
టెస్టు సిరీస్ ట్రోఫీతో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, సిరాజ్, రిషభ్ పంత్
భారత్ లెక్క తప్పలేదు... స్పిన్ను ఆడలేని ప్రత్యర్థి బలహీనతపై బలమైన దెబ్బ వేస్తూ జట్టు మరో టెస్టును తమ ఖాతాలో వేసుకుంది. మూడో టెస్టు రెండు రోజుల్లో ముగిస్తే, నాలుగో టెస్టు మూడు రోజుల వరకు వెళ్లింది. ఈ తేడా తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్... అశ్విన్, అక్షర్ పటేల్ బౌలింగ్ను కనీస స్థాయిలో కూడా ఎదుర్కోలేక ఆపసోపాలు పడిన ఇంగ్లండ్ ఎలాంటి పోరాటం లేకుండా ఆటను అప్పగించేసింది. ఇద్దరు స్పిన్నర్లు నీకో ఐదు నాకో ఐదు అంటూ వికెట్లు పంచుకోవడంతో కుప్పకూలిన రూట్ బృందం ఓటమిని ఆహ్వానించింది.
రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాకుండానే ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోకి దర్జాగా అడుగు పెట్టింది. పనిలో పనిగా ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరి బోనస్ కూడా పొందింది. అనూహ్యంగా తొలి టెస్టులో నెగ్గి సిరీస్లో గట్టి పోటీ ఇవ్వగలదని భావించిన రూట్ జట్టు చివరకు 1–3తో తలవంచింది. 2016లో ఇక్కడ ఆడిన సిరీస్తో పోలిస్తే ఒక విజయాన్ని అందుకున్నా... పేలవ బ్యాటింగ్ కారణంగా కీలక సమయాల్లో చేతులెత్తేసింది. స్వదేశంలో తమకు తిరుగులేదని కోహ్లి బృందం మరోసారి నిరూపించగా, కొందరు యువ ఆటగాళ్ల ప్రదర్శన సిరీస్ను చిరస్మరణీయంగా మార్చింది.
అహ్మదాబాద్: టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ భారత జట్టు ఇంగ్లండ్పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా శనివారం ముగిసిన చివరి మ్యాచ్లో భారత్... ఇన్నింగ్స్, 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లోనూ కుప్పకూలింది. కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్ లారెన్స్ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు.
అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (174 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. అశ్విన్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’.... పంత్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు లభించాయి. చెన్నైలో తొలి టెస్టులో ఓడిన తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన భారత్ చివరకు 3–1తో సిరీస్ను సొంతం చేసుకుంది. తాజా విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు కూడా అర్హత సాధించి న్యూజిలాండ్తో పోరుకు సిద్ధమైంది. జూన్ 18 నుంచి 22 వరకు లండన్లోని లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 12 నుంచి అహ్మదాబాద్లోనే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరుగుతుంది.
సెంచరీ మిస్...
ఓవర్నైట్ స్కోరు 294/7 స్కోరుతో ఆట కొనసాగిస్తూ మూడో రోజు మరో 20.4 ఓవర్లు ఆడగలిగిన భారత్ 71 పరుగులు జత చేసి చివరి 3 వికెట్లు చేజార్చుకుంది. ముఖ్యంగా సుందర్, అక్షర్ శతక భాగస్వామ్యం హైలైట్గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు అలవోకగా పరుగులు సాధించారు. బెస్ ఓవర్లో వరుస బంతుల్లో సుందర్ సిక్స్, ఫోర్ బాదగా, లీచ్ ఓవర్లో అక్షర్ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే ఎట్టకేలకు రనౌట్తో ఈ జోడీని ఇంగ్లండ్ విడగొట్టింది. రూట్ బౌలింగ్లో సుందర్ షాట్ మిడాన్ దిశగా ఆడగా... సింగిల్ కోసం ప్రయత్నించిన అక్షర్ సాధ్యంకాక వెనక్కి వచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ సమయంలో సరిగ్గా 96 పరుగుల వద్ద ఉన్న సుందర్ దురదృష్టవశాత్తూ సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు. స్టోక్స్ వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతికే ఇషాంత్ శర్మ (0) అవుట్ కాగా, నాలుగో బంతికి సిరాజ్ (0) బౌల్డ్ కావడంతో సుందర్ నిరాశగా నిలబడిపోయాడు.
లారెన్స్ మినహా...
ఎప్పటిలాగే ఇంగ్లండ్ జట్టు భారత స్పిన్ ద్వయాన్ని సరిగ్గా ఎదుర్కోలేక చేతులెత్తేసింది. నాలుగు ఓవర్ల వరకు ఎలాగోలా నిలబడిన జట్టు పతనం ఐదో ఓవర్తోనే మొదలైంది. అశ్విన్ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో క్రాలీ (5), బెయిర్స్టో (0)లను పెవిలియన్ పంపించాడు. కొద్ది సేపటికే సిబ్లీ (3)ని అవుట్ చేసి అక్షర్ తన వికెట్ల ఖాతా తెరవగా, తొలి ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీ చేసిన స్టోక్స్ (2) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. పోప్ (15), రూట్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా... అదీ ఎక్కువసేపు సాగలేదు. పంత్ అద్భుత స్టంపింగ్కు పోప్ వెనుదిరగ్గా, మరో రెండు బంతులకే అశ్విన్ బౌలింగ్లో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 65/6 స్కోరుతో దాదాపు ఓటమి ఖాయమైన దశలో ఒక్క లారెన్స్ మాత్రం కొంత పోరాడే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో ‘సున్నా’ వద్ద ఉన్న లారెన్స్ పట్టుదలగా ఆడి అర్ధ సెంచరీ సాధించగలిగాడు. మరో ఎండ్లో ఫోక్స్ (13), బెస్ (2)లను అక్షర్ అవుట్ చేసి ఐదో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కొద్ది సేపటికే లీచ్ (2)ను అవుట్ చేసిన అశ్విన్, అదే ఓవర్లో లారెన్స్ను బౌల్డ్ చేయడంతో టెస్టు సిరీస్ ముగిసింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 205; భారత్ తొలి ఇన్నింగ్స్: 365; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రహానే (బి) అశ్విన్ 5; సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 3; బెయిర్స్టో (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; రూట్ (ఎల్బీ) (బి) అశ్విన్ 30; స్టోక్స్ (సి) కోహ్లి (బి) అక్షర్ 2; పోప్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 15; లారెన్స్ (బి) అశ్విన్ 50; ఫోక్స్ (సి) రహానే (బి) అశ్విన్ 13; బెస్ (సి) పంత్ (బి) అక్షర్ 2; లీచ్ (సి) రహానే (బి) అశ్విన్ 2; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (54.5 ఓవర్లలో ఆలౌట్) 135.
వికెట్ల పతనం: 1–10, 2–10, 3–20, 4–30, 5–65, 6–65, 7–109, 8–111, 9–134, 10–135.
బౌలింగ్: సిరాజ్ 4–0–12–0, అక్షర్ 24–6–48–5, అశ్విన్ 22.5–4–47–5, సుందర్ 4–0–16–0.
తొలి టెస్టు ఓడిన తర్వాత కోలుకొని తర్వాతి మ్యాచ్ గెలవడం అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది. ఆ మ్యాచ్లో టాస్ కీలకపాత్ర పోషించగా, మా బౌలర్లు విఫలమయ్యారు. అయితే రెండో టెస్టులో మా బ్యాటింగ్ ఏమిటో చూపించాం. మా రిజర్వ్ ఆటగాళ్లు కూడా చాలా బాగా ఆడుతుండటం టీమ్కు మేలు చేసే అంశం. జట్టు సంధి దశలో ఉన్నప్పుడు జట్టు ప్రమాణాలు పడిపోవు. పంత్, సుందర్ భాగస్వామ్యం ఇదే చూపించింది. సిరీస్ గెలవడం సంతోషకరమే అయినా మేం ఇంకా మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. ఏ అంతర్జాతీయ జట్టయినా పటిష్టంగానే ఉంటుంది. స్వదేశంలో అయినా వారిని ఓడించేందుకు శ్రమించాల్సిందే. మున్ముందు కూడా కొన్ని ఆటుపోట్లు తప్పకపోవచ్చు. కానీ వాటినీ సమర్థంగా ఎదుర్కొంటాం. గత ఆరేడేళ్లుగా టెస్టుల్లో అశ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రోహిత్ శర్మ చేసిన సెంచరీ ఈ సిరీస్లో గుర్తుంచుకోదగ్గ అంశం. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై 150 అంటే 250 పరుగులు చేసినంత విలువ. న్యూజిలాండ్లో మేం ఆడిన సమయంలో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అనేది అసాధ్యంగా కనిపించింది. ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చింది.
–కోహ్లి, భారత కెప్టెన్
► అశ్విన్ నెగ్గిన ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ల సంఖ్య. హ్యాడ్లీ, ఇమ్రాన్ ఖాన్, వార్న్ కూడా 8 సాధించగా... మురళీధరన్ (11), కలిస్ (9) మాత్రమే ముందున్నారు.
► అశ్విన్ తన కెరీర్లో తీసిన వికెట్ల సంఖ్య. ఈ మ్యాచ్తో కర్ట్లీ ఆంబ్రోస్ (405–వెస్టిండీస్)ను దాటిన అశ్విన్ అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల ఓవరాల్ జాబితాలో 15వ స్థానానికి చేరాడు.
► సొంతగడ్డపై భారత్కిది వరుసగా 13వ టెస్టు సిరీస్ విజయం. చివరిసారి స్వదేశంలో 2012లో ఇంగ్లండ్ చేతిలో 1–2తో సిరీస్ను కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత మరో సిరీస్ను చేజార్చుకోలేదు.
గత మూడు టెస్టులు మాకు ఎంతో పరీక్ష పెట్టాయి. భారత్ అన్ని రంగాల్లో మాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ అనుభవంతో మేమందరం ఒక్కొక్కరుగా పాఠాలు నేర్చుకొని మెరుగుపడాల్సి ఉంది. సిరీస్లో కొన్ని కీలక క్షణాలను భారత్ తమకు అనుకూలంగా మార్చుకోగలిగింది. అది మాకు సాధ్యం కాలేదు. ఓటమికి పంత్ ఇన్నింగ్స్ ఒక కారణం కావచ్చు కానీ... మేం ఏ దశలోనూ కనీస పరుగులు కూడా చేయలేకపోయాం. ఆటగాళ్లు కుప్పకూలిపోయే వరకు ఆగలేం కాబట్టి రొటేషన్ పాలసీ తప్పదు. ఐదు వికెట్ల ప్రదర్శనకంటే ఒక బ్యాట్స్మన్గా నేను చేసిన డబుల్ సెంచరీనే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది.
–రూట్, ఇంగ్లండ్ కెప్టెన్
‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అశ్విన్