కృత్రిమ మేధతో బోధన
నేటి నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలు
20 నిమిషాల వ్యవధిలో..
ప్రత్యేక సాఫ్ట్వేర్తో విద్యార్థులను ఆకట్టుకునేలా ఏఐ బోధన అందిస్తారు. ఎంపిక చేసిన 3 నుంచి 5 తరగతుల విద్యార్థులను అయిదుగురికి ఒక బ్యాచ్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో బ్యాచ్కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తారు. ఆ విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా, లేదా అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో బోధిస్తుంది. అర్థం అయ్యిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధన అందిస్తుంది. ఇలా ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడంతో పాటు, గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి ఆయా విద్యార్థులపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు.
11 మండలాల్లో 13 పాఠశాలలు ఎంపిక
చదువులో వెనుకబడిన 3, 4, 5వ తరగతి పిల్లలకు ప్రత్యేకం ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం చర్యలు
ఇప్పటికే టీచర్లకు శిక్షణ పూర్తి
హుజూర్నగర్: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐ (ఆర్టిిఫీషియల్ ఇంటలిజెన్స్–కృత్రిమ మేధ) హవా నడుస్తోంది. ఈ అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం సాయంతో ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చదువులో వెనుకబడిన పిల్లల కోసం ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధన చేపట్టారు. ఆయా జిల్లాల్లో మెరుగైన ఫలితాలు రావడంతో ఇదే విధానాన్ని మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.
ఏఐ బోధనపై శిక్షణ
ఏఐ బోధనకు ప్రతి జిల్లాలోనూ కొన్ని పాఠశాలలను గుర్తించి ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో బోధించేందుకు నిపుణులైన ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయ అధికారులకు ఈనెల 11న రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కాగా జిల్లా కేంద్రంలో ఈనెల 12న సంబంధిత ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, పాఠశాల ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఏఐ బోధనపై శిక్షణ కూడా ఇచ్చారు. ఎంపికై న పాఠశాలల్లో శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభంకానుంది.
మెరుగైన సామర్థ్యాల సాధనకు..
ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో మౌలిక భాష, సంఖ్యా జ్ఞానం అభ్యసనతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియల్లోనూ ఆశించిన స్థాయి సామర్థ్యాలు సాధించకపోవడంతో విద్యలో వెనుకబాటుకు గురవుతున్నారు. పలు రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ సాయంతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాల సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.
‘సి’ గ్రేడ్ పిల్లలకు ఉపయుక్తంగా ఉంటుంది
ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లోని ‘సి’ గ్రేడ్ పిల్లలకు ఏఐ భోధన ఉపయుక్తంగా ఉంటుంది. 3, 4, 5వ తరగతుల్లోని సీ గ్రేడ్ పిల్లలు బేసిక్ మాథ్స్ నేర్చుకోవడంతోపాటు వారిలో విద్యా సామర్థ్యాల మెరుగునకు ఏఐ బోధన ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది.
– కె.అశోక్, డీఈఓ, సూర్యాపేట
కృత్రిమ మేధతో బోధన
Comments
Please login to add a commentAdd a comment