
ధరూరు (గద్వాల): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉదృతి భారీగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తూ జలకళ సంతరించుకుంది. పోటెత్తుతున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేశారు.
ప్రాజెక్టు ఇన్ఫ్లో 3 లక్షల 35 వేల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 3 లక్షల 38 వేల 733 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం318.07 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటిసామర్ద్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.75 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిరాటంకంగా కొనసాగుతుంది. మరోవైపు నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు నీటి పంపింగ్ కొనసాగిస్తున్నారు. నారాయణపూర్ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. నదీ తీర గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరు నదిలోకి చేపల వేటకు వెళ్లరాదాని అధికారులు విజ్ఞప్తి చేశారు.