
జెద్దా వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2025 మెగా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు పైలా అవినాష్, సత్యనారాయణ రాజు, షేక్ రషీద్ అమ్ముడుపోయారు. షేక్ రషీద్ ఇప్పటికే ఐపీఎల్లో ఓసారి సీఎస్కే జట్టులో భాగం కాగా.. అవినాష్, సత్యనారాయణలకు మాత్రం తొలిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఆడే అవకాశం దక్కింది.
విశాఖపట్నంకు చెందిన అవినాష్ను కనీస ధర రూ. 30 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాగా 24 ఏళ్ల అవినాష్కు అద్బుతమైన ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో బెజవాడ టైగర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఏపీఎల్-2024 సీజన్లో అవినాష్ అదరగొట్టాడు. కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడి 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని పంజాబ్ సొంతం చేసుకుంది. మరోవైపు కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజు ను రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగొలు చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆంధ్ర జట్టుకు ఆడుతున్న సత్యనారాయణ.. తన ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు.
ఇప్పటివరకు కేవలం 6 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన అతడు 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ముంబై తమ జట్టులో చేర్చుకుంది. ఇక గుంటూరు క్రికెటర్ షేక్ రషీద్ను మరో సారి సీఎస్కే సొంతం చేసుకుంది. అతడు కూడా తన బేస్ ప్రైస్ రూ.30 లక్షలకే అమ్ముడుపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment