
రెండో సీజన్ ‘అల్టిమేట్ ఖోఖో’ లీగ్కు రంగం సిద్ధమైంది. కటక్లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నేడు ప్రారంభమయ్యే ఈ టోర్నీ జనవరి 13 వరకు సాగుతుంది. మొత్తం ఆరు జట్లు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ఒడిషా జాగర్నట్స్, రాజస్తాన్ వారియర్స్ మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ మొదలవుతుంది. నేడు జరిగే తర్వాతి మ్యాచ్లో ముంబై ఖిలాడీస్తో తెలుగు యోధాస్ టీమ్ తలపడుతుంది. గుజరాత్ జెయింట్స్, చెన్నై క్విక్ గన్స్ టోర్నమెంట్ బరిలో ఉన్న మరో రెండు జట్లు. 21 రోజుల వ్యవధిలో మొత్తం 30 మ్యాచ్లు జరుగుతాయి.
జీఎంఆర్ గ్రూప్ యాజమాన్యానికి చెందిన తెలుగు యోధాస్ టీమ్ గత ఏడాది రన్నరప్గా నిలవగా...ఈ సారి టైటిల్ సాధిస్తామని యోధాస్ కెప్టెన్ ప్రతీక్ వైకర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత ఖోఖో సమాఖ్య గత ఏడాది ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించడంతో ఈ సీజన్ కోసం అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గత ఏడాది టీవీ, ఓటీటీలో కలిపి 164 మిలియన్ల మంది ప్రేక్షకులు టోర్నీని తిలకించారు. ‘సోనీ నెట్వర్క్’లో మ్యాచ్లు ప్రసారం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment