతపడిన తనయ్ ఎకోవేర్స్ విస్తరాకుల పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. షిఫ్ట్ ఛేంజ్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున తోటి సెక్యూరిటీ గార్డ్ అరుణ్ మిశ్రా పరిశ్రమ వద్దకు వచ్చాడు. అప్పటికే సెక్యూరిటీ రూం వద్ద రాజు గాంధీ కిందపడి మృతి చెంది ఉన్నాడు. వెంటనే మృతుడి కుటుంబీలకు, పరిశ్రమ యజమానికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి పరిశీలించారు. అనారోగ్యంతో మృతి చెందాడని మృతుడి కుమారుడు శివరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి