
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా అతని సహచరులు, మిత్రులు, శ్రేయాభిలాషుల నుంచి అభినందనలు, ఉద్వేగపూరిత సందేశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా భారత మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ మిస్టర్ కూల్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. తను పని చేసిన గొప్ప నాయకుల్లో ధోని ఒకడని కిర్స్టెన్ కితాబిచ్చాడు.
గ్యారీ హెడ్ కోచ్గా ఉన్న సమయంలోనే భారత్ 28 ఏళ్ల తర్వాత 2011లో మరోసారి ప్రపంచకప్ను గెలుపొందింది. ధోనితో కలిసి పని చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని కిర్స్టెన్ వ్యాఖ్యానించాడు. ‘ ధోని నా వైపు ఉంటే నేను యుద్ధానికి కూడా సిద్ధం అని గతంలో ఎప్పుడూ అనేవాడిని. ఇది అతనిపై నాకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. అతనో గొప్ప నాయకుడు. భారత క్రికెట్ జట్టుతో నాకు మధుర స్మృతుల్ని అందించిన ధోని నీకు ధన్యవాదాలు’ అని కిర్స్టెన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. 52 ఏళ్ల కిర్స్టెన్ 2008–2011 మధ్య కాలంలో భారత్కు హెడ్ కోచ్గా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment