WC 2023: సంతోషంగా ఉంది.. మా విజయాలకు ప్రధాన కారణం అదే: షమీ | WC 2023 Ind vs SL: Very Happy We Are Bowling As Unit, Says Mohammed Shami | Sakshi
Sakshi News home page

#IndvsSL: సంతోషంగా ఉంది.. మా విజయాలకు ప్రధాన కారణం అదే: షమీ

Published Fri, Nov 3 2023 9:03 AM | Last Updated on Fri, Nov 3 2023 9:40 AM

WC 2023 Ind vs SL: Mohammed Shami Very Happy We Are Bowling As Unit - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ రైట్‌ఆర్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఐదు వికెట్లతో మెరిశాడు.

శ్రీలంక టాపార్డర్‌ను జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ కుదేలు చేస్తే.. మిడిలార్డర్‌ బ్యాటర్లు ఏ దశలోనూ కోలుకోకుండా వరుసగా వికెట్లు పడగొట్టాడు షమీ. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఈ వెటరన్‌ పేసర్‌ 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చడం విశేషం.

తద్వారా తనకు వచ్చిన అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకున్న షమీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మా(పేసర్లు) ప్రదర్శన ఈరోజు అత్యద్భుతంగా ఉంది. పరస్పర సహకారంతో.. ఒకరి ఆటను మరొకరం ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాం. అందుకే మా బౌలింగ్‌ విభాగం ఇలాంటి ఫలితాలు రాబట్టగలుగుతోంది.

నేను ఎల్లప్పుడూ సరైన లెంగ్త్‌తో రిథమ్‌ మిస్‌ కాకుండా బంతిని విసిరేందుకు ప్రయత్నిస్తా. వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం సంతోషంగా ఉంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బంతిని ఏ ఏరియాలో విసురుతున్నామన్నదే కీలకాంశంగా ఉంటుంది. అయితే, కొత్త బంతితో బరిలోకి దిగినపుడు పిచ్‌ నుంచి మనకు సహకారం ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి’’ అని షమీ తన ఆట తీరును విశ్లేషించాడు. 

ఇక ముంబైలో మ్యాచ్‌ ఆడటం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఈరోజు ఇక్కడి ప్రేక్షకులు మాకు పూర్తి మద్దతుగా నిలిచారు. అభిమానులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. విదేశాల్లోనూ మాకు ఫ్యాన్స్‌ ఎల్లప్పుడూ మద్దతుగానే ఉంటారు’’ అని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.

అదే విధంగా.. డ్రెస్సింగ్‌రూం వాతావరణం అద్భుతంగా ఉందనే విషయాన్ని నేను మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ మహ్మద్‌ షమీ సహచర ఆటగాళ్ల నుంచి తనకు సహకారం ఉందని పేర్కొన్నాడు.

కాగా పేస్‌ త్రయం బుమ్రా, సిరాజ్‌, షమీ సంచలన ప్రదర్శనతో శ్రీలంకను టీమిండియా 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. తద్వారా వరుసగా ఏడో విజయం అందుకుని.. ఈ వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ప్రపంచకప్‌ టోర్నీ లో భారత్‌ సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించడం ఇది ఎనిమిదోసారి. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు కూడా ఎనిమిదిసార్లు చొప్పున సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement