
రెండు లక్షల ఉద్యోగాలు బోగస్సే
సిద్దిపేటజోన్: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగసేనని, నేటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో వరంగల్ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘నాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్, వెంకట్, మురళి, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అశోక్నగర్ కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేపట్టారు.. రాహుల్ గాంధీని అశోక్ నగర్కు తీసుకొచ్చి ప్రామిస్ చేయించారు. మీకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.. కానీ నిరుద్యోగులకు రాలేదు.. ఎందుకు మీ గొంతులు మూగపోయాయని హరీశ్ రావు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాల పేరిట యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీకి నిరుద్యోగుల బాధలు కనబడడం లేదా వినబడడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పిన నిరుద్యోగ భృతి వట్టి మాటేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి యువత కీలకమని, రజతోత్సవ సభకు వరంగల్ వరకు వెయ్యి మంది యువత పాదయాత్ర చేయనున్నారని అన్నారు. సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నిరుద్యోగ భృతి వట్టిమాటేనా?
ప్రభుత్వ తీరుపై హరీశ్ ఫైర్