పారిస్: మోంట్ పెలియర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీకీ నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ యూకీ బాంబ్రీ–ఇవాన్ డోడిగ్ ద్వయం 4–6, 5–7తో మాన్యుయెల్ గినార్డ్–గ్రెగోరి జాక్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమి పాలైంది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో ఇండో–క్రొయేషియన్ జంట తమ సర్వీస్ ను రెండుసార్లు చేజార్చుకుంది. యూకీ–డోడిగ్ జోడీకి 5,500 యూరోల (రూ. 4 లక్షల 95 వేలు) ప్రైజ్ మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment