గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉన్న భారత్ ఐదోరోజు ఆటను వీలైనంత తొందరగా ముగించాలని చూస్తోంది. ఆన్ఫీల్డ్లో ఇలాంటి డ్రామా నడుస్తుంటే.. ఆఫ్ ఫీల్డ్ మాత్రం మరో డ్రామాకు వేదికైంది.
తొలి టెస్టుకు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేక్, మురళీ కార్తిక్ల మధ్య కామెంటరీ బాక్స్లో బాడీ షేమింగ్ గురించి చిన్నపాటి యుద్ధం జరిగింది. ఇద్దరు మాట మాట అనుకోవడంతో ఫన్నీగా మొదలైన కామెంటరీ చివరకు మాటల యుద్ధానికి దారి తీసింది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది.
విషయంలోకి వెళితే.. టెస్టు మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయంలో, స్టూడియోలో ఉన్న మురళీ కార్తిక్ మైదానం వద్ద నుంచి మాట్లాడుతున్న సంజయ్ మంజ్రేకర్ ముఖకవళికలపై కామెంట్ చేశారు. "మీరు పెట్టే ఎక్స్ ప్రెషన్స్ వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక్కోసారి సరిగా అర్థం కావడం లేదు, అది కొంచెం తగ్గించండి" అంటూ కార్తిక్ సరదాగా వ్యాఖ్యానించారు.
దీంతో అసహనానికి గురైన సంజయ్ మంజ్రేకర్ వెంటనే స్పందిస్తూ.. "కెమెరాను నా నుంచి స్ప్లిట్ స్క్రీన్ చేసి పక్కనే ఉన్న అజింక్య రహానే వైపు తిప్పండి, ఆయన ముఖం చూడటానికి చాలా బాగుంటుంది, మాట్లాడటానికి కూడా మంచి వ్యక్తి" అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా మురళీ కార్తిక్ అద్దంలో చూసుకుంటూ తనను తాను చూసి మురిసిపోతుంటారని ఎద్దేవా చేశారు. దానికి కార్తిక్ "నేను అద్దంలో చూసుకోను, అది మీ అలవాటే" అని రీకౌంటర్ ఇచ్చారు.
అయితే, పరిస్థితి మరింత చేయి దాటిపోయే సమయంలో ఇద్దరూ సంయమనం పాటించాడు. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరుగుతుందని గ్రహించిన మంజ్రేకర్.. 'సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ట్రోల్స్ వస్తాయి, ఫ్యాన్స్కు పండగే' అంటూ సరదగా వ్యాఖ్యానిస్తూ ఆ వివాదానికి తెరదించాడు.
తొలి టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల టార్గెట్ను నిర్ధేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. శ్రీలంక విజయానికి మరో 288 పరుగులు అవసరం కాగా, భారత్ గెలుపుకు ఆరు వికెట్లు అవసరం.


