IPL 2025: ముంబై ఇండియన్స్‌లోకి బెయిర్‌స్టో.. మరో ఇద్దరు కూడా..! | Mumbai Indians Rope In Bairstow, Gleeson And Asalanka As Replacement For IPL 2025 Playoffs Push | Sakshi
Sakshi News home page

IPL 2025: ముంబై ఇండియన్స్‌లోకి బెయిర్‌స్టో.. మరో ఇద్దరు కూడా..!

May 20 2025 12:07 PM | Updated on May 20 2025 1:56 PM

Mumbai Indians Rope In Bairstow, Gleeson And Asalanka As Replacement For IPL 2025 Playoffs Push

Photo Courtesy: BCCI

జాతీయ జట్టు విధుల కారణంగా ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్న ర్యాన్‌ రికెల్టన్‌ (సౌతాఫ్రికా), కార్బిన్‌ బాష్‌ (సౌతాఫ్రికా), విల్‌ జాక్స్‌ (ఇంగ్లండ్‌) స్థానాలను ముంబై ఇండియన్స్‌ మరో ముగ్గురితో భర్తీ చేసుకుంది. విల్‌ జాక్స్‌కు ప్రత్యా​మ్నాయంగా జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌), ర్యాన్‌ రికెల్టన్‌కు ప్రత్యామ్నాయంగా రిచర్డ్‌ గ్లీసన్‌ (ఇంగ్లండ్‌), కార్బిన్‌ బాష్‌కు ప్రత్యామ్నాయంగా చరిత్‌ అసలంకను (శ్రీలంక) జట్టులోకి తీసుకుంది. వీరు ముగ్గురు ఒకవేళ ​ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే అందుబాటులో ఉంటారు. 

లీగ్‌ చివరి మ్యాచ్‌ వరకు జాక్స్‌, రికెల్టన్‌, బాష్‌ అందుబాటులో ఉంటారు. బెయిర్‌స్టోను ముంబై యాజమాన్యం రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది. గ్లీసన్‌ను రూ. కోటికి, అసలంకను రూ. 75 లక్షలకు దక్కించుకుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు (గుజరాత్‌, ఆర్సీబీ, పంజాబ్‌) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్‌ కోసం ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్‌ భవితవ్యం మే 21న జరిగే మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది. 

ఆ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ, ముంబై తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది. 

ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్‌ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమితో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఇదివరకే సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. 

ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్‌, ఆర్సీబీ, పంజాబ్‌ లీగ్‌ దశలో తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్‌ల్లో జయాపజాలు టాప్‌-2 బెర్త్‌లను డిసైడ్‌ చేస్తాయి. లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి టాప్‌-2 పోజిషన్స్‌లో ఉండే జట్లకు ప్లే ఆఫ్స్‌లో ఓ మ్యాచ్‌ ఓడినా మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు ఆ అవకాశం ఉండదు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడే జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది.  

Advertisement
 
Advertisement
Advertisement