
లండన్: ప్రతిష్టాత్మక మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వరల్డ్ క్రికెట్ కమిటీలో భారత మాజీ పేసర్ జులన్ గోస్వామికి స్థానం లభించింది. ఆమెతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, హీతర్ నైట్లను కూడా కమిటీలోకి తీసుకున్నట్లు ఎంసీసీ చైర్మన్ మైక్ గ్యాటింగ్ వెల్లడించారు. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీలో భాగమైన వరల్డ్ క్రికెట్ కమిటీ కొత్తగా వచ్చే సాంకేతిక అంశాలను, వాటిని ఉపయోగించడానికి సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఎంసీసీ ప్రధాన కేంద్రం లార్డ్స్ మైదానంలో ఉంది. లార్డ్స్లోనే జరిగిన ఫైనల్ మ్యాచ్లలో 2019 వన్డే వరల్డ్ కప్, 2017 వన్డే వరల్డ్ కప్లలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఈ టీమ్లకు మోర్గాన్, హీతర్ నైట్ కెప్టెన్లుగా వ్యవహరించారు. గత ఏడాది ఇదే లార్డ్స్ మైదానంలో తన ఆఖరి వన్డే ఆడి జులన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. ఓవరాల్గా మూడు ఫార్మాట్లలో కలిపి 355 వికెట్లు పడగొట్టిన జులన్కు ఈ ఏడాదే ఎంసీసీ గౌరవ సభ్యత్వం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment