T20 WC 2024: రోహిత్‌ శర్మకు జోడీగా కోహ్లి ఫిక్స్‌! | Sakshi
Sakshi News home page

T20 WC 2024: రోహిత్‌కు జోడీగా కోహ్లిని ఫిక్స్‌ చేసిన సెలక్టర్లు!

Published Wed, Apr 17 2024 2:22 PM

Kohli Wants Clarity About T20 WC Spot Selectors Say Open With Rohit: Report - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2024లో విరాట్‌ కోహ్లిని భారత ఓపెనర్‌గా చూడబోతున్నామా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రన్‌మెషీన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా మెగా టోర్నీలో టీమిండియా ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందుకు సంబంధించిన ఇప్పటికే రోహిత్‌ శర్మతో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత రోహిత్‌తో పాటు కోహ్లి కూడా సుదీర్ఘకాలం పాటు పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా తరఫున బరిలోకి దిగలేదు.

ఈ క్రమంలో ఇటీవల అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌ సందర్భంగా విరాహిత్‌ ద్వయం పునరాగమనం చేశారు. అయితే, ఆ సిరీస్‌లో కోహ్లి తను రెగ్యులర్‌గా వచ్చే మూడో స్థానంలోనే బ్యాటింగ్‌ చేశాడు. మరోవైపు.. రోహిత్‌కు జోడీగా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ ఓపెనింగ్‌ చేశాడు.

ఇదిలా ఉంటే.. యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో ప్రపంచకప్‌-2024లో అసలు కోహ్లికి చోటే దక్కదంటూ గతంలో వార్తలు వచ్చాయి. అగార్కర్‌ ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా.. రోహిత్‌ శర్మ వాటిని ఖండించాడని.. కోహ్లి జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఐసీసీ ఈవెంట్లో తన పాత్ర ఏమిటన్న విషయం మీద క్లారిటీ కావాలని కోహ్లి సెలక్షన్‌ కమిటీని అడిగినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో గతవారం ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్‌, ద్రవిడ్‌, అగార్కర్‌ ఇందుకు సంబంధించి కోహ్లిని ఓపెనర్‌గా పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దైనిక్‌ జాగరణ్‌.. కథనం వెలువరించింది. 

కాగా రాయల్‌ చాలెంజర్స్‌ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విరాట్‌ కోహ్లి.. ఇప్పటి వరకు ఐపీఎల్‌-2024లో ఏడు మ్యాచ్‌లు ఆడి 361 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.

మరోవైపు.. ఇటీవల కాలంలో రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్న యశస్వి జైస్వాల్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు రాజస్తాన్‌ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి 121 రన్స్‌ మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ తాజా సీజన్‌ ముగిసిన తర్వాత జూన్‌ 1 నుంచి వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం కానుంది.

చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్‌, అగార్కర్‌ చర్చలు.. హార్దిక్‌ పాండ్యాకు నో ఛాన్స్‌!

Advertisement
Advertisement