ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సీజన్ను ఆంధ్ర జట్టు విజయంతో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ జట్టును చిత్తు చేసింది. తాజా సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆంధ్ర జట్టుకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
ఏడు మ్యాచ్ల్లో ఒక విజయం, 3 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 13 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆంధ్ర జట్టు ఎలైట్ గ్రూప్ ‘బి’లో ఆరో స్థానంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 95/7తో శనివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ చివరకు 39.4 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.
అభిజిత్ తోమర్ (31), అజయ్ సింగ్ (30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కాస్త పోరాడారు. ఆంధ్ర జట్టు బౌలర్లలో త్రిపురాణ విజయ్ మరోసారి 5 వికెట్లతో విజృంభించగా... పృథ్వీరాజ్ 4 వికెట్లు తీశాడు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 31 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి గెలిచింది.
రికీ భుయ్ (76 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో మెరవగా... శ్రీకర్ భరత్ (43; 5 ఫోర్లు), కరణ్ షిండే (35 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 258 పరుగులు చేయగా... ఆంధ్ర జట్టు 220 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టిన ఆఫ్స్పిన్నర్ విజయ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఎలైట్ గ్రూప్ ‘బి’ నుంచి విదర్భ, గుజరాత్ క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాయి.
చదవండి: 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment