
బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్ను టీమిండియా కోల్పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికి నాసిరకం ప్రదర్శనతో ఓటములను కొనితెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మదన్లాల్ టీమిండియా ఆటతీరుపై స్పందించాడు.
''కచ్చితంగా టీమిండియా మాత్రం సరైన దిశలో వెళ్లడం లేదు. జట్టులో ఆ దూకుడే కనిపించడం లేదు. గత రెండేళ్లుగా కనిపించిన జోష్ ఇప్పుడు లేదు. దేశానికి ఆడుతున్నామనే విషయం మరిచినట్లున్నారు. ఏ ఒక్కరిలోనూ గెలవాలన్న కసి కనిపించడం లేదు. వాళ్ల శరీరాలు పూర్తిగా అలసిపోయి ఉండాలి లేదంటే ఏదో ఆడుతున్నామంటే ఆడుతున్నాం అన్నట్లుగా అయినా ఉండాలి. ఇది చాలా తీవ్రమైన విషయం.
ఇక సగం ఫిట్గా ఉన్న ప్లేయర్స్ ఇండియాకు ఆడుతున్నారని రోహిత్ శర్మ పేర్కొనడం బాధాకరం. దీనికి ఎవరు బాధ్యులు? ట్రైనర్లు దీనికి బాధ్యులు కాదా? ఫిట్గా లేని ప్లేయర్స్ ఎందుకు వెళ్తున్నారు? ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు. ఫలితం మీ ముందు ఉంది. వాళ్లకు విశ్రాంతి కావాలంటే ఐపీఎల్ సమయంలో తీసుకోవాలి. దేశమే ముందు. ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోతే.. దేశంలోని క్రికెట్ పతనమైతున్నట్లే'' అని పేర్కొన్నాడు.
ఇక టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. "రికార్డులు చూస్తే.. వాళ్లు గత మూడేళ్లలో ఎన్ని సెంచరీలు చేశారు. గతేడాది ఎన్ని చేశారు? వయసు మీద పడుతున్న కొద్దీ హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ దెబ్బ తింటుంది. కానీ వాళ్లు అనుభవజ్ఞులు. బాగా ఆడాల్సింది. టాపార్డర్ ఆడకపోతే గెలవలేరు. బౌలింగ్ కూడా హఠాత్తుగా బలహీనంగా మారిపోయింది. వికెట్లు తీయలేకపోతున్నారు. బంగ్లాదేశ్ 6 వికెట్లకు 69 నుంచి 271 రన్స్ ఎలా చేసింది? అసలు ఏం జరుగుతోంది" అని మదన్లాల్ ప్రశ్నించాడు.
చదవండి: బాస్కెట్బాల్ స్టార్ బ్రిట్నీ గ్రైనర్ను విడుదల చేసిన రష్యా
Comments
Please login to add a commentAdd a comment