ఆగని ప్రమాదాలు | Accidents increasing in Singareni coal mines: Telangana | Sakshi
Sakshi News home page

ఆగని ప్రమాదాలు

Dec 18 2024 6:10 AM | Updated on Dec 18 2024 6:11 AM

Accidents increasing in Singareni coal mines: Telangana

పేరుకే రక్షణ పక్షోత్సవాలు 

సూచనలు, సలహాలకే పరిమితం 

సింగరేణి బొగ్గు గనుల్లో పెరుగుతున్న ప్రమాదాలు

సాక్షి, పెద్దపల్లి: సింగరేణి బొగ్గు గనులు, వివిధ విభాగాల్లో ప్రస్తుతం రక్షణ పక్షోత్సవాలు కొనసాగుతున్నాయి. ‘రక్షణే ప్రథమం.. రక్షణే ఎల్లప్పుడు’అని ప్రతీ గని, డిపార్ట్‌మెంట్‌పై కార్మికులతో అధికారులు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అయితే, రక్షణ పక్షోత్సవాలు వేడుకల కోసమేనని, క్షేత్రస్థాయిలో కార్మికుల రక్షణకు తీసుకుంటున్న చర్యలేవీ లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. సింగరేణిలో ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు.

నిమ్, యూఎంటీఐ, వీటీసీ, అత్యాధునిక సిమ్‌టార్స్‌.. ఇలా ఎన్ని శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసినా ప్రమాదాలు నియంత్రణలోకి రావడం లేదు. తట్టాచెమ్మాస్, సెమీ మెకనైజ్‌డ్, పూర్తిస్థాయి యాంత్రీకరణ జరిగినా రక్షణలో వైఫల్యాలతో బొగ్గు గనుల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏటా కార్మికులు చనిపోతున్నా, ప్రమాదాలపై సమీక్షించ డం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొగ్గు ఉత్ప త్తి విషయంలో సింగరేణి చూపుతున్న శ్రద్ధ ప్ర మాదాల నియంత్రణకు తీసుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.  

17ఓసీపీలు.. 22 భూగర్భ గనులు 
ఏటా మాదిరిగానే ప్రమాద రహిత సింగరేణిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా యాజమాన్యం ఈనెల 9 నుంచి 21వ తేదీ వరకు రక్షణ పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. సింగరేణిలోని 11 ఏరియాల్లో 17 ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులు, 22 భూగర్భ గనులు ఉన్నాయి. వీటిలో దాదాపు 42 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి కాంట్రాక్ట్‌ కార్మికులు అదనం. వీరు సుమారు 30 వేల మంది వరకు ఉంటారని అంచనా. రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా 12 బృందాలు వివిధ గనులు, సీఎస్పీలు తదితర విభాగాల్లో తనిఖీలు చేసి అత్యుత్తమ రక్షణ చర్యలు పాటించే గనులకు బహుమతులు అందిస్తాయి.

అయితే కార్మికులకు రక్షణ సూత్రాల గురించి వివరిస్తున్న అధికారులు.. వాటిని అమలు చేయాలని అవగాహన కలి్పస్తున్నారు. మరోవైపు.. కార్మికులతోపాటు అధికారులు యూనిఫాం, టోపీలు ధరించకుండానే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కార్మికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సరైన పర్యవేక్షణ లేకే.. 
రక్షణ పక్షోత్సవాల్లో చేయించిన ప్రతిజ్ఞ, సూచనలు ఆచరణలో సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా జీఎం స్థాయి అధికారుల బృందం తనిఖీలు చేసి నివేదికలు తయారు చేసి వెళ్లిపోతుంది. అప్పటివరకు ఏరియా అధికారులు గనులు, డిపార్టుమెంట్లలో సూచిక బోర్డులు, రక్షణకు సంబంధించిన కొటేషన్లు రాసి, జెండాలు కట్టి హంగూ ఆర్భాటాలతోనే సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. 

నోటీస్‌ బోర్డులపై కానరాని సమాచారం 
ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా మరికొన్ని సందర్భాల్లో క్షతగాత్రులవుతున్నారు. గనులపై ప్రమాదాల సమాచారం వెల్లడించాల్సి ఉన్నా.. ఎక్కడ కూడా నోటీసు బోర్డులపై కానరావడం లేదు. ఉన్నతాధికారులు సందర్శనకు వచ్చినప్పుడు హడావుడి చేసి.. ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడం లేదు. ఏడాది పొడవునా రక్షణ చర్యలు తీసుకునే అంశాలను మరుగున పడేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై సింగరేణి స్టేపీ అధికారులను సంప్రదించగా.. సింగరేణివ్యాప్తంగా సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ పద్ధతు లు పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు వాటిపై అవగాహన కలి్పస్తున్నామని తెలిపారు. గతంతో పొల్చితే ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య తగ్గిందని, అయినా, జీరో హార్మ్‌ సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement