‘త్యాగాలు చేశా.. ఐపీఎల్‌ వల్ల కెరీర్ నాశ‌న‌మైంది’ | Former Cricketer Kevin Pietersen Drops Major Bombshell Lost My Career Due To IPL | Sakshi
Sakshi News home page

Kevin Pietersen: ‘త్యాగాలు చేశా.. ఐపీఎల్‌ వల్ల కెరీర్ నాశ‌న‌మైంది’

Apr 7 2026 8:48 AM | Updated on Apr 7 2026 9:39 AM

Former Cricketer Kevin Pietersen Drops Major Bombshell Lost My Career Due To IPL

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ ఐపీఎల్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) వ‌ల్ల త‌న కెరీర్ నాశ‌న‌మైందంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. యూట్యూబ‌ర్ ర‌న్‌వీర్ అల్లాబ్దియాకు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో పీట‌ర్స‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్‌ మొదలైన 2008లో ఒకేఒక్క ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డిమిత్రి మస్క్‌రెనాస్‌ మాత్రమే ఆనాటి లీగ్‌లో ఆడాడు. 

కేంద్ర కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొనకుండా ఈసీబీ నిషేధించడమే అందుకు కారణం. 2009లో బ్రిటిష్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ బరిలో దిగేందుకు ఈసీబీ అనుమతించినా..దాన్ని మూడు వారాలకే పరిమితం చేసింది. దాంతో కెవిన్ పీట‌ర్స‌న్ ఐపీఎల్‌ లీగ్‌కే తొలి ప్రాధాన్యమిచ్చాడు. ఫలితంగా ఈసీబీతో అతడికి అంతరం పెరిగింది. ఈ నేప‌థ్యంలో పీటర్సన్‌ను ఈసీబీ జాతీయ జట్టుకు దూరం చేసింది.  

పీట‌ర్స‌న్ మాట్లాడుతూ..‘2008లో ఐపీఎల్ ప్రాచుర్యం పొందుతున్న సమయంలో, ఇంగ్లండ్‌ బోర్డు మ‌మ్మ‌ల్ని ఈ లీగ్‌లో ఆడేందుకు అనుమతించేది కాదు. కానీ అప్పట్లో బోర్డు నిర్ణయానికి నేను వ్యతిరేకంగా గ‌ళం విప్పాను. అందుకోసం నేను పెద్ద త్యాగమే చేశాను. అలా ఐపీఎల్ కోసం నా కెరీర్‌ను కోల్పోవాల్సి వ‌చ్చింది. ఈ కారణం చేతనే అప్పట్లో బోర్డులోని ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకంగా మారారు. 

దీంతో 33 ఏళ్లకే నా కెరీర్ ముగిసిపోయింది. నిజానికి నేను ఇంగ్లండ్ త‌ర‌ఫున 150 నుంచి 160 టెస్టులు ఆడి ఉండాల్సింది. ఇంగ్లండ్ బోర్డుతో విభేదాల కారణంగా అది సాధ్యం కాలేదు. అంతేకాదు ఆ సమయంలో నాపై వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బోర్డు కొన్ని వార్తా సంస్థలను కూడా వాడుకుంది. ఇప్పుడు ఆ గతాన్ని తవ్వుకోవడం నాకు ఇష్టం లేదని, ప్రస్తుతం నేను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నా. 

నేను పడ్డ ఇబ్బందుల వల్లే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఇవాళ స్వేచ్ఛగా ఐపీఎల్ స‌హా ఇత‌ర ప్రైవేటు లీగుల్లో ఆడుతున్నారు. ఇటీవ‌ల‌ జోస్ బట్ల‌ర్ న‌న్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విష‌యమై నాకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. నేను చేసిన పోరాటం వల్లే ఇప్పుడు మా ఆట‌గాళ్లంతా ఐపీఎల్ ఫలాలను అనుభవిస్తున్నారు’ అని పీట‌ర్స‌న్ చెప్పుకొచ్చాడు.  

ఐపీఎల్ 2009 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున పీటర్సన్ తొలిసారి బరిలోకి దిగాడు. 2011లో డెక్కన్ చార్జర్స్‌కు, 2012 సీజన్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు పీటర్సన్ ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పీటర్సన్ ఇంగ్లీష్ జట్టు తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 

2010లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో పీటర్సన్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.

చదవండి: కేకేఆర్ ప్లాఫ్ షో.. షారుక్ ఖాన్ అసంతృప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement