T20 World Cup: బంగ్లాపై విజయభేరి.. భారత్‌ సెమీ ఫైనల్‌ చేరడం లాంఛనమే! | India won by 50 runs against Bangladesh | Sakshi
Sakshi News home page

T20 World Cup: బంగ్లాపై విజయభేరి.. భారత్‌ సెమీ ఫైనల్‌ చేరడం లాంఛనమే!

Published Sun, Jun 23 2024 4:13 AM | Last Updated on Sun, Jun 23 2024 4:48 AM

India won by 50 runs against Bangladesh

50 పరుగులతో భారత్‌ ఘనవిజయం 

సెమీఫైనల్‌ చేరడం లాంఛనమే! 

పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన  

రాణించిన బుమ్రా, కుల్దీప్‌

రేపు ఆ్రస్టేలియాతో పోరు  

నార్త్‌సౌండ్‌: భారత్‌ ఆల్‌రౌండ్‌ షోకు బంగ్లాదేశ్‌ తెల్లమొహం వేసింది. బ్యాటింగ్‌లో కలిపికొట్టి, తర్వాత పేస్, స్పిన్‌తో వికెట్లను చెదరగొట్టింది. టి20 ప్రపంచకప్‌ సూపర్‌–8 రెండో మ్యాచ్‌లో భారత్‌ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా ఇక సెమీస్‌కు చేరడం లాంఛనమే. 

టాస్‌ నెగ్గిన బంగ్లా ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (27 బంతుల్లో 50 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (28 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్‌ దూబే (24 బంతుల్లో 34; 3 సిక్స్‌లు) రాణించారు.

 అనంతరం బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. కెప్టెన్  నజు్మల్‌ హుస్సేన్‌ (32 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కొద్దిగా ప్రతిఘటించగలిగాడు. కుల్దీప్‌ 3, బుమ్రా, అర్ష్ దీప్‌ చెరో 2 వికెట్లు తీశారు. సూపర్‌–8 దశలో తమ చివరి మ్యాచ్‌లో సోమవారం ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంది.  

కలిసిమెలిసి దంచేసి... 
కోహ్లితో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కెప్టెన్‌ రోహిత్‌ (11 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌) నాలుగో ఓవర్లోనే అవుటయ్యాడు. ఈ కాసేపట్లోనే వేయాల్సినంత వేగవంతమైన పునాదిని వేసి వెళ్లాడు. ఇక కోహ్లి, పంత్‌ తమ కెపె్టన్‌ వేగాన్ని అందిపుచ్చుకోవడంతో పవర్‌ప్లేలో భారత్‌ 53/1 స్కోరు చేసింది. పవర్‌ప్లే ఆఖరి ఓవర్‌ (6)లో కోహ్లి కొట్టిన సిక్సర్‌తోనే జట్టు స్కోరు 50కి చేరింది. రిషాద్‌ వేసిన 8వ ఓవర్లో కోహ్లి మరో సిక్స్‌ బాదాడు. 

పంత్‌ కూడా బౌండరీ కొట్టడంతో 8 బంతుల ఈ సుదీర్ఘ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇది భారత శిబిరాన్ని ఉత్సాహపరిస్తే... మరుసటి 9వ ఓవర్‌ భారత్‌ను దెబ్బమీద దెబ్బ తీసింది. తొలి బంతికే కోహ్లి, మూడో బంతికి సూర్యకుమార్‌ (6)లను తన్జీమ్‌ పెవిలియన్‌ చేర్చాడు. అయితే ఈ వికెట్ల ప్రభావం ఇన్నింగ్స్‌పై పడకుండా తర్వాత వచి్చన బ్యాటర్లు చెలరేగారు.   

హార్దిక్‌ మెరుపు ఫిఫ్టీ 
11వ ఓవర్‌ నుంచి శివమ్‌ దూబే అండతో రిషభ్‌ పంత్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. ముస్తఫిజుర్‌ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్‌ బాదాడు. మరుసటి ఓవర్లో రిషాద్‌పై విరుచుకుపడే క్రమంలో 6, 4 కొట్టిన పంత్‌ అదే జోరులో ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. 14 ఓవర్లలో భారత్‌ 120/4 స్కోరు చేసింది. ఆ తర్వాత 6 ఓవర్లలోనే (36 బంతులు) 76 పరుగులు చేసింది.

ఇంత స్కోరుకు, ఇన్నింగ్స్‌ జోరుకు హార్దిక్‌ పాండ్యా కారణమయ్యాడు. 15వ ఓవర్లో 6, 4తో 14 పరుగులు, 16, 17 ఓవర్లలో దూబే ఒక్కో సిక్సర్‌తో వరుసగా 12 పరుగులు, 9 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో సిక్స్‌ కొట్టిన దూబే అవుట్‌ కాగా, హార్దిక్‌ మరో భారీ సిక్సర్‌ బాదడంతో 15 పరుగులొచ్చాయి. తన్జిమ్, ముస్తఫిజుర్‌ సహా బౌలర్లందరినీ చితకబాదిన హార్దిక్‌ 27 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు.  

నజు్మల్‌ ఒక్కడే... 
టాప్‌–3 బ్యాటర్లలో లిటన్‌ దాస్‌ (13) విఫలమవగా, తన్జీద్‌ హసన్‌ (31 బంతుల్లో 29; 4 ఫోర్లు), కెపె్టన్‌ నజు్మల్‌ మెరుగ్గానే ఆడారు. ఒక వైపు నజు్మల్‌ పోరాడినా... మరోవైపు తౌహీద్‌ హ్రిదయ్‌ (4), ప్రతీ ప్రపంచకప్‌ ఆడిన విశేషానుభవజు్ఞడు షకీబ్‌ (11), మహ్ముదుల్లా (13) చేతులెత్తేయడంతో బంగ్లా పరాజయం తప్పలేదు. ఆఖర్లో రిషాద్‌ (10 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు . 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) జాకీర్‌ (బి) షకీబ్‌ 23; కోహ్లి (బి) తన్జీమ్‌ హసన్‌ 37; పంత్‌ (సి) తన్జీమ్‌ హసన్‌ (బి) రిషాద్‌ 36; సూర్యకుమార్‌ (సి) లిటన్‌ దాస్‌ (బి) తన్జీమ్‌ హసన్‌ 6; దూబే (బి) రిషాద్‌ 34; పాండ్యా నాటౌట్‌ 50; అక్షర్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–39, 2–71, 3–77, 4–108, 5–161. బౌలింగ్‌: మెహదీ హసన్‌ 4–0–28–0, షకీబ్‌ 3–0–37–1, తన్జీమ్‌ హసన్‌ 4–0–32–2, ముస్తఫిజుర్‌ 4–0–48–0, రిషాద్‌ హుస్సేన్‌ 3–0–43–2, మహ్ముదుల్లా 2–0–8–0. 

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ (సి) సూర్యకుమార్‌ (బి) పాండ్యా 13; తన్జీద్‌ హసన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 29; నజు్మల్‌ (సి) అర్ష్ దీప్‌ (బి) బుమ్రా 40; తౌహీద్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 4; షకీబ్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 11; మహ్ముదుల్లా (సి) అక్షర్‌ (బి) అర్ష్ దీప్‌ 13; జాకిర్‌ అలీ (సి) కోహ్లి (బి) అర్ష్ దీప్‌ 1; రిషాద్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 24; మెహిది హసన్‌ నాటౌట్‌ 5; తన్జీమ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–35, 2–66, 3–76, 4–98, 5–109, 6–110, 7–138, 8–145. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–30–2, బుమ్రా 4–0–13–2, అక్షర్‌ 2–0–26–0, హార్దిక్‌ పాండ్యా 3–0–32–1, జడేజా 3–0–24–0, కుల్దీప్‌ 4–0–19–3.  

టి20 ప్రపంచకప్‌లో నేడు
ఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్‌ 
వేదిక: కింగ్స్‌టౌన్‌; ఉ.గం.6.00 నుంచి  
ఇంగ్లండ్‌ X  అమెరికా 
వేదిక: బ్రిడ్జ్‌టౌన్‌; రాత్రి గం. 8 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement