
సెప్టెంబర్ 27 నుంచి బంగ్లాదేశ్తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం టీమిండియా జోరుగా సాధన చేస్తుంది. ఈ మ్యాచ్ కోసం ఇదివరకే కాన్పూర్కు (మ్యాచ్కు వేదిక) చేరుకున్న భారత బృందం ప్రాక్టీస్లో నిమగ్నమై ఉంది. టీమిండియా ఆటగాళ్లు నెట్స్లో చెమటోడుస్తున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.
తొలి టెస్ట్లో విఫలమైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కఠోరంగా సాధన చేస్తూ కనిపించారు. రెండో టెస్ట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కోచ్ గంభీర్తో జట్టు సభ్యులతో డిస్కస్ చేశారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ బౌలర్లకు సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించాడు. ఆటగాళ్లంతా బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా ప్రాక్టీస్ చేశారు. మొత్తంగా టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది.
తుది జట్టు విషయానికొస్తే.. రెండో టెస్ట్ కోసం భారత్ ఓ మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగవచ్చు. దీంతో అశ్విన్, జడేజాకు జతగా కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్ దిగే అవకాశం ఉంది. కుల్దీప్, అక్షర్లలో ఎవరు తుది జట్టులోకి వచ్చినా సిరాజ్ లేదా ఆకాశ్దీప్లలో ఎవరో ఒకరిపై వేటు పడుతుంది. ఈ ఒక్క మార్పు మినహా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది.
కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కాన్పూర్లోని గ్రీన్ పార్క్లో సెప్టెంబర్ 27న రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.
రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: ENG VS AUS 3rd ODI: కుక్ రికార్డు బ్రేక్ చేసిన బ్రూక్
Comments
Please login to add a commentAdd a comment