
ముంబై: ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ శనివారంతో 48 వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగి సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. ప్రస్తుతం అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్లో రాణిస్తున్నాడు. అర్జున్ ప్రస్తుత ఐపీఎల్-2021 ఎడిషన్లో ముంబై ఇండియన్స్ జట్టులోకి రంగ ప్రవేశం చేశాడు. కుమారుడి గురించి సచిన్ మాట్లాడుతూ.. ఒక సందర్భంలో అర్జున్ టెండూల్కర్ చేసిన పనికి కాస్త ఇబ్బంది పడ్డానని మీడియాతో తెలిపాడు. అమితాబ్ బచ్చన్తో కలిసి సచిన్ ఒక కంపెనీ ప్రకటనలో నటించాడు. వీరు ఇరువురు ప్రకటన చేసిన సమయంలో అప్పుడు అర్జున్ వయసు ఒకటిన్నర ఏళ్లు మాత్రమే.
షూటింగ్ బ్రేక్ సమయంలో ఇరువురు ఒక దగ్గర కుర్చోగా, అర్జున్ తన తండ్రి సచిన్ ఒళ్లో కూర్చున్నాడు. అర్జున్ ఆ సమయంలో ఆరెంజ్ పండును తిని చేతులను అమితా బచ్చన్ వేసుకున్న కుర్తాతో తుడ్చుకున్నాడు. ఆ సమయంలో సచిన్ నిర్ఘాంతపోయానని మీడియాతో తెలిపారు.అంతేకాకుండా అర్జున్ చేసిన పనితో కాస్త ఇబ్బందికి గురయ్యానని పేర్కొన్నాడు. ఈ సంఘటనను 2017లో అమితాబ్ బచ్చన్ 75 వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో పంచుకున్నాడు.